గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 15, 2014

అనారోగ్యశ్రీకి చికిత్స కావాలి!

-సదుపాయాల కల్పనే సరైన మందు
-జనంలో నమ్మకం పెంచాలన్న నిపుణులు
-కొద్దిపాటి నిధులతో ఏడు వైద్య కళాశాలలు
-ఇబ్బందులు తీర్చితే ప్రైవేటుకు దీటుగా సేవలు
-ఉదాహరణగా నిలిచిన కరీంనగర్
ఒకనాడు కార్పొరేట్ ఆస్పత్రులు లేవు. స్థానిక వైద్యులు, లేదంటే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులే మొత్తం ప్రజారోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రభుత్వాస్పత్రుల్లోనే చికిత్స చేయించుకునేవారు. కానీ ఈ రోజు పరిస్థితివేరు. ఒకప్పుడు అందరికీ వైద్యం అందించిన సర్కారీ దవాఖానల్లో ఇప్పుడు వైద్యం అందుబాటులో లేకుండాపోయింది! కనీస వసతులు మృగ్యమయ్యాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పోనీ ప్రైవేటు వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులకంటే గొప్పా? అంటే అదేమీకాదు! కేవలం మౌలిక వసతులు, ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులో లేకపోవడం వల్లే ప్రభుత్వాస్పత్రులు కునారిల్లుతున్నాయి. తగినన్ని ఆస్పత్రులు, వాటిలో అవసరమైన వసతులు కల్పిస్తే ప్రజల్లో ప్రజావైద్యం మీద నమ్మకం పునరుద్ధరించవచ్చు. ఇది అసాధ్యం కూడా కాదు. కరీంనగర్‌లో స్మితా సబర్వాల్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో ఆస్పత్రుల్లో వసతులపై దృష్టి పెట్టి గణనీయ ప్రగతి సాధించారు. జిల్లాలో ప్రతి కాన్పునూ ప్రభుత్వాస్పత్రిలోనే చేయించి రికార్డు సాధించారు. కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించాలనేది ఆరోగ్యరంగ నిపుణుల సూచన!
ఆరోగ్యశ్రీ విషయం ఎలా ఉన్నా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బాగా విస్తరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రభుత్వరంగంలో మెరుగైన వైద్యం అందడం లేదనే కారణంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యానికి లక్షలు పోస్తూ అప్పులపాలవుతున్నారు. కొన్ని రకాల జబ్బులు వచ్చినపుడు కుటుంబాల ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై ధీమా లేకపోవడంతోపాటు అన్ని రకాల వైద్య సేవలు సర్కారీ దవాఖానల్లో లేకపోవడం కూడా జనం ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టటానికి మరో కారణం. ఫలితంగా కార్పొరేట్ ఆస్పత్రులు కోట్ల రూపాయలు ప్రజలనుంచి పిండుకుంటున్నాయి. పేద మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోయి వారి జీవితాలు దశాబ్దాలు వెనక్కి పోతున్నాయి.

stethascopఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ పథకానికి జనం ఆకర్షితులయ్యారు. ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతున్నదన్న భావన వారిలో నెలకొంది. ఇదే కారణంతో అనేక మంది అర్హత లేకపోయినా తెల్ల రేషన్ కార్డులకు ఎగబడ్డారు కూడా. అయితే.. చాలా తక్కువ మందికి.. తక్కువ వ్యాధులకు మాత్రమే పనికి వచ్చే ఒక పథకం పేరుతో యావత్ రాష్ట్రానికి, సకల సమస్యలకు పరిష్కారం చూపే ప్రభుత్వ వైద్య రంగాన్ని బలి చేశారన్నది మాత్రం వాస్తవం. ఆరోగ్యశ్రీ పథకానికి ఏటా వెచ్చించే మొత్తంలో కొంత భాగాన్ని వినియోగిస్తే జిల్లాకో గొప్ప ఆస్పత్రి కట్టి.. పేద ప్రజలందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంది.
రూ.500 కోట్లు వెచ్చిస్తే ఏడు వైద్యకళాశాలలు...

తెలంగాణలో ఇపుడు కేవలం ఐదు వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వైద్యకళాశాలలు విస్తరించాలన్న జ్ఞానం గత ఉమ్మడి రాష్ట్ర పాలకులకు లేక పోయింది. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో, ఎంజీఎం మెడికల్ కాలేజీ వరంగల్‌లో, ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్‌లో, రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్‌లో ఉన్నాయి. కాగా కరీంనగర్ జిల్లా ఆస్పత్రి పడకల సామర్థ్యం ఇప్పటికే 350గా ఉంది. కేవలం 50 పడకలు పెంచితే దీనిని మెడికల్ కాలేజీ ఆస్పత్రిగా మార్చవచ్చు. అలాగే మహబూబ్‌నగర్, కింగ్‌కోఠి, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీ ఆస్పత్రులుగా మార్చే వీలుంది.

ఒక పడక ఏర్పాటుకు సుమారు రూ.12 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన 50 పడకలకు రూ.6 కోట్లు అవసరం. వైద్య కళాశాల ఆస్పత్రిలో 15 శాతం పడకలు ఐసీయూకే కేటాయిస్తారు. ఒక ఐసీయూకు సుమారు రూ.25 లక్షలు అవుతుంది. 300 పడకల్లో 15 శాతం అంటే 45 పడకలు ఐసీయూకోసం కేటాయిస్తే, దీనికయ్యే ఖర్చు రూ.11.25 కోట్లు. ఒక్కో ఆస్పత్రికి వైద్య పరికరాల కోసం సుమారు రూ.30 కోట్లు, మెడికల్ కాలేజీ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు, ఆధునీకరణ కోసం రూ.5 కోట్లు ఖర్చవుతాయని అంచనా. 250 పడకల ఆస్పత్రిని 300 పడకల వైద్య కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడానికి అయ్యేఖర్చు రూ.62 కోట్లు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పడకలున్నాయి.

అందుకని పడకలకయ్యే ఖర్చు మినహాయిస్తే మిగతా వాటికయ్యే ఖర్చు రూ.56 కోట్లు. సంగారెడ్డి, కరీంనగర్ జిల్లా, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రులను వైద్యకళాశాలలు మార్చడానికి అయ్యే ఖర్చు రూ. 24.8 కోట్లు. 200 పకడలున్న తాండూరు, కింగ్‌కోఠీ ఆస్పత్రులను 300 పడకలుగా అప్‌గ్రేడ్ చేయడానికి అయ్యే ఖర్చు రూ.136.50 కోట్లు. కరీంనగర్ జిల్లా వైద్య కళాశాలకయ్యే ఖర్చుతో కలిపితే మొత్తం రూ.440.50 కోట్లు. అంటే కళాశాలల అనుమతులకోసం అయ్యే ఖర్చుతో కలుపుకుని రూ.500 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో 7 వైద్య కళాశాలలు కొత్తగా ఏర్పాటు చేయవచ్చు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీకి చేసిన కేటాయింపులు రూ.950 కోట్లు. అంటే అంతకు తక్కువ మొత్తంతోనే శాశ్వతంగా వైద్య సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉన్నదన్నమాట. సాధారణంగా ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి 500 పడకలను పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేస్తుంది.

పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రశంసలు ఏ స్థాయిలో ఉన్నాయో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అసలు ఆరోగ్యశ్రీ పథకాన్ని రద్దుచేయాలని గట్టిగా వాదిస్తున్నవారు కూడా ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని దశలవారీగా రద్దుచేయాలి. అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన నిధులతో ఉచితంగా సమర్థవంతమైన వైద్యసేవలు అందించాలి అని ప్రముఖ శాస్త్రవేత్త పీఎం భార్గవ తన పుస్తకం యాన్ అజెండా ఫర్ ది నేషన్ పుస్తకంలో సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ఇన్స్యురెన్స్ పథకం ప్రాథమిక ఆరోగ్యంపై కాకుండా నెట్‌వర్క్ ఆస్పత్రులపై దృష్టిపెట్టింది. దీనివల్ల వాటికే లాభం చేకూరుతుంది. ఫలితంగా ప్రాథమిక స్థాయిలో చికిత్స, నివారణ, ప్రమోషన్ సేవలపై దృష్టి ఉండదు. దీర్ఘకాలంలో ఆరోగ్యం మెరుగుదల ఉండదు. సంప్రదాయ బీమా పథకాలు ఆరోగ్యంతో పోలిస్తే తక్కువ ఫలితాలనిస్తున్నాయి. ఆరోగ్యంపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతున్నది అని ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసిన హైలెవల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ రిపోర్ట్ ఆన్ యూనివర్సల్ కవరేజ్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

అయితే ఇప్పటికిప్పుడు ఆరోగ్యశ్రీ చికిత్సలను ఆపేయలేం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత కూడా ఉంది. ఇప్పటి నుంచి స్పెషలిస్టులను తయారు చేసుకుంటే వీళ్లు అందుబాటులోకి వచ్చే సరికి మూడు, నాలుగేళ్లుపడుతుంది. అందుకని ఇప్పుడు పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీలు, మెడికల్ కాలేజీలను నడపాలి. దీంతో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుతుంది. ఇదే క్రమంలో ప్రభుత్వ స్పెషలిస్టులను ఇప్పటి నుంచి తయారు చేస్తే మూడేళ్లుపడుతుంది. వెంటనే ఆరోగ్యశ్రీని తీసేయడానికి వీలుకాదు. ప్రైవేటు భాగస్వామ్యంతో నెమ్మదిగా ప్రభుత్వ వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి.

సూక్ష్మస్థాయినుంచి పరిశీలించాలి..

తెలంగాణ ప్రభుత్వమైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ వ్యవస్థను సూక్ష్మస్థాయి నుంచి సమీక్షించాలని నిపుణులు కోరుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ పథకాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమీక్ష చేయాలని చెబుతున్నారు. ఏ ప్రభుత్వమైనా అందరికీ సమగ్రమైన వైద్యసేవలు అందించినప్పుడే ప్రజల మెప్పుపొందే అవకాశముంది. ప్రజల సొమ్ముతో ప్రైవేటు ఆస్పత్రులద్వారా కల్పించే వైద్యసేవలను తక్కువ ఖర్చుతో ఆయా ప్రాంతంలో ఉండే వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని అందిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు 30 పడకల ఆస్పత్రులను 100 పడకలకు పెంచి, జిల్లాకు ఒక వైద్యకళాశాల ఏర్పాటు చేసి, అన్ని మౌలిక వసతులు సమకూరిస్తే అందరికీ ఉచితంగా వైద్యం అందుతుందని, దీనివల్ల వైద్యవ్యవస్థలో ఇంతవరకు ఉన్న అసమతుల్యత పోయి సమతుల్యం నెలకొంటుందని నిపుణులు చెబుతున్నారు. అన్ని మౌలిక వసతులు ఉంటే వైద్యులు కూడా పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారని అంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి