గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, డిసెంబర్ 29, 2015

తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఉద్యమస్ఫూర్తితో నడుద్దాం...


తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. అనేక పోరాటాలు చేశాం. అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అరవై ఏండ్ల వలసపాలనలో విచ్ఛిన్నమైపోయిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను పునర్నిర్మించుకోవాలి. 

తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక ఎత్తు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించే కర్తవ్యం మరోఎత్తు. అందుకే నేడు ప్రజలు ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ గురుతర బాధ్యతగా భావిస్తే తెలంగాణ అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజలు ఏ ఆశ లు, ఆకాంక్షల కోసం ప్రాణాలు త్యాగం చేశారో.. ఆ ఆశయ సాధన కేవలం పునర్నిర్మాణం ద్వారానే సాధ్యమవుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వలసపాలకుల పెత్తనాలు ఇంకా కొనసాగుతున్నాయి. అందుకే రాష్ట్ర పునర్నిర్మాణం ఎలా? ఆంధ్ర వలస పాలకులు అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు కాదని, ఆంధ్ర ప్రాంత వలస పాలకులు మాత్రమేనని టీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. ఆచరణ ద్వారా రుజువు చేసింది. ఆంధ్ర ప్రాంత సంపన్న పాలకవర్గం అరవై ఏళ్లు పాలించారు. ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇక్కడి వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, గనులు, నిక్షేపాలు అన్నింటిని కాపాడుకొని తెలంగాణ ప్రజలకు చెందేలా కృషిచేయాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, పక్షపాత వైఖరిని, ఆంధ్ర పాలకుల కుట్రలను ఓడించాలి.


తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి 16 నెలలు అయింది ఇప్పటికీ 231 ప్రభుత్వరంగ సంస్థల విభజన జరుగలేదు. ప్రభుత్వ సంస్థల, శాఖల విభజన జరిగితే మరో యాభై వేల కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణకే చెందుతాయి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు మార్గం సులువవుతుంది. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో పొందుపరిచినట్లుగా, అలాగే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లో విభజన జరగడానికి కావలసిన అన్ని సెక్షన్లు ఉన్నా ఆంధ్ర పాలకులు మోకాలడ్డుతున్నారు. కేంద్రం బయ్యారం స్టీల్ ప్లాంట్, ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హార్టీకల్చర్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో కాలయాపన చేస్తున్నది. తెలంగాణలో 6300 కిమీ మేర రోడ్డును ప్రతిపాదిస్తే 1200 కి.మీ. రోడ్లకు మాత్ర మే కేంద్రం అనుమతించింది. రేషన్ బియ్యం కోటా, బడ్జెట్ కేటాయింపుల్లో, ఎన్టీపీసీ విద్యుత్ పాంట్ల పట్ల వివక్ష చూపుతున్నది. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. తెలంగాణ అభివృద్ధి కోసం అనేక ఆటంకాలను అధిగమించాలి.


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, పునర్నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలి. అందరూ ఐక్యంగా కదలాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా ఉమ్మడిగా ఉద్యమించామో రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఐక్యంగా కదలాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పట్ల కనబరుస్తున్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి.


తెలంగాణ అభివృద్ధి కూడా ఆందోళనలో, ఆరాటంలో భాగమేనని గుర్తించలేని వారు పునర్నిర్మాణంలో భాగస్వాములు కాకుండా పారిపోతారు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 18 నెలలు గడిచింది. ఆంధ్రా పాలకుల కుట్రలు, ఎలా పట్టి పీడిస్తున్నాయో అర్థం చేసుకోవాలి. మధ్యప్రదేశ్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేవలం ఆరు నెలల కాలంలోనే అన్ని విభజనలు జరిగిపోయాయి. ఉమ్మడిగా ఉన్న అనేక సమస్యలు సులభంగా పరిష్కారమయ్యాయి. కానీ తెలంగాణలో కాలయాపన జరగడానికి ఆంధ్ర వలసపాలకుల కుట్రలు, కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేది వాస్తవం.


ఆంధ్ర వలసవాదుల ఆధిపత్యం అన్నిరంగాలతో పాటు మీడియా రంగంపై ఉన్నది. దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఆవగింజంత చూపించి, లోపాలను తాటికాయంత చూపించడం వీరి నైజం. ఆరోపణ కోసం ఆరోపణ, విమర్శ కోసం విమర్శ అనే వింత పోకడను ప్రదర్శిస్తున్నారు.


ఉదాహరణకు- మిష కాకతీయ అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. చెరువుల పునరుద్ధరణ పని ప్రారంభమైనప్పటి నుంచి ఇది కమీషన్ మిషన్ అనీ, కాంట్రాక్టుల కోసమని అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. నిజాం కాలంలో తవ్విన చెరువులను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలస పాలకులు ఎంత ఘోరంగా నిర్లక్ష్యం చేశారో తెలిసిందే. ఇక ఆక్రమణల సంగతి సరే సరి. అరవై ఏండ్ల నాటి నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ.. చెరువుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ప్రతిపక్షాలు మిషన్ కాకతీయపై దుమ్మెత్తి పోసినా ప్రజలు మాత్రం సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రచారం చేసిన వీరు రైతులకు భరోసా కల్పించే కర్తవ్యం గానీ, ఆత్మహత్యల నివారణకు ఏ ఒక్క కార్యక్రమం కానీ చేపట్టకపోగా రైతుల సమస్యలను రాజకీయ ప్రచారం కోసం వినియోగించుకున్నారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ పని అప్రజాస్వామిక చర్యగానే భావించాలి.
ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, కొన్ని సంఘాలు తెలంగాణ అభివృద్ధి గురించి కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే కార్యక్రమానికి పూనుకున్నాయి. తప్పుడు అవగాహన కలిగిన వీరు, అసహనంతో మాట్లాడుతూ జరుగరానిది ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడటంతోనే తిరిగి దొరల రాజ్యం ఏర్పడినట్లు, భాగస్వామ్య వ్యవస్థ మళ్లీ పుట్టిందన్నట్లు ప్రచారం చేస్తున్నారు. వీరికి ఒకటే సమాధానం. ఇది వర్గ వ్యవస్థ, భూస్వా మ్య వ్యవస్థ కూలిపోలేదు. కానీ మళ్లీ పుట్టిందని మాట్లాడుతున్నారు. వర్గ వ్యవస్థ ఉన్నంత కాలం అణచివేత, నిర్బంధం ఉంటుంది. ఇది వాస్తవం. నిర్బంధాలు, దాడులను నిరసించడం, వ్యతిరేకించడం కంటిన్యూగా సాగే ఉద్యమ క్రమం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే పోలీసుల చర్యల గురించి గోల పెడుతున్నారు. ఆంధ్ర వలస పాలనలో ఎన్‌కౌంటర్ హత్యల పట్ల మౌనం వహించినవారు కూడా.. స్థల, కాల, నూతన పరిణామాల పేరిట నయా కుట్రలు పన్నుతున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటూ, అప్రతిష్ట పాలు జేసేందుకు మీడియాను ఆయుధంగా వినియోగించుకుంటున్నారు.


తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. అనేక పోరాటాలు చేశాం. అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అరవై ఏండ్ల వలసపాలనలో విచ్ఛిన్నమైపోయిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలను పునర్నిర్మించుకోవాలి. ఇందుకోసం ప్రజల అండదండలు, సంపూర్ణ మద్దతు కావాలి. ఆందోళనలు, నినాదాలు, ఉద్యమాల స్థానంలో పటిష్టమైన నిర్మాణం, అభివృద్ధి సాధించి తీరాలి. దీనికోసం ప్రభుత్వాల మద్దతు కావాలి. లేదంటే జరుగుతున్న పొరపాట్లను ఎత్తిచూపాలి. ప్రజానుకూలంగా పాలన సాగేట్లు చూడాలి. 


అదే సమయంలో ఆయా పార్టీలు ప్రజా సంఘాల నాయకత్వంలో ప్రజలను కదిలించే పోరాట పటిమ ఉందని, ఉద్యమ స్ఫూర్తి ఉందని అనుకోవడంతోనే సరిపోదు. ప్రజా ఆకాంక్షలను గుర్తించి వాటికి అనుగుణంగా నడుచుకోవాలి. ఈ స్థితిలో ఉద్యమాలు ముందుకు వెళ్లాలి. ఉద్యమ దశ, దిశ మొత్తం ఆంధ్ర పాలకులపైన కేంద్ర ప్రభుత్వ వివక్షతా విధానాలపైన పోరాడే విధంగా ఉండాలి.


ఇదంతా తెలంగాణ పునర్నిర్మాణం కోసమని అందరూ గుర్తించాలి. ఈ పునర్నిర్మాణం లేకపోతే మనకు దక్కింది ఏమిటనేది ప్రశ్న వేసుకోవాలి. భారతదేశ పటంలో తెలంగాణ రాష్ర్టాన్ని చూసి, సంబురపడటం ఒక్కటే కాదు, అది తెలంగాణ ప్రజల పురోగమనానికి నాంది కావాలి. చైతన్యానికి మరోపేరు కావాలి.


వ్యాసరచయిత: బి. మోహన్ రెడ్డి



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


ఆదివారం, డిసెంబర్ 27, 2015

మహాభారతంలోనూ ‘సైన్స్’ సూత్రాలున్నాయా...

TNN| Dec 5, 2015, 03.45 PM IST

ఫోటోలు పంచుకోవడం
ప్రఖ్యాత భారతీయ ఇతిహాసం మహాభారతంలోని కొన్ని అంశాలు సైన్స్ సూత్రాలకు చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పవచ్చు. మన శాస్త్రవేత్తలు తెలియజేసిన అనేక విషయాలు కొన్ని శతాబ్దాల క్రితం రచించబడిన మహాభారతంలో ప్రస్తావనకు రావడమే అందుకు ఉదాహరణ. ఆ మహా ఇతిహాసాన్ని సైన్స్ కోణంలో నుంచి చూస్తే ఎన్నో ఘట్టాలు నిజంగానే మనల్ని ఆశ్చర్యపరుస్తాయనడంలో సందేహం లేదు.

అభిమన్యుడి జ్జానానికీ కారణాలున్నాయి - 'రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్ఫాన్సీ' అనే పుస్తకంలో డాక్టర్ మకటో సిచిడా అనే శాస్త్రవేత్త తల్లి గర్బంలోని శిశువు మెదడు కొన్ని సందర్భాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుందని, బయటి శబ్దాలను వినగల శక్తిని కూడా కలిగుంటుందని విశదీకరించారు. దీనిని బట్టి చూస్తే సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అభిమన్యుడు కూడా ఇలాంటి శక్తి ద్వారానే అర్జునుడు చెప్పిన చక్రవ్యూహ రహస్యాలను విని ఉండవచ్చని కొందరి అభిప్రాయం.

కౌరవుల పుట్టుకకు.. ఆ పేటెంట్‌కు సంబంధముంది - ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో సర్జన్‌గా పనిచేస్తున్న మాతాపుర్కర్ స్టెమ్ సెల్స్ మీద పరిశోధనలు చేస్తూ.. ఒకే పిండాన్ని అనేక పిండాలుగా విభజించే ఓ వినూత్న పద్ధతికి సంబంధించిన యూఎస్ పేటెంట్ తీసుకున్నారట. ద్వాపర యుగంలో ఈ పద్ధతి ద్వారానే వ్యాసుడి సూచన మేరకు గాంధారి పిండాన్ని 101 భాగాలుగా వైద్యులు విభజించి.. కౌరవులకు వూపిరి పోసిన విషయం విదితమే.
ద్రౌపది సందేశం 'టెలీపతీ' ద్వారా చేరిందా - 1882లో ఫ్రెడిరిక్ మేయర్స్ అనే శాస్త్రవేత్త ఒక ఆలోచనను మనిషి మరో ప్రాంతంలోని వ్యక్తికి మనో తరంగాల ద్వారా చేరవేసే అవకాశం ఉందని తెలిపారు. ఆ పద్ధతికే 'టెలీపతి' అని పేరు పెట్టారు. పాండవులు జూదంలో ఓడిపోయి..కౌరవులకు ద్రౌపదిని పణంగా పెట్టినప్పుడు..ఎక్కడో ద్వారకలో ఉన్న కృష్ణుడికి ఆ సమాచారం టెలీపతి ద్వారానే చేరుంటుందని.. అందుకే ద్రౌపది రక్షణార్థం ఆయన పథకం రచించారని కొందరి భావన

ద్రోణాచార్యుడు చెప్పింది 'టార్గెట్ ఎనాలసిస్' సూత్రమేనా - అమెరికాలోని సెంట్రల్ అనాలసిస్ ఏజెన్సీ యుద్దానికి వెళ్లే సైనికులకు లక్ష్య నిర్దేశం చేసే దిశగా ప్రోత్సహిస్తూ..ఎప్పుడూ ఏకాగ్రత, అప్రమత్తత అత్యంత అవసరం అని తెలియజేస్తూ చెప్పే పాఠమే 'టార్గెట్ ఎనాలసిస్'. మహాభారతంలో ద్రోణుడు అర్జునుడికి ఒక పక్షి కన్నును మాత్రమే లక్ష్యంగా చేసుకొని బాణాన్ని ప్రయోగించమనప్పుడు..అతను దాని మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి గురి చూసి బాణాన్ని వేస్తాడు. ఈ సూత్రం కొంతవరకు టార్గెట్ ఎనాలసిస్ సూత్రాన్నే పోలి ఉంటుంది.


(క్లిక్ చేయండి)
(తెలుగు సమయం సౌజన్యంతో)
 

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

అసమగ్ర తెలంగాణ రాష్ట్రంలో....స్వంత హైకోర్టు ఎండమావియేనా?

రేపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ పతాకం జేగీయమానంగా ఎగిరినట్లయితే హైదరాబాద్ నగరం తెలంగాణ నగరం కాదన్న విష ప్రచారానికి మూడు పార్టీలు, విశేషించి మోదీయుల కూటమి, పచ్చమీడియా పడగ విప్పి బుసలు కొట్టే ప్రమాదముండదు. వరంగల్లు విజయం స్ఫూర్తితో ఇటువంటి ప్రమాదాలను నివారించక తప్పదు.


"WE ARE ALL PROUD OF THE HAPPY OCCASIoN WHEN THE ANDHRA STATE CAME INTO EXISTENCE, THERE WAS A FEELING OF INCOMPLETENESS. BUT NOW WITH THE CONSTITUTION OF THE HIGH COURT, THE LONG STANDING DESIRE AND ASPIRATIONS OF THE ANDHRAS HAVE BEEN FULFILLED.."

rao


ఇవి కోకా సుబ్బారావు గారి మాటలు: 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తర్వాత తొమ్మిది నెలలకు, 1954 జూలై 5వ తేదీన గుంటూరులో ఆంధ్రరాష్ట్రం హైకోర్టు ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి దేశ వ్యవహారాల శాఖామంత్రి కైలాస్ నాథ్ కట్జూ ఆంధ్రరాష్ట్రం హైకోర్టును ప్రారంభించారు. ఆంధ్రరాష్ట్ర హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. గుంటూరులో తమ హైకోర్టు ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ కోకా సుబ్బారావు పైన ఉదహరించిన మాటలు అన్నారు - "ఆంధ్రరాష్ట్రం అవతరించిన ఈ తరుణం మనందరికీ గర్వకారణం, సంతోషదాయకం. కానీ, అసమగ్రతా భావం వ్యక్తమైంది. ఇప్పుడు హైకోర్టు ఏర్పాటు కావడంతో ఆంధ్రుల చిరకాల వాంఛ నెరవేరింది..." కోకా సుబ్బారావు మాటల తాత్పర్యం ఇది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినందుకు గర్వించినా, సంతోషపడినా హైకోర్టు ఏర్పాటు కాకపోవడంవల్ల రాష్ట్రం అసమగ్రం అన్న భావం వ్యక్తమైందని సుబ్బారావు అన్నారు. 


హైకోర్టు ఏర్పాటుతో రాష్ట్రం సంపూర్ణ స్వరూపం ధరించిందన్న అభిప్రాయం ఆయన మాటల్లో ప్రస్ఫుటమైందనడంలో అనుమానం లేదు. 28 నెలల తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పుడు గుంటూరులోని ఆంధ్రరాష్ట్ర హైకోర్టు వెంటనే (ఎంతమాత్రం ఆలస్యం కాకుండా) రాజధాని హైదరాబాద్‍కు వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం హైకోర్టు, ఆంధ్రరాష్ట్రం హైకోర్టు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. తరువాత ఆయన సుప్రీంకోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించి 1967లో రిటైరయ్యారు. అదే సంవత్సరం ఆయన ప్రతి పక్షాలన్నింటి ఉమ్మడి అభ్యర్థిగా మూడవ రాష్ర్టపతి పదవికి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్రంతో పాటు హైకోర్టు కూడా ఏర్పాటు కాకపోవడం వల్ల రాష్ర్టం అసమగ్రమైనదన్న భావం కలిగిందన్న ఆయన మాట విలువైనది, గమనార్హమైనది. హైకోర్టు లేనందువల్ల రాష్ట్రం అసమగ్రమైనదన్న అభిప్రాయం, అసంతృప్తి సహజమైనవి, సహేతుకమైనవి.

మరి ఇప్పుడో...? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా... రాష్ట్రంతో పాటు తెలంగాణ హైకోర్టు కూడా ఏర్పాటు కాకపోవడం... తెలంగాణ ప్రజలకు అసంతృప్తి కల్గిస్తుంది కదా! తమకు అరవై సంవత్సరాల పోరాటాలు, త్యాగాల ఫలితంగా లభించిన రాష్ట్రం అసమగ్రమైనదన్న భావం (హైకోర్టు ఏర్పాటు కానందువల్ల) తెలంగాణ ప్రజలకు కూడా కలుగుతుంది కదా! కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన పిదప తొమ్మిది మాసాలకే గుంటూరులో ఆంధ్ర హైకోర్టు ఏర్పాటైంది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పందొమ్మిది నెలలైనా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కావడం లేదు. పందొమ్మిది నెలల నుంచి తెలంగాణ ప్రభుత్వం, పార్లమెంటు సభ్యులు, న్యాయవాదులు (ఉద్యమం కూడా నిర్వహిస్తూ), తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏక కంఠంతో తెలగాణ హైకోర్టు కోసం నిర్విరామ, నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. హైకోర్టు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశారు. హైదరాబాద్‌లో కొంతకాలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెట్టుకోవడానికి భవనాలు తదితర అన్ని సదుపాయాలు సమకూర్చుతామని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నారు. 


కానీ... కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం వాగ్దానాలు చేస్తూ, వాయిదాలు వేస్తూ, మభ్యపెడుతూ, మాటల మిఠాయిలు తినిపిస్తూ కాలక్షేపం చేస్తున్నది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణ హైకోర్టు ఏర్పాటు మీద చేసిన ప్రకటనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర విభజన ఇష్టంలేని మోదీయులకు విభజన చట్టాన్ని అమలు జరపడంలో అసలే ఆసక్తి లేదు. అరవై సంవత్సరాల కిందట ఆంధ్ర రాష్ర్టానికి అయాచితంగా తొమ్మిది మాసాలలో వచ్చిన హైకోర్టు తెలంగాణ రాష్ర్టానికి పందొమ్మిది మాసాలైనా ఎందుకు రావడం లేదు? అరవై సంవత్సరాల కిందట అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమర్థత, కార్యదక్షత, నిష్పాక్షికత ఇప్పటి మోదీ ప్రభుత్వంలో కొరవడ్డాయనుకోవాలా? స్వాతంత్య్రానంతరం కేవలం ఆరు సంవత్సరాలకు కేంద్రంలో ఉన్న పరిపాలనా యంత్రాంగం, కమ్యూనికేషన్ సదుపాయాలు, పాలనా నైపుణ్యంతో పోల్చినప్పుడు ఇప్పటి పరిపాలనా యంత్రాంగం, కమ్యూనికేషన్ వ్యవస్థ, పాలనా నైపుణ్యం నిజానికి ఎన్నో రెట్లు మెరుగుపడ్డాయి.

అయినా...

అప్పుడు తొమ్మిది మాసాలకే నెరవేరిన పని (హైకోర్టు ఏర్పాటు)... ఇప్పుడు పందొమ్మిది మాసాలైనా... ఎందుకు కావడం లేదు? మినిమమ్ గవర్నమెంట్ - మాగ్జిమమ్ గవర్నెన్స్ నినాదంతో మోదీయులు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ నినాదం మాగ్జిమమ్ గవర్నమెంట్ - మినిమమ్ గవర్నెన్స్‌గా మారిందా? మాటలే గాని చేతలు లేవు. కో-ఆపరేటివ్ ఫెడరలిజం, టీం ఇండియా నినాదాలతో మోదీ ప్రభుత్వం ముచ్చట్లు చెబుతున్నది. మోదీ ప్రభుత్వం నిజానికి రాష్ట్రాలకు రాష్ట్ర పార్టీలకు విలువ ఇవ్వడం లేదు. అందువల్ల, తెలంగాణ హైకోర్టు ఎండమావి అవుతున్నది. అవిభక్త రాష్ట్ర ఉద్యోగుల విభజనలో కమల నాథన్ కమిటీ ఒక అంగుళమైనా ఎందుకు ముందడుగు వేయడం లేదు? నదీ జలాలలో న్యాయంగా తెలంగాణ వాటా ఎందుకు లభించడం లేదు? గత పందొమ్మిది మాసాలలో మోదీ ప్రభుత్వం ఆంధ్రకు ఇచ్చింది ఎంత? తెలంగాణకు ఇచ్చింది ఎంత? వీటిపై ఒక శ్వేతపత్రం ప్రకటించి వివరిస్తారా మోదీయులు? ఇచ్చింది ఏమీ లేదు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే: తెలంగాణ ఏడు మండలాలను (ఖమ్మం జిల్లాలో) కబళించడం, ఆంధ్రకు దత్త పరచడం! ఆంధ్ర మీద ప్రేమ, తెలంగాణ పట్ల ద్వేషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంతో పాటే తమ హైకోర్టు ఏర్పడాలన్నది తెలంగాణ ప్రజల ప్రగాఢ వాంఛ. దీనిని కేంద్రం గుర్తించడంలేదు. ఏడు మండలాల కబళింతతో కుట్రలు ఆగడం లేదు! తెలంగాణ నడి గడ్డ మీద ఉన్న హైదరాబాద్ నగరం తెలంగాణ గుండె. ఈ వాస్తవాన్ని హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసిన వారు, ఉమ్మడి రాజధానిలో తెలంగాణ హక్కులను విస్మరించి సెట్లర్ల హక్కులు, ప్రయోజనాల కోసం అహర్నిశలు ఆరాట పడుతున్న వారు గుర్తించడం లేదు. హైదరాబాద్ నగర పాలనను ఉమ్మడి గవర్నర్‌కు అప్పగించాలన్న కుట్ర తెలంగాణ మెడ మీద కత్తిలా వేలాడుతున్నది. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి సంస్థలు, తెలంగాణ హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగించడానికే. ఆంధ్ర న్యాయమూర్తుల సంఖ్య అధికంగా ఉన్న ఉమ్మడి హైకోర్టులో గత పందొమ్మిది మాసాలలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహుశా ఇరవై కంటే ఎక్కువ స్టే ఆర్డర్లు జారీ అయి ఉంటాయి. హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ ప్రజల సొత్తు కాదన్న దుష్ప్రచారం జరుగుతున్నది. తెలగాణ అస్తిత్వ భావం, తెలంగాణ వాదం హైదరాబాద్ నగరంలో బలంగా లేవన్న తప్పుడు ప్రచారం జరుగుతున్నది. 

సెట్లర్లు ఎంతమంది ఉన్నా, దొంగ ఓటర్లు ఎంత మంది ఉన్నా, మొదటి నుంచి తెలంగాణ సెంటిమెంట్‌కు కేంద్రం హైదరాబాద్ నగరమే. 1969-70 ఉద్యమకాలంలో బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఒత్తిడులు తెచ్చినా హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ జెండా ఎగిరింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాడు నాయకత్వం వహిస్తున్న తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి లక్ష్మీనారాయణ హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికైనారు. కలకత్తా బెంగాలీల, ముంబై మహారాష్ట్రల, చండీగఢ్ పంజాబీల, బెంగుళూరు కన్నడిగుల, తిరువనంతపురం మళయాళీల నగరాలైనట్లు... హైదరాబాద్ తెలంగాణుల నగరం. హైదరాబాద్‌లో ఆంధ్రుల సంఖ్య ఎంత అన్నది ముఖ్యం కాదు - తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాలు ముఖ్యం. నిద్రలో సైతం సెట్లర్ల యోగక్షేమాల కోసం కలవరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, ముఖ్యంగా కేంద్రంలో పెత్తనం చేస్తున్న బీజేపీలు... తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద దుమ్మెత్తి పోయడం... ఒక రోజు ఆపి, తెలంగాణ హైకోర్టు, తెలంగాణ నదీ జలాలు, తెలంగాణ నిధులు, తెలంగాణ ఉద్యోగాల కోసం ఢిల్లీ లో, కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదు? మోదీ ప్రభుత్వంలో... బీజేపీ, టీడీపీలు ప్రధాన భాగస్వామ్య పక్షాలనా? 


ఈ రెండు పార్టీల లోకల్ నేతలు తెలంగాణ హైకోర్టు కోసం, తెలంగాణ ఇతర హక్కులు, ప్రయోజనాల కోసం గత పందొమ్మిది మాసాలలో చేసిందేమిటి? ఏమీ లేదు. రేపు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌పై తెలంగాణ పతాకం జేగీయమానంగా ఎగిరినట్లయితే హైదరాబాద్ నగరం తెలంగాణ నగరం కాదన్న విష ప్రచారానికి మూడు పార్టీలు, విశేషించి మోదీయుల కూటమి, పచ్చమీడియా పడగ విప్పి బుసలు కొట్టే ప్రమాదముండదు. వరంగల్లు విజయం స్ఫూర్తితో ఇటువంటి ప్రమాదాలను నివారించక తప్పదు.


ఈ వ్యాసం పూర్తి వివరాలకై: దీనిపై క్లిక్ చేయండి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!



గురువారం, డిసెంబర్ 17, 2015

తెలంగాణపై ఏపీ మరో కుట్ర!

- రెవెన్యూశాఖలో విభజన జరుగకుండానే 
- ఆంధ్రా ప్రాంత ఉద్యోగుల పదోన్నతులకు సన్నాహాలు
- ఏకపక్షంగా డీపీసీ సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు 
- తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరం 
- నేడు ఏపీ సీసీఎల్‌ఏ ఎదుట ఆందోళన

సీమాంధ్ర సర్కారు విభజన చట్టాలను, న్యాయాన్ని భేఖాతర్ చేస్తున్నది. కీలకమైన రెవెన్యూశాఖలో పదోన్నతుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగుల విభజన జరుగకుండానే ఏకపక్షంగా ఆంధ్రా ప్రాంత రెవెన్యూ అధికారులకు పదోన్నతులు ఇచ్చి తెలంగాణకు పంపాలని కుట్ర పన్నింది. రాష్ట్ర విభజన జరిగి 18 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగులు, అధికారుల విభజన జరుగలేదు. ఉద్యోగుల విభజనను కమలనాథన్ కమిటీ ఇంకా పూర్తిగా చేయక ముందే ఏపీ ప్రభుత్వం తమ ప్రాంతంవారికి పదోన్నతులు ఇవ్వడానికి సిద్ధమైంది. 


గురువారం ఏపీ సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఉమ్మడి డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై తెలంగాణ డిప్యూటీ కలెక్టర్లు తెలంగాణ సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 475 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉండగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కేవలం 176 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు మాత్రమే ఉన్నాయంటూ డీపీసీ నిర్వహించడం సరికాదన్నారు. వాస్తవంగా ఉమ్మడిగా డీపీసీ నిర్వహిస్తే తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించాలని, డీపీసీలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. పోస్టులు, సీనియార్టీలిస్ట్‌ల తయారీలో తెలంగాణ సీసీఎల్‌ఏ భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఏపీ ఏకపక్షంగా డీపీసీ నిర్వహించడాన్ని వారు తప్పుపట్టారు. దీనిపై వెంటనే స్పందించిన రేమండ్ పీటర్, ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి సూర్యకుమారితో ఫోన్‌లో మాట్లాడారు. డీపీసీ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏ ప్రాతిపదికన డీపీసీ నిర్వహిస్తారని ప్రశ్నించారు. అయితే మంజూరైన పోస్టులకు లెక్కప్రకారం సీనియార్టీ లిస్ట్ తయారు చేశామని ఆమె సమాధానం ఇచ్చారు. 


పదోన్నతుల విషయంలో కోర్టుధిక్కరణ కేసు ఉన్నందున డీపీసీ నిర్వహిస్తున్నామన్నారు. కమలనాథన్ కమిటీకి 176 మంజూరైన పోస్టులు ఉన్నాయని చెప్పామని, సీనియార్టీ జాబితా ఇచ్చామని తెలిపారు. దీంతో విభజన చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయం చేయవలసి ఉందని రేమండ్ పీటర్ అన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం నిర్వహించే డీపీసీని రద్దు చేయాలని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై గురువారం ఏపీ సీసీఎల్‌ఏ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శివశంకర్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలిపారు.




జై తెలంగాణ! జై జై తెలంగాణ!!


మంగళవారం, డిసెంబర్ 15, 2015

తెలంగాణ కరువుకు శాశ్వత పరిష్కారం...!!!

ప్రఖ్యాత జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ ఎవ్రీవన్ లవ్స్ ఎ గుడ్ డ్రౌట్ అనే పేరుతో 1996 లో ఓ పుస్తకం రాశారు. దేశంలో చాలా పేదరికం అనుభవిస్తున్న ప్రజలుండే జిల్లాల్లో కలియ తిరిగి రాసిన పుస్తకమది. కరువు ఏర్పడటానికి కారణాలు, దానివల్ల పేద లు పడే ఇబ్బందులు, ప్రభుత్వం చేయాల్సిన పనులు అన్నింటినీ కూలంకషంగా చర్చించారు. కరువును నిర్ధారించడానికి, కరువును ఎదుర్కోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు, దానివల్ల ఎవరికి మేలు కలుగుతున్నదనే విషయాలను లోతుగా అధ్యయనం చేసి అక్షరీకరించారు. ఆ పుస్తకం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నది కానీ, ఏ ప్రభుత్వం కూడా దాన్నొక పాఠంగా స్వీకరించలేదు. సాయినాథ్ తర్వాత కూడా కరువు మీద పుస్తకాలు వస్తున్నాయి. వ్యాసాలు వస్తున్నాయి. మీడియాలో ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ల వార్తలు వస్తున్నాయి. కానీ కరువు మాత్రం మళ్లీ మళ్లీ పేదింటి తలుపు తడుతూనే ఉన్నది. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల కరువు వస్తుందనే ఓ ప్రాథమిక సూత్రీకరణతో ప్రజలను సమాధానపరుస్తున్నారు. విచిత్రమేమిటంటే వర్షాభావ పరిస్థితులకు కరువు పర్యాయపదంగా మారింది.

కరువు అనుకోకుండా వచ్చే సునామీ కాదు. అయినా సరే ప్రభుత్వం కరువును ఓ ప్రకృతి వైపరీత్యంగానే చూస్తున్నది. కేంద్రం రాష్ర్టాలకు కేటాయించే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద ఇచ్చే డబ్బులనే కరువును ఎదుర్కోవడానికి ఖర్చు పెట్టాలనే నిర్దేశిస్తున్నది. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగానో, తక్కువగానో వర్షాలు కురవడం చాలా సాధారణం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా వర్షపాతం ఏటా ఓకే విధంగా ఉండదు. హెచ్చుతగ్గులుంటాయి. అలాంటి సమయంలో అనుసరించాల్సిన వ్యూహం సిద్ధంగా ఉండాలి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల కరువు వస్తుందనేది అందరూ నమ్మే మాట. కానీ వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి దీర్ఘకాలిక వ్యూహాలు అనుసరించకపోవడం వల్ల మాత్రమే కరువు వస్తుంది. ఈ విషయంలో ఇప్పటివరకు అటు కేంద్ర స్థాయిలో గానీ, ఇటు రాష్ట్ర స్థాయిలో గానీ పాలకులు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకుపోలేదు. పాలకుల దృష్టిలోపం వల్ల వచ్చే కరువును ప్రకృతి శాపంగా చిత్రీకరిస్తున్నారు. నిజంగా కరువు ప్రకృతి వైపరీత్యం కాదు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్న పాలకుల నేర ఫలితం కరువు. అంతేకాదు. కరువును నిర్ధారించడానికి, కరువును ఎదుర్కోవడానికి ఇప్పుడున్న పద్ధతులు పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నాయి. 

తెలంగాణలో ఏడాదికి 907 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావా లి. వర్షాకాలంగా పరిగణించే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 713 మి.మీ. వర్షపాతం ఉండాలి. కానీ ఈ ఏడాది 611 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 984 మి.మీ.కు 805 మి.మీ., ఖమ్మంలో 875 మి.మీ.కు 977 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో ఆ జిల్లాలు కరువు జాబితాలో లేవు. మిగతా ఎనిమిది జిల్లాలు కరువు జిల్లాలే. అయితే ఈ జిల్లాల్లో కూడా కొన్ని మండలాల్లో వర్షపాతం తక్కువగా, మరికొన్ని మండలాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. దాని ఆధారంగా కరువు మండలాల జాబితా తయారైంది. ఇది కూడా ఓ అశాస్త్రీయ పద్ధతే. వర్షపాతాన్ని లెక్కకట్టే సమయంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పడిన వర్షం మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. ఈ సారి జూన్ మొదటి వారంలో బాగానే వానలు పడ్డాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ఎంతో పెట్టుబడి పెట్టి పంటలు వేశారు. కానీ జూలై, ఆగస్టులలో అసలు వానలే లేవు. దీంతో ఆ పంటలు ఎండిపోయాయి. కానీ సెప్టెంబర్ మధ్య నుంచి మళ్లీ వానలు జోరందుకున్నాయి. వర్షపాతం లెక్కల్లో ఆ వాన చుక్కలు కలిశాయి కానీ పంటలకు ఉపయోగపడలేదు. లెక్క ప్రకారం చూస్తే వర్షపాతం బాగానే ఉన్నట్లు నమోదైన మండలాల్లో నిజంగా కరువు పరిస్థితులుండానికి కారణం ఇదే.

వర్షపాతంతో పాటు పంటలు వేసిన వ్యవసాయ భూమి యాభై శాతం కన్నా తక్కువగా ఉండటం, పంట దిగుబడి 33 శాతం తగ్గడం, వరుసగా 21 రోజుల పాటు వర్షాలు పడకుండా ఉండటం, పంటలో పచ్చదనం, భూమిలో తేమ శాతం తదితర లెక్కలతో కరువును నిర్ధారిస్తారు. వీటన్నింటిలో ప్రధానమైనది వర్షపాతం తక్కువగా ఉండటమే. వర్షపాతం లెక్కులు వేయడంలోనే అసలు లోపముంది కాబట్టి, కరువు ప్రాంతాల నిర్ధారణలోనే లోపం ఉన్నది. సరే, కరువు వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఏమిటి? అనే విషయంలో కూడా ప్రభుత్వానికి స్థిరమైన అవగాహనే ఉన్నది. కరువు వల్ల పంటలు పండవు. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ప్రజలకు మంచినీళ్ల సమస్య ఏర్పడుతుంది. పశువులకు మేత దొరకదు. కూలీలకు పని దొరకదు. వీటిని ఎదుర్కోవడానికి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. మంచినీళ్ల కోసం అప్పటికప్పుడు బోర్లు వేయాలి. దేశంలో ఎక్కడ పశుగ్రాసం ఉన్నా కొనుక్కురావాలి. ఉపాధి హామీ పని దినాలు పెంచాలి. అవసరమైతే కరువు పింఛ న్లు కూడా ఇవ్వాలి.

ఇదీ ఇప్పటి వరకూ ఉన్న కరువు కార్యాచరణ. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యే మార్గదర్శకాలు, కరువును ఎదుర్కొనే మార్గాలు. మొన్నటికి మొన్న తెలంగాణలో కరువు గురించి తెలుసుకోవడానికి కేంద్ర బృందాలు వచ్చాయి. తిరిగాయి. కరువు చూశాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాలకు లోబడి కొన్ని కోరికలు కోరింది. మూడు వేల కోట్లు అడిగింది. ఇప్పటికే డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న రూ.270 కోట్ల దాకా వాడుకునే అవకాశం కల్పించడంతో పాటు, మరికొన్ని డబ్బులిచ్చి కేంద్రం చేతులు దులుపుకుంటుంది. ఆ డబ్బులకు మరికొంత జమ చేసి ఎకరాకు మూడు, నాలుగు వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుం ది. కొన్ని బోర్లు , కొంత గడ్డి కూడా వస్తుంది. అంతే తప్ప అంతకు మించి ఏమీ జరగదు. ఈ పరిస్థితిపై సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను కేంద్ర బృందానికి నిర్మొహమాటంగానే చెప్పా రు. అసలు కరవును ఎదుర్కోవడానికి అనుసరించే పద్ధతులు ఇవి కానే కాదని తేల్చిచెప్పారు. దీర్ఘకాలిక వ్యూహం కావాలని డిమాండ్ చేశారు. కేంద్రం సంగతలా ఉంచితే, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అసలు రాష్ట్రంలో కరువే ఉండకుండా చేయడానికి తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు.

నిజానికి కరువును ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో అమెరికాలోని లాస్ వెగాస్ లాంటి ప్రాంతాల్లో ఎన్నటికీ పంట పండని, భూగర్భ జలాలకు అవకాశం లేని వాతావరణం ఉంది. కానీ అక్క డి ప్రజలు తిండికోసం, నీళ్లకోసం అలమటించడం లేదు. ఎనభై ఏండ్ల కిందటే హూవర్ డ్యామ్ కట్టి బూడిద మాత్రమే ఉండే భూమిని భూతల స్వర్గంగా మార్చా రు. అలాంటి ప్రణాళిక కేంద్రం దగ్గర లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్నది. రాబోయే రెండు, మూడేళ్లలో కరువును శాశ్వతంగా పారదోలిన రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతున్నది.
వర్షపాతం తక్కువ నమోదైనా సరే, పంటలు పండటానికి ప్రాజెక్టుల రీ డిజైన్ జరుగుతున్నది. గోదావరి, కృష్ణాలపై బ్యారేజీలు వస్తున్నాయి. కోటి ఎకరాలకు నీరందించే రిజర్వాయర్లు సిద్ధమవుతున్నాయి. వర్షపు నీళ్లనే కాదు, ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లను నిల్వ చేసుకోవడానికి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు సిద్ధమవుతున్నాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. స్థానిక నీటి నిల్వలతో సంబం ధం లేకుండానే నదీ జలాలు మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికీ అందుతాయి. వర్షపాతం పెంచడానికి హరితహారం దోహదపడుతుంది. దీర్ఘకాలిక చర్యల ద్వారా ఎంతటి కరువైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందించాలి. వర్షాభావ పరిస్థితులు న్నా సరే, కరువు లేని కాలం కావాలి. తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలి.

gatika


వర్షపాతం తక్కువ నమోదైనా సరే, పంటలు పండటానికి ప్రాజెక్టుల రీ డిజైన్ జరుగుతున్నది. గోదావరి, కృష్ణాలపై బ్యారేజీలు వస్తున్నాయి. కోటి ఎకరాలకు నీరందించే రిజర్వాయర్లు సిద్ధమవుతున్నాయి. వర్షపు నీళ్లనే కాదు, ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లను నిల్వ చేసుకోవడానికి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు సిద్ధమవుతున్నాయి.భూగర్భ జలాలు పెరుగుతాయి.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!


శనివారం, డిసెంబర్ 05, 2015

హైదరాబాద్...తెలంగాణ అస్తిత్వ పతాక!

ఓవైపు బీజేపీ- తెలంగాణ వస్తే రజాకార్ల రాజ్యమవుతుందనే దుష్ప్రచారానికి ఒడిగట్టింది. అలాగే మజ్లిస్ పార్టీ కూడా- తెలంగాణ వస్తే మైనారిటీలకు రక్షణ ఉండదనే అపోహను ప్రచారంలో పెట్టింది. ఇలా బీజేపీ-మజ్లిస్ పార్టీలు నగరంలో తమ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశాయి. ఆంధ్రాధిపత్య రాజకీయాలకు తోడ్పడ్డాయి. కాబట్టి, ఆ కుతంత్రాలను ఛేదించి తెలంగాణ అస్తిత్వాన్ని నగర ప్రజల్లో పాదుకొల్పాల్సిన అవసరాన్ని ఎవరు గుర్తించినా వారిని ప్రశంసించాల్సిందే. 

srinivas


హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై అన్ని పార్టీల దృష్టి మాత్రమే కాదు, సీమాంధ్ర పత్రికలూ బాగా దృష్టిపెడుతున్నాయి.మొన్నటికి మొన్న ఓ పత్రిక రాజధానిలో దాహార్తి అంటూ ఫ్రంట్ పేజీలో ఓ స్టోరీ రాసింది. సమస్యలను ఎత్తి చూపడం పత్రికల విధి అనడంలో అనుమానం లేదు. సమస్యను భూతద్దంలో చూపడం తప్ప... ప్రభుత్వం ఆ సమస్యను ఎంత తీవ్రమైనదిగా పరిగణించి పనిచేస్తున్నదనే విషయాన్ని మరుగుపరుచడంలోనే... ఆ పత్రిక దుర్బుద్ధి మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య ఉన్నది. దాన్ని అధిగమించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి కూడా ఉన్నది. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు అందరికీ తెలిసినవే. అలాగే నగర దాహార్తిని తీర్చడానికి శాశ్వత ప్రణాళికలను గత రెండు దశాబ్దాలుగా సమైక్య పాలకులు పట్టించుకొని ఉంటే ఇవాళ నగరంలో తాగునీటి సమస్య ఉండేది కాదు. 
కానీ ఆ పత్రిక ఆ విషయాన్ని మరుగు పరిచి, ఇప్పటి ప్రభుత్వంపై నెపం నెట్టి చూపాలనే ఉద్దేశం తప్ప మరొకటి కనిపించదు. గోదావరి నీటిని నగరానికి తరలించడంలో సీఎం కేసీఆర్ కృషిని ప్రశంసించక తప్పదు. ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని నగరానికి తరలించడానికి కేంద్ర అటవీ శాఖ, రక్షణ శాఖల నుంచి ఆరు నెలల్లోనే అనుమతులు సాధించారు. యుద్ధ ప్రాతిపదికన కేసీఆర్ చేసిన పని తీరు గురించి ఆ పత్రిక ఒక్క మాట రాయకపోవడం దాని రాతల్లో దాగివున్న మర్మాన్ని తెలియజేస్తుంది. గత పాలకులు రాజధాని హైదరాబాద్‌లో సమస్యలను కావాలని వదిలేసిపోయారు. ఆ సమస్యలు వచ్చిన తెలంగాణను మరింత పీడించాలనే సమైక్య పాలకుల దురుద్దేశాల ఫలితమే నేడు నగరంలో ఉన్న నీటి సమస్య. 

ఇక తెలంగాణ మూడేళ్లలో రాబోతున్నదనగానే, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం... కరెంటు కొరతను గాలికి వదిలేసిన విషయం తెలిసిందే. కరెంటు కొరతతో... వచ్చిన తెలంగాణ... తల్లడిల్లాలనే వారి దురుద్దేశం సుస్పష్టం. ఆరు నెలలలోనే విద్యుత్ కొరతను కేసీఆర్ ప్రభుత్వం అధిగమించింది. పరిశ్రమలకు డిమాండ్ తగ్గ విద్యుత్ సరఫరా జరుగుతున్నది. చిన్న, కుటీర పరిశ్రమలు నిరాటంకంగా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. కార్మికులకు ఉద్యోగ భద్రతా పెరిగింది. హైదరాబాద్‌లో రౌండ్ ది క్లాక్ విద్యుత్ సరఫరా జరుగుతుండటం కేసీఆర్ ప్రభుత్వ పని తీరుకు ఒక నిదర్శనం.

నగరంలోని సగటు పౌరుడు ఏం కోరుకుంటాడు? శాంతి భద్రతలు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీరు, మంచిరోడ్లు, పరిశుభ్రత. పై అంశాలలో మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చిత్తశుద్ధితో పని చేస్తున్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇక ప్రధానమైనది శాంతిభద్రతల అంశం. మనకు తెలిసి నగరంలో పోలీసు వ్యవస్థ ఇంత పకడ్బందీగా గతంలో పనిచేసింది లేదు. అందుకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రాత్రి 11 దాటిందంటే, జూబ్లీహిల్స్ లాంటి వీఐపీ ప్రాంతాల్లో, అలాగే పాతనగరంలో యువకుల బైక్ రైడింగ్‌లు, కారు రైడింగ్‌లు, స్ట్రీట్ ఫైటింగ్ బెట్టింగ్‌లు, రాత్రిపూట రోడ్డుపై వెళ్లేవారి పట్ల ఈవ్ టీజింగ్‌లు జరిగేవి. ప్రజలు రాత్రిపూట బయటికి వెళ్లాలంటే కొంత జంకేవారు. గత ఏడాదిన్నరగా నగరంలో రాత్రి పూట యువకులు చేసే న్యూసెన్స్‌ను నగర పోలీసులు చాలా పకడ్బందీగా కట్టడి చేయగలిగారు. 
రాత్రిపూట రోడ్లపై వాహన రైడింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌లు, న్యూసెన్స్ సృష్టిస్తున్న యువకులను నగర పోలీసులు పట్టి, వారికి కౌన్సిలింగ్‌లు ఇప్పిస్తున్నారు. వారి తల్లిదండ్రులకు సైతం కౌన్సి లింగ్ ఇస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. పోలీసులు తమ పిల్లల ప్రవర్తనను చక్కది ద్దుతున్నందుకు తల్లిదండ్రులు సైతం సంతోషిస్తున్నారు. నగరంలో పోలీసింగ్ వ్యవస్థ పని చేస్తున్న తీరును ప్రశంసిస్తున్నారు. రోడ్లపైనా, బస్‌స్టాప్‌లలో అమ్మాయిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌లకు గురి కావడం గతంలో సర్వసాధారణం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. అవి మంచి ఫలితాలను చూపిస్తున్నాయి. ఎక్కడ పోకిరీలు తారస పడినా మహిళలు షీటీమ్‌లకు ఫోన్ చేసి చెప్పగలుగుతున్నారు. దీని వల్ల పోకిరీల ఆగడాలు నగరంలో చాలా మేరకు తగ్గాయని క్రైం రిపోర్టులే చెపుతున్నాయి. చూడడానికి ఇవన్నీ చిన్న విషయాలుగానే కనిపిస్తాయి.

ఇంత పెద్ద మహా నగరంలో సగటు మహిళకు భద్రత లేకపోతే.. దేనికి భద్రత ఉన్నట్లుగా మనం భావించాలి? నగరంలో తీవ్రవాదం ఏమూలలో దాగి ఉన్నా, దాన్ని పట్టి చట్టానికి అప్పగించడంలోనూ కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తున్నదనడానికి కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం నుంచి లభిస్తున్న ప్రశంసలే ఒక సాక్ష్యం. ఇలా నగరంలోని శాంతి భద్రతల విషయంలో, ప్రభుత్వ పని తీరు పట్ల రాజధాని ప్రజల్లో ఇంతటి సానుకూల స్పందన కనిపిస్తుంటే, ఆంధ్రా మీడియాకు మాత్రం అవేవీ కనిపించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.
హైదరాబాద్‌లో ఆంధ్రాప్రాంత ప్రజలు కేసీఆర్ ప్రభుత్వ పని తీరుపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు? అనేది కూడా కీలక ప్రశ్నే. ఉదాహరణకు గతేడాది కంటోన్మెంట్ ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. కంటోన్మెంట్‌లోనూ ఆంధ్రా ఓటర్లు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని అక్కడి ఫలితాలు కొంత మేరకు చెప్పాయి కూడా. రాష్ట్రం విభజన జరిగిపోయింది. వారు తెలంగాణ రాష్ట్రంలో బతకాలి కాబట్టి, ఇక్కడి ప్రభుత్వ పని తీరు ఆధారంగానే వారు ఓటేస్తారు తప్ప, ఆంధ్రాను ఏలుతున్న చంద్రబాబుకు ఓటేయరని కూడా ఆ ఫలితాలు రుజువు చేశాయి. ఆంధ్రాపార్టీలు గతంలో చేసిన దుష్ప్రచారాలు నిజం కావని కూడా వారు గుర్తిస్తున్నారు. తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకుంటామన్నారే గానీ ఆంధ్ర వాళ్లను వెళ్లగొడతామని ఏనాడూ అనలేదు. తెలంగాణ రాజ్యాధికారం కింద ఏ ప్రాంత ప్రజలు బతికినా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ రాజ్యాధికారానికి కన్నం వేయాలనుకున్న శక్తుల పట్ల మాత్రమే తెలంగాణ అప్రమత్తంగా ఉంటుందని గమనించాలి. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో బతుకుతున్న ఆంధ్రా ప్రజలు ఇప్పటికే బాగా అర్థంచేసుకున్నారు.

కాబట్టే, కేసీఆర్ ప్రభుత్వం పట్ల గుడ్డి వ్యతిరేకత కన్నా, కేసీఆర్ పని తీరును వారు గమనిస్తున్నారు.


సమైక్య పాలనలో మతవాదం, తీవ్రవాదాలకు హైదరాబాద్ కేంద్రమనే పేరు ఉంది. నగరాన్ని ఆంధ్రాధిపత్య, మతోన్మాదాధిపత్య రాజకీయాల నుంచి సగటు తెలంగాణ అస్తిత్వం వైపు మళ్లించాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించి పని చేస్తున్నారు. హైదరాబాద్‌ను ఒక శాంతి కాముక నగరంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. నగరంలో 30 శాతంపైగా ఉన్న మైనారిటీలున్నారు. మజ్లిస్ లాంటి రాజకీయపార్టీల మనుగడకు మైనారిటీలే బలమైన ఓటు బ్యాంకుగా పని చేస్తూ వస్తున్నారు. అలాంటి మజ్లిస్ పార్టీతో టీఆర్‌ఎస్ సాన్నిహిత్యాన్ని నెరపడమంటే, అది మత రాజకీయాలను ప్రోత్సహించడమని కొందరు అపోహపడవచ్చు.

కానీ మైనారిటీలనూ జనజీవన రాజకీయాల వైపు మళ్లించాల్సిన అవసరాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఉదాహరణకు గతంలో మజ్లిస్‌తో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలూ స్నేహం చేశాయి. రాజకీయ లబ్ధిని మూటగట్టుకున్నాయి. కానీ మైనారిటీల సంక్షేమంలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాయి. కానీ కేసీఆర్ మైనారిటీలను మతం ఆధారంగానే చూడకుండా వారిలో ప్రాంత భావాన్ని పెంపొందించి తెలంగాణ జనజీవనంలో మమేకం చేయాలనుకుంటున్నారు. నిజానికి అదొక అభ్యుదయం. నగర రాజకీయాలలో అభ్యుదయ ఆలోచనా విధానాలు పెంపొందించాల్సిన బాధ్యతను గతంలో కాంగ్రెస్‌గానీ, టీడీపీగానీ గుర్తించలేదు. సరికదా మత రాజకీయాలతో ఆటలాడుకున్నాయి. తమ పబ్బం గడుపుకున్నాయి.

ఆ రెండు పార్టీల బాధ్యతారాహిత్యంతోనే హైదరాబాద్ నగర రాజకీయాలు మతాల చుట్టూ, ఉన్మాదాల చుట్టూ, ఆంధ్రాధిపత్యాల చుట్టూ తిరిగాయి. దానితో తెలంగాణ అస్తిత్వం నుంచి హైదరాబాద్‌ను వేరు చేయాలనే కుతంత్రాలను నడిపాయి. ఒకప్పుడు ఉద్యమ కాలంలో నగర ప్రజలను తెలంగాణ అస్తిత్వానికి దూరం చేసే కుతంత్రాలు జోరుగా సాగాయి. ఓవైపు బీజేపీ- తెలంగాణ వస్తే రజాకార్ల రాజ్యమవుతుందనే దుష్ప్రచారానికి ఒడిగట్టింది. అలాగే మజ్లిస్ పార్టీ కూడా- తెలంగాణ వస్తే మైనారిటీలకు రక్షణ ఉండదనే అపోహను ప్రచారంలో పెట్టిం ది. ఇలా బీజేపీ-మజ్లిస్ పార్టీలు నగరంలో తమ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశాయి. ఆంధ్రాధిపత్య రాజకీయాలకు తోడ్పడ్డాయి. కాబట్టి, ఆ కుతంత్రాలను ఛేదించి తెలంగాణ అస్తిత్వాన్ని నగర ప్రజల్లో పాదుకొల్పాల్సిన అవసరాన్ని ఎవరు గుర్తించినా వారిని ప్రశంసించాల్సిందే. అందుకే నగర రాజకీయాలను తెలంగాణ అస్తిత్వం వైపు మలుపు తిప్పుతున్న కేసీఆర్‌ను అభినందించక తప్పదు. కాబట్టి, హైదరాబాద్‌పైనా అస్తిత్వ పతాక ఎగరడానికి ఉన్న అవకాశాలను ఎవరైనా ఎలా కాదనగలరు?



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


గురువారం, డిసెంబర్ 03, 2015

తెలంగాణ అమరవీరా...శ్రీకాంత్ చారీ...నీకు జోహార్... జోహార్...!!

(నేడు శ్రీకాంత చారి వర్ధంతి)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగధనులు ఎందరో. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతచారి మరణం యావత్ దేశాన్ని ఆలోచింపజేసింది. తెలంగాణ ఉద్యమం అనగానే మొదట గుర్తుకొచ్చేది అమరుల త్యాగం. ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరుగని విధంగా తెలంగాణ ప్రాంత విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయం. అరవై ఏళ్ల వివక్షకు చరమగీతం పాడుతూ స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.

2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్న ఉద్యమనేత కేసీఆర్‌ను పోలీసులు కరీంనగర్ జిల్లా అల్గునూర్ వద్ద అరెస్టు చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ భగ్గుమన్నది.ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తా ఉద్యమ కాగడా అయ్యింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జై తెలంగాణ నినాదం చేస్తూ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీకాంతచారి భగభగమండిపోయిండు. ఉద్యమ మిత్రులు మంటలార్పేలోపే తీవ్ర గాయాలతో కుప్ప కూలి పోయాడు. ఆస్పత్రిలో అయిదు రోజులు చికిత్సపొందుతూ శ్రీకాంతచారి.. నన్ను బతికించినా మళ్లీ తెలంగాణ కోసం సచ్చిపోతా అంటూ వీరమరణం పొందినాడు. శ్రీకాంతచారి త్యాగం యావత్ తెలంగాణ ప్రాంతాన్ని ఆలోచింపజేసింది. సకల జనులను, సబ్బండ వర్ణాలను రోడ్లపైకి తెచ్చింది. సీమాంధ్ర పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, బంద్‌లతో తెలంగాణ ప్రాంతం అట్టుడుకిపోయింది. 

నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామంలో పుట్టిన శ్రీకాంతచారి ఫిజియోథెరపి కోర్సును చదువుతూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనే వాడు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రాష్ట్రసాధనోద్యమానికి వెన్నుదన్నుగా ఉండేవాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న శ్రీకాంతచారి రాష్ట్ర సాధన కోసం హిమాలయాలంత త్యాగం చేశాడు. శ్రీకాంతచారి తెగింపు, త్యాగం తెలంగాణ ప్రజలకు వేగు చుక్కై దారి చూపింది. శ్రీకాంతచారి మన మధ్య లేకున్నా అతని ఆశయం నెరవేరి మన కళ్లముందే కదలాడుతున్నది. శ్రీకాంతచారి ఆశయాల ప్రేమికులుగా బంగారు తెలంగాణ సాధనలో మనమంతా నిమగ్నం కావడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. 



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!