గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 08, 2014

సాగర్ గుట్టు సీమాంధ్రులకెరుక...!

- హక్కులకు మించి ఆంధ్రాకు సాగర్ నీరు
- వాస్తవానికి కుడి, ఎడమకు 132.. డెల్టాకు 80 టీఎంసీలే
- ఇస్తున్నది కుడి కాల్వకు 196.. కృష్ణా డెల్టాకు 199 టీఎంసీలు
- క్రస్టుగేట్లతో 155 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీలోకి!
- ఎడమ కాల్వకు 177.. ఎస్‌ఎల్‌బీసీకి 35 టీఎంసీలు
- శ్రీశైలం నుంచి రాయలసీమకు అక్రమంగా తరలింపు
- శ్రీశైలం, సాగర్ ఖాళీ చేసి తాగునీటి పేరుతో కట్టుకథ
నీరు పల్లమెరుగు.. మేం జలాల దోపిడెరుగు అన్నట్లుగా ఉంది సీమాంధ్రుల తీరు. ప్రాజెక్టుల్లోని నీళ్లను తోడేయటం.. హక్కులకు మించి వాడేయటం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం.. చివరికి కొత్త కుట్రలు, కట్టు కథలకు తెరలేపటం వారికే చెల్లింది. శ్రీశైలం నుంచి రాయలసీమకు.. నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రాకు నీళ్లను తరలించి తమ ప్రాంత ప్రాజెక్టులు నిం పేసుకున్న సీమాంధ్రులు.. కేటాయింపులను పక్కన పెట్టి వాటాలకు మించి నీటిని వాడుకున్నారు. తాజాగా తాగునీటి పేరుతో కట్టు కథలు చెప్పి మళ్లీ దోపిడీకి తెరలేపారు. ఏటా చేసినట్లే.. తాజాగా కృష్ణా నీటిపై కట్టు కథ చెప్పి నీటి దోపిడీ చేసేస్తున్నారు.

sagar
ఆగని నీటి దోపిడీ: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి సీమాంధ్రకు నీటి దోపిడీ నిరంతరాయంగా సాగుతున్నది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు విరుద్ధంగా నీటి తరలింపు సాగుతున్నది. అక్రమంగా నీటిని తరలించి.. తాగునీటి అవసరాలంటూ మళ్లీ ఒత్తిడి చేసి నీటిని తీసుకెళ్లటం వారికే చెల్లుతున్నది. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నీటిని అడ్డగోలుగా అక్రమ పద్ధతిలో తరలించిన సీమాంధ్రులు తాజాగా తాగునీటి కోసం అదే పనిగా తీసుకెళ్తున్నారు. సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల పేరిట 7.2 టీఎంసీల నీటిని తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. గతనెల 25న 3.6 టీఎంసీలకు కృష్ణా బోర్డు నుంచి అనుమతి పొందగా, ప్రకాశం బ్యారేజీకి నీరు చేరలేదనే సాకుతో మరో వారం రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున మరో 3.6 టీఎంసీల నీటికి అనుమతి పొందారు.

దీని ప్రకారం మంగళవారం సాయంత్రంతో నీటి విడుదల గడువు ముగుస్తుండగా సోమవారం మధ్యా హ్నం వరకు 6.1 టీఎంసీల నీరు వదిలినట్లు సాగునీటి శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధాన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా 5,871 క్యూసెక్కుల నీరు వదులుతుండగా.. బుధవారం వరకు నీటి విడుదల కొనసాగే అవకాశాలున్నాయి. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 513.7 అడుగులకు (138.03 టీఎంసీలు) పడిపోయింది. 510 అడుగులు డెడ్ స్టోరేజీ కాగా మరో మూడు అడుగులు (ఐదు టీఎంసీలు) నీరు వాడుకునే వీలుంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పీ కింద 93 చెరువులు, ఎడమ కాల్వ కింద చెరువులు, రిజర్వాయర్లు నింపేందుకు 4 టీఎంసీల నీరు అవసరం. హైదరాబాద్ తాగునీటికి నిత్యం 900 క్యూసెక్కుల చొప్పున ఇస్తుండగా ఇది నిరంతరాయంగా వదలాల్సిందే. 510 అడుగులకు చేరితే ఏఎమ్మార్పీ మోటార్లు నడిచే పరిస్థితి లేదు. డెడ్‌స్టోరేజీకి తగ్గకుండా నిల్వలు కొనసాగించాల్సిన అవసరం ఉంది.

అడ్డగోలుగా నీటి తరలింపు: ఉమ్మడి రాష్ట్రంలో కాకి లెక్కలు చూపి నిరాటంకంగా సీమాంధ్రకు నీటిని తరలించారు. గత గణాంకాలు ఇవే స్పష్టం చేస్తుండగా.. 2013-14లోనూ ఇదే పరిస్థితి ఉంది. 2013, ఆగస్టు 2న కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయగా ఆగస్టు 7న డెల్టాకు నీరు విడుదల చేశారు. అప్పటికి సాగర్ నీటి మట్టం 585.04 అడుగు లు. ఆగస్టు 18 నుంచి సాగర్‌లో 590 అడుగుల మేర నీరు ఉండేలా చూశారు. ఈ నీటిలో కుడి, ఎడమ కాల్వలకు చెరో 132 టీఎంసీలు, ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు, డెల్టాకు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 152 టీఎంసీల నీరు వదలాలని బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలున్నాయి. ఈ సాకుతో ఆంధ్రాకు అడ్డగోలుగా నీటి విడుదల చేసి సాగర్‌ను ఖాళీ చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వాయర్లు నింపేసుకున్నారు.

కుడి కాల్వకు 196 టీఎంసీలు వదిలారు. హక్కుకు మించి 64 టీఎంసీలు ఎక్కువగా తీసుకున్నారు. డెల్టాకు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 199 టీఎంసీలు వెళ్లాయి. ఈ లెక్కన 47 టీఎంసీలు అదనంగా తరలించారు. క్రస్టుగేట్ల ద్వారా మరో 155 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి చేరినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రస్టుగేట్లతో కాకుండా కుడి కాల్వ, డెల్టాకు హక్కుకు మించి 111 టీఎంసీలు తీసుకెళ్లారు. అదే ఎడమ కాల్వకు 177 టీఎంసీలు వదలగా.. ఎస్‌ఎల్‌బీసీకి 35 టీఎంసీలే ఇచ్చారు.

సాగర్ నుంచి నీటి విడుదల అడ్డగోలుగా సాగటంతో డెడ్ స్టోరేజీకి చేరింది. తాజాగా తాగునీటి పేరుతో నీరు తీసుకెళ్లటంతో మన రాష్ట్ర తాగు, సాగునీటికి ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్టుకు తాగునీటి కోసం లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు అక్రమంగా నీటిని తరలించి ప్రాజెక్టును ఖాళీ చేశారు. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 834.20 అడుగులకు చేరింది. శ్రీశైలం డెడ్‌స్టోరేజీకి చేరటంతో సాగర్‌కు నీటి విడుదలకు అవకాశం లేదు. శ్రీశైలం నిల్వలను ఎస్‌ఆర్‌బీసీ ద్వారా గోరకల్లు, అవుకు, తెలుగుగంగ ద్వారా వెలుగోడు, బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్లు నింపుకోగా.. తెలుగుగంగ నుంచి అక్రమ కనెక్షన్లు ఇచ్చి కండలేరు (68.03 టీఎంసీల సామర్థ్యం), సోమశిల (73.898 టీఎంసీల సామర్థ్యం) ప్రాజెక్టులు నింపుకున్నారు.

ప్రస్తుతం కండలేరులో 15.09 టీఎంసీలు, సోమశిలలో 17.9, వెలిగొండలో 3.3 టీఎంసీల నీరు ఉంది. ఈ లెక్కన మొత్తం 36 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది. ముందస్తు వ్యూహంతో నీటి దోపిడీ చేశారు. 841 అడుగుల వరకు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటి దోపిడీ సాగింది. ఇక ప్రాజెక్టు నీటి మట్టం 834 అడుగులకు చేరటంతో పోతిరెడ్డిపాడు నుంచి ఆపేసినా.. హంద్రీనీవా ద్వారా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 834 అడుగుల నీటి మట్టం తప్పనిసరిగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

sagar2
నీటి దోపిడీ నిరంతరాయంగా సాగుతున్నది: మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి

శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్ల నుంచి ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా ఎక్కువ నీటిని తరలించటం నిరంతరాయంగా సాగుతున్నది. ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పుడే తమ ప్రాంత రిజర్వాయర్లు నింపుకోవడం సీమాంధ్రుల ముందస్తు వ్యూహం. చెన్నైకి తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు పూర్వ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక చెరో 5 టీఎంసీల చొప్పున ఇస్తుండగా ఇందులో తెలంగాణ వాటా 1.7 టీఎంసీలు. అక్రమ కనెక్షను ఇచ్చిన కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు 6.6 టీఎంసీలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌కు 3.7 టీఎంసీలే ఇస్తున్నారు. వాటా మరింత పెంచుకోవాల్సి ఉంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి