గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 31, 2014

సందట్లో సడేమియాలు...

క్రమ ఉద్యోగులను తెలంగాణలోనే ఉంచడం...తెలంగాణ ఉద్యోగుల్ని ఆంధ్రకు బదిలీ చేయడం...పోలవరం ముంపుగ్రామాల్ని...ఏడుమండలాల్ని ఆంధ్రలో కలపడం మొదలైన సమస్యలతో తెలంగాణ తలమునకలై ఉంటే సందట్లో సడేమియాల్లా ఈ ఆంధ్రా అక్రమార్కులు తెలంగాణ భూదందా షురూచేశారు...


-ఆఖరి మోఖాలో ఆంధ్రాబాబుల భూం ఫట్
-కంటపడ్డ భూములన్నింటికీ ఎన్వోసీలు.. సహకరిస్తున్న సీమాంధ్ర అధికారులు
-రాత్రికి రాత్రే జారీఅవుతున్న జీవోలు..
-కబ్జా పెడుతున్న భూమి విలువ రూ. 1500 కోట్లు
-తెరవెనుక కేవీపీ, సీఎం రమేశ్, లగడపాటి, మాజీ సీఎం కిరణ్ సోదరుడు
-ఆంధ్రా అధికారికి తెలంగాణలో భూమి కేటాయింపు
-అక్రమంగా ఆక్రమిస్తే ఊరుకోం.. టీఆర్‌ఎస్ సీరియస్

ఆంధ్రా నాయకులు ఆఖరి దోపిడీ ప్రారంభించారు. ఇన్నాళ్లూ అబ్బ సొత్తులాగా తెలంగాణ భూములు తెగనమ్మి బొక్కసాలు నింపుకున్న నయా దోపిడీమూకలు, సమైక్యరాష్ట్రం చరమాంకంలో కూడా వంకరబుద్ధి పోనిచ్చుకోవడం లేదు. ఎంత దోచుకోగలిగితే అంత అన్నట్టు ఆఖరు నిమిషంలో ఆబగా సర్కారు, యుఎల్‌సీ, ఇనామ్ ఇలా హైదరాబాద్‌లో కంటపడ్డ భూములనన్నింటినీ చెరబట్టి దొడ్డిదారిలో క్రమబద్ధం చేసుకోజూస్తున్నారు. నాలుగు రోజుల్లో తెలంగాణ వదిలే అధికారులు వాటికి రాజముద్రలు వేస్తున్నారు. భేతాళ మాంత్రికులు, పాతాళ తాంత్రికులు పార్టీలు మరిచి కుమ్మక్కై ఇలా చెరబట్టిన భూముల విలువ రూ. 1500 కోట్లకు పైమాటే. సీమాంధ్ర పాలకులను పొలిమేరల ఆవలికి తరిమికొట్టిన ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన తెలంగాణ భవన్ సమీపంలో ఉన్న భూమిని సైతం ఈ బకాసురులు వదలడం లేదంటే ఎంతకు తెగించారో... సీమాంధ్ర అధికారులు ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. 

రో నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవిస్తున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు, అధికారులు ఇక్కడి విలువైన భూములను స్వాహా చేయడానికి ఆగమేఘాల మీద ఉరకలు పరుగులు పెడుతున్నారు. విలువైన కొన్ని భూములను ఇప్పటికే అడ్డదారుల్లో తమ ఖాతాల్లో వేసుకున్నారు. వీరితో కుమ్మక్కైన సీమాంధ్ర ఉన్నతాధికారులు వివాదాస్పద, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ రాత్రికి రాత్రే జీవోలు జారీ చేస్తున్నారు. రెండు రోజుల్లో ఎన్ని భూములను స్వాధీనం చేసుకోగలమో లెక్కలు వేసుకొని మరీ దంచుకో.. పంచుకో అన్న సూత్రాన్ని అమలు చేస్తున్నారు. నాయకులు, ఉన్నతాధికారులు ఇప్పటిదాకా కాజేసిన భూముల విలువ దాదాపు రూ. 1500 కోట్ల వరకూ ఉంటుందని తెలిసింది. సర్కారు, యూఎల్‌సీ, ఇనామ్, అవెక్యూ ఇలా ప్రభుత్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన భూములకు అడ్డదారుల్లో క్రమబద్ధీకరణ మార్క్ వేస్తున్నారు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలలో అత్యంత ఖరీదైన యూఎల్‌సీ భూములకు కూడా జిల్లా కలెక్టర్ల నుంచి మొదలు కొని సీసీఎల్‌ఏ వరకు కమిటీల్లో వేసి హడావిడిగా క్లియరెన్స్ ఇస్తున్నారు. సర్కారు భూములకు కూడా ఎన్వోసీలు జారీ చేస్తున్నారు. షేక్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాలలో సర్కారు భూములకు తూట్లు పొడిచి సీమాంధ్రులు కోట్లు దండుకుంటున్నారు.

దిగో ఈ రకంగా...: షేక్‌పేట మండలంలో అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా ఉన్న 403 సర్వేనెంబర్‌లో 10 ఎకరాల భూమిని ఆంధ్రా బడాబాబులు, ఉన్నతాధికారులు కలిసి స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారు. ఆనంద్ ప్రభాత్ సొసైటీ పేరిట ఈ ప్రభుత్వ భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. రూ.300 కోట్ల విలువ చేసే ఈ భూమిని కాజేసేందుకు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు లగడపాటి, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌లు పార్టీలు మరిచి కుమ్మక్కై తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇదే సర్వేనెంబర్‌లో ఒక సంస్థకు కేటాయించిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి అధికారుల స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

హైదరాబాద్ కలెక్టర్ ద్వారా ఎన్వోసీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులవుతారని ప్రచారంలో ఉన్న ఒక అధికారి పూర్తి స్థాయి అండదండలు అందిస్తున్నట్టు సమాచారం. సీసీఎల్‌ఏగా ఉన్న ఒక అధికారి సీమాంధ్రలో అధికార పార్టీ నాయకులకు, బడా బాబులకు తలొగ్గి హడావిడిగా ఎన్వోసీలు ఇవ్వడానికి రంగం సిద్దం చేస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు చెప్పారు. దీని వెనుక పెద్ద లాబీ పని చేస్తున్నదని వారు చెప్పారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్11లోని రూ.150 కోట్ల రూపాయల విలువైన ఐదు ఎకరాల భూమిని స్వాహా చేయడానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు సంతోష్‌రెడ్డి తన బినామి ప్రతాపరెడ్డితో తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అంజునాబేగం పేరుతో ఈ భూమికి ఎన్వోసీ తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. రాయదుర్గంలోని సర్వేనెంబర్ 66, 83లోని వివాదాస్పద భూమిపై ఎన్వోసీ ఇవ్వడానికి అధికారులు అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నారు. 

రోడ్ నెంబర్ 10లోని 2500 చదరపు గజాల పార్కు భూమిని ఉన్న ఫళంగా ఎన్వోసీ జారీ చేశారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ భవన్ ఎదురుగా ఉన్న రూ.300 కోట్ల విలువ చేసే 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేయడానికి కేవీపీ రంగంలోకి దిగాడు. రాధికా సొసైటీ ముసుగులో ఈ భూమిని ఎన్వోసీ తీసుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. నేడో రేపో ఎన్వోసీ వస్తుందన్న ధీమాతో సీమాంధ్ర బడాబాబు ఉన్నట్లు సమాచారం. మరోవైపు లోయర్ ట్యాంక్ బండ్‌లోని డీబీఆర్ మిల్స్ భూమిని స్వాధీనం చేసుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ముషీరాబాద్ మండల కార్యాలయం ఎదురుగా ఉన్న 157, 158 సర్వేనెంబర్‌లోని రూ. 250 కోట్ల విలువైన 24 ఎకరాల భూమిని రాజ్‌కుమార్ మల్సానీ పేరుతో ఎన్వోసీ తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 

ఆంధ్రా అధికారి కుటుంబానికి తెలంగాణలో భూమి..: ఆంధ్రప్రాంతానికి చెందిన ఒక ఐఎఫ్‍ఎస్ అధికారి కుటుంబానికి ఉన్న ఫళంగా హైదరాబాద్‌లోని విలువైన భూమిని కట్టబెడుతూ ఈ నెల 23వ తేదీన హడావుడిగా జీవో జారీ చేశారు. కాకినాడకు చెందిన ఐఎఫ్ ఎస్ అధికారి వీ వెంకటేశ్వరరావు 1990లో కాబూల్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించారు. ఆయన భార్య వీ మాలతీరావుకు జూబ్లీహిల్స్ భరణి లేఅవుట్‌లో 475 చదరపు గజాల భూమిని కట్టబెట్టారు. ఈ భూమిని ఇవ్వడానికి అంగీకరిస్తూ హైదరాబాద్ కలెక్టర్ సిఫారసు చేయగా సీసీఎల్‌ఏ ఆమోదిస్తూ జీవో ఇచ్చారు. రాష్ట్ర విభజనే జరిగిన తర్వాత కాకినాడకు చెందిన వారికి హైదరాబాద్‌లో భూమిని కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటనేది అధికారులే చెప్పాలి. సీమాంధ్రకు చెందిన అధికారికి సీమాంధ్రలోనే భూమిని కేటాయించకుండా తెలంగాణ భూములను ఎందుకు కేటాయిస్తున్నారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.

టీఆర్‌ఎస్ సీరియస్..: సీమాంధ్రకు చెందిన అధికారులకు, బడాబాబులకు ఆయాచితంగా భూములు కట్టబెట్టడంపై టీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రం ఆవిర్భవిస్తున్న సమయంలో హైదరాబాద్‌లో తిష్ఠవేసిన సీమాంధ్ర అధికారుల సహకారంతో భూములు స్వాహా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ భూముల కేటాయింపులు, ఎన్వోసీల జారీపై మొత్తానికి మొత్తం సమీక్ష నిర్వహిస్తామని అంటున్నారు. ఈ అక్రమాలలో పాలు పంచుకున్న అధికారులు ఎంతటి వారైనా, సీమాంధ్రకు వెళ్లినా రప్పించి ప్రాసిక్యూట్ చేస్తాం తప్ప వదిలేది లేదని అంటున్నారు. సీమాంధ్ర అధికారులు ఇచ్చిన ఎన్వోసీలను, కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కళ్ళ ముందే ఇంత దుర్మార్గమా?



ఏడెనిమిది వారాలుగా పనుల ఒత్తిడివల్ల ఈ శీర్షికకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా ఆ ఒత్తిడి తగ్గి వెసులుబాటు వచ్చిందని కాదు గాని, కళ్లముందర జరిగిపోతున్న అత్యంత అమానుషమైన దుర్మార్గం పట్ల సమాజమంతా మౌనసాక్షిగా ఉండిపోతుండడం చూసి ఇది పునఃప్రారంభిస్తున్నాను.

‘విరబూసే యాపిల్ చెట్ల సౌందర్యం కాదు, సత్యానికి తారుపూసే హిట్లర్ ఉపన్యాసాల బీభత్సం నా చేత కవిత్వం రాయిస్తోంది’ అని బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆనందం కన్నా కేంద్ర ప్రభుత్వం, కోస్తా, రాయలసీమ కాంట్రాక్టర్-రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యక్షంగా సాగించిన దుర్మార్గం, తెలంగాణ నాయకుల కుటిల మౌనం కలగలిసి ఖమ్మం జిల్లా ఆదివాసుల జీవితాల మీద జరగనున్న బీభత్సమే ఇవాళ రాయడానికి పురికొల్పుతున్నది. 

నిజానికి పోలవరం ప్రాజెక్టు కేవలం మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసే, వారి జీవితాలను ధ్వంసం చేసే పథకం మాత్రమే కాదు, దాన్ని వ్యతిరేకించడానికి మరెన్నో కారణాలున్నాయి. పోలవరం ఆనకట్ట ఏదో బహుళార్థ సాధక అభివృద్ధి పథకమనీ, అది కోస్తా, రాయలసీమలకు ఏదో మంచి చేస్తుందనీ, అన్ని “మంచి” పనులకూ ఏదో ఒక బలి ఇవ్వక తప్పదనే హిందూ బ్రాహ్మణ ఆచారం ప్రకారం ఆదివాసుల బలి తప్పదనీ చాల మంది అమాయకులు భావిస్తున్నారు. ఈ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అనే న్యాయమైన ఆకాంక్షను నెరవేర్చామనే ముసుగు వేసుకుని పాలకవర్గాలు పోలవరం ప్రాజెక్టును తీసుకువస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టు గురించి మొదటి ఆలోచన 1941లోనే వచ్చినప్పటికీ గత ఆరు దశాబ్దాలలో వేరువేరు ప్రభుత్వాలు ఎన్నో రూపాలలో అధికారిక సమాచారాలు ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ ఏ అబద్ధమూ లేని సమగ్ర సమాచారం దొరకడం లేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్న లక్ష్యాలు వేరు, లోపాయకారీ లక్ష్యాలు వేరు. ప్రభుత్వం చెపుతున్న ఖర్చు వేరు, నిజంగా జరిగే ఖర్చు వేరు. ప్రభుత్వం చెపుతున్న జలాశయ సామర్థ్యం వేరు, వాస్తవ సామర్థ్యం వేరు. అసలు ఎంత ఎత్తు ఆనకట్ట కట్టబోతున్నారనేదే ప్రభుత్వం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెపుతున్నది. జలాశయం వల్ల నిజంగా జరిగే ముంపు బీభత్సానికీ, ప్రభుత్వం చెపుతున్న అంకెలకూ పొంతన లేదు. ఆ జలాశయం కింద ముంపుకు గురయ్యే అడవి గురించీ, మత, సాంప్రదాయిక, చారిత్రక స్థలాల గురించి సరైన సమాచారం లేదు. ఆ జలాశయం ఏర్పడబోయే భూమి అంత నీటి ఒత్తిడిని తట్టుకోగలుగుతుందా అనే ప్రశ్నకు జవాబు లేదు. 

కేంద్ర జల వనరుల సంఘం వేసిన ప్రశ్నలలో సగానికి కూడ జవాబు చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం మాయ చేసిందో ఎవరికీ తెలియదు. సుప్రీంకోర్టులో రెండు పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక రాజకీయ పార్టీ వేసిన కేసులు ఇంకా విచారణలో ఉండగానే, సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే ఇది “జాతీయ” ప్రాజెక్టుగా కేంద్ర నిధులు ఎలా పొందుతుందనే ప్రశ్నకు జవాబు లేదు. ఆ ముంపు గ్రామాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్‌లో కలపడానికి ఎన్ని కుట్రలు జరిగాయో లెక్కలేదు. ఇన్ని అక్రమాలతో, అస్తవ్యస్తతలతో, అర్ధసత్యాలతో, అసత్యాలతో ఒక ప్రాజెక్టు రూపొందుతుంటే మాట్లాడవలసిన వాళ్లలో అత్యధిక సంఖ్యాకులు మౌనంగా ఉండిపోతున్నారు. లేదా పాలకవర్గ అబద్ధాలను చిలకపలుకుల్లా వల్లిస్తున్నారు. 

అన్నిటికన్నా ఘోరంగా, “మీ రాష్ట్రంలో ఉంటే... ఆ గ్రామాలను ముంచి, ఆ ఆదివాసులను నిర్వాసితులను చేసి, ప్రాజెక్టు కట్టుకోవడానికి ఆటంకాలు సృష్టించేట్టున్నారు. కనుక ఆ గ్రామాలను మాకివ్వండి” అని కోస్తా పాలకవర్గాలు అడిగితే కేంద్రం అంగీకరించింది. “మీ దగ్గర ఉన్న మనిషిని చంపదలిచాను. మీ దగ్గర ఉంటే మీరు అభ్యంతరం చెపుతారు గనుక ఆ మనిషిని నాకు ఇచ్చెయ్యండి. నా మనిషిని నేను చంపుకుంటే మీకేం బాధ” అని ఎవడన్నా అంటే వాడి బేహద్బీకీ, దుర్మార్గానికీ, అమానుషత్వానికీ అసహ్యించుకుంటాం. కాని కోస్తా పాలకవర్గాలు చాల నాజూకుగా ఈ మాటలనే చెపితే కేంద్ర ప్రభుత్వమూ అంగీకరించింది. ఇది సరైన వాదనే అని చాల మంది బుద్ధిమంతులు కూడ భావిస్తున్నారు. 

మొదట పోలవరం పేరు మీద ఊరేగుతున్న మహా అబద్ధాలను చూద్దాం. ఈ ప్రాజెక్టు అటు విశాఖపట్నం జిల్లా నుంచి ఇటు కృష్ణా జిల్లా దాకా కొన్ని లక్షల ఎకరాల వ్యవసాయానికి నీరు, విశాఖపట్నానికి మంచినీరు, ఆ పరిసరాలలో పరిశ్రమలకు నీరు ఇస్తుందని, ఆనకట్ట దగ్గర 960 మెగావాట్ల జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తుందనీ, కాలువల ద్వారా ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తుందనీ, గోదావరి వరదలను అడ్డుకోగలుగుతుందనీ, విజయవాడ ప్రకాశం బ్యారేజి దగ్గరికి తీసుకువచ్చి చేర్చే నీటి ద్వారా రాయలసీమకు కూడ నీరు అందించవచ్చుననీ పాలకులు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ పూర్తి అసత్యాలు కాదు గాని అర్ధసత్యాలు. 

వీటిలో సాగు నీరు ప్రభుత్వం చెప్పినంత రాదు. వచ్చేదైనా అవసరమైన దుర్భిక్ష ప్రాంతాలకు రాదు. విశాఖపట్నం తాగునీటి అవసరాలకు ఈ వనరు అవసరం లేదు. జలవిద్యుత్తు కోసం ఆనకట్ట అంత ఎత్తు పెంచనవసరం లేదు. వరదలను అడ్డుకోవడానికి పైన కూడ చిన్న చిన్న ఆనకట్టలు కట్టవలసి ఉంటుంది గాని ఇలాంటి ఒక రాక్షస ప్రాజెక్టు కాదు. రాయలసీమకు నీరు అందిస్తామని చేస్తున్న వాగ్దానం ఎత్తగొట్టడానికే ఎక్కువ అవకాశాలున్నాయని గత చరిత్ర వేనోళ్ల మొత్తుకుంటున్నది.

మొత్తానికి ఇన్ని ప్రయోజనాలు చెప్పినప్పటికీ పూర్తి వాస్తవరూపం ధరించేవి విశాఖపట్నం – కాకినాడ మధ్య రాబోతున్న బహుళజాతి పారిశ్రామిక సంస్థల, పెట్రోకెమికల్ సంస్థల నీటి అవసరాలు తీర్చడం, ప్రకాశం బ్యారేజి దగ్గర నీటి నిలువను స్థిరీకరించి కృష్ణా – గుంటూరు జిల్లాల ఆయకట్టులో మూడో పంటకు వెసులుబాటు కల్పించడం. అంటే ప్రకటిత లక్ష్యాలు ఆరేడింట్లో నిజంగా నెరవేరేవి రెండు మాత్రమే. అవి అటు బహుళజాతి సంస్థలు, ఇటు కృష్ణా – గుంటూరు రైతాంగం అనే రెండు బలమైన లాబీల ప్రయోజనాలు కావడం వల్ల కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వంటి జాతీయ పార్టీలు, తెలుగుదేశం వంటి ప్రాంతీయపార్టీ ఇంతగా ప్రత్యక్ష మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణ పార్టీలు కూడ ఏదో ఒక రకంగా తెలంగాణ వస్తే చాలుననే రాజీధోరణి ద్వారా ఈ దుర్మార్గం పట్ల మౌనం వహిస్తున్నాయి. 

నిజానికి ఇది తెలంగాణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఆటంకం కలిగించే ప్రాజెక్టు. బచావత్ ట్రిబ్యునల్ అంగీకరించిన ముఖ్యమంత్రుల ఒప్పందం ప్రకారం గోదావరి జలాలలో పాత ఆంధ్రప్రదేశ్ వాటా 1480 టిఎంసిలు కాగా, ఏ న్యాయసూత్ర ప్రాతిపదికన చూసినా దానిలో తెలంగాణ వాటా 900 టిఎంసిలు, ఆంధ్ర వాటా 580 టిఎంసిలు కావాలి. ఆంధ్ర వాటాలో ఇప్పటికే 320 టిఎంసి వినియోగం జరుగుతున్నది. అంటే ఆంధ్రకు ఇంకా 260 టిఎంసి కన్న ఎక్కువ వాడుకోవడానికి అవకాశం లేదు. కాని పోలవరం ప్రకటిత వినియోగమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు వెబ్ సైట్ 2010లో రాసిన ప్రకారం 301.38 టిఎంసి కాగా, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు నీటిపారుదల శాఖ 1986లో తయారు చేసిన సమగ్ర ప్రణాళిక ప్రకారం అది 336.57 టిఎంసిలు. కె. బాలగోపాల్ 2005లో వేసిన లెక్క ప్రకారం పోలవరం ఆనకట్ట ఎత్తును బట్టి ఈ జలాశయం నుంచి 500 టిఎంసి వాడుకునే అవకాశం కూడ ఉంది. ఈ లెక్కలలో కనీస సామర్థ్యపు వాటా కూడ ఆంధ్రకు లేదు. కాని ఒకసారి కేంద్ర నిధులతో ఆనకట్ట కట్టినతర్వాత, ప్రిస్క్రిప్టివ్ రైట్స్ (అక్రమంగానైనా, సక్రమంగానైనా సంపాదించినవారిదే సంపాదన మీద హక్కు అని చెప్పే న్యాయసూత్రం) ఆధారంగా ఈ అదనపు వినియోగం కూడ వారిదే అవుతుంది. అంటే ఆ మేరకు తెలంగాణ నష్టపోతుంది.

పోనీ అది ఆంధ్ర ప్రాంత రైతాంగానికైనా ఏమైనా మేలు చేస్తుందా అంటే అది కూడ వాస్తవం కాదు. అక్కడి ప్రజలను రెచ్చగొట్టి, ఈ అన్యాయానికి సమర్థన తెచ్చుకోవడానికి పాలకులు అబద్ధాలు చెపుతున్నారు గాని ఆ ప్రాజెక్టు వల్ల కృష్ణా – గుంటూరు ఆయకట్టులో మూడవ పంటకు తప్ప మిగిలిన జిల్లాల రైతాంగానికి జరగబోయే మేలేమీ లేదు.

అయినా ఇంకా తక్కువ ఎత్తు ఆనకట్ట కట్టి, తక్కువ ముంపుతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని వస్తున్న ప్రత్యామ్నాయ డిజైన్లను కూడ పక్కనపెట్టి, అసలు ప్రాజెక్టు అవసరమే లేదంటున్న వాదనలను కొట్టివేసి మూడు లక్షల మంది ఆదివాసులను నిర్వాసితులను చేసి ఈ భారీ జలాశయం నిర్మాణానికి పాలకులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఈ జలాశయం వల్ల విలువైన అడవి మునిగిపోతుంది. ఆ అడవిలోని ఆదివాసుల సాంస్కృతిక, చారిత్రక స్థలాలెన్నో మునిగిపోతాయి. శబరి నది జలాశయ గర్భంలో అంతర్ధానమై పోతుంది. పాపికొండలు కనబడకుండా పోతాయి. ఈ ప్రాంతం అతి సున్నితమైన భూకంప సంభావ్యతా క్షేత్రంలో ఉండడం వల్ల ఇక్కడ ఇంత పెద్ద జలాశయం నిర్మిస్తే ఆ ఒత్తిడికి భూకంపం సంభవిస్తే రాజమండ్రి, కాకినాడ నగరాలతో సహా వేలాది గ్రామాలు జలసమాధి అవుతాయి. 

అయినా సరే నిర్మించవలసిందే అని, దానివల్ల వేల కోట్ల రూపాయలు ఆర్జించే కంట్రాక్టర్లు, వారినుంచి వందల కోట్ల రూపాయలయినా ముడుపులు పొందే రాజకీయనాయకులు, సాంకేతిక పరిజ్ఞానం తప్ప సామాజిక జ్ఞానం లేని సాంకేతిక నిపుణులు, తెలిసీ తెలియని ‘మేతావులు’ అనుకుంటే అనుకోవచ్చు గాని ఆలోచనాపరుల సంగతేమిటి? కనీసం సహ మానవుల జీవన్మరణ విషాదమైనా కదిలించలేనంత మొద్దుబారిపోయాయా మన ఆలోచనాపరుల హృదయాలు?



- ఎన్ వేణుగోపాల్
మురళీరవం (ఆంధ్రప్రభ దినపత్రిక)
venugopalraon@yahoo.com
First Published: 10 Mar 2014 11:06:15 PM IST
Last Updated: 10 Mar 2014 11:31:24 PM IST

(ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

పోలవరం నిర్మాణంతో 600 గ్రామాలు మునకే..


-పోలవరంపై నిజాలు దాస్తున్న అధికారులు
-వరద పోటెత్తితే అనూహ్య పరిణామాలు
-సాక్ష్యంగా నిలుస్తున్న గత అనుభవాలు
-ఇప్పటికి రెండుసార్లు 180 అడుగుల వరద నీరు 
-1986లో 183 అడుగులకు చేరిన వరద 
-మునిగిపోయిన భద్రాచలం ఆలయ మెట్లు 
-ప్రాజెక్టు కడితే ఆలయానికి పెను ప్రమాదం 

పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిని అధికారులు దాచిపెడుతున్నారా? ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయని వరద ప్రమాదాన్ని తగ్గించి చూపుతున్నారా? అవుననే అంటున్నారు జలవనరుల నిపుణులు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంపు గ్రామాల సంఖ్య భారీగా పెరుగుతుందని వారంటున్నారు.

పోలవరం వరద పోటెత్తితే దాదాపు ఆరువందల గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని గత చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. పోలవరం డ్యామ్‌ను 150 అడుగుల ఎత్తు వరకు నిర్మిస్తే దాదాపు 350 గ్రామాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ నిజానికి పోలవరంలో వరద శివాలెత్తితే కనుక దాదాపు ఐదారు వందల గ్రామాలను ముంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పక్క రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లు పసిగట్టాయి. ఆంధ్ర అధికారులు మాత్రం ప్రాజెక్ట్ అంత ప్రమాదకరమైనది కాదని బుకాయిస్తున్నారు.

ప్రాజెక్ట్ పై మరింత వ్యతిరేకత రాకుండా నిజాలు దాస్తున్నారు. అదే సమయంలో సమీపభవిష్యత్‌లో ముంపుగ్రామాలను క్రమంగా పెంచే విధంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంతసేపు డ్యామ్‌లో నీటిని నిల్వచేస్తే ఉండే నీటిమట్టం వరకే లెక్కలు కట్టి ముంపును కేవలం 150అడుగులకే కుదించి లెక్కగడుతున్నారని, అయితే వరదలు పోటెత్తితే నీటిమట్టాలు గణనీయంగా పెరిగిపోతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వరద ఉధృతి వల్ల భవిష్యత్తులో భద్రాద్రి రాముడు కూడా ముంపునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 

గతంలో జరిగిన అనుభవాలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. 1986లో ఎలాంటి అడ్డుకట్ట లేని కాలంలోనే దాదాపు 183అడుగుల ఎత్తులో వరద వచ్చింది. అప్పట్లో భద్రాచలం గుడి మెట్లు కూడా వరద నీటిలో మునిగిపోయాయి ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా సరిహద్దుల్లోని కుంటామోటు వద్ద దాదాపు 180అడుగుల మేరకు వరదనీరు చేరి అనేక గ్రామాలను ముంచి వేసింది. ఇక్కడ ఎలాంటి ఆనకట్టలేకుండానే దాదాపు 179 అడుగుల మేరకు వరద నీరు చేరుతుందని 2006 జనవరి 2న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. నాలుగు దశాబ్దాలలో భద్రాచలం వద్ద ఇప్పటికి రెండు సార్లు వరద 168నుంచి 180 అడుగుల వరకు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ప్రస్తుతం 150 అడుగులనే లెక్కలోకి తీసుకుంటే తెలంగాణలో 270 ఆంధ్ర,ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌లలో మరో వంద గ్రామాలు నీట మునుగుతాయని తాజాగా లెక్క తేల్చారు. కానీ భవిష్యత్తులో వచ్చే వరద ప్రళయాలను విస్మరించి కొందరు అధికారులు ఏదో ఒక రకంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే తర్వాత చూసుకోవచ్చన్న విధంగా వ్యవహరిస్తున్నారు. 1986 మాదిరిగా 36లక్షల క్యూసెక్‌ల వరద వస్తే ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా పూర్తి చేస్తే ఊహకందని విధంగా మునక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్, ఒరిస్పా రాష్ట్రాలు మన అధికారులు వేసిన అంచనా కంటే ఐదు రెట్లు ముంపు ఎక్కువ ఉంటుందని లెక్క వేసుకున్నారు. ఆ రాష్ర్టాల్లో కేవలం 30నుంచి 50 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని ఆంధ్రప్రదేశ్ అధికారులు లెక్కలు వేస్తే.. కాదు 150 నుంచి 200 గ్రామాలకు ముంపు ముప్పు ఉందని వాళ్లు అంచనా వేశారు. అంటే ఆ రెండు రాష్ట్రాల అధికారులు ఎంత ముందు చూపుతో ఉన్నారో అర్థమవుతుంది.

భద్రాద్రి వద్ద గోదావరి వరద ఉధృతి 36 లక్షల క్యూసెక్‌లను దాటే అవకాశముంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే గనక జరిగితే ప్రాజెక్ట్ కారణంగా బ్యాక్ వాటర్ మరింత పెరిగి మొత్తం భద్రాచలం ఆలయానికే ప్రమాదముంటుందని ఈ ప్రాజెక్ట్‌పై పరిశోధన జరిపిన తెలంగాణకు చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్ భీమయ్య అంటున్నారు. 

మరింత నష్టం....
డిజైన్ మార్చుకుని ముంపును తగ్గించటానికి అన్ని అవకాశాలున్నా మొండి పట్టుదలతో ఆదివాసీలను ముంచటానికే యంత్రాంగం సిద్ధమైంది. ఫలితంగా పోలవరంలో మరిన్ని గ్రామాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. 2005లో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఆదివాసీలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నో తీర్మానాలు చేశారు. 


గ్రామ సభలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా సమర్పించాయి. ముంపు గ్రామాలతోపాటు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటాన్ని అన్ని మండల పంచాయితీలు వ్యతిరేకించినా ప్రజల మనోభావాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీల ఉనికిని దెబ్బ తీయటానికి వీల్లేదు. వాళ్ల అభీష్టం, మనోభావాలకు వ్యతిరేకంగా వేరే ప్రాంతానికి పంపించటానికి వీల్లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో 3,500 హెక్టార్ల అడవి అదృశ్యమవుతుంది. దాదాపు 2.5లక్షలమంది ఆదివాసీలు నిరాశ్రయులు కానున్నారు. మూడు రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాలతో కలిపి మొత్తానికి భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమికి బదులు భూమి ఇవ్వాలి. అటవీ భూముల్లో ఎక్కడ వారికి పునరావాసం కల్పిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఆరు దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం ఫలించిన తరుణంలో ఈ సంస్కృతిలో భాగమైన ఆదివాసీలు మనుగడను కోల్పోతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

ఇది జలయజ్ఞం కాదు...జలప్రళయయజ్ఞం...భూ, వన, ఖనిజ, విద్యుత్, ధన, ప్రాణాపహరణయజ్ఞం!

గతంలో దివి: 27-03-2914 నాడు ప్రకటించిన ఈ టపాను ఈ సందర్భంలో మళ్ళీ ప్రకటించడం జరుగుతున్నది.

"పోలవరం నిర్మాణం
అన్ని అనుమతులను పొంది
పూర్తి అగుట అసాధ్యమ్ము"
అనుచుండిరి మేధావులు!

వివాదాలు కోర్టులోన
పెండింగ్‍లో ఉండగాను,
నిర్మించెదమని పలుకుట
మోసపూరితము కాదా?

అన్ని అనుమతుల కొరకయి
అబద్ధంపు లెక్కలతో
మోసగించు వ్యాఖ్యలతో
పోలవరం కట్టలేరు!

కోర్టుల కేసులనుండియు
బయటపడుట తేలికయా?
ముంపు గ్రామ ప్రజ లెన్నిక
బహిష్కరణ లసత్యమా?

నాలుగు లక్షల ప్రజలను
నిర్వాసితులను జేసెడి
పోలవరము నిర్మాణం
అసాధ్యమ్మె...అసాధ్యమ్మె!

కేంద్రపు మోసపు మాటల,
చేతల నమ్మినవారలు,
పప్పులోన కాలువేతు
రనుటె చెడని సత్యమయ్య!

తెలగాణను ముంచునట్టి
పోలవరపు నిర్మాణము
వివాదాలలో జిక్కియు
బయలు వెడలకున్నదయ్య!

పోలవరం పేరుచెప్పి
ప్రభుత్వమ్ము కోట్లు కోట్లు
ఖర్చుచేసినట్టి లెక్క
అబద్ధాల చిట్టలోదె!

గుత్తెదార్లు, నాయకులును
కుమ్మక్కై చేసినట్టి
ప్రభుత్వంపు ధనలూటీ
ప్రణాళికే పోలవరము!

ఆచరణకు సాధ్యమవని
ప్రాజెక్టును చూపించియు
కోట్ల ధనము కొల్లగొట్టు
ప్రణాళికే పోలవరము!

పర్యావరణమును ముంపు
నకు గురిచేయంగ బూను
అక్రమార్కులే వేసిన
ప్రణాళికే పోలవరము!

నిర్వాసితులను జూపియు,
జలయజ్ఞమటంచు జెప్పి,
ధనయజ్ఞము చేయునట్టి
ప్రణాళికే పోలవరము!

తెలంగాణ బిల్లులోన
లేని ఏడు ముంపు మండ
లాల నాంధ్రలోన కలుపు
ప్రణాళికే పోలవరము!

బతికి బట్టకట్టలేని
ప్రాజెక్టుకు జాతీయపు
హోదనిడెడి ఎలక్షన్ల
ప్రణాళికే పోలవరము!

చెట్టుపేరు చెప్పి కాయ
లమ్ముకొనగనెంచినట్టి
స్వార్థపరులు పన్నినట్టి
ప్రణాళికే పోలవరము!

తెలంగాణ, సీమాంధ్రుల
చెవిని పువ్వు పెట్టి కోట్లు
దండుకొనెడి అక్రమార్క
ప్రణాళికే పోలవరము!

వ్యవసాయము పదిశాతము
వ్యాపారము తొంబదిశా
తము కొరకుపయోగించెడి
ప్రణాళికే పోలవరము!

పేదల పేదలుగ నుంచి,
ధనికుల నింకా ధనికుల
జేయగ నుపయోగించెడి
ప్రణాళికే పోలవరము!

కొంతమంది స్వార్థపరుల
కును మేలును జేయునట్టి
భూ, వన, ఖనిజాపహరణ
ప్రణాళికే పోలవరము!

తెలగాణకు విద్యుత్తును
సమకూర్చెడి మార్గమ్మును
కొల్లగొనగ నెంచినట్టి
ప్రణాళికే పోలవరము!

గిరిజనులను, తీరజనుల
ముంపుకు గురిచేసి, ధనిక
వర్గమునకు ధనము నిడెడి
ప్రణాళికే పోలవరము!

తెలంగాణ నైసర్గిక
రూపమ్మును మార్పుచేసి,
ఇకిలింపగ బూనినట్టి
ప్రణాళికే పోలవరము!

ఈ ప్రాజెక్ట్ లేకున్నను
తొంబదైదు శాత జలము
ఇప్పటికే అందుచుండ
ప్రాజెక్టును కట్టనేల?

అక్రమార్క స్వార్థ నేతృ
కుతంత్రాల బట్టబయలు
చేసి, ప్రజాధనము నిపుడు
కాపాడగవలెనయ్యా!

అట్టి స్వార్థపరుల కుట్ర
లన్ని బట్టబయలు చేసి,
వారందర కిపుడు తగిన
శిక్షవేయవలెనయ్యా!

***     ***     ***     ***

ఇంకా మరిన్ని వివరాలకై

(నమస్తే తెలంగాణ దినపత్రికవారి సౌజన్యంతో...)



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మమ్మల్ని మా జన్మభూమినుండి వేరు చేయకండి!

ఈ టపాకూడా దివి: ఫిబ్రవరి 12, 2014 నాడు ప్రచురింపబడిందే. ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి మరల ప్రచురిస్తున్నాను.


శ్లో||
అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే,
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి||

చం.
కనకపు లంకయైన మఱి కాంచను నేను రుచించ లక్ష్మణా!
జననియు జన్మభూమియును స్వర్గముకన్నను మిన్నయౌ సుమా!!

రావణ వధానంతరం లక్ష్మణుడు శ్రీరాముని లంకకు అధిపతియై రాజ్యమేలుమనగా, అంగీకరింపక రాముడు "లక్ష్మణా! ఇది బంగారు లంకయినా నేను ఇష్టపడను! ఎందుకంటే, జననీ, జన్మభూమీ స్వర్గంకన్నా ఎక్కువగదా! కాబట్టి మనం మన జన్మభూమియైన అయోధ్యకే వెళదాం!" అన్నాడు.

ఇది ఎవరి విషయంలోనైనా వర్తిస్తుంది. నాగరికులైనా... గిరిజనులైనా...! వాళ్ళను ముంచడానికి...వాళ్ళను వాళ్ళ జన్మభూమినుండి వేరు చేయడానికి ఎవరికీ హక్కులేదు! మానవ...అదీగాక గిరిజన హక్కుల్ని కాలరాయడానికి ప్రభుత్వం పూనుకొనడం అమానుష చర్య! ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగదు! ఇక్కడి ప్రజలు మనుషులు కారా? సీమాంధ్రులే మనుషులా? ఎవరినైనా వారి జన్మభూమినుంచి వేరుచేస్తామనడం భావ్యమా? ఇది ప్రభుత్వం తేల్చుకోవలసిన అంశం. ఏది న్యాయమో తక్షణమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుంది.


మానవత్వము లేని కేంద్రము
పోలవర ప్రజలకును అన్యా
యమ్ము జేయగ నిశ్చయించుట
తగని పనియయ్యా!

ముంపునకు గురియయెడు గ్రామ
మ్ములను సీమాంధ్రులకు నిడుటయె
మానవత్వము లేని పనియయ!
తగనిపనియయ్యా!

జననియును మఱి జన్మభూమియు
స్వర్గమున కన్నను విశిష్టత
గలవి యంచును తెలిసి తెలిసియు
నిట్లు చేయుదురా?

భద్రగిరిలో మునిగిపోయెడు
గ్రామముల నివసించు జనులకు
జన్మభూమిని ముంపునకు గురి
చేయ న్యాయమ్మా?

జన్మభూమిని వీడుమనుటయె
మానవత్వము లేని చేతయ!
మీరు మీ జన్మస్థలమ్మును
వీడిపోయెదరా?

కేంద్రమిట్టుల చేయుచో మా
తెలంగాణ నిసర్గ రూపము
మార్పుచెందును గాన మేమిది
యొప్పుకొనమయ్యా!

పోలవరపు డిజైను మార్చిన
నెట్టి నష్టము లుండబోవయ!
సులభమైన యుపాయముండగ
నష్టపరిచెదరా?

పోలవరప్రాజెక్టు నిర్మా
ణమ్ము జేసిన కలుగునెన్నో
నష్టములు, గ్రహియించి వెంటనె
ఆపుడోయయ్యా!

ప్రజాభీష్టమ్ము కనుగొంటిరె?
వారు తెలగాణమ్ము నందున
నుండ గోరిరి! వారి కోరిక
కూలద్రోయుదురా?

బ్రతుకు దెరువిచ్చటనె యున్నది!
ప్రాణములు వారికిట నున్నవి!
తల్లి నేలను వీడలేరయ!
ఒప్పుకొనరయ్యా!!

సీమకును న్యాయమ్ము కొరకయి
వీరి కన్యాయమ్ము చేతురె?
వీరి నోటను మట్టి గొట్టగ
చేతులెటులొచ్చెన్?

ప్రజల హక్కును కాలరాయుట
ప్రజాస్వామ్యము కాలరాయుటె!
ప్రజాపాలకులైన మీరలు
ప్రజల నణచెదరా?

వీరు ప్రజలుగ కనంబడరే?
తెలంగాణులు ప్రజలు కారే?
ప్రజలు సీమాంధ్రులే యగుదురె?
పక్షపాతమిదే!

మార్చుకొనుడయ యభిప్రాయము!
పోలవరపు డిజైను మార్చుడు!
సకల జనులకు న్యాయమును మీ
రిపుడు చేయుడయా!!

మార్పు చేయక యున్నచో తెల
గాణమందున నుద్యమమ్ములు
తీవ్రతరమై నింగికెగయును!
మీకు సమ్మతమా?

ప్రభువులైనటువంటి మీరలు
ప్రజాభీష్టమ్ములను దెలిసియు
మసలుకొనుటే న్యాయమగునయ;
మారుడోయయ్యా!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

శుక్రవారం, మే 30, 2014

మా జన్మభూమికై నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం!


-ఆర్డినెన్స్ రద్దు కోరుతూ ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష
- మద్దతుగా దీక్షలో పాల్గొన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు 
- ఆందోళనల్లో కానరాని టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ

నేతలు రాజ్యంగ విరుద్ధంగా ఆర్డినెన్స్ తెచ్చి ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్‌లో గురువారం దీక్షలను సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ ప్రారంభించారు. రాజయ్యతోపాటు ముంపు ప్రాంతాలకు చెందిన 17మంది సీపీఎం ఎంపీటీసీలు, సర్పంచ్‌లు దీక్షలో కూర్చున్నారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామాన్ని, సెంటు భూమిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టంచేశారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ముంపు గ్రామాలను వదులుకోబోమన్నారు.

గిరిజన చట్టాలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వంపై రాజ్యాంగ ఉల్లంఘన కింద సుప్రీంకోర్టు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలు గిరిజన వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మానవ విధ్వంసం చేయడం ద్వారా ఏ రకమైన అభివృద్ధిని టీడీపీ, బీజేపీలు కోరుకుంటున్నాయని ప్రశ్నించారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేసే వరకు పోలవరం ప్రస్తుత డిజైన్‌ను మార్పు చేసే వరకు సీపీఎం ప్రజాపోరాటం ఆగదని తేల్చిచెప్పారు. దీక్షలకు టీఆర్‌ఎస్, సీపీఐ నాయకులు సంఘీభావం పలికారు. కేంద్రం ఆర్డినెన్స్‌తో జిల్లాలోని లక్షలాది గిరిజన, ఆదివాసీల జీవనం విధ్వంసానికి గురయ్యే ప్రమాదము్న్నా టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం సంఘీభావం తెలపకుండా మౌనం వహించారు. ఎక్కడా ఆందోళనల్లో పాల్గొనలేదు. ఆయా పార్టీల తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలు కంటికి కానరాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

పోలవరము వరమిడదు, ముంపు నిడును!

(నేను గతంలో దివి:21-11-2013 మరియు 08-02-2014 నాడు పోలవరము నిర్మిస్తే కలిగే నష్టాలను వివరిస్తూ పెట్టిన టపాను మరల ఈ క్రింద ఇస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భద్రాచలం ముంపుకే కానీ మంచికి కాదు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా భద్రాచలవాసులు దీన్ని ఎంత మాత్రం సహింపరు. అంతగా అవసరం ఐతే పోలవరం డిజైన్ మార్చి, ఎవరికీ ముంపులేని, నష్టం కలిగింపని, తెలంగాణ (భద్రాద్రి)లోని పూచిక పుల్లంత స్థలాన్నికూడా సీమాంధ్రలో కలుపని రీతిగా నిర్మించుకుంటే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణ జోలికి వస్తే మాత్రం రణరంగమే!)


భద్రగిరిఁ బొంది, మీ పోలవరము నిచట
నిర్మితము సేయఁ గుట్రల నెన్నొ పన్ని,
"మేల్మి బంగారమే యయ్య మే" మటంచుఁ 
బల్క, నమ్మెడి వారమే? వదరఁ బోకు! 

ఇచటి భద్రాచలాలయ, మిచటి జనులు,
వీరిపై ప్రేమ నీ కున్న వేగిరముగఁ
బోలవరమందుఁ బ్రాజెక్టు పూన్కి నాపి,
ముంపు నీయక, భద్రాద్రి కింపు నిడుము!


పోలవర మిట నిర్మింప మునుఁగు నంచు
నమ్ముఁ డెనుఁబది మూఁడు శాతమ్ము గ్రామ
ములును! మూఁడు లక్షల జనములు నుపాధి
లేక నిర్వాసితులు నయి, లేమిలోనఁ
గూర్పఁ బడుదురు! బాధలఁ గోరఁ దగునె?

ఇరువదియు నైదు వేల యెకరములు గల
యటవి నీటను మున్గును! నటులె రెండు
నూర్ల డెబ్బది యైదగు నూళ్ళు మునుఁగు!
పాపికొండలు, పేరంట్ల పల్లి మునిఁగి,
నీటి కడుపున నివసించు నిజము సుమ్ము!

నేఁడు పదునేను నడుగుల నీటిమట్ట,
మది నలువదియు మూఁడడ్గు లటు పయిఁ జను;
భారి వర్షమ్ము వచ్చిన వరద హెచ్చ
రికయె నల్వదెన్మిది గంటలకును ముందె
జారి యగుచుండ, ప్రాజెక్టుఁ గోరి యిచట
నిర్మితముఁ జేయు తదుపరి నెట్టు లుండు 
నో యటంచు నూహింపఁ గదోయి! యితర 
ప్రాంత సంబంధముల్ తెగు! వైద్య, విద్య, 
గిరిజనోపాధు లన్ని దుష్కరము లగును! 

గిరిజనులఁ గావ మైదాన పరిధులకును
దీసికొని పోవ నేజన్సి వాస చట్ట
మెటులు వారికి వర్తించు? నేది దారి?

సరియె పోనిండు! భరత దేశమ్మునందె
మిగులఁ బ్రాచీన జాతిగ నెగడునట్టి
కొండ రెడ్ల తెగయె యిటనుండి తొలఁగు!

ఎనిమిదౌ గ్రామములు మున్గు నిచట యనియుఁ
బల్కి, "యొడిశా"యె పెట్టె నభ్యంతరమ్ము!

ఇన్ని భద్రాద్రి గ్రామా లవెట్టి దుఃఖ
మందఁగాఁ గోరు దీవు? తమంత తాము
వెలికి వచ్చి, భద్రాద్రినిం గలుపఁగ వల 
దాంధ్రలోపల నంచును నార్తి తోడఁ 
బల్కుచుండి రీ ప్రజ! పోలవరము నాపి,
జరుగఁ బోవు విలయమునుం జరుగకుండఁ
గావఁగా నాంధ్రుఁడా నీకుఁ గరుణ లేదె?
కర్కశుండవే? యిఁక నైన గాలి మాట 
లాపి, భద్రాద్రి జోలికి రావలదయ! 

పోలవరము ప్రాజె క్టదియేల నీకు?
ఎన్నొ దుష్పరిణామాలు నున్న దదియ!

నీదు బాగుకోసమె యిట, నాదు బాగు
నాశ మొనరింతువే? యన్యాయమునకు
నడుము కట్టెదవే? దుర్జనుఁడవె నీవు?

మంచివాఁడవు నీవైన, మాన్యతఁ గన,
భద్రగిరి జోలికే రావ వలదు! కోర,
పోలవరము వర మిడదు! ముంపు నిడును!

ఇదే విషయమై మరిన్ని వివరాలకు:

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

ఆర్టీసీ కేటాయింపుల్లో ఈడీల లొల్లి


ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వ్యవహారం విమర్శల పాలవుతున్నది. సీమాంధ్ర అధికారుల తెలివితేటలు, ముందస్తు ప్రణాళిక తెలంగాణ అధికారుల పదోన్నతులకు ఎసరు వచ్చేలా చేస్తున్నది. స్థానికత ఆధారంగా పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన ఆర్టీసీ ఈడీ.. తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడమే ఇందుకు కారణమవుతున్నది. ఈ ఈడీ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇవ్వాలని భావించినప్పటికీ.. సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తెలివిగా వ్యవహరించి తెలంగాణ ఆప్షన్ ఇచ్చుకునేలా ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఇతను ఆంధ్రప్రదేశ్‌కు వెళితే సీమాంధ్రకు చెందిన వారికి కీలకపోస్టులు దక్కవనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ఆర్టీసీని ఎంచుకోమని చెప్పినట్లు సమాచారం. మార్గదర్శకాలు విడుదలై సదరు ఈడీ ఇచ్చిన ఆప్షన్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే.. సీనియారిటీ ప్రకారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్‌గా కొనసాగే అవకాశముంది. ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు తర్వాత ఈ పోస్టు (ఈడీఏ)కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగినా తమ కనుసన్నల్లో ఉండే అధికారులే తెలంగాణ ముఖ్య విభాగాల్లో పనిచేయాలనే ఉద్దేశంతో సీమాంధ్ర అధికారులు చక్రం తిప్పుతున్నారు.

భవిష్యత్ అవసరాల రీత్యా కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకోవాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. విభజన సందర్భంగా ఆర్టీసీలో ఉన్న 10 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ బోర్డు తీర్మానం చేసింది. అందులోభాగంగా ఆరుగురు ఈడీలను ఆంధ్రప్రదేశ్‌కు, నలుగురిని తెలంగాణకు కేటాయించారు. సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఈడీలు వచ్చే నెలలో పదవీ విరమణ పొందుతున్నారు. వాస్తవానికి వారికి ఈడీల అవసరం ఉంది. అయినా, హెడాఫీసులో కొనసాగాలనే తాపత్రయం తో.. తెలంగాణ ఆర్టీసీ తమ కనుసన్నల్లో నడవాలనే దుర్బుద్ధితో కుట్రలకు పాల్పడుతున్నారు. ఈడీ పదోన్నతికి ఎదురుచూస్తున్న తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణతోపాటు రంగారెడ్డి జిల్లా రీజియన్ మేనేజర్‌గా ఉన్న వినోద్‌కుమార్ ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే పరిస్థతి వస్తుంది. 

ఇరు రాష్ర్టాల ఆర్టీసీ కన్సల్టెంట్‌గా ఆపరేషన్స్ ఈడీ రమణారావు
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంతర్‍రాష్ట్ర సర్వీసులు సక్రమంగా నడిచేందుకు జూలై నెలలో పదవీ విరమణ పొందుతున్న ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ రమణారావును ఏడాదిపాటు కన్సల్టెంట్‌గా నియమించుకుంటున్నారు. దీనికి పాలకమండలి కూడా అంగీకరించింది. తెలంగాణకు చెందిన రమణారావును ఆపరేషన్స్ కన్సల్టెంట్‌గా నియమించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు తెలంగాణలో ఇష్టారీతిన తిప్పడానికి వీలవుతుందనే భావనతో సీమాంధ్ర అధికారులు చక్రంతిప్పుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

కార్ల కోసం.. బస్సుల కొనుగోలు:
బహుమతుల కోసం ఆర్టీసీ అధికారులు .. అడ్డగోలుగా బస్సులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము లేకపోవడంతో.. యాజమాన్యం కార్మికుల వేతనాలతో ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తున్నది. దీని కోసం ఆర్టీసీ ఉద్యోగుల నెల జీతంనుంచి ఒక రోజు వేతనాన్ని తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ను యాజమాన్యం జారీచేసింది. సమాచారంలేకుండా వేతనాల్లో కోత విధిస్తూ ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై కార్మికులు మండిపడుతున్నారు. చాలీచాలని జీతంతో అవస్థలు పడుతున్న ఆర్టీసీ కార్మికులకు ఈ ఏకపక్ష నిర్ణయం ఆవేదనకు గురిచేస్తున్నది. 

కనీసం కార్మిక సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు లక్షా 25 వేల మంది అధికారులు, కార్మికుల బేసిక్ వేతనం నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఉద్యోగుల నుంచి వచ్చిన రూ.6 కోట్లతో 24 బస్సులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ బస్సుల కొనుగోలు వెనుక అధికారుల స్వార్థం ఉన్నట్లు తెలిసింది. 24 బస్సులను కొనడం ద్వారా బస్సుల అమ్మకపు సంస్థలు ఐదు కార్లు బహుమతిగా ఇస్తున్నట్లు కార్మిక వర్గం ఆరోపిస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గురువారం, మే 29, 2014

పోలవరం ఆర్డినెన్సుపై టీఆర్‍ఎస్ పోరుబాట!

-అసంపూర్ణ తెలంగాణపై మొదటినుంచి హెచ్చరికలు
-అప్రమత్తంగా ఉండాలన్న గులాబీ నేత
-తెలంగాణను ముంచుడే ఆ ఇద్దరు సీమాంధ్ర నేతల పని అని మండిపడుతున్న తెలంగాణవాదులు
-అధికారంలోకి వచ్చినా మళ్లీ ఉద్యమబాట పట్టిన తెలంగాణ ఇంటిపార్టీ

అసంపూర్ణ తెలంగాణ..
టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ అనుమానించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అసంపూర్తి తెలంగాణ. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలంటూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. తెలంగాణ ఆదివాసీలకు మరణశాసనం రాస్తూ ఇలా ఆర్డినెన్స్ తీసుకురావడానికి కారకులు ఆ ఇద్దరు నేతలేనని తెలంగాణ సమాజం ఇప్పుడు వేలెత్తి చూపుతోంది. తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదటినుంచి వారు వ్యవహరించిన తీరుపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.


తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబునాయుడు ఒకవైపు.. కేంద్ర మంత్రివర్గంలో చేరిన బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు మరోవైపు.. తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు వారు తమ శక్తియుక్తులను సర్వదా వినియోగిస్తూనే వచ్చారు. అయితే అవి విఫలమయ్యాయి. తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్నపుడు ఇంటా బయటా అడ్డంకులు సృష్టించేందుకు వారు అన్ని రకాలుగా ప్రయత్నించారు.

చంద్రబాబునాయుడు హస్తినలో మకాం వేసి, రాష్ట్రాలు తిరిగి.. జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపి ఏదో విధంగా తెలంగాణను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినా, కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర ప్రయోజనాలపై ఎప్పుడూ గళమెత్తే వెంకయ్య నాయుడు కూడా పోలవరంపై ఆర్డినెన్స్ రావడం వెనుక ప్రధాన పాత్ర పోషించారని, వీరిద్దరు పక్షపాతంతో వ్యవహరించడం వల్లే ఇంతా జరిగిందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. 

పోలవరంపై ఇలాంటి తఖరారు ఉంటుందని అనుమానిస్తూ వచ్చిన తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ ఇప్పుడు మళ్లీ తన ఉద్యమ స్వభావాన్ని చాటేందుకు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారినా, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై తిరిగి టీఆర్‌ఎస్ ఉద్యమ బాట పట్టింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించనున్న పార్టీ అధినేత కే.చంద్రశేఖరరావు పోలవరంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు నిరసనగా స్వయంగా బంద్‌కు పిలుపునిచ్చారు. 

పోలవరం కింద ముందుగా 105 గ్రామాలే ముంపునకు గురవుతాయని ప్రచారం జరిగింది. అయితే, గిరిజన గ్రామాలు ముంపునకు గురికాకుండా...వాళ్లు నష్టపోకుండా ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని కేసీఆర్ పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, కేవలం ముంపును తగ్గించాలన్నదే తమ పోరాట లక్ష్యమని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిసి సవివరమైన వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కేసీఆర్ ఉద్యమాన్ని కొనసాగించటంతోపాటు పోలవరంపై వెంటనే తన దృష్టిని కేంద్రీకరించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రతిపాదించిన సమయంలోనూ ఆయన తెలంగాణ ప్రయోజనాలను ఫణంగా పెట్టిన క్లాజులపట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

ఉద్యోగుల విషయం...నీటి వాటాల అంశాలపై, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవటం వంటి విషయాలను కేసీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. విద్య, ఉమ్మడి రాజధాని, హైకోర్టు, హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించటం వంటి విషయాల్లో తెలంగాణపట్ల కనబరిచిన వివక్షతను ఆయన ఎత్తి చూపారు. పోలవరం ప్రాజెక్టు కింద ఏడు మండలాలు ముంపునకు గురవుతుండగా వాటిని సీమాంధ్రలో చేర్చేందుకు చర్యలు తీసుకునేలా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయటం అప్రజాస్వామికమని టీఆర్‌ఎస్ మండిపడుతున్నది. 

పోలవరం ఆర్డినెన్స్‌పై ప్రధానంగా తెలుగుదేశం, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్నా తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా జారీ అయిన ఆర్డినెన్స్‌పై ఆ పార్టీ నాయకులు కనీసం ప్రతిఘటించలేకపోయారు. ఈ విషయంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు మహానాడులో చంద్రబాబు నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పటం గమనార్హం. సీమాంధ్ర ముఖ్యమంత్రిగా వచ్చే నెల 8వ తేదీన పదవీబాధ్యతలు స్వీకరిస్తున్న చంద్రబాబు కూడా రెండు రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు...తప్పితే పోలవరం ఆర్డినెన్స్‌తో తెలంగాణ ప్రయోజనాలు పూర్తిగా దెబ్బ తింటున్నా దానిపై ఒక్క మాట కూడా మాట్లాడడంలేదు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా పోలవరం ప్రాజెక్టుపై అంతంత మాత్రంగానే పెదవి విప్పారు. తెలుగుదేశం అధినేత ఒకవైపు..ప్రధాని నరేంద్ర మోడీ మరోవైపు తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించకుండా ఆర్డినెన్స్ జారీ చేయటాన్ని తెలంగాణ బీజేపీ నాయకులు పట్టించుకోకపోవటం గమనార్హం. ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

పోలవరంపై బిల్లులో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014 సెక్షన్ 90 (1) ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే చేపడుతుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని కూడా పేర్కొంటూ నీటిపారుదల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణమని సబ్ సెక్షన్ 2 కింద పేర్కొన్నారు. 3వ సబ్ సెక్షన్ కింద రాబోయే తెలంగాణ రాష్ట్రం పోలవరం ప్రాజెక్టును అంగీకరించినట్టుగా పేర్కొనటం గమనార్హం.

సబ్ సెక్షన్ 4 కింద ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ, అటవీశాఖ అనుమతులతోపాటు నిర్వాసితుల పునరావాస బాధ్యతలను కూడా కేంద్రమే చేపడుతుంది. మొత్తంగా నాలుగు సబ్ సెక్షన్లలో పోలవరం అంశానికి సంబంధించిన వివరాలను పేర్కొనగా 3వ సబ్ సెక్షన్ ప్రకారం పేర్కొన్న విషయాలు వివాదాస్పదంగా ఉన్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ముందుగానే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్టు పేర్కొనటం వివాదానికి తావిస్తోంది. అయితే, పోలవరం విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్డినెన్స్ జారీ చేయటానికి సాహసించలేకపోయింది. తరువాత వచ్చిన ప్రభుత్వానికి నిర్ణయాధికారాన్ని వదిలిపెట్టింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా ఎన్నికల సమయంలో సమస్యలు వద్దని ఆర్డినెన్స్‌ను వాయిదా వేసేందుకే సిఫార్సు చేసినట్టు సమాచారం. అయితే, ఎన్నికలు ముగిసి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో మొదటి క్యాబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసింది. 

పోలవరం ఆర్డినెన్స్‌ను ఆమోదించొద్దు 
-గెజిట్ నోటిఫికేషన్ నుంచే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది..
-తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సరిహద్దులు మార్చడం అప్రజాస్వామికం-కేంద్ర ప్రభుత్వ చర్య స్థానిక గిరిజనులకు వ్యతిరేకం -రాష్ట్రపతి ప్రణబ్‌కు కేసీఆర్ లేఖ 
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న కే చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో సరిహద్దుల్లో మార్పులు చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్డినెన్స్ తీసుకురావడం అప్రజాస్వామికమని బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

పార్లమెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గెజిట్ నోటిఫికేషన్‌గా విడుదలైన నాటినుంచే అమల్లోకి వచ్చిందన్నారు. జూన్ 2వ తేదీ నుంచి 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సహేతుకం కావని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారని, తెలంగాణ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే రాజ్యాంగం విరుద్ధంగా ఇలాంటి చర్యలకు పూనుకోవడం దురదృష్టకరమన్నారు. 

ఆ అధికారం పార్లమెంట్‌కే..:ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణ నుంచి వేరుచేసి ఆంధ్రప్రదేశ్‌లో కలిపే అధికారం ఆర్టికల్-3 ద్వారా పార్లమెంట్‌కు మాత్రమే ఉందన్నారు. కేంద్ర మంత్రి మండలి సిఫార్సు చేసిన తీర్మానాన్ని ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్‌గా జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని.. అయితే, ఈ విధానం సాధారణ ఆంశాలకే పరిమితమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దులను మార్చే విషయంపై క్యాబినెట్ ఆర్డినెన్స్ జారీ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం మార్పులు ఎలా చేయాలో ఎస్.ఆర్.బొమ్మై కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. 

గిరిజన వ్యతిరేక చర్య:తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. అదేసమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు సైతం కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవ్వలేదన్నారు. తాము పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని, ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు చేసి ముంపు ప్రాంతాలను వీలైనంత మేరకు తగ్గించాలని.. గిరిజనులకు ఇబ్బందులు కలుగకుండా, సమస్యలు రాకుండా చూడాలని ఆశిస్తున్నామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న మీరు కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారన్న విశ్వాసంతో ఈ విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి వర్గం చేసిన ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని ఆయన తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

లేఖలోని ముఖ్యాంశాలు
-ఆర్టికల్ 3 ప్రకారం సరిహద్దుల మార్పు విషయంలో రాష్ట్రపతి సిఫార్సుల మేరకే పార్లమెంట్‌లో బిల్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. క్యాబినెట్ ఆర్డినెన్స్ చెల్లవు.
-పార్లమెంట్ కూడా తనకు తానుగా ఆర్టికల్3 కింద బిల్లును పరిశీలనలోకి తీసుకోవడం సాధ్యం కాదు. -ప్రస్తుత ఆర్డినెన్స్ వల్ల తెలంగాణలోని లోయర్ సీలేరు జలాశయం.. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తుంది. తత్ఫలితంగా తెలంగాణకు విద్యుత్‌పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. -తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న టీడీపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ఆర్డినెన్స్ రూపంలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను మార్చే ఇలాంటి ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం తోసిపుచ్చుతుంది.

పోలవరంపై అలుపెరగని పోరు
-ఆది నుంచి టీఆర్‌ఎస్‌ది ఉద్యమ పంథానే
-నిబంధనలు తుంగలో తొక్కిన వైఎస్ -ఆగమేఘాల మీద ప్రాజెక్టుకు శంకుస్థాపన-ఆనాడే తీవ్ర నిరసన తెలిపిన గులాబీదళం
-ఆర్డినెన్స్‌కు నిరసనగా నేడు బంద్ బాట
-టీఆర్‌ఎస్‌కు తోడుగా తెలంగాణ జాగృతి 
పోలవరం ప్రాజెక్టుపై మడమతిప్పకుండా టీఆర్‌ఎస్ పార్టీ పోరాటం సాగిస్తున్నది. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నది. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని ప్రకటిస్తూనే లక్షలాది మంది గిరిజనులను ముంచే పోలవరం డిజైన్‌ను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నది. నేడు తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇక్కడి ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా మరోసారి ఉద్యమజెండాను ఎగురవేసింది.  

 
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వైఎస్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించారు. విలేకరులు వైఎస్‌ను అనుమతులు లేకుండా శంకుస్థాపన ఎలా చేశారని ప్రశ్నిస్తే.. ప్రాజెక్టులు అనుమతులు వచ్చాకే ఎక్కడైనా కడుతున్నారా? ప్రాజెక్టును కట్టినంక అనుమతులు అవే వస్తాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలంటే ముందు క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వైఎస్ క్యాబినెట్‌లో ఆరుగురు టీఆర్‌ఎస్ మంత్రులు ఉండటంతో క్యాబినెట్‌లో చర్చించకుండానే సరాసరిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

ఇది ఒకరకంగా తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా అవమానపర్చడమే. వైఎస్ చేసిన శంకుస్థాపనపై తెలంగాణ సమాజంలో, టీఆర్‌ఎస్ మంత్రుల్లో నాడు తీవ్ర అలజడి మొదలైంది. దీంతో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ మంత్రులు నిరసనకు దిగారు. అదే సమయంలో కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు కేసీఆర్, నరేంద్ర సైతం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ హైకమాండ్‌ను నిలదీశారు. దీంతో నాడు సోనియాగాంధీ సూచన మేరకు దిగ్విజయ్‌సింగ్.. కేసీఆర్, వైఎస్‌తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా కేసీఆర్ ప్రధానాంశంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాల్సిందేనని కోరారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని డిమాండ్ చేశారు. కానీ వైఎస్ మాత్రం దూకుడుగా పోలవరంపై ముందుకు వెళ్తుండటంతో రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులతోపాటు, కేంద్రంలో ఉన్న ఒక క్యాబినెట్, ఒక సహాయమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి దూకింది టీఆర్‌ఎస్. 

పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలతో పాటు, సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేస్తూ ముందుకుసాగుతున్నది. 2006-07లో టీఆర్‌ఎస్ తరపున ఎంపీ వినోద్, కేంద్ర జలవనరుల కమిషన్ మాజీ సభ్యుడు ఆర్ విద్యాసాగర్ సుప్రీంకోర్టులో కేసువేశారు. అదే సమయంలో తెలంగాణ జాగృతి తరఫున ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కవిత కూడా సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు 2007-08సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు తెస్తూనే ఉంది. ఈ అనుమతులన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడే ఉంటాయని ఆయా శాఖలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లో కూడా సమస్యలొస్తున్నాయని ఛత్తీస్‌గఢ్, ఒడిశాలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో చాలా రోజులుగా పోలవరంపై సుప్రీంలో స్టే కొనసాగుతూనే ఉంది. తాజాగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెల్లవారే క్యాబినెట్ భేటీలో పోలవరంపై ఆర్డినెన్స్‌ను ఆమోదించడంపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. 

పోరాడుతున్న తెలంగాణ జాగృతి
పోలవరం ప్రాజెక్టు డిజైన్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ జాగృతి కూడా తీవ్రస్థాయిలో పోరాటాలు చేస్తూనే ఉంది. ఒక వైపు ప్రజాఉద్యమాల్లో భాగం అవుతూనే మరోవైపు కోర్టుల్లో న్యాయపోరాటాలు చేస్తోంది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కవిత 2009 నుంచి పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. 2009లో సుప్రీంలో కేసు వేసిన ఆమె ఆ తర్వాత రాష్ట్రంలో టెండర్లు వేస్తున్నారని తెలిసి హైకోర్టులో మరో కేసు వేశారు. హైకోర్టు పోలవరం కేసులన్నీ కూడా సుప్రీంలో ఉన్నాయని చెప్పడంతో మరోసారి ఆమె సుప్రీంను ఆశ్రయించారు. 
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 
జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

 

పోల 'వరం' కాదు...జల ప్రళయం!

-ప్రాజెక్టు కడితే 397 ఆదివాసీ గ్రామాలు జలసమాధే!
-ప్రకతి సంపద సర్వనాశనమే 
-భద్రాద్రి రామయ్యకూ సంకటమే
-బ్రిటీష్ కాలంలోనే వద్దన్నారు...మళ్లీ తెరపైకి వచ్చినా కుదరదన్నారు!
-మరి ఇప్పుడే ఎందుకు ముందుకు తెస్తున్నారు? 
నీటి రంగ నిపుణుల ఆగ్రహం


ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మిస్తే కొంతమంది నష్టపోయినా ఎక్కువమంది లాభపడుతారు. ప్రాజెక్ట్ ఎగువభాగం మునిగినా దిగువ భాగంలో బహుళప్రయోజనాలు నెరవేరుతాయి. ఇదే బహుళా సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యమైన అంశం! కానీ అందుకు భిన్నంగా ప్రయోజనం స్వల్పంగా.. వినాశనమే ప్రధానంగా చేపడుతున్న ప్రాజెక్టులేమైనా ఉన్నాయా..? పరీవాహక ప్రాంతమే కాకుండా నీరుపారే ప్రాంతాలనుకూడా నిట్టనిలువునా ముంచే ప్రమాదకరమైన ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్మించారా..? అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రమాదమని హెచ్చరించినా.. 
జలరంగనిపుణులు వద్దని వారించినా పట్టువీడకుండా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులేమైనా ఉన్నాయా..? అంటే, అందులో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర, వివాదాస్పదంగా పేరొందిన ప్రాజెక్టు.. పోలవరం! బ్రిటీష్ హయాంనుంచి ఇప్పటివరకు ఎన్నో వివాదాల సుడిగుండాలను సష్టించిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర విభజన పుణ్యమా అని జాతీయహోదా లభించింది. జాతీయ హోదా దేనికి..? తెలంగాణలో ఆదివాసీల సంస్కృతిని, మనుగడను ధ్వంసం చేయడానికా..?! దిగువ ప్రాంతాలను వరద నీటితో ముంచి ప్రళయం సస్ష్టిృడానికా..?! పాపికొండల వంటి అపురూప అభయారణ్యాన్ని, అపార ప్రకతి సంపదను పూర్తిగా నాశనం చేయడానికా..?! అన్న సంశయాలు కలుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును నిపుణులు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా హెచ్చరిస్తున్నారు. అయినా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పోలవరం వద్ద ఆనకట్ట పనులు మొదలయ్యాయి. 

ప్రాజెక్టు ఎత్తుతో హెడ్ రెగ్యులేటరీతో నిమిత్తం లేకుండా అడ్డదిడ్డంగా కాల్వల పనులు సాగిపోతున్నాయి. ఆనకట్ట స్పిల్ వే, ఎర్త్- కం- రాక్‌ఫిల్ డ్యాం పనులు జరుగుతున్నాయి. గోదావరి నదీ గర్భంలో కట్టే ఈ ఆనకట్ట ఎందుకు తెగే ప్రమాదముందంటున్నారు..? అసలు పోలవరమే ఆటంబాంబు లాంటిదని నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు..? డిజైన్ ఎందుకు మార్చాలంటున్నారు..?! ఉగ్ర గోదారికి అడ్డుకట్ట.. భద్రాద్రికీ ముప్పే! అటవీ విధ్వంసం, పట్టణీకరణ, వ్యవసాయభూముల్లో సైతం జనావాసాల వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్(మెరుపు వరదలు) ఆందోళనకరరీతిలో పెరిగిపోతున్నాయి. ఉన్నట్టుండి వరదలు పోటెత్తుతున్నాయి. వర్షం నీరు నేరుగా, ఏ అడ్డూలేకుండా ఉధృతంగా నదుల్లోకి వేగంగా చేరి దిగువ, ఎగువ ప్రాంతాలను ముంచుతున్నాయి. అత్యంత పొడవైన జీవనది గోదావరిలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. 

 

ఈ నదిలో వరద ఉధృతి అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోంది. 1850లో 15లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటే 1940 నాటికి అది 21లక్షలకు పెరిగింది. 1953లో 30లక్షల క్యూసెక్కులున్న వరద ప్రవాహం 1986లో 35లక్షలకు పెరిగింది. ఇప్పుడది 36లక్షల క్యూసెక్కులను దాటుతోంది. కానీ గోదావరి వరద ప్రవాహం ఎప్పుడైనా ప్రమాదకర స్థాయి 50లక్షల క్యూసెక్‌ల వరకు చేరుకోవచ్చని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలవనరుల సంఘం హెచ్చరించింది. 1953, 1986లో వచ్చిన గోదావరి వరదలు రాష్ట్రాన్ని వణికించాయి. 36లక్షల క్యూసెక్‌ల మేర నీరు ప్రవహించడంతో వరద నీరు భద్రాచలం గుడిని తాకింది. గత నాలుగు దశాబ్దాలలో మూడోసారి ఈ పరిస్థితి తలెత్తింది. ఎలాంటి అడ్డుకట్ట లేకుండానే ఈ పరిస్థితి తలెత్తింది. అంటే ఇక పోలవరం వద్ద 150అడుగులతో అడ్డుగా ఆనకట్ట నిర్మాణం పూర్తి చేస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు!! గోదావరి వాలు భద్రాచలం నుంచి పోలవరం వరకు చాలా తీవ్రంగా ఉంటుంది. పోలవరానికి 125కిలో మీటర్ల దూరంలో నది భూతల మట్టం 32.5మీటర్ల ఎత్తులో ఉంటే పోలవరం వద్ద ఎకాఎకిన 3మీటర్లకు పడిపోయింది. ఏటవాలుకు వరద ఉధృతి ఊహించని విధంగా ఉంటుంది. భద్రాచలం వద్ద 1200మీటర్ల వెడల్పు ఉన్న నది పాపికొండల వద్దకు రాగానే ఒక్కసారిగా 70మీటర్లకు తగ్గుతుంది. ఈ కారణంగా వరద ప్రవాహం దాదాపు 5 రెట్లు అధికమై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. 

ఈ ప్రవాహవేగం వల్ల మట్టి కట్టలను చీల్చే ప్రమాదం ఉంటుంది. ప్రవాహం 36 నుంచి 50 లక్షల క్యూసెక్కులుంటే, నదీ గర్భంలో వాగు మధ్యలో కడుతున్న ఆనకట్టకు ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందని డాక్టర్ కేఎల్ రావు వంటి ఇంజినీరింగ్ నిపుణులు తేల్చిచెప్పారు. పోలవరంలో 40లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు పంపడానికి 1800 అడుగుల మేరకు స్పిల్ వే కట్టడం సరికాదని, వాస్తవానికి 12లక్షల క్యూసెక్‌ల నీటిని బయటకు పంపడానికి సర్ ఆర్థర్ కాటన్ ప్రకాశం బ్యారేజీపై 6280 అడుగుల స్పిల్ వేను ఏర్పాటు చేశారని, ఆ లెక్కన పోలవరం డిజైన్‌లో ఎంత లోపం ఉందో తెలుసుకోవచ్చని కేఎల్ రావు గతంలో పలుమార్లు చెప్పారు. ఇంద్రావతి ప్రాణహిత నుంచి వరదలు పొంగుకువస్తే డ్యామ్ బ్రేక్ అయ్యే ప్రమాదముందని ఇంజినీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ టీ శివాజీరావు హెచ్చరించారు. 


అసలుకే ఎసరు
వాస్తవానికి గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఆరుగంటల్లో జలాశయం పూర్తి మట్టం 150 అడుగులకు చేరుతుంది. అప్పటికే తెలంగాణలో రెండువందల గ్రామాలు నీట మునుగుతాయి.. కానీ 50 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పుడు కేవలం నాలుగుగంటలలోనే నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకుని ప్రమాదం ముంచుకు వస్తుందని దేవరుప్పుల భీమయ్య అంటున్నారు. నీటిపారుదల శాఖలో ఎస్‌ఈగా పనిచేసి రిటైరైన ఆయన పోలవరంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. వెంటనే గేట్లు తెరవకపోతే ఆ ప్రవాహ ఉధృతికి మట్టికట్ట తెగే ప్రమాదముందని భీమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రాంతీయ పరంగా కాకుండా మానవీయకోణంలో చూసినా ఇది అత్యంత ప్రమాదకరమని, పోలవరంలో మట్టికట్ట ఎత్తు 175 అడుగులు కాగా గేట్లపై మట్టం 150 అడుగులు. గేట్ల పూర్తి మట్టం, మట్టికట్ట మధ్య తేడా కేవలం 25 అడుగులే. జలాశయంలో ఏర్పడే అలలకు సరైన చోటివ్వడానికి 10 అడుగులు అవసరమవుతాయి. 15 అడుగుల వరద ఒరవడి 36 లక్షల నుంచి 50 లక్షల వరకు చేరితే 72 శతకోటి ఘనపుటడుగుల నీరు గంటకు 13 శతకోటిఘనపుటడుగుల నుంచి 19 టీఎంసీల వరకు వరుసగా జలాశయంలో నిండుతుందని భీమయ్య అంటున్నారు. డ్యామ్ అండ్ స్పిల్ వే డిజైన్‌ల విషయంలో ఇండియన్ స్టాండర్డ్ కోడ్ కొన్ని మార్గదర్శకాలు నిర్దేశించింది. భారీ ప్రాజెక్టుల్లో స్పిల్ వేలో డిజైన్‌ల లోపం ఉంటే డ్యామ్ బద్దలయ్యే ప్రమాదం ఉంటుందని అప్పుడు దిగువ ప్రాంతాల్లోని ప్రజలను తరలించడానికి కనీసం 24 నుంచి 48గంటల సమయం ఉండేలా సర్వే చేసి డిజైన్‌ను రూపొందిస్తారు. 

కానీ భౌగోళికంగా పోలవరం విషయంలో అలాంటి పరిస్థితి లేదు. గోదావరి వరద ఉధృతికి నాలుగు గంటల్లోనే వరద నీరు నిండిపోవడం, మరో నాలుగు గంటల్లో వరద పొంగి మట్టికట్ట తెగిపోయే ప్రమాదం ఉందని భీమయ్య విశ్లేషిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును యథావిధిగా నిర్మిస్తే అది తెలంగాణకే కాదు కోస్తా మెడపై కూడా జలఖడ్గమవుతుందని తేల్చిచెప్పా రు. పోలవరం ఎత్తును తగ్గించడం, లేదా వరుసగా బ్యారేజీలను నిర్మించడంతో తెలంగాణలో మునకను తగ్గించడంతోపాటు ఆంధ్రలో ప్రాణనష్టాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కట్టతెగితే..?!:
ఒక వేళ కట్టతెగితే 40 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు పెద్ద ఎత్తున ఉప్పెన వచ్చే ప్రమాదముందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలజీ రుర్కి ఇది వరకే హెచ్చరించింది. వరద ఉధృతి 50 లక్షల క్యూసెక్కులను దాటే పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు పెను ప్రమాదం ఉంటుందని తేల్చింది. రాజమండ్రి, భీమవరం, కొవ్వూరు, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోకెమికల్ కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు, సెజ్‌లకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు కాదని మొదటి నుంచి బలమైన విమర్శలున్నాయి. 

ఎందుకంటే...పోలవరం ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిచాలన్నది ప్రధాన లక్ష్యం. కానీ వివాదాల కారణంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యామ్నాయంగా పుష్కర, తాటిపుడి, ఛగలనాడు, తురిగడ్డ ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. దీంతో దాదాపు ఐదులక్షల ఎకరాలకు నీరందుతోంది. ఇక మిగిలింది.. బహుళజాతి కంపెనీలు, సెజ్‌లు, సముద్రతీర ప్రాంతంలోని ఫార్మా, కెమికల్ కంపెనీలకు నీరందించటమే! ఇందుకోసం తెలంగాణ ఆదివాసీలను బలిపెట్టడంతో పాటు దిగువన ఉన్న వారిని కూడా ప్రమాదంలోకి నెట్టడానికి ఈ జాతీయ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. పోలవరం శాస్త్రీయంగా సాధ్యం కాదని పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు, శివాజీ లాంటి నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. 1751 నుంచి బ్రిటీష్ కాలంలో ప్రతిపాదన వచ్చింది.. కానీ అప్పుడే దూరదృష్టితో వ్యవహరించారు. తగదని పక్కకు తప్పుకున్నారు. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీలో మళ్లీ శ్రీరామపాదసాగర్ పేరిట తెరపైకి వచ్చింది. నాడు డాక్టర్ సావేజీతో పాటు కేఎల్ రావు కూడా సాధ్యంకాదని తేల్చారు.

భారీ విధ్వంసం తప్పదా?
పోలవరం రిజర్వాయర్ స్టోరేజీ కెపాసిటీ 194 టీఎంసీలు. అందులో 75 టీఎంసీలు లైవ్ స్టోరేజీ. స్పిల్ వే డిశ్చార్జి 36 లక్షల క్యూసెక్‌లు. వరద ఇన్‌ఫ్లో డిజైన్డ్ 49 లక్షల క్యూసెక్‌లని అంచనా వేశారు. ఈ ప్రాజెక్ట్ అదనంగా వచ్చే లాభం కంటే నష్టాలు, కష్టాలే ఎక్కువ. పోలవరం ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలను ముంపునకు గురిచేస్తూ దాదాపు రెండున్నర లక్షల గిరిజన, ఆదివాసీలను నిరాశ్రయులను చేయనుంది. ఒడిశా, ఛత్తీస్‍గఢ్‌తో కలిపి 397 గిరిజన, ఆదివాసీ గ్రామాలు పోలవరంలో కొట్టుకుపోనున్నాయి. ఇంత విధ్వంసం చేసే ప్రాజెక్ట్ వల్ల ఏమి వస్తుందని ప్రశ్నిస్తే..?! కృష్ణా డెల్టాకు అదనంగా 80 టీఎంసీల నీరు! దానిలో కూడా కర్ణాటక, మహారాష్ట్రకు సగం వాటాపోగా.. మిగిలిన 45 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చిన్న లాభానికి పెద్ద విధ్వసం అన్నది తేలిపోతున్నది. ఇప్పటికైనా పాలకులకు కనీస విచక్షణ ఉంటే పోలవరం డిజైన్‌ను మార్చి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని నిపుణులు హితవు పలుకుతున్నారు. 

ఈ విషయంలోనే మరిన్ని వివరాలకై:

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

ముంపు ఉద్యమం ఉధృతం

-తెలంగాణలోనే ఉంచాలని వెల్లువెత్తుతున్న డిమాండ్..
-బూర్గంపాడులో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు 
-కొనసాగిన బంద్.. పోలవరం డిజైన్ మార్చాలని సూచన..
-రేపటి నుంచి భద్రాచలం ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష

పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ గిరిజన బిడ్డల ఆందోళనలు ఉధృతమయ్యాయి. అపాయింటెడ్ డే దగ్గరికి వస్తుండడం, మరోవైపు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని కేంద్రం ఆర్డినెన్స్ తేవాలని యోచిస్తుండడంతో ఏజెన్సీలో ఉద్యమం భగ్గుమంటున్నది. తెలంగాణలోనే ఉంచాలంటూ బూర్గంపాడులో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నేత శంకర్‌నాయక్ మాట్లాడుతూ పోలవరం ముంపుపేరుతో బూర్గంపాడును సీమాంధ్రలో కలపాలనుకోవడం సరికాదన్నారు. ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మాణం చేపట్టాలని సూచించారు. ముంపు గ్రామాలపై చట్టపరంగాను, రాజకీయపరంగాను టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు. బూర్గంపాడు రెవెన్యూ గ్రామాన్ని సీమాంధ్రలో కలపాలనే నిర్ణయా న్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బూర్గంపాడు మండలం గ్రామాన్ని తెలంగాణలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఆమరణ దీక్ష చేయనున్న ఎమ్మెల్యే సున్నం: పోలవరం ముంపును తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. భద్రాచలంలో ముంపు మండలాల ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన దీక్షలో పాల్గొననున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

లోకల్‌లో బోగస్ లీల

-తప్పుడు ధ్రువపత్రాలతో తిష్ఠకు సీమాంధ్ర ఉద్యోగుల కుట్ర
-కార్మికశాఖలో డిప్యూటీ కమిషనర్ స్థానికమాయ 
-సమాచార హక్కు చట్టంతో అసలు విషయం వెలుగులోకి
-చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ ఉద్యోగులు

ఉద్యోగుల విభజనలో రోజుకో బోగస్ లోకల్ సర్టిఫికెట్ బాగోతం వెలుగు చూస్తున్నది. స్థానికత ఆధారంగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు కొట్టేయడానికి సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు చేసిన మాయాజాలం అంతా ఇంతాకాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన క్రమంలో స్థానికతపై మాయచేసి హైదరాబాద్ ఏడో జోన్‌లోనే కొనసాగడానికి ఆయా ప్రభుత్వశాఖల్లోని అధికారులు ప్రయత్నిస్తున్నట్లు టీ మీడియా పరిశీలనలో తేలింది. ఉద్యోగుల విభజనకు స్థానికతను ప్రధానంగా పరిగణన లోకి తీసుకుంటుండటంతో కొంతమంది హైదరాబాద్‌లోనే పనిచేయడానికి నకిలీ లోకల్ సర్టిఫికెట్లను జతచేస్తున్నారు.

వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్‌లో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏదైనా నాలుగు విద్యాసంవత్సరాలు చదివినవారు స్థానికులవుతారు. దీనిని ఆసరాగా చేసుకుని ఎంతోమంది సీమాంధ్రులు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి హైదరాబాద్ స్థానికులమంటూ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. ఏడో జోన్ హైదరాబాద్‌లో తిష్ఠవేశారు. కొందరు నాలుగు విద్యాసంవత్సరాలు పూర్తి చేయకుండానే గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్లను తెచ్చుకున్నారు. ఇంకొందరు ఎప్పుడో మూసేసిన పాఠశాలలో చదివినట్లు, గుర్తింపులేని అనామక పాఠశాలల్లో నాలుగేళ్లు వరుసగా విద్యను అభ్యసించినట్లు సర్టిఫికెట్లను జత చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కార్మికశాఖలో ఒక అధికారి బోగస్‌లీల వెలుగుచూసింది. కార్మికశాఖలో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎస్ నరేశ్‌కుమార్ స్థానికతపై తప్పుడు లెక్క చూపినట్లు తెలుస్తున్నది. దీనిపై వివాదం రాజుకుంటున్నది. ఆయన 1989లో ఏపీపీఎస్సీ గ్రూప్-2 (ఎ)ద్వారా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 

తాను హైదరాబాద్‌లో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగు సంవత్సరాలు చదివినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్న నరేశ్‌కుమార్ రికార్డులను జాగ్రత్తగా పరిశీలిస్తే స్థానిక కోటాలోకి రారనేది స్పష్టమవుతోంది. లోకల్ స్టేటస్ ఫ్రూఫ్ స్టడీ సర్టిఫికెట్ ను సమర్పించిన ఆయన మాసాబ్‌ట్యాంక్‌లోని క్లార్క్ కాన్వెంట్ స్కూల్‌లో 4, 5వ తరగతి చదివినట్లు పేర్కొన్నారు. కానీ, దానికి సంబంధించి స్టడీ సర్టిఫికెట్ లేదని స్పష్టం చేశారు. ఆబిడ్స్‌లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్‌లో 6నుంచి 9వ తరగతి వరకు చదివినట్లు సర్టిఫికెట్‌ను సమర్పించారు. ఆ సర్టిఫికెట్లు అనేక అనుమానాలకు తావిచ్చాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలు తీసుకుంటే అసలు విషయం బయటపడింది. మూమూలుగా విద్యాసంవత్సరం జూన్‌లో మొదలై మార్చి లేదా ఏప్రిల్‌లో ముగుస్తుంది. కానీ, నరేష్‌కుమార్ విచిత్రంగా జనవరి 1న 1967లో సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్‌లో 6వ తరగతిలో చేరినట్లు పేర్కొన్నారు. 5వ తరగతి పూర్తయిన తర్వాత జనవరి వరకు ఏ పాఠశాలలో చదివింది చెప్పకపోవడం అనుమానాలకు తావిచ్చింది. 

దీంతోపాటు తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేసినట్లు దాఖలాలు లేవు. 16 డిసెంబర్ 1970 వరకే అంటే పరీక్షలు పూర్తి కాకముందే ఆయన సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్‌ను వదిలినట్లు స్వయంగా లోకల్ స్టేటస్ ఫ్రూఫ్‌లో పేర్కొన్నారు. ఏ విధంగా చూసినా ఆయన నాలుగు విద్యాసంవత్సరాలు పూర్తి చేసిన రుజువులు లేవు. పీపుల్స్ ట్యుటోరియల్ కాలేజీ, గన్‌ఫౌండ్రీ ఆంధ్ర మెట్రిక్యులేషన్‌లో ప్రైవేట్‌గా పదో తరగతి పూర్తి చేసినట్లు స్టడీ సర్టిఫికెట్ తీసుకున్నారు. పీపుల్స్ ట్యుటోరియల్‌కు అసలు ఉనికిలో లేదని, పైగా ప్రైవేట్‌గా రాసిన ఆ సర్టిఫికెట్ స్థానికత కిందకు రాదని తెలంగాణవాదులు అభ్యంతరం లేవదీశారు. నరేశ్‌కుమార్ సర్టిఫికెట్లపై విచారణ జరిపి ఆయన అసలు స్వరూపాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమకు చెందిన నరేశ్‌కుమార్ జోన్-7లో ఎంపిక చేయడమే తప్పని ఆయన్ను వెంటనే ఆంధ్రాకు పంపాలని వారు కోరుతున్నారు. ఎంతోమంది అధికారులు బోగస్ సర్టిఫికెట్లతో మాయ చేస్తున్నారని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కొన్ని రోజులుగా తెలంగాణ ఉద్యోగసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

(నమస్తే తెలంగాణా దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!