గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 04, 2014

ఆంధ్రా సర్కార్‌కు మరోషాక్!

-సీలేరు విద్యుత్‌లో తెలంగాణకు వాటా
-వినియోగం ప్రాతిపదికన కేటాయించాల్సిందే
-ఉత్పత్తి వివరాలు బెంగళూరుకు చెప్పాల్సిందే
-స్పష్టం చేసిన గోదావరి యాజమాన్య బోర్డు
విద్యుత్ వివాదంలో ఆంధ్రసర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గోదావరి బేసిన్‌లోని అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు, డొంకరాయిలో ఉత్పత్తవుతున్న జలవిద్యుత్‌ను ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వినియోగం ప్రాతిపదికన తెలంగాణకు కేటాయించాల్సిందేనని గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ మహేంద్రన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. విద్యుత్ రంగానికి సంబంధించి ఇప్పటిదాకా బొగ్గు ఆధారంగా ఉత్పత్తవుతున్న థర్మల్ విద్యుత్‌లో మాత్రమే తెలంగాణకు కోటాను ఆంధ్ర సర్కార్ ఇస్తూ వస్తున్నది.

తాజా ఉత్తర్వుల్లో మూడు ప్రాజెక్ట్‌లలో ఉత్పత్తవుతున్న 725 మెగావాట్ల జలవిద్యుత్‌లో 53.89శాతాన్ని తెలంగాణకు కేటాయించాలని గోదావరి రివర్ బోర్డు స్పష్టం చేసింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వివరాలను వెంటవెంటనే విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించే బెంగళూరులోని ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి పంపాలని సూచించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు అంశంపై రాద్ధాంతం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ తర్వాతనుంచి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి.

తెలంగాణకు విద్యుత్ కొరత సృష్టించడానికి ఆంధ్రా సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎన్ని కుట్రలు పన్నుతున్నా అవి క్రమంగా భగ్నమవుతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు సమంజసం కాదని కేంద్రం, విద్యుత్‌నియంత్రణ మండలి, బెంగళూరులోని సదరన్ రీజియన్ పవర్ కమిటీ ఇప్పటికే తేల్చి చెప్పాయి. అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టారు. బెంగళూరులోని సదరన్ రీజియన్ పవర్‌కమిటీ సూచనను కూడా ఖాతరు చేయలేదు. పైగా మొన్నటి వరకు తెలంగాణలో అంతర్భాగమైన లోయర్ సీలేరు ప్రాజెక్ట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తెలంగాణకు రాకుండా అడ్డుపడ్డారు. గోదావరికి ఉపనది అయిన శబరిలో సీలేరు కలుస్తుంది.

శబరి కూనవరం వద్ద గోదావరిలో కలుస్తుంది. లోయర్‌సీలేరు వద్ద దాదాపు 450మెగా వాట్ల జలవిద్యుత్ ఉత్పత్తవుతోంది. పోలవరం ముంపుగ్రామాల ఆర్డినెన్స్ అమలులోకి వచ్చిన తర్వాత లోయర్ సీలేరు విద్యుత్‌ఉత్పత్తి కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో కలిసినట్టయింది. ముంపుగ్రామాల వ్యూహంలో సీలేరు విద్యుత్‌ను ఆధీనంలోకి తీసుకునే కుట్ర దాగి ఉందని మొదటి నుంచి తెలంగాణ జలరంగనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చివరకు సీలేరును అధీనంలోకి తెచ్చుకున్న ఆంధ్ర సర్కార్ విద్యుత్ ఉత్పత్తిలో మరో తొండి మొదలు పెట్టింది.

ఎంత నీరు వాడుతుంది ఎంత విద్యుత్ ఉత్పత్తవుతుంది అనే విషయాన్ని చెప్పడంలేదు. విద్యుత్ కోసం ఎంతనీరు వాడుతున్నారు...ఎంత జలవిద్యుత్ ఉత్పత్తవుతుందో తెలపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌సెక్రెటరీ అరవింద్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ అధికారులకు, గోదావరి రివర్‌బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గోదావరి బోర్డు చైర్మన్ దీనిపై స్పందించి సీలేరు బేసిన్‌లో ఉత్పత్తయ్యే మొత్తం 725 మెగావాట్లలో తెలంగాణకు వినియోగం ఆధారంగా వాటాను కేటాయించాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి