గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 08, 2014

నగరం నడిబొడ్డున అక్రమ కార్ఖానా..

-నిబంధనలకు విరుద్ధంగా జంతువుల వధ..
-మాంసపు ముద్దలను ఉడకబెట్టి నూనె తయారీ
-కోట్లలో వ్యాపారం.. లక్షల్లో మామూళ్లు
-ఎమ్మెల్యే సహకారంతోవ్యవహారం
-చాదర్‌ఘాట్ మూసీ పక్కన సాగుతున్న దందా..

లంకల శ్యాంసుందర్‌రెడ్డి (సిటీబ్యూరో): నగరం నిద్రపోతున్న వేళ.. అమాయక ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కార్యకలాపాల నిర్వహణ జరుగుతోంది. అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమవుతాయి. నిర్వాహకుల హంగూ, ఆర్భాటం, దౌర్జన్యం అక్కడి వారిని ప్రశ్నించలేని స్థితికి దిగజార్చాయి. ఎప్పుడూ డజను మంది కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో కాపలాగా ఉంటారు. అక్కడకు ఎవరైనా వెళ్తే దేహశుద్ధి తప్పదు. పొరపాటున ఎవరైనా ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో చెప్పలేం. నగరం నడిబొడ్డున, పోలీస్‌స్టేషన్ నుంచి కిలోమీటర్ దూరంలోనే అక్రమ వ్యవహారం కొనసాగుతున్నా పోలీసులకు పట్టదు. అక్రమ వ్యవహారాలను అడ్డుకోవాల్సిన ఓ ఎమ్మెల్యే సహకరిస్తున్నారు. దీంతో అక్రమాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు, బల్దియా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తమవంతు వాటాలు తీసుకుంటూ సహకరిస్తున్నారు. ఇక కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంటే.. ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, నాయకులు లక్షల్లో దండుకుంటూ వంత పాడుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన ఎమ్మెల్యే భక్షించే స్థాయికి దిగజారడం ఆయా శాఖలకు చెందిన అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎప్పుడూ ప్రజల గురించి ప్రసంగాలు గుప్పిస్తూ, అక్రమ మార్గంలో కోట్లు దండుకుంటూ గురివిందగింజ సామెతను నిజం చేస్తున్న వైనమిది. 

అక్రమ వధశాల.. నూనె తయారీ... 
అక్రమంగా మూగ జీవాల వధశాల... జంతువుల కళేబరాలతో నూనె తయారీ.... నిత్యం రక్తపు మడుగులు ఏరులైపారుతుంది... దుర్వాసనతో చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వచ్చే మలక్‌పేట్ ప్రాంతంలోని శంకర్‌నగర్ బస్తీ ఆందోళన చెందుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా వెలసిన కార్ఖానాలో ఈ వ్యవహారం జరుగుతోంది.

జంతు వధశాలలో అందరూ నిద్రపోయే సమయంలోనే పనులు ప్రారంభమవుతాయి. రాత్రి వేళ లారీల రాకపోకలు, జంతువుల తరలింపు, తయారు చేసిన నూనె, జంతువుల వ్యర్థాలు, చర్మాలు, మాంసం ఒక్కొక్కటి అంతా రాత్రికి రాత్రే ఇక్కడ నుంచి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తారు. ఇలా ప్రతి రోజు బిజీగా కొనసాగే వీరి వ్యాపారం కోట్లలో కొనసాగుతుంది.డబ్బు గడించాలనే అత్యాశతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పశువులను వధించిన తరువాత వచ్చే రక్త, వ్యర్థాలను మొత్తం మూసీలో కలిపేస్తున్నారు. జంతువులను వధించిన తరువాత మాంసం ముద్దలను మూసీ పరివాహక ప్రాంతంలో ఆరబెట్టి ఆధునిక బాయిలర్‌లలో మరగపెడుతూ నూనెను తయారు చేస్తున్నారు. ఉదయానికల్లా మొత్తం శుభ్రంగా కడిగేసి ఏమీ లేనట్లుగా చేసేస్తున్నారు. నగర శివారు ప్రాంతాలు, గ్రామాలకు వీటిని తరలించి దర్జాగా విక్రయిస్తున్నారు.

అనునిత్యం పహారా... మలక్‌పేట శంకర్‌నగర్‌లోని నడుస్తున్న అక్రమ పశువధ శాల మూసీ నది ఒడ్డునే ఉంటుంది. ఇక్కడికి కొత్త వ్యక్తులు వెళ్లాలంటే ప్రాణాల పై ఆశలు వదులుకోవాల్సిందే. కొత్త వ్యక్తులు ఇక్కడ సంచరిస్తే వెంటనే అక్కడ ఉండే కిరాయి మనుషుల నుంచి హుంకరింపులు వస్తాయి. తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లిపోవల్సిందిగా ఆర్డర్ వేస్తారు. ఇదేమని అడిగితే భౌతిక దాడులకు పాల్పడుతారు. పశు వధశాలను నిర్వహిస్తున్న యజమాని కిరాయి మనుషులను పెంచి పోషిస్తున్నారు. స్థానికంగా అక్కడే నివాసం ఉండే వారు కూడా అక్కడికి వెళ్లలేరు. అదంతా ఒక అనధికారిక నిషేధిత ప్రాంతమన్నమాట. 

మామూళ్ల మత్తులో అధికారులు... మామూళ్ల తతంగం తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కలుగక మానదు. పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల్లో అందరూ ఈ వ్యవహారంతో భాగస్వాములుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనధికార పశువధశాల చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో సహా ఏఎంఓహెచ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, పోలీసులు(డీసీపీ, ఏసీపీ, సీఐ, సెక్టార్ ఎస్‌ఐ, టాస్క్‌ఫోర్స్), విద్యుత్-జలమండలి అధికారులు, స్థానిక నాయకులు... ఇలా అందరికీ లక్షల్లో ముడుపులు అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కేవలం కంటి తుడుపు చర్యగా అప్పుడప్పుడు లోపాయికారి ఒప్పందంతో సీజ్ చేస్తున్నట్లుగా నటిస్తున్నారని, మళ్లీ వెంటనే తెరుచుకుంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే తంతు చాలా సంవత్సరాలుగా కొనసాగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వ్యవహారానికి విద్యుత్ కనెక్షన్, మంచినీటి కనెక్షన్ ఇచ్చి తమవంతుగా సహకరిస్తున్నారు సంబంధిత అధికారులు. ఇక ఓ ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై పూర్తి సహకారం అందిస్తున్నారు. అక్రమాలను నిరోధించాల్సిన ప్రజాప్రతినిధి అక్రమ కార్యకలాపాలకు వత్తాసు పలుకుతుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నూతన పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ వార్త నమస్తే తెలంగాణలో చూడాలంటే...

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

s mallikarjuna చెప్పారు...

ఇటువంటి వాటిని తప్పనిసరిగ మూయించి వేయాలి, దయచెసి అందరూ గమనించాలి, ఇందులొ సీమాంధ్రుల పాత్ర ఏమి లేదు.

s mallikarjuna చెప్పారు...

ఇటువంటి వాటిని తప్పనిసరిగ మూయించి వేయాలి, దయచెసి అందరూ గమనించాలి, ఇందులొ సీమాంధ్రుల పాత్ర ఏమి లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి