గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 14, 2014

విస్తరణ పేరుతో.. కోట్లు స్వాహా!!

రాత్రికి రాత్రే కోటీశ్వరులం కావడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీకిదో సువర్ణావకాశం. జస్ట్ బల్దియా అధికారులను మేనేజ్ చేసుకుంటే చాలు.. పైసా పెట్టుబడి లేకుండా కోటీశ్వరులు కావచ్చు. ప్రభుత్వ భూమైనా, రోడ్డైనా, చివరికి నాలా అయినా పరవాలేదు. అవి తమవేనని నమ్మించే పత్రాలు సృష్టించుకుంటే చాలు పరిహారం పేరిట కోట్ల రూపాయలు మీ ఇంటిముందుంటాయి. బరి తెగించిన బల్దియా అధికారులు ఇటువంటి అక్రమ వ్యవహారాల్లో వాటాలు మాట్లాడుకొని ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతూ, తామూ దోచుకుంటున్నారు. 
మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా బల్దియా అధికారులు రోడ్లను విస్తరించడం సర్వసాధారణమైన విషయం. ప్రైవేటు భూములైతే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించి భూములు తీసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ స్థలమైతే సంబంధిత శాఖతో చర్చల ద్వారా ప్రభుత్వ విధివిధానాలు పాటించి ఆ భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇలా సాధారణ మాస్టర్‌ప్లాన్ రోడ్లకు బల్దియా ఏటా సుమారు రూ.100 కోట్ల వరకూ నష్ట పరిహారం రూపంలో చెల్లిస్తుండగా, ఇన్నర్ రింగురోడ్డు, మెట్రోరైలు ప్రాజెక్టు తదితర ప్రత్యేక ప్రాజెక్టుల కోసమైతే ఇప్పటికే దాదాపు రూ.500 కోట్లకుపైగా నష్టపరిహారం రూపంలో చెల్లించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా అసలు ఏ రోడ్డు విస్తరణ లేకుండానే నష్టపరిహారం పేరిట అప్పనంగా ప్రజల సొమ్ము ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన ఘటనలు తాజాగా వెలుగులోకొచ్చాయి. ఈ వ్యవహారం ఎప్పటినుంచి జరుగుతుందో, ఇలా ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలు దోచిపెట్టారో పూర్తిగా తేలకపోయినా నాలుగు ఘటనల్లో మొత్తం రూ.31 కోట్ల పైచిలుకు ప్రైవేటు వ్యక్తులకు చెల్లించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ భూములు, రోడ్లు, నాలాలైతే ప్రశ్నించేవారు ఎవరూ ఉండరు...కనుక వాటి సమీపంలోని భూముల సర్వే నెంబర్ల ఆధారంగా తప్పుడు పత్రాలు సృష్టించి గతంలో తమకు ఎటువంటి పరిహారం చెల్లించకుండానే భూములు సేకరించినట్లు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించినట్లు సమాచారం. ఇది అక్రమమని తెలిసినా పరిహారం భారీస్థాయిలో ఉండడం, ప్రశ్నించేవారు ఎవ్వరూ లేకపోవడంతో బల్దియా అధికారులు వారితో వాటా మాట్లాడుకొని హడావుడిగా కోట్ల రూపాయలు ధారాదత్తం చేశారు. తిలా పాపం తలా పిడికెడు అనే చందంగా ఇందులో సంబంధిత అధికారులకే కాకుండా బల్దియాకు చెందిన ఇద్దరు ప్రముఖులకు కూడా భారీగా వాటా అందినట్లు సమాచారం.

ఆర్ అండ్ బీ రోడ్డుకు..బల్దియా అధికారులు టోలీచౌకీ-రాయదుర్గం ఆర్ అండ్ బీకి చెందిన రోడ్డులో ఫుట్‌ఓవర్ బ్రిడ్జీ వద్ద 2430.26 చదరపు మీటర్ల భూమిని సేకరించినట్లు పేర్కొంటూ ఓ ప్రైవేటు వ్యక్తికి రూ. 12 కోట్లు చెల్లించారు. ఇందులో బల్దియాకు చెందిన ఒక ప్రముఖుడికి రెండుకోట్లు, ఓ అధికారికి నాలుగు కోట్లు ముట్టగా మిగిలిన మొత్తాన్ని సదరు ప్రైవేటు వ్యక్తి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక హడావుడీగా ఈ మొత్తాన్ని చెల్లించడం ఒక ఎత్తైతే, దీనికి సంబంధించి బల్దియా సర్కిల్ కార్యాలయం అధికారులు పరిహారం కోసం హెడ్ ఆఫీస్‌కు రికమండ్ చేయడం మరో విశేషం. దీనికోసం బల్దియాలోని భూసేకరణ విభాగంలో టిఎస్ నెం-9/2, వార్డ్ నెం-13, బ్లాక్ నెం-బి పరిధిలో ఫైల్- బి/ 1421/2007 పేరుతో ప్రక్రియ కొనసాగించారు. జీహెచ్‌ఎంసీ మ్యాప్ ప్రకారం అక్కడ 100 ఫీట్ల రోడ్డు ఉండగా, ప్రస్తుతం అంతే రోడ్డు అక్కడ ఉంది. ఏమాత్రం విస్తరించిన దాఖలాలు లేవు. సదరు వ్యక్తి, గతంలో తనకు ఎటువంటి పరిహారం చెల్లించకుండానే తన భూమిని సేకరించారని పేర్కొంటూ దరఖాస్తు చేసుకోగా అధికారులు హడావుడ్గిగా అతనికి రూ.12 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.

ప్రభుత్వ భూమికి..రెవెన్యూ రికార్డుల ప్రకారం కేబీఆర్ పార్కుకు సంబంధించిన భూమి నిజాంలకు సంబంధించినది కాగా, అనంతరం అది ప్రభుత్వపరమైంది. కాగా, ఈ పార్కుముందు రోడ్డుకోసం తన భూమిని సేకరించారని పేర్కొంటూ ఓ వ్యక్తి బల్దియాకు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఇ/ 1207/2007ఫైల్‌ను రూపొందించి సదరు వ్యక్తికి ఆరు కోట్లు చెల్లించారు. ఇందులోనూ బల్దియాకు చెందిన ఇద్దరు ప్రముఖులకు చెరో కోటి చొప్పున ముట్టినట్లు సమాచారం. అక్కడ ప్రైవేటు భూమి లేకున్నా సమీపంలోని సర్వే నెంబర్ల ఆధారంగా తప్పుడు పత్రాలు సృష్టించి ప్రైవేటు వ్యక్తులకు పరిహారం చెల్లించినట్లు సమాచారం.

నాలాకూ చెల్లింపుహుస్సేన్‌సాగర్ నాలాకు సంబంధించిన భూమి తమదేనంటూ ఇద్దరు వ్యక్తులు పరిహారం కోసం దరఖాస్తుచేసుకున్నారు. దీంతో ఫైలు నెం- ఏఏ/782/2007 పేర ఒకరికి ఎనిమిది కోట్లా ఐదు లక్షలు, అలాగే, ఫైల్ నెం-7/నాలాస్/ 149, 191 పేరుతో మరొకరికి ఐదు కోట్లు చెల్లించారు. ఎంతోకాలంగా నాలా కొనసాగుతుండగా, కాలక్రమంలో నాలా కబ్జాకు గురైంది. ఓ వైపు నాలా విస్తరణ కోసం కబ్జాల తొలగింపుకు బల్దియా అధికారులు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు, నాలా కోసం భూమి సేకరించినట్లు పేర్కొంటూ నష్టపరిహారం చెల్లించడం విశేషం.

ఇంకా ఇలాంటివి ఎన్నో?గ్రేటర్ ఏర్పాటు తరువాత ఇన్నర్ రింగురోడ్డు ఏర్పాటుకు, అలాగే మెట్రోరైలు ప్రాజెక్టుకు కలుపుకొని సుమారు రూ. 500 కోట్లకుపైగా నష్టపరిహారం రూపంలో చెల్లించారు. ఇవికాకుండా ఏటా సుమారు రూ. 100 కోట్ల వరకూ మాస్టర్‌ప్లాన్ రోడ్ల విస్తరణకు పరిహారం చెల్లిస్తూనే ఉన్నారు. దీన్నిబట్టి బల్దియాలో పరిహారం చెల్లింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. తాజాగా అక్రమాలు వెలుగుచూడడంతో ఇంకా ఇటువంటివి ఎన్ని జరిగాయో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియాలోని భూసేకరణ విభాగానికి డిప్యూటేషన్‌పై వస్తున్న రెవెన్యూశాఖ అధికారులు అక్రమంగా బల్దియా సొమ్మును కొల్లగొట్టడమే కాకుండా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. బల్దియా భూసేకరణలపై సమగ్ర దర్యాప్తు జరిపితే అనేక అక్రమాలు బయటకొచ్చే అవకాశముందని తాజా ఘటనలు రుజువుచేస్తున్నాయి.

తప్పుడు పత్రాలు ఎలా?విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వ భూములు, నాలాలకు సంబంధించి సమీపంలోని సర్వే నెంబర్ల ఆధారంగా అవి కూడా అదే సర్వే నెంబర్‌లో వస్తున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. రెవెన్యూశాఖలోని లోపాలు, సాంకేతికపరమైన లొసుగులు, అధికారుల అవినీతివల్ల ఇటువంటి తప్పుడు పత్రాలు సృష్టించడం తేలిగ్గా మారినట్లు ఆ శాఖలోని ఉద్యోగులే చెబుతున్నారు. భూముల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో పరిహారం కూడా కోట్లల్లో ఉంటోంది. దీంతో ప్రైవేటు వ్యక్తులు, అధికారులు వాటాలు మాట్లాడుకొని దోచుకుంటున్నారు.

- ఎస్.కిశోర్

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి