గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 13, 2014

అందలం కోసం ఆంధ్ర కుట్రలు...!!

-అడిషనల్ ఎస్పీ పదోన్నతుల్లో అవకతవకలు
ఉమ్మడి రాష్ట్రంలో అక్రమమార్గాల్లో పదోన్నతులు పొందిన కొందరు పోలీసు అధికారులు తెలంగాణ రాష్ట్రంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. పోలీసుశాఖలో కొందరికి మేలు కలిగేలా యాక్సిలేటరీ విధానంలో పదోన్నతులు కల్పిస్తూ ఇటీవల ఆంధ్ర సర్కారు ఇచ్చిన మూడు జీవోలే ఇందుకు నిదర్శనం. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొంతమందికి యాక్సిలేటరీ పద్దతిలో పదోన్నతులు కల్పించాలంటూ ఏపీ ప్రభుత్వం ఈ జీవోలను జారీ చేసింది. అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్‌శాఖలో ఉన్న చిన్న చిన్న ఒప్పందాలను అడ్డుపెట్టుకుని అక్రమంగా పదోన్నతులు కొట్టేయాలనుకున్న ఆ అధికారుల పాచిక పారలేదు. సీనియారిటీతో సంబంధం లేకుండా ఇలా కొందరికి పదోన్నతులివ్వడాన్ని సీనియర్ అధికారులు ట్రిబ్యునల్‌లో సవాల్ చేశారు. దీంతో ట్రిబ్యునల్ ఆ జీవోల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇదీ యాక్సిలేటరీ పదోన్నతుల కథ

ఉమ్మడి రాష్ట్రంలోఆంధ్రపాలకులు తమ వారిని అందలం ఎక్కించేందుకు అడ్డగోలు విధానాలు అవలంబించారు. సీనియారిటీతో సంబంధం లేకుండా అయినవారికి పదోన్నతులు కట్టబెట్టేందుకు అప్పటి సీమాంధ్ర పాలకులు యాక్సిలేటరీ విధానం ప్రతిపాదన తెచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే ఎస్సైలు, సీఐలు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులకు సీనియార్టీతో నిమిత్తం లేకుండా పదోన్నతులు కల్పించడమే ఆ విధానం.

హైదరాబాద్ రేంజ్‌లో ఆంధ్ర పోలీసులు ఎక్కువగా ఉండడంతో 1991 నుంచి సీనియార్టీ జాబితాల తయారీకూడా పక్కన పెట్టేశారు. దాదాపు 20 ఏండ్లపాటు యాక్సిలేటరీ విధానంలో పదోన్నతులు ఇస్తూ పోయారు. దీనిపై కొందరు పోలీసులు సుప్రీంలో న్యాయపోరాటం చేయడంతో సీనియారిటీ జాబితాల తయారీకి 2014లో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్‌ఐ, సీఐ, డీఎస్పీ పదోన్నతుల జాబితా తయారుచేశారు.

పదోన్నతుల్లో ముందు.. జాబితాలో వెనుక

యాక్సిలేటరీ స్కీం కింద ఎస్సై నుంచి సీఐ, సీఐ నుంచి డీఎస్పీలుగా పదోన్నతులు పొందిన కొందరు అధికారులు సీనియార్టీ జాబితాలో వెనుకబడిపోయారు. సీనియారిటీ ప్రకారం వారికి పదోన్నతులు రావాలంటే జాబితాలో వారి ముందున్న వారందరికీ పదోన్నతులు ఇవ్వాల్సిందే. దీంతో కొందరు అధికారులు కొత్త ఎత్తువేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తమకు యాక్సిలేటరీ పదోన్నతులు ఇచ్చింది కాబట్టి ఇప్పుడూ అలాగే సీనియారిటీ జాబితాలో తమను ముందుకు జరిపి యాక్సిలేటరీ స్కీంలో పదోన్నతులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఉన్నతాధికారుల అండదండలతో జీవోలు తెచ్చుకున్నారు. 11 మందికి త్వరగా అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు ఏపీ సర్కార్ ఈ జీవోలను జారీచేసింది.
- యాక్సిలేటరీ స్కీం కింద ఎస్సై నుంచి సీఐగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులు సీనియార్టీ జాబితాలో 749, 786, 787, 788, 789 స్థానాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 4, 2014న జీవో నం139 జారీ చేస్తూ వీరిని సీనియార్టీ లిస్టులో 475(ఏ), 475(బీ), 475(సీ),475(డీ), 475(ఈ)గా చేర్చాలంటూ తెలంగాణ డీజీపీకి ఆదేశాలిచ్చింది. అంటే జీవో ప్రకారం సగం మందిని దాటేసి ఈ ఐదుగురు ముందుకు వెళ్తారన్నమాట.

- పై ఐదుగురు అధికారులే డీఎస్పీ సీనియార్టీ పదోన్నతి జాబితాలో 1789, 1824,1924, 1825, 1826 స్థానాల్లో ఉన్నారు. వీరిని 1550 (ఏ), 1550(బీ), 1550(సీ), 1550(డీ), 1550(ఈ)లో చేర్చాలంటూ జీవో నం140ని ఏపీ ప్రభుత్వం సెప్టెంబరు 4, 2014న విడుదల చేసింది. ఈ జీవోలు అమలు చేయాలని తెలంగాణ డీజీపీని ఆదేశించింది.

- మరో ఆరుగురు డీఎస్పీలు కూడా ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి జీవో తెచ్చుకున్నారు. సీనియార్టీ లిస్టులో 1751, 1786, 1821, 1905, 2048, 2076 క్రమంలో ఉన్న వీరిని 1648(ఎ), 1648(బి), 1648(సి), 1648(డి), 1648(ఇ), 1648(ఎఫ్) లో చేర్చాలంటూ ఈ ఏడాది ఆగస్టు 19న ఏపీ ప్రభుత్వం మరో జీవో ఇచ్చింది.

జీవోలపై తాత్కాలిక స్టే : ఈ జీవోలు కొంతమందికి లబ్దిచేకూర్చే విధంగా ఉన్నాయని వాటిని నిలిపివేయాలంటూ కొంతమంది పోలీసులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో ట్రిబ్యునల్ జీవోల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. 37 మందికి తెలంగాణ సర్కార్ ఇటీవల అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. ఆంధ్ర జీవోల ప్రకారం 11మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించి, 37 మందిలో కొందరిని రివర్షన్ చేయాలని సీమాంధ్ర అధికారులు కుట్ర పన్నారని తెలంగాణ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి