గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 01, 2014

ఆంధ్రోళ్ల ఫీజులు మనమెందుకు కట్టాలె?

-ఆ సొమ్ముతో ప్రాజెక్టులు కట్టుకుంటం
-తెలంగాణ వచ్చినా టీడీపీ మారుతలేదు
-మనవారిపై బాబు కోపం పెంచుకుంటున్నాడు
-త్వరలోనే రుణమాఫీ అమలు
-నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు
-టీఆర్‌ఎస్‌లో చేరిన నిజామాబాద్, మెదక్ జిల్లా టీడీపీ, కాంగ్రెస్ నేతలు
ఇక్కడున్న ఆంధ్ర విద్యార్థులకూ తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇవ్వాలని అంటున్నారు. ఆంధ్రోళ్లకు మనమెందుకు ఫీజులు కట్టాలె. తెలంగాణ సొమ్ము తెలంగాణ బిడ్డలే తినాలె. వాళ్లకు ఇస్తే న్యాయం జరుగుతదా..? మన దగ్గర గరీబోళ్లు లేరా? మనం ఇచ్చిన హామీలు అమలుచేయాలంటే పైసలు కాపాడుకోవాలె. మావోళ్లకే మేం ఫీజులు కడుతం అంటే కేసీఆర్‌మీద తప్పు తీస్తున్నారు. వాళ్లకు ఫీజులు కడితే రూ.200 కోట్లు అయితది. ఈ సొమ్మును జుక్కల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చేందుకు ఖర్చుపెడితే మొత్తం పచ్చబడుతది. తెలంగాణ పేదరికం పోవాలనేది కేసీఆర్ తండ్లాట. ఆయన కల కూడా అదే అని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ జేడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను నమ్మిన వారంతా ఇతర పార్టీలకు రాజీనామాలు చేసి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని, తెలంగాణ వచ్చిన తరువాతైనా టీడీపీ మారుతుందనుకుంటే.. చంద్రబాబు ఇంకా తెలంగాణ ప్రజలపై కోపం పెంచుకుంటున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టి ముంచాలని, పీపీఎలను రద్దుచేసి తెలంగాణను చీకట్లో పెట్టాలని ఆయన చూస్తున్నారని మండిపడ్డారు.

harishrao

తెలంగాణలో టీడీపీ రోజురోజుకు ఖాళీ అవుతున్నదన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రతి సందర్భంలో ప్రయత్నించారని, తెలంగాణను ఆనాడు అడ్డుకున్నా.. మళ్లీ అడ్డుకుంటానని గుంటూరులో ఆయన చెప్పుకున్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారని, అసెంబ్లీలో తెలంగాణ అన్న పదమే వినిపించకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కేసీఆర్ పోరాటం, సకలజనుల సమ్మె, విద్యార్థి, యువకుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందని, వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలని తెలిపారు. కానీ చంద్రబాబు కేసీఆర్ కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ వచ్చిందన్న సంతోషం నుంచి బయటకు రాకముందే పీపీఏలను రద్దు చేయాలనే కుట్రకు బాబు తెరతీశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆయన తెలంగాణను ముంచుతున్నారని, దీనివల్ల 450 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఆంధ్రకు వెళ్లిపోతున్నదని, బాబు ఢిల్లీలో చక్రం తప్పి ఆర్డినెన్స్ తెచ్చుకున్నారని చెప్పారు. పీపీఎల రద్దు వల్ల 5వేల మెగావాట్ల విద్యుత్ కొరత వస్తుందని, ప్రస్తుతం పల్లెల్లో ఉన్న విద్యుత్ కొరతకు చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబుకు తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలన్నా కోపం, కసి, ద్వేషం ఉన్నాయని, అందుకే సీఎం కాగానే అక్కసును వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. బాబు తీరు నచ్చకే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరారని, ప్రజలంతా కేసీఆర్‌ను నమ్ముతున్నారని తెలిపారు.

కేసీఆర్‌ది మాటంటే మాటే

కేసీఆర్ ఒక మాటంటే ఆ మాట మీద ఉంటారని, మాట ప్రకారం రూ.18వేల కోట్ల రుణమాఫీ చేయబోతున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎన్నికల సందర్భంగా పంట రుణాలే మాఫీ చేస్తామని అన్నప్పటికీ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు బంగారంపై తీసుకున్న పంట రుణాలను కూడా రద్దు చేయబోతున్నామని తెలిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ అంటూ రుణమాఫీపై కాలయాపన చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో రాబోయే రెండేళ్లలో తొమ్మిది గంటలపాటు విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వెయ్యి మెగావాట్ల సోలార్, ఆరువేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయబోతున్నామని తెలిపారు.

వృద్ధులకు, వితంతువులకు రూ. వెయ్యి పెన్షన్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామన్నారు. భూమిలేని దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమితోపాటు కరెంటు, సాగునీరు కోసం బోరు, మొదటి సంవత్సరం పెట్టుబడిని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు భూ పంపిణీ పేరుతో కొండలు, గుట్టలు, రాళ్లు రాప్పలు ఇచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం సాగుకు అనుకూలమైన భూమినే ఇస్త్తుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ ఎన్నికల ముందు జరిగినట్లుగా ఎన్నికల తరువాత కూడా చేరికలు జరుగుతున్నాయని, దీనికి ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న నమ్మకమే కారణమని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలోకి రావడం అంటే ప్రభుత్వాన్ని బలోపేతం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, భూపాల్‌రెడ్డి, నర్సింహారెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మద్దునూరు, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన వేణుగోపాల్‌రావు, సుభాష్‌గౌడ్, మాణిక్యరెడ్డి, కిషన్, అనిత, గోపాల్, శంకరయ్య, జగన్, రాములు, సంజయ్, రేణుక, బాలమ్మ, నర్సింహులు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి