గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 01, 2014

లెవీ విధానంపై కేంద్రం వెనక్కి?

-ఫలించిన తెలంగాణ ప్రభుత్వం కృషి
-కొత్త లేవీని వ్యతిరేకించిన హర్యానా,పంజాబ్, ఏపీ
-50:50 శాతం లేవీ వైపు కేంద్రం మొగ్గు!
భారీగా వరి పండించే రాష్ర్టాల తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం లెవీ సేకరణపై తన ప్రతిపాదనలపై కొంత వెనక్కి తగ్గే అవకాశం కనబడుతోంది. గతంలో 75 : 25 శాతం లెవీ సేకరణ విధానం ఉండేది. రైస్ మిల్లర్లు సేకరించిన 75 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చి మిగతా 25 శాతాన్ని మిల్లర్లు బహిరంగమార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. 
దీనివల్ల సబ్సిడీ బియ్యం పథకం అమలు చేసే రాష్ర్టాలకు వెసులుబాటు ఉండేది. అయితే ఈ పద్ధతిని తలకిందులు చేసి 25 : 75 శాతం లేవీ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం సమాయత్తమైంది. దీనిపై వరి పండించే రాష్ర్టాలనుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 25 : 75 శాతం వల్ల రైతులతోపాటు ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో పడుతుందని, రేషన్ బియ్యం కోసం ఇతర రాష్ర్టాలపై ఆధారపడవలిసి వస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసింది.

ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ మధ్య ప్రస్తావించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఒకే విధంగా ఉండటం, వరి సమృద్ధిగా పండే హర్యానా, పంజాబ్ వంటి రాష్ర్టాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఆ ప్రతిపాదనకు స్వల్ప మార్పులు చేసి 50 : 50 శాతం లేవీ విధానం అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించవలిసి ఉంది.

సబ్సిడీ బియ్యం పథకానికి దెబ్బ...: ఇప్పటివరకు రైస్ మిల్లర్లు సేకరించిన ధాన్యంలో 75 శాతం ఎఫ్‌సీఐకి ఇచ్చి మిగతా 25 శాతం బహిరంగమార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉండేది. దీంతో రైతుల ధాన్యానికి మద్ధతు ధర లభించడంతోపాటు, ప్రజా పంపిణీ వ్యవస్థకు సరిపడా రేషన్ బియ్యం లభించేది. అదనంగా మరో మూడు నెలల కోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని గిడ్డంగుల్లో ముందు జాగ్త్రత్తగా నిలువ ఉండేలా అధికారులు జాగ్రత్త పడేవారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విధానం వల్ల తెలంగాణ రాష్ర్టానికి సంవత్సరానికి 14 లక్షల టన్నుల కొరత ఏర్పడే అవకాశముండేది.

ప్రతిపాదనలకు వ్యవసాయశాఖ అభ్యంతరం: ఇదిలా ఉంటే రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాలశాఖ అధికారులు 2 వేల 3 వందల కేంద్రాలను ఏర్పాటుచేయాలని చేసిన ప్రతిపాదనలకు వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వరి పంట ఉత్పత్తిని అంచనా వేయలేమని, ఇటువంటి పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల ప్రతిపాదనలు సరికావని స్పష్టం చేసింది. పంటల మీద ఏ స్పష్టత లేని ఈ సమయంలో ప్రతిపాదనలు తయారు చేయవద్దని కోరింది. మరో 20 రోజుల్లో వరిసాగుపై అంచనాకు రావచ్చని, దీని ఆధారంగా ప్రతిపాదనలు తయారుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడటంతో పౌరసరఫరాలశాఖ అధికారులు తమ ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి