గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 08, 2014

వంద రోజుల్లో.. కోటి కాంతులు...!!

-మన ప్రభుత్వానికి రేపటితో సెంచరీ
-బంగారు తెలంగాణకు భరోసా..
-అడుగడుగునా తెలంగాణ ముద్ర
-ప్రతి పథకంలోనూ కొత్త పంథా..
-చరిత్ర సృష్టించిన సామాజిక సర్వే
-దేశాన్ని ఆకర్షించిన దళితులకు భూపంపిణీ..
- ప్రజలు మెచ్చిన గోల్కొండ ఉత్సవాలు
-వినూత్న పంథాలో సాగుతున్న కేసీఆర్ పాలన
సమగ్ర సర్వే సాధ్యమా? చేయగలరా? అనే సందేహాలు, ప్రశ్నలను పటాపంచలు చేస్తూ 99% వివరాలు ఒకే రోజున సేకరించడం అపూర్వం. తెలంగాణ సమాజం సంఘటిత శక్తిని ఆగస్టు 19న జరిగిన సమగ్ర సర్వే చాటి చెప్పింది.

ప్రతిష్ఠాత్మక పథకాలు

- గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవం
- సమగ్ర ఇంటింటి సర్వే
- దళితులకు మూడెకరాల భూమి పంపిణీ
- మన ఊరు-మన ప్రణాళిక
- బడ్జెట్ రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్ కమిటీ
- తెలంగాణ వాటర్ గ్రిడ్ నిర్ణయం
- సింగిల్ విండోతో కొత్త పారిశ్రామిక విధానం
- కోట్ల మొక్కలతో హరితహారం పథకం
- వైఫై, 4జీ నగరంగా హైదరాబాద్
- పరిశ్రమల ఏర్పాటుకు 5 లక్షల ఎకరాల ల్యాండ్‌బ్యాంక్
అరవై ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉద్యమ రథసారథి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రేపటికి వందరోజుల పాలన పూర్తి చేసుకుంటున్నది. ఈ స్వల్పవ్యవధిలోనే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పథకాలు, అమలు చేసిన అంశాలు తెలంగాణ పాలనలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ప్రతి నిర్ణయంలోనూ నవ్యత, నాణ్యత, తెలంగాణ ముద్ర ఉట్టిపడింది. ఆరు దశాబ్దాల వలస పాలనలో ఏసీ గదులకే పరిమితమైన పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లి పథకాల అమలులో ప్రజలను భాగస్వాములను చేయడం టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన తొలి విజయం.

kcr-100days2ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశ ప్రధానిని సైతం ఆకర్షించింది. దేశవిదేశాల్లో ఉన్న ప్రజలంతా కదిలివచ్చి ఈ సర్వేలో పాల్గొనడం, కోట్లమంది ప్రజల వివరాలు ఒక్క రోజులో సేకరించడం ఒక చరిత్ర. ఆ అపూర్వ ఘట్టం ప్రభుత్వంపై ప్రజలకు ఎంతటి విశ్వాసం ఉందో చాటిచెప్పింది. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి నిధులు ఇవ్వడం, పీవీ జయంతి వేడుకలు అధికారికంగా జరపడం, దాశరథి పేరిట అవార్డు, వ్యవసాయ వర్సిటీకి జయశంకర్‌సార్ పేరు... ఇలా అనేక నిర్ణయాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టాయి. గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం ద్వారా చరిత్ర పొరల్లో ఎక్కడో దాగిపోయిన ఘన వైభవాన్ని వెలికితీసి తెలంగాణ కీర్తిప్రతిష్ఠలను దశదిశలా చాటి చెప్పినట్టయింది.

ఇంతకాలం పరేడ్ గ్రౌండ్‌లో, స్కూలుపిల్లలు, ప్రభుత్వాధికారుల ఆవలింతలకు పరిమితమయ్యే స్వాతంత్య్ర వేడుకలకు ఈసారి వెల్లువలా ప్రజలు తరలిరావడంతో ఆ నిర్ణయం వారినెంత ఆకర్షించిందో తేటతెల్లం చేసింది. అదే రోజున ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ కార్యక్రమం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. వందల ఏండ్లు అంధకారంలో మగ్గిన దళితులకు మూడెకరాల భూమి పంపిణీతో ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందించేందుకు తీసుకున్న నిర్ణయం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కీర్తి కిరీటంగా నిలిచింది. సచివాలయంలో అధికారుల జమాఖర్చుల వ్యవహారంగా మారిన బడ్జెట్ రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేసే మన ఊరు - మన ప్రణాళిక మరో ప్రగతిశీల కార్యక్రమం.

kcr-100daysప్రతి సమస్యకు సమూల పరిష్కారం సాధించే దిశగా ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ వాటర్‌గ్రిడ్ పథకం. రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించేందుకు సింగిల్ విండో విధానంతో కూడిన పారిశ్రామిక విధాన రూపకల్పన వినూత్న పంథాయే అని చెప్పవచ్చు. ఇక సంక్షేమ పథకాలకు వస్తే రూ.18 వేల కోట్ల భారమైనా లెక్క చేయకుండా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం, దసరానుంచి ప్రారంభం కానున్న వితంతువులు, వృద్ధులు, వికలాంగుల పింఛన్ల కార్యక్రమం, అదే సమయంలో ప్రారంభం కానున్న కల్యాణ లక్ష్మి, మైనార్టీ యువతుల వివాహానికి రూ. 51వేలు అందించే డోలీ పథకంతో పాటు త్వరలోనే బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి చెల్లింపు కూడా ఉన్నాయి.

మూస పద్ధతికి స్వస్తి..

రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పరిపాలనపై తనదైన ముద్రవేస్తున్నారు. గత ప్రభుత్వాల మూస ధోరణికి స్వస్తి చెప్పి ప్రజలు ఉద్యోగులను పాలనలో భాగస్వాములు చేయడం ద్వారా సృజనాత్మకతతో ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పథకం చేపట్టినా అది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా ఉండాలన్నది సీఎం భావనగా ఉన్నది.

kcr-100days4ఈ వంద రోజుల పాలనలో కేసీఆర్ పాలనా పటిమను చాటిచెప్పిన కార్యక్రమం సమగ్ర సామాజిక సర్వే. రాష్ట్రం మొత్తం ఒకే రోజున కోట్లాది మంది ప్రజల వివరాలను వేలాది మంది ఉద్యోగులు సేకరించడం దేశ చరిత్రలోనే అరుదైన సందర్భం. అసలు సమగ్ర సర్వే సాధ్యమా? జరుగుతుందా? చేయగలరా? అనే పలు రకాలైన సందేహాలు, ప్రశ్నలను పటాపంచలు చేస్తూ 99శాతం వివరాలు ఒకే రోజున సేకరించడం అపూర్వం. తెలంగాణ సమాజం సంఘటిత శక్తిని ఆగస్టు 19న జరిగిన సమగ్ర సర్వే చాటి చెప్పింది. తర్వాత రెండవ స్థానంలో నిలిచేది దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ. స్వాతంత్య్ర దినోత్సవం రోజున గోల్కొండ కోట వేదికగా జిల్లాల నుంచి వచ్చిన భూమిలేని నిరుపేద దళిత మహిళలకు మూడు ఎకరాల భూమి పట్టాల పంపిణీ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.


kcr-100days5అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 18 వేల కోట్ల రూపాయల భారం పడుతున్నా లెక్కించకుండా చేపట్టిన రైతుల వ్యవసాయ రుణాల మాఫీ పథకం రైతులకు వరంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలోనే రుణమాఫీ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. రిజర్వు బ్యాంకు రుణాల మాఫీ కుదరదన్నా, ప్రభుత్వమే బ్యాంకులకు నగదును చెల్లిస్తుందని స్పష్టం చేసి, రుణమాఫీ అమలుకు ముందుకు వెళుతున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడానికి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందించడానికి మొదటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం మరో కీలక అంశం.


సంక్షేమ కార్యక్రమాలు

- ప్రకృతి వైపరీత్యాల నష్టానికి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ
- రైతుల వ్యవసాయ రుణాల మాఫీ
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం
- వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు 1500 పింఛన్,బీడీ కార్మికులకు వెయ్యి భృతి
- ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను ఎత్తివేత

ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసింది. అలాగే రాష్ట్ర సాధనకోసం పోరాడిన, ఉద్యమించిన వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్, బడ్జెట్ రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు ఆధునిక వాహనాలు, సిబ్బంది నియామకానికి రూ.350 కోట్ల విడుదల ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపు, తెలంగాణలోని అన్ని జిల్లాలకు మంచినీటి వసతి కల్పించాలనే సంకల్పంతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు నిర్ణయం వంటి ప్రగతిశీల నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకున్నారు.

కొత్త పారిశ్రామిక విధానం

kcr-100days3సంక్షేమ పథకాలే కాదు.. అభివృద్ధిలోనూ రాష్ర్టాన్ని పరుగులు పెట్టించాలంటే పరిశ్రమల స్థాపన అత్యవసరం. నిరుద్యోగంతో తల్లడిల్లుతున్న తెలంగాణ యువతకు ఉపాధి లభించాలి. దీనికోసం సత్వర పారిశ్రామీకరణ అవసరమెంతో ఉంది. గత ప్రభుత్వాల పాలనలో పరిశ్రమల స్థాపనలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యేవి. ప్రభుత్వ స్థాయిలో విపరీతమైన అలసత్వం జాప్యం చోటు చేసుకునేవి. వాటన్నింటికీ నూతన ప్రభుత్వం స్వస్తి పలికింది. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సులువైన విధానాన్ని అమలు చేయడానికి, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సింగిల్ విండో విధానం పాటించాలని నిర్ణయించారు.

సామాజిక న్యాయం

- దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ
- మార్కెట్ కమిటీల్లో బీసీ, దళిత, గిరిజనులకు కోటా
- దళిత, గిరిజన మైనార్టీ యువతులకు వివాహ ఆర్థిక సహాయం
- మైనార్టీ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు
- చేనేత, పవర్‌లూం కార్మికులకు రుణమాఫీ
- క్రిస్టియన్లకు 3 శాతం రిజర్వేషన్లు

దీని వల్ల అనుమతులే కాదు, అనుమతుల ఫైళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే ట్రాకింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు 5 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఇటీవలి సింగపూర్ పర్యటనలో ల్యాండ్‌బ్యాంక్ పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు పూర్తిస్థాయి వైఫై నగరంగా మార్చే యత్నాలు ప్రారంభించారు. నగరంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ నగరంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలీసు శాఖకు అధునాతన వాహనాలు కొనుగోలుకు రూ.350 కోట్లు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్‌గా రూపొందించే కార్యక్రమం చేపట్టారు.

దళిత, మైనార్టీ యువతులకు వివాహ ఆర్థిక సహాయం

దళితులు, గిరిజన, మైనార్టీ యువతుల వివాహానికి రూ.51వేల నగదును అందించాలనే మరో సంక్షేమ పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకువచ్చింది. కళ్యాణ లక్ష్మి పేరుతో పేదవర్గాల వారి వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా ఎంతో వెనకబడిన దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు ఆడ పిల్లల వివాహం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆడపిల్లల పెళ్లిలో కొంత వెసులుబాటు కలిగించేందుకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ఆయా వర్గాల యువతులకు నేరుగా వారి ఖాతాలోకే ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం చేరేలా చర్యలు తీసుకోవడం ముఖ్యమంత్రిగా కేసీఆర్ వందరోజుల్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలను, వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం వారికి ఎంతో ఊరటను ఇస్తుంది. అలాగే విద్యార్థుల స్కాలర్ షిప్‌ల కోసం ఫాస్ట్ పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది.

మనఊరు-మన ప్రణాళికః

మన ఊరు-మన ప్రణాళిక పేరుతో రాష్ట్రంలోని పల్లె పల్లె నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ప్రజల అవసరాలు, సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందించాలంటే కింది నుంచి సరైన సమాచారం రావాలని ముఖ్యమంత్రి భావించారు. గ్రామస్థాయిలోని ప్రజా ప్రతినిధులు, అధికారులను భాగస్వాములను చేసి ఏయే ప్రాంతానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఉన్న వనరులేమిటి వాటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవచ్చు.

ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలి అనే సమగ్రమైన సమాచారాన్ని తయారు చేయడానికి మన ఊరు-మన ప్రణాళిక ఉపయోగపడుతుంది. క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధుల కేటాయింపు, పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కల పెంపకమైన హరితహారం, మైనార్టీలకు రిజర్వేషన్లు, మార్కెట్ కమిటీల్లో దిళిత, గిరిజనులకు కోటా, దసరా పండుగ నుంచి హైదరాబాద్‌లో కల్లు దుకాణాల ప్రారంభానికి నిర్ణయం గీత కార్మికులకు సహాయం అందించడం సీఎం నిర్ణయాలు వందరోజుల్లో చెప్పుకోదగిన అంశాలు.

తీసుకున్ననిర్ణయాలు

- అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయానికి క్యాబినెట్ ఆమోదం.
- ఉద్యమ సమయంలో నమోదైన కేసుల ఎత్తివేతకు నిర్ణయం.
- రైతుల వ్యవసాయ రుణాల మాఫీ పథకం.
- చేనేత పవర్‌లూం కార్మికుల రుణమాఫీ.
- వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు చెల్లింపునకు నిర్ణయం.
- వికలాంగులకు 1500, బీడీ కార్మికులకు వెయ్యి భృతి
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం.
- గిరిజన తండాలు, గూడెంలను గ్రామపంచాయతీలుగా నిర్ణయం.
- ఆదుకునేందుకు హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తెరిపించాలని నిర్ణయం.
- పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం.
- ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఆమలుకు నిర్ణయం.
- రాష్ట్రంలో 20 జిల్లాల ఏర్పాటుకు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీ
- గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారికోసం కేరళ తరహా ప్యాకేజీ
- మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలివ్వాలని నిర్ణయం.
- గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం.
- గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం.
- ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రాష్ట్రస్థాయి సలహా మండలి ఏర్పాటు
- చేనేత కార్మికులు, పవర్‌లూమ్ కార్మికులకు రుణాలు మాఫీ
- చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తీర్మానం తేవాలని నిర్ణయం.
- క్రిస్టియన్లకు 3 శాతం రిజర్వేషన్లకు నిర్ణయం. చర్చిల నిర్మాణానికి స్థానికంగానే అనుమతి.

ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు

- గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ.
- విజయవంతంగా సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి
- దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ప్రారంభం.
- మన ఊరు-మన ప్రణాళిక కింద ప్రజల అభిప్రాయాల సేకరణ.
- బడ్జెట్ రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్ కమిటీ కసరత్తు.
- బతుకమ్మ, బోనాలకు రాష్ట్ర పండుగ హోదా. అధికారికంగా నిర్వహణ.
- అధికారికంగా పీవీ జన్మదిన వేడుకల నిర్వహణ
- అగ్రికల్చరల్ వర్సిటీకి జయశంకర్ పేరు, ప్రారంభం.
- ప్రకృతి వైపరీత్యాల నష్టానికి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ.
- ఆటోలు, ట్రాక్టర్ ట్రాలీలపై రవాణా పన్ను ఎత్తివేత జీవో జారీ.
- ఉద్యోగులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్.
- ఎవరెస్టు విజేతలకు నగదు బహుమతులు పంపిణీ.
- అంతర్జాతీయ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత.
- పోలీసు కమిషనరేట్లకు ఆధునిక వాహనాలు పంపిణీ.
- ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో అవకతవకలపై సీఐడీ విచారణ
- మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు.
- ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు.
- మహిళలపై దాడులు, అత్యాచారాల నివారణకు ఉన్నతాధికారులతో కమిటీ.
- పరిశ్రమల ఏర్పాటుకు 5 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు.
- వచ్చే ఏడాదికి 2800 మెగావాట్ల విద్యుత్ ప్రణాళిక.
- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ.

ప్రభుత్వ విధానాలపై నిర్ణయాలు

- పారదర్శకతకోసం టెండర్లలో సంస్కరణలు తీసుకు రావాలనే నిర్ణయం.
- సచివాలయంలో కొత్త బిజినెస్ రూల్స్ రూపొందించాలనే నిర్ణయం.
- తెలంగాణ విద్యార్థులకు ఫాస్ట్ పథకం అమలుకు నిర్ణయం.
- తెలంగాణ గ్రామాలకు తాగునీటికోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు నిర్ణయం.
- రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలపై వ్యాట్, నాలా పన్నులను రద్దు నిర్ణయం.
- సింగిల్ విండోతో కొత్త పారిశ్రామిక విధానం.
- కోట్లాది మొక్కలతో హరితహారం పథకం.
- జర్నలిస్టుల సంక్షేమానికి పదికోట్ల రూపాయలతో సంక్షేమ నిధి ఏర్పాటు.
- ఫార్మా సిటీ, సినిమా సిటీల ఏర్పాటుకు నిర్ణయం.
- దాశరథి పేరిట అవార్డు, కుమారుడికి ఉద్యోగ కల్పన.
- మార్కెట్ కమిటీల్లో బీసీ, దళిత, గిరిజనులకు కోటా.
- దళిత, గిరిజన మైనార్టీ యువతులకు వివాహ ఆర్థిక సహాయం
- హైదరాబాద్‌లో మాస్టర్ ప్లాన్ అమలుకు నిర్ణయం.
- మెట్రో రైల్‌ను 200 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయం.
- హైదరాబాద్ నగరాన్ని వైఫై, 4జీ నగరంగా తీర్చిదిద్దాలనే నిర్ణయం.
- వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ నగరాలను సమగ్రాభివృద్ధికి నిర్ణయం.
- నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో వ్యవసాయ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం.
- రవీంద్రభారతి అభివృద్ధికి రూ.కోటి
- కాళోజీ పేరిట వరంగల్‌లో స్టేడియం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి