గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 04, 2014

ప్రపంచానికే ఆదర్శంగా నిలుద్దాం...

అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు, భారత్ సజీవంగా, స్వతంత్రగా మేల్కొంటుంది. ఓ క్షణం వస్తుంది, చరిత్రలో అరుదుగా వస్తుంది. పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగుపెడుతం. ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది...దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాలా సరిపోతాయి. జూన్ ఒకటవ తేదీ అర్ధరాత్రి- ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ తెలంగాణ జాతి తన స్వాతంత్య్ర ప్రకటన చేసింది. అది తెలంగాణ సమాజం చేసిన సమిష్టి ప్రకటన.

అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచ వన్నెల సూర్యులు పలకరించినట్టు... ఇంద్రధనస్సులు విరగబూసినట్టు, తారలు దిగివచ్చి తెలంగాణ సంబరాల్లో తారాడినట్టు! తెలంగాణ అంతా ఉద్వేగభరితం! తెలంగాణ పోరాటం గమ్యాన్ని ముద్దాడిన క్షణమది! జాతి చరిత్రలో అరుదైన క్షణం, అత్యద్భుతమైన క్షణం! 

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ- మూడు తరాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలాయి. 1969 ఉద్యమం, మలిదశ పోరాటం, పతాక స్థాయి ఘట్టాలు... లాఠీలు, తూటాలు.. గాయాలు... ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, అనుభూతులు వారివి. ఆనందోత్సాహాలతో పాటు పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకుని హదయాలను ఆర్ద్రంగా మార్చాయి. తెలంగాణలోని ప్రతి అడుగడుగుకూ ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్రమైన పవిత్ర స్థలమేనాయె! సచివాలయంలో నల్ల పోచమ్మను మాయం చేసి, బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు. దీంతో మళ్ళా నల్ల పోచమ్మ వెలిసింది. ఇప్పుడా గుడిలోనే తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పూజలు చేయడం! ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టుకోవడానికి అనుమతి లభించలేదు. 

ఇప్పుడా మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవందనం స్వీకరించారు. హైదరాబాద్ వీధుల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి. ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచఠీవీతో తిరుగాడుతున్నారు. ఉస్మానియా క్యాంపస్‌లో ఎన్ని ఉద్రిక్త ఘట్టాలని! క్యాంపస్‌లో పిల్లలను లాఠీలతో కొడుతుంటే చూడలేక, దేశ విదేశాలలోని తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లి పోయిన క్షణాలెన్నో! ఉద్యమం ప్రతి మలుపులో తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమర వీరుల స్తూపం దగ్గర కలుసుకొని చర్చించుకునేటోళ్ళు. వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడువక ముళ్ళ తీగలను ఛేదించుకుని అమర వీరుల స్తూపం దగ్గరకు ఉరకడం చాలా మందికి అనుభవమే. 

జూన్ రెండు ప్రవేశ ఘడియల్లో అనేక మంది అక్కడ చేరి చెమ్మగిల్లిన కనులతో అమర వీరులకు నివాళులర్పించారు. చాలా మంది కుటుంబంతో వచ్చి పిల్లలను అమరులకు పరిచయం చేశారు. ఆ పిల్లల మస్తిష్కంలో అదొక చెరగని జ్ఞాపకం. తెలంగాణవాదం ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తూనే ఉన్నది. 
స్వీయ రాష్ట్రం సిద్ధించింది కనుక, ఇక జాతి సర్వతోముఖాభివద్ధి కోసం పాటుపడవలసి ఉన్నది. వలస పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ భాషా సంస్కతులకు మళ్ళా ప్రాణం పోయాలె. ఉతష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలె. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. ఇదొక సమష్టి యజ్ఞం. 

పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను, సంక్షోభాన్ని అనుభవించింది. సామాజిక జీవనం ఛిద్రమైంది. సామాజిక సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది. ఈ పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు. శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయట పడగలం. జనానికి తక్షణం కావలసింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. రేపటి గురించి బుగులు లేని జీవితం. ఇవేమీ చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు. కనీస అవసరాలు తీరడం, గౌరవమైన బతుకు ప్రజల ప్రాథమిక హక్కు.

కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక, అధికారం చేపట్టగానే ఇచ్చిన తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండడం హర్షణీయం. స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవి. పరాయి పాలనలో నిధుల మళ్ళింపు, పాలనాపరమైన వివక్ష వల్ల అవి తెలంగాణకు అందలేదు. అందువల్ల మూడు తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి. రుణాల మాఫీ, రెండు పడక గదుల ఇల్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైన హామీలు. తెలంగాణకు నీటి పారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బహత్కార్యం. కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్టు పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశ పెట్టడం కూడా అవసరమే.

తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు. అపారమైన వనరులు ఉన్నాయి. ప్రజలు కష్టించే తత్వం గలవారు. బుద్ధిబలానికి కొదవలేదు. ఇందుకు తోడు, మూడు తరాల పాటు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది. అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావు లేదు. స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి