గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 18, 2014

సొమ్ము తెలంగాణది..సోకు సీమాంధ్రది!

రాష్ట్ర విభజనలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీఐఐసీ తెలంగాణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక వాడల్లో ప్లాట్లను విక్రయించగా రూ.13 వేల కోట్లకు పైగానే సంస్థ ఖాతాకు చేరింది. ఆ డబ్బులు పెట్టి సీమాంధ్రలో పట్టా భూములు కొని పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రూపొందించిన వాడల్లో ప్రభుత్వ భూములే అధికం కాగా సీమాంధ్రలో దాదాపు అన్నీ కొనుగోలు చేసినవే. అంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్లాట్లను విక్రయించగా వచ్చిన సొమ్మును సీమాంధ్రలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా ధారపోశారు. పారిశ్రామికవాడలను అభివృద్ధిపరుచుకున్నారు. ఎంతగా అంటే ఇపుడు తెలంగాణ కన్నా సీమాంధ్రలో పారిశ్రామికవాడలే అధికం. అంతేకాదు తెలంగాణ ల్యాండ్ బ్యాంకులో ఉన్న భూములన్నీ కరిగిపోగా సీమాంధ్రలో దండిగా ఉన్నాయి. కొసమెరుపు ఏమిటంటే ఇపుడు సంస్థ అప్పులను ఆయా ప్రాంతాల్లో జరిగిన వ్యయం ఆధారంగా కాకుండా జనాభా ప్రాతిపదికన పంచుతామనడం.

- ఏపీఐఐసీ అధికారుల నిర్వాకం.. తెలంగాణ భూములమ్మి సీమాంధ్రకు తరలింపు
-ఇక్కడి సొమ్ముతో అక్కడ పారిశ్రామికవాడలు
-ఉత్పాదక రంగం అక్కడ, సర్వీసు ఇక్కడ
-తెలంగాణ ప్రభుత్వ రాబడికి తీవ్ర నష్టం
-ల్యాండ్‌బ్యాంక్‌లో భారీ వ్యత్యాసాలు
-ఆంధ్రాలో 22994.92, మనకు 5649.60 ఎకరాలు
-తెలంగాణ ప్రభుత్వంపై పడనున్న భారం
-ఉమ్మడి రాష్ట్రంలో కొన్న స్థలాలన్నీ పంచాలి
-అప్పులు జనాభా పరంగా కాకుండా వ్యయం ప్రాతిపదికన పంచాలి
-అపెక్స్ కమిటీ పరిశీలనలో విభజన నివేదిక
ఏపీఐఐసీ.. ఉమ్మడి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఇతోధికంగా కృషి జరిపేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. ప్రభుత్వం బోలెడన్ని నిధులిచ్చి సిబ్బందిని, అధికారాలను సమకూర్చి ఏర్పరిచిన సంస్థ. అయితే ఇది పూర్తిగా సీమాంధ్ర ప్రయోజనాలకే అంకితమై పనిచేసింది. తెలంగాణలో బీదాబిక్కి రైతుల భూములను కొల్లగొట్టి బొక్కసం నింపుకుంది. ఆ నిధులను సీమాంధ్రకు తరలించి అక్కడ పారిశ్రామికాభివృద్ధికి కృషి చేసింది. ఇక్కడ భూములమ్మి సమకూర్చుకున్న నిధులను సీమాంధ్రకు తరలించి అక్కడ పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసింది. తెలంగాణను సర్వీస్ ప్రొడక్ట్ రంగానికి పరిమితం చేసింది. ఈ సంస్థ నిర్వాకం కారణంగా తెలంగాణ అనుత్పాదక సంస్థలకు పరిమితం కావలిసి వచ్చింది. ఉత్పాదక రంగానికి కీలకమైన పారిశ్రామిక వాడలన్నీ సీమాంధ్రకు దక్కాయి. దీని కారణంగా తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు భంగం వాటిల్లనుంది.

తెలంగాణ భూముల సేకరణఏపీఐఐసీ తన కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం తెలంగాణలో భూముల సేకరణ. పరిశ్రమల ఏర్పాటుకు భూములు అవసరం కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా భూసేకరణ జరిపింది. సహజంగానే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వానికి భారీగా భూములున్నాయి. వీటన్నింటితో పాటు బీదాబిక్కి రైతుల నుంచి కూడా సంస్థ సేకరించి ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటు చేసుకుంది. తర్వాత పరిశ్రమ ప్రోత్సాహం కోసం ప్రభుత్వం నగరం చుట్టు పక్కల 50కి పైగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ రంగాలకు సంబంధించి పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. భారీగా భూవసతి ఉండడంతో సర్వీస్ సెక్టర్‌కు చెందిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. నామమాత్రపు ధరతో వారికి సర్కారు ఈ భూములను కట్టబెట్టింది. లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ప్రచారం చేసింది. కాగా ఇలా వివిధ పారిశ్రామికవేత్తలు చెల్లించిన సొమ్ము సంస్థ ఖాతాకు చేరింది. ఈ మొత్తం సుమారు రూ. 13వేల కోట్లకు పైనే ఉంటుంది.


సీమాంధ్రకు నిధులు తరలింపు...ఇక పారిశ్రామికీకరణ రెండోదశకు ఈ సంస్థ తెర తీసింది. సీమాంధ్రలో కూడా పారిశ్రామికాభివృద్ధి జరపడానికి పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకోసం భూసేకరణ ప్రారంభించింది. అయితే సీమాంధ్రలో సర్కారు భూములు లేవు. దానితో ప్రైవేటు వ్యక్తులనుంచి భూములు సేకరించింది. ఇందుకోసం తెలంగాణ భూముల్లో వచ్చిన నిధులను వారికి పరిహారంగా చెల్లించింది. అంటే తెలంగాణ భూములనున అమ్మగా వచ్చిన సొమ్ముతో అక్కడ భూముల సేకరణ జరిగిందన్నమాట. సరే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఎవరూ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. సేకరించిన భూముల్లో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేశారు.

ఉత్పాదక రంగంలో సీమాంధ్రకు పెద్దపీట..ఇలా తెలంగాణలో అటు సీమాంధ్రలో పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. ఇందులో మళ్లీ ఓ ట్విస్టు ఉంది. పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా ఉత్పాదక రంగాలకు చెందినవి, సర్వీసు రంగానికి చెందినవి అని రెండు రకాలు, ఇందులో తెలంగాణకు సర్వీసు రంగ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయగా సీమాంధ్రలో ఉత్పాదక రంగానికి చెందిన పారిశ్రామిక వాడలు అధికంగా ఏర్పాటు చేశారు. తెలంగాణలో 28452.37 ఎకరాలతో ఉత్పాదక రంగానికి చెందిన 133 పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో 97873.24 ఎకరాలతో 199 వాడలను రూపొందించారు. ఈ వ్యత్యాసం వల్ల తెలంగాణ ఉత్పాదక రంగం విషయంలో వెనకబడినట్లయింది.

నష్టమేమిటి?...ఉత్పాదక రంగానికి చెందిన పరిశ్రమల వల్ల ఉద్యోగాల సృష్టితో పాటు అక్కడ ఉత్పత్తి జరిగే వస్తువుల మీద పన్నుల రూపంలో ప్రభుత్వానికి రాబడి భారీగా ఉంటుంది. దానికి తోడు ఆ పరిశ్రమకు తోడు ఉప ఉత్పత్తులు అందించే పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. వస్తుసేవల రవాణా తదితర అంశాల్లో ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. ఇలా ఉత్పాదక రంగ పరిశ్రమల వల్ల బహుముఖంగా ప్రయోజనం చేకూరుతుంది. అదే సర్వీసు రంగ పరిశ్రమల వల్ల ఈ స్థాయి ప్రయోజనాలు ఉండవు. చాలా వరకు సర్వీసు రంగ పరిశ్రమలతో ఉద్యోగావకాశాలు పెద్దగా రాకపోగా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో భారీ ఆదాయం ఉండదు. ఈ రకంగా ఈ సెజ్‌లలో సర్వీసు రంగ పరిశ్రమలే అధికంగా ఉండడం వల్ల నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆదాయానికి నష్టం వాటిల్లినట్టే లెక్క. సీమాంధ్రలో ఉత్పాదకరంగ పరిశ్రమలు ఏర్పాటు చేసిన, ఏర్పాటయ్యే పరిశ్రమల వల్ల వారికి భారీగా పన్నుల రూపంలో రాబడి లభిస్తుంది.

ల్యాండ్ బ్యాంకు పరిస్థితి....తెలంగాణ రాష్ర్టావిర్భావం తర్వాత ప్రభుత్వానికి ఉపాధి అనేదే పెద్ద సవాలు. అందుకోసం పరిశ్రమలను భారీగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి ల్యాండ్ బ్యాంక్‌లో ఇపుడు కేవలం 5649.60 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. అదే సీమాంధ్రలో 22994.92 ఎకరాలున్నాయని రికార్డులు చెబుతున్నాయి. అంటే ఇక్కడి నిధులతో అక్కడ భారీగా ల్యాండ్‌బ్యాంకు వృద్ధి చేసుకున్నారన్న మాట. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ బ్యాంకు అభివృద్ధి చేసుకోవాలంటే పట్టాభూములు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అందుకోసం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుంది. ఈ సమస్య సీమాంధ్రకు తక్కువ. కాగా తెలంగాణలో సెజ్‌లలో కేటాయింపులు జరిగి నిబంధనలను ఉల్లంఘించిన 1773 సంస్థలకు కేటాయించిన స్థలాలు సుమారు 18 వేల ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని అధికారులు ఆర్నెళ్ల క్రితం ప్రకటించారు. అది అమలు చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. ఈ సంస్థలే కాకుండా అనేక సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. వాటిపై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది.

భూములు పాయే.. అప్పులు మిగిలె..ఈ రకంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భూములన్నీ కరిగించేశారు. సెజ్‌లలో పరిశ్రమలు స్థాపిస్తామంటూ భారీగా భూములు సొంతం చేసుకున్నారు. అయితే పరిశ్రమల జాడ లేదు. ఇక్కడ వేలాది ఎకరాలను సెజ్‌లు, ఐటీ/పారిశ్రామిక వాడల ఏర్పాటుకు బదలాయించారు. ప్రధానంగా 11 సెజ్‌ల ద్వారా 5.93 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. కానీ 0.26 లక్షల ఉద్యోగాలకే పరిమితమయ్యారు. ఇందులో నాలుగు సెజ్‌లు ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేదు. మిగిలిన ఏడింట్లో నామమాత్రపు ఉపాధి మాత్రమే చూపించారు. లక్షల మందికి ఉపాధి లభిస్తుందంటూ ప్రభుత్వాలు విస్తతంగా ప్రచారం బూటకమని తేలిపోయింది. సాగించాయి. ఇక ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది.

న్యాయంగా అస్తులు అప్పులు పంచాలంటే ఎక్కడ ఎంత సంపాదించిందీ ఎక్కడ వ్యయం చేసింది చూసి లెక్కలు తీయాలి. ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు చేసిన భూముల్లో తెలంగాణకు వాటా ఇవ్వాలి. లేదా ఆ భూముల కొనుగోలుకు తరలించిన నిధులు తెలంగాణ ఖాతాకు చేర్చాలి. కానీ అవేవీ లేకుండా జనాభా ప్రాతిపదికన అప్పులు పంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనివల్ల తెలంగాణ అటు భూములను, నిధులను కోల్పోవడమే కాకుండా అక్కడ జరిగిన అప్పులు నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది. సీమాంధ్రలో ఇప్పటి వరకు 58000.86 ఎకరాలతో కూడిన 16212 ప్లాట్లను కేటాయించారు. ఇంకా 6435.69 ఎకరాలతో కూడిన 971 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం 22994.92 ఎకరాల ల్యాండ్ బ్యాంకు నికరంగా మిగిలి ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 16372.58 ఎకరాలతో కూడిన 13128 ప్లాట్లను కేటాయించారు. ఇంకా 1031.44 ఎకరాలతో కూడిన 632 ప్లాట్లు మిగిలాయి. అంటే తెలంగాణలో కేవలం 5649.60 ఎకరాల ల్యాండ్ బ్యాంకు మాత్రమే మిగిలి ఉంది.

అపెక్స్ కమిటీ పరిశీలన తర్వాతే విభజనప్రభుత్వ రంగ సంస్థల విభజన కష్టమే. ఐతే అంతర్గతంగా నివేదికలను సిద్ధం చేశాం. వాటిని అపెక్స్ కమిటీ పరిశీలించి ఆమోదించిన తర్వాతే విభజన ప్రక్రియ పూర్తవుతుందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర చెప్పారు. షీలాబిడే చైర్మన్‌గా, నర్సింహమూర్తి, గోయెల్ సభ్యులుగా ఉన్న అపెక్స్ కమిటీ వీటిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాది గడువు ఇచ్చినప్పటికీ ఆర్నెళ్లల్లోనే పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఏపీఐఐసీ వంటి సంస్థల్లో ఉద్యోగుల మధ్య వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమేనన్నారు. కమిటీ నిర్ణయం మేరకు ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి