గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 10, 2015

ఇదంతా మా ఔదార్యమే.. మీ హక్కు కాదు..!!

పాపమని పచ్చి పులుసు వోత్తె నేతిబొట్టు లేదని లేసిలేసి ఉరికిందట అనే  సామెత తెలంగాణలో ఉన్నది. అరవై ఏళ్లుగా ఆంధ్రులు (ఆంధ్రపాలకులు, ఆంధ్ర అక్రమార్కులు) ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఈ సామెతలో ఎంత వాస్తవముందో అర్థమవుతుంది. తెలంగాణ రాష్ర్టం ఏర్ప డిన తర్వాత కూడా మొగన్ని గొట్టి మొరమొర న్నట్టే ఉంది వాళ్ల వైఖరి. అంటే భర్త భార్యను కొట్టొచ్చు కానీ, భార్య భర్తను కొట్టొద్దని అర్థం కాదు. ఎవరూ ఎవర్నీ కొట్టకూడదని. ఆడ అయినా మగ అయినా తానే ఇతరులను కొట్టి, తననే కొట్టారని ఒర్రడం లాంటిదే. ఇటీవల ఆంధ్రులు తెలంగాణ పట్ల చేస్తున్నదదే. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్ర రాజకీయులు ఇటేటు రమ్మంటే ఇళ్లంతా నాదే అన్నట్టుంది. 


గత అరవై ఏళ్లుగా తెలంగాణపై ఆంధ్ర రాజకీయులు, పెట్టుబడిదారులు సాగిస్తున్న దోపిడీని, ఆధిపత్యాన్ని సజీవంగా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నమే హైదరాబాద్‌ను గవర్నర్ పాలన కింద ఉంచమనడం. సుమారు ఐదువందల ఏళ్లుగా హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి రాజధాని. హైదరాబాద్‌లోని ప్రతి భవన నిర్మాణంలో, నగర నిర్మాణంలో తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో పాటు, చెమట ధారలున్నాయి. ఆంధ్రవాళ్ళు స్వాతంత్య్ర పూర్వం నాటికే భారతదేశంలో ఐదవ మహా నగరంగా ఉన్న భాగ్యనగరంపై కన్నేశారు. హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రతో బలవంతంగా విలీనం చేశారు. నాటినుంచి వలస పాలకులు తెలంగాణను అరవై ఏళ్ల పాటు అన్నిరంగాల్లో ధ్వంసం చేశారు. ఇది చాలదన్నట్లుగా ఉమ్మడి రాజధాని పేరుతో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ దోపిడీ కొనసాగించాలని ఆరాటపడుతున్నారు. దానికి నాయకత్వం వహించేది ఏపీ సీఎం చంద్రబాబు.


సెక్షన్ 8 పేరుతో హైదరాబాద్ నగర శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్‌కు అప్పగించాలని నానా యాగీ చేయడం తెలంగాణ రాష్ర్ట సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే. విభజన చట్టంలో సెక్షన్-8 ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అందులో ఏముందనే విషయాన్ని పరిశీలిస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అదుపుచేసే స్థితిలో లేనప్పుడు ఆ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించాల్సి ఉంటుంది. గత సంవత్సరకాలంగా ఎవరి శాంతిభద్రతలకు భంగం ఏర్పడింది? ఏ ఒక్క సంఘటన జరిగిందా? ఇక్కడ ఆంధ్ర ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అలాంటప్పుడు సెక్షన్-8 అవసరం ఎక్కడున్నది? ఆంధ్రులకు గాని, ఇతరులకు గాని ఎలాంటి నష్టం జరగకపోగా 10వ షెడ్యూల్ కింద ఉన్న సంస్థల్లో ఇప్పటికి ఆంధ్ర పెత్తనమే సాగుతుంది. 


విభజన సూత్రాలను ఉల్లంఘించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయటానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజలు, నాయకులు ఓపికతో వేచిచూస్తున్నారు. ఆంధ్ర, రాయలసీమ, జిల్లాల్లో తెలంగాణ ప్రజలు స్వల్ప సంఖ్యలో ఉన్నా వాళ్లది అక్కడ ఉండలేని పరిస్థితి. హైదరాబాద్‌లో, ఇతర తెలంగాణ జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న కోస్తాంధ్ర ఉద్యోగులు పెత్తనం కొనసాగిస్తుంటే వాళ్ల శాంతిభద్రతలకు ఏం భంగం కలిగినట్లు? ఓటుకు నోటు వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు సెక్షన్-8ని తెరపైకి తెస్తున్నారనడంలో అనుమానం లేదు. అయినంత మాత్రాన చేసిన తప్పు తప్పు కాకుండా పోతుందా? పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంతమాత్రాన ఏం నేరం చేసినా, ఎంతపెద్ద తప్పు చేసినా చూస్తూ కూర్చోవాలా? ఉమ్మడి తాత్కాలిక రాజధానిలో ఉండనిచ్చేది నేరాలు చేయడానికా? హుందాగా విచారణకు అంగీకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలె కానీ దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తే అది ఏ పాటి రాజనీతి అవుతుంది? కుటిల నీతి తప్ప.


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేంతవరకు హైదరాబాద్‌ను ముఖ్యపట్టణంగా వాడుకోవచ్చుని తెలంగాణ ప్రజలు, నాయకులు అంగీకరించడం తప్పా? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్‌పై ఏ హక్కులు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నట్లు కాదు. ఆంధ్రలో అన్ని వసతులున్న మహా నగరం లేదు కాబట్టి హైదరాబాద్‌లోని భవనాలను ఉపయోగించుకొని పాలన చేసుకోవాలని అంగీకరించినట్టు. ఇది తెలంగాణ ప్రజల, నాయకుల మంచితనానికి నిదర్శనం. ఇందుకు ఫలితంగా హైదరాబాద్‌పై మాకు హక్కు ఉందనడం ఇటేటు రమ్మంటే ఇల్లంతా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లే కదా? ఈ పాపానికి మేం ఏం చేసినా చెల్లుతుందని సీమాంధ్ర నాయకులు భావిస్తే అది చట్ట ధిక్కారమే అవుతుంది. ఎన్ని కుట్రలు చేసినా, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించినా మా మీద ఏ చర్యలూ తీసుకోవద్దని ఎదురుదాడి పేరుమీద రాజకీయాలు చేయడం మానుకొని, తప్పును ఒప్పుకొని లేదా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడమో చేయాలి. అంతేకానీ ఎదురుదాడి పేరుతో దారి, దృష్టి మళ్ళింపు రాజకీయాలు చేయడం సరైంది కాదు. నాలుగు వందల ఏళ్ల పైకాలం నుంచి, ఇప్పటికీ, ఎప్పటికీ హైదరాబాద్ తెలంగాణ ప్రజలదే. దీనిపై హక్కులన్నీ తెలంగాణ ప్రభుత్వానివే. ఓటుకు కోట్లు లాంటి అనైతిక చర్యలు శాంతిభద్రతలు ఎవరి చేతిలో ఉన్నా నేరపూరితమైనవే. నేరస్థులు శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పటికైనా హైదరాబాద్‌పై పెత్తనం చేయాలనే దురాశను వదులుకొని సీమాంధ్ర రాజకీయాలను తమ పదమూడు జిల్లాలకు పరిమితం చేసుకుంటే హైదరాబాద్‌లో ఉన్న తెలుగువాళ్లు అన్నదమ్ముల్లా కలిసే ఉంటారు.


అవును.. హైదరాబాద్ తెలంగాణ ప్రజల జాగీరే. కులీ కుతుబ్ షా, భాగమతిల ప్రేమకు చిహ్నంగా తెలంగాణ ప్రజల చెమటధారలతో నిర్మింపబడిన నాలుగు వందల ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉన్న చారిత్రక నగరం. మీకు రాజధాని లేదు కాబట్టి తాతాలికంగా ఇక్కడుండి పాలించుకొండి అన్నంత మాత్రాన మరో పదేళ్లు దోచుకోమని కాదు. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేసుకొని వెళ్ళమని. ఇంత కాలంగా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తించి పాలించిన ఆంధ్రులు తామేం చేసినా ఊరుకోవాలని, లేకుంటే తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారనడం హాస్యాస్పదం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినంతమాత్రాన నేరం చేస్తే చర్యలు తీసుకొనే హక్కు, అధికారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదా? అరవై ఏళ్లు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని హరించిన సీమాంధ్ర నాయకులు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం నవ్వులాటగానే ఉన్నది. రాజధాని తయారయ్యేవరకు తగాదాలతో ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అమరావతి దేవేంద్ర నగరం సకల సౌభాగ్యాలను, సౌకర్యాలనిచ్చే వైభవోపేత నగరం నిర్మాణం కావాలంటే దేవతల కాలమానం ప్రకారం మనుషులకు వందల సంవత్సరాలు పడుతుంది. 


ఎందుకంటే మనుషులకు పదేళ్ల కాలం దేవతలకు లిప్తకాలం కూడా కాదు. గిల్లికజ్జాలతో లిప్తకాలం కూడా వేచి చూస్తూ లడాయితో కాలయాపన చేసే ఓపిక తీరిక, తెలంగాణ వాళ్ళకు లేదు. ఎందుకంటే అరవై ఏళ్ల పోరాట ఫలితంగా వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే పనిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అనవసర తగాదాలు పెట్టుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.


సెక్షన్-10 షెడ్యూల్‌ను అడ్డుపెట్టుకొని సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లోనే పర్మినెంటుగా స్థిరపడటానికి కుట్రలు చేయడం సరైంది కాదు. దీంతో తెలంగాణ ఉద్యోగావకాశాలు దెబ్బతిని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఫలితం భంగమవుతుంది. అలాగే సెక్షన్-8 పేరుతో నేరాలు చేసి తప్పించుకోవాలని చూడటం కుట్రలో భాగమే. అందుకోసం సీమాంధ్ర నాయకులు తెలంగాణపై కుట్రలు మానుకొని తెలంగాణ జాగీరైన హైదరాబాద్ గురించి కాక తమ దేవేంద్రనగరం అయిన అమరావతి నిర్మాణం గురించి పూర్తి సమయాన్ని కేటాయిస్తే సీమాంధ్ర ప్రజలకు మేలు జరుగుతుంది. తెలంగాణ నాయకుల్లా విభజన చట్టాన్ని గౌరవించి చట్టం తన పనిని తాను చేసుకునేందుకు సహకరించడం తప్ప సీమాంధ్ర నాయకులకు మరో మార్గం లేదు. అలా చేయకుంటే చట్టం ఎలాగూ తనపని తాను చేసుకుంటూ పోతుంది. కానీ సీమాంధ్ర నాయకులను చరిత్ర క్షమించదు.


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేంతవరకు హైదరాబాద్‌ను ముఖ్య పట్టణంగా వాడుకోవచ్చుని తెలంగాణ ప్రజలు, నాయకులు అంగీకరించడం తప్పా? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే హైదరాబాద్‌పై ఏ హక్కులు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నట్లు కాదు. ఆంధ్రలో అన్ని వసతులున్న మహానగరం లేదు కాబట్టి హైదరాబాద్‌లోని భవనాలను ఉపయోగించుకొని పాలన చేసుకోవాలని అంగీకరించినట్టు. ఇది తెలంగాణ ప్రజల, నాయకుల మంచితనానికి నిదర్శనం.


వ్యాసరచయిత: కాలువ మల్లయ్య



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


8 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

ఫోటో మీదేనా ? తెలంగాణా పౌరుషం స్పష్టంగా కనిపిస్తున్నది.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నాపై వ్యక్తిగత ద్వేషం పెంచుకోకండి నీహారిక గారూ! మీరు వ్యంగ్యంగా నన్ననవలసిన పనిలేదు. ఆంధ్రులు మా సోదరులు. ఇది సత్యం. మాకోపం అంతా మాకు ద్రోహం చేసిన, చేస్తున్న, చేయాలనిచూస్తున్న ఆంధ్రపాలకులపైనే అని అర్థంచేసుకొండి! మీ పైనా నాకు ఏలాంటి కోపంగానీ, ద్వేషంగానీ లేదు.

ఇకపోతే, ఈ ఫొటో... ఏతద్వ్యాసకర్త శ్రీ కాలువ మల్లయ్యగారిది!! చక్కని వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు!

స్వస్తి.

నీహారిక చెప్పారు...

మీరు బాధితులు కనుకనే తెలంగాణా వారివెంట నిలబడ్డాను.మనకు అన్యాయం జరిగింది అని మనం భావించినపుడు అదే అన్యాయాన్ని ఎదుటివాళ్ళకు చేయకూడదు.ఇపుడు ఆంధ్రులకు అన్యాయం జరిగింది.మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు బాధితులను రెచ్చగొట్టేవిధంగా వ్రాయడం మంచిది కాదు.రాజధాని లేదు సమస్యలు చాంతాడంత ఉన్నాయి.ప్రతిపక్షం ఒకవైపు,పవన్ కళ్యాణ్ ఒకవైపు,సీ బీ ఐ ఒకవైపు సతాయిస్తుంటే తోటికోడలు నవ్విందన్న కారణంతో సెక్షన్8 ని ఎత్తుకున్నారు.ఎంతోమంది విద్యావంతులు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నారు.ప్రత్యేక హోదా రావాలి అంటే కొన్ని ప్రత్యేక కారణాలు ఉండాలి అని తెలియకుండానే కోరుతుంటారు.విడాకులిచ్చేసినాక (విభజన)ప్రత్యేక హోదా ఏమిటి ? ఎవరో ఏదో అన్నంత మాత్రాన మీకొచ్చే నష్టం ఏమీ లేదు కనుక తెలంగాణా వారు కాస్త సంయమనం పాటిస్తే మీకే మంచిది.ఆ తరువాత మీ ఇష్టం :)



మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నీహారిక గారూ!

తెలంగాణులు సంయమనం పాటించడం వల్లనే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రవాళ్ళు హాయిగా శాంతియుతంగా జీవించగలుగుతున్నారు. తెలంగాణులు అమాయకులు. కుడుమంటే పండుగ అంటారు. ఎవరైనా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు మంచివాళ్ళనుకుంటారు. లోపల ఒకటి పెట్టుకొని బయటికొకటి మాట్లాడరు! ఏదైనా అసమ్మతి ఉంటే ముఖం ముందటే చెప్పేస్తారు. పై పై మెరుగులతో మాట్లాడరు. వాళ్ళకు ప్రేమించడం తెలుసు...ద్వేషించడం తెలియదు. ఒకవేళ ద్వేషిస్తే జీవితకాలం ద్వేషిస్తారు. మొదటే క్షమాగుణం కలిగి వుంటారు. తాము చూపినది అకారణ క్షమ అని తెలిస్తేమాత్రం వాళ్ళంత కఠినులు ఉండరు. ఆ కఠినత్వం వాళ్ళు తమను మోసం చేసిన వారిపై చూపిస్తారు. అంతే కానీ, సంయమనం కోల్పోరు. వాళ్ళు సంయమనం కోల్పోయేవాళ్ళే అయితే అరవై ఏండ్లు ఆంధ్రవారిని భరించేవాళ్ళేకారు. కాబట్టి మీరు సంయమనం గురించి మమ్మల్ని హెచ్చరించనవసరంలేదు.

స్వస్తి.

hari.S.babu చెప్పారు...

ఆంధ్రావాళ్లని మీరు భరించిందేమిటి?విభజనకి ముందు సమైక్య రాష్ట్రంలో హైదరాబాదు ఆదాయం యెంతో తెలుసా? అప్పటి రాష్ట్రంలో ఉన్న రాయలసీమ,తెలంగాణ, ఆంధ్ర అనే మూడు ప్రాంతాల ఒక్కో ప్రాంతం నుంచీ యెంత వస్తుందో ఒక్క హైదరాబాదు నుంచే వాటికి దీటుగా వచ్చేది!అందుకేగా మీరు కూడా హైదరాబాదు తెలంగాణ గుండెకాయ అని దాన్ని యూటీ చెయ్యడానికి ఒప్పుకోనిది!మొహమాటం లేకుండా చెప్పాలంటే మేధావుల దగ్గిర్నుంచి చిన్నపిల్లవాడి వరకూ హైదరాబాదు ఆదాయంలో సింహభాగం ఆంధ్రా పారిశ్రామికవేత్తల నుంచీ వ్యాపారవేత్తల నుంచీ వస్తున్నదని చెప్తాడు!ఇవ్వాళ విభజన అనంతరం మీ ముఖయ్మంత్రి కూడా వాళ్ళని పొమ్మనకపోగా వాళ్ల సేవలు మాకు కావాలి అంటుండదం మీకు తెలియదా?మాకు తెలియదా?యాభయ్యేళ్ల క్రితం నిజాము కట్టిన కట్టడాల గురించి కూడా చరిత్రలు చెప్పేవాళ్లకి విభజన సమయంలో యే ప్రాంతపు ఆదాయం యెంతో లెఖ్ఖలు తెలియవా?

ఆదాయం పెంచగల సత్తా వున్నవాళ్ళు గనకనే ఇవ్వాళ్టికీ అక్కడనుంచి మీరు వాళ్లని కదిలించలేకుండా వున్నారు,అవునా కాదా?పొరపాటున మీరు తన్ని తగిలేస్తే తెలంగాణ ఆదాయంలోనే ఒక పెద్ద బొక్క పడుతుంది,అది తెలుసా మీకు?

మాటల్ని పొదుపుగా వాడటం మీకే మంచిది! ఒక మాటతో సరిపోయేచోట పదిమాటలు మాట్లాడితే ఒకమాతతో సరిపెట్టినప్పటికన్నా వాటిలో యే నాలుగో అయిదో తప్పుడు మాటలు వస్తాయేమో ఇరుక్కుపోతాం అనే వివేకంతోనన్నా తక్కువగా మాట్లాడటం నేర్చుకోండి!మీరు ఆంధ్రావాళ్లని భరించేదేమిటి?వాళ్ళు మొట్టమొదట అక్కడ అడుగుపెట్టినప్పుడు సాటి తెలంగాణ వాడయితే 10 ఇస్తాడు, వాళ్ళు ఇక్కడ భూములు కొనడానికి లిటిగేషను ఉంది గనక ఆంధ్రావాడికి అమ్మ్మితే 30 ఇస్తాడు అనే విధమైన తెలివిని అప్పటి స్థానికులు చూపించడం వల్లనే తెలంగాణా వ్యాపారవేత్తలు అప్పట్లో వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రవేశించలేకపోయారు - నిజమైన చరిత్ర చదవండి తెలుస్తుంది! అప్పట్లో ఆ పోటీని తట్టుకుని యెదిగిన మీ తెలంగాణా ప్రాంతపు పెద్దమనిషే తన జీవితానుభవాల్ని చెప్తూ "ఆంధ్రావాళ్ళు పోటీపడి భూములకి విపరీతంగా రేట్లు పెంచెయ్యడంతో మాలో చాలామంది వెనకబడి పోయారు" అని తను చూసినదాన్నే చెప్పాడు. ఇప్పటికయినా మీ అనుబవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే యెదుగుతారు తప్ప మమ్మల్ని విమర్సిస్తే లాభమేమిటి? తెల్లారి లేచి నోరు తెరిస్తే చాలు సామాన్యుల్ని మేమేమీ అనట్లేదు మమ్మల్ని దోచుకున్నవాళ్ళనే తిడుతున్నాం అని మీరు యెవరినయితే తిడుతున్నారో ఇవ్వాళ కూడా మీ ముఖ్యమంత్రీ మీరూ వాళ్ళనే నెత్తిన మోస్తున్నారు మా తెలంగాణ వృధ్ధిలోకి రావడానికి మీరే సాయం చెయ్యాలె అని - అది యెక్కుతుందా చవితిపర్రల్లాంటి మీ బుర్రలకి! పెట్టిన చేతిని కొరుకుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు?

మరోసారి మీ మాటల్ని సరిచూసుకోవడానికి ఇవ్వాళ తెలంగానలో యేమి జరుగుతుందో చెప్తాను,"నిన్నటిదాకా మా తెలంగాణాని దోచుకున్నారు అని యెవరిని తిట్టారో యెవరి దోపిడీని బూచిగా చూపించి తెలంగాణాకి వీరివల్ల జరిగిన అన్యాయానికి పర్తిగానే మేము రాష్తం విదగొట్టుకోవాలనుకున్నాము అని చెప్పారో ఇవ్వాళ్టికీ వాళ్ళు అక్కడే ఉన్నారు,ఆ దోపిడీ దారులు లేనిదే తెలంగాణా అభివృధ్ధిపధంలో పయనించదు అని నిష్కర్షగా మీ ముఖ్యమంత్రియే స్వయంగా అంగీకరించాక కూడా ఆంధ్రావాళ్ళు దుర్మార్గులని అంటున్నారంటే మరొకరు వాదించి రుజువు చెయ్యాల్సిన అవసరం లేకుండా మీ వాదన అబధ్ధమని మీరే ఒప్పుకుంటున్నట్టు" - అర్ధమయిందా?ఇవ్వాళ్టికీ మీకు రాష్ట్రపు ఆదాయం పెంచటానికి ఉపయోగపడుతున్న వాళ్ళని దొంగలని అనడం పెట్టిన చేతిని కొరకదం అనికాక మరేమని అంటారో మీరు చెప్పండి నేను వింటాను!

ఇవ్వాళ మిమ్మల్ని నిలవలో ఉంచింది వాళ్ళ కష్టమే,కావాలంటే మీ ముఖ్యమంత్రినే అడగండి?!గణాంకాలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి గనకనే హైదరాబాదు ఆదాయంలో మా వాటా మాకు పంచమని అడిగాం.సూది మొనమోపినంత కూడా ఇవ్వమన్న దుర్మార్గం మీదే! ఇప్పుడు ఇద్దరూ కలిసి చర్చించుకుని న్యాయంగా పంచుకోమని చెప్తున్న షెడ్యూలు 10లో ఉన్న వాట్ని కూడా లుంగజుట్టి లాగేసుకోవాలనుకుంటున్న అసలైన దోపిడీ మీదే!!

దాన్ని కప్పుకోవటానికి మాకు దుర్మార్గం అంటగడుతున్నారు - మోసాలతోనూ గయ్యాళితనంతోనూ అబధ్ధాలతోనూ నిర్మిస్తున్నారా తెలంగాణని!మొగుణ్ణీ కొట్టి మొగసాలకి యెక్కడం అనేది మీకే వర్తిస్తుంది,మాకు కాదు?!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

హరిబాబుగారూ!

సుదీర్ఘమైన మీ వ్యాఖ్యకు నా ధన్యవాదాలు.

మమ్మల్ని నిందిస్తూ రాసిన రాతలు మాకు ములుకుల్లాగానే వున్నాయి. మీ ఆంధ్రవాళ్ళు అభివృద్ధిచేస్తేనే మేం గొప్పవాళ్ళమైనామనే మీ అభిప్రాయం సరియైనదికాదు. ఆంధ్రావాళ్ళు తెలంగాణులకు "ఈతగింజ" ఇచ్చి, "తాటిగింజ"ను పొందారు. వారు లాభం లేకుండా ఏ పనీ చేయలేదనేది మరువకండి.

మీ ఆంధ్రావాళ్ళను మా తెలంగాణులు ఇక్కడ ఎవరినీ నొప్పించకుండా మర్యాదగా చూసుకుంటున్నాము. ఉద్యమం జరుగుతున్నప్పుడుకూడా అలాగే చూసుకున్నాము.

కాని, మీరు మాత్రం మా తిరుపతి యాత్రికులను అడ్డుకున్నారు. వారిపట్ల అమర్యాదగా ప్రవర్తించారు. మా తెలంగాణ ఆడపడుచులపై పేడ కొట్టి అవమానించారు. తెలంగాణకు చెందిన నిండుచూలాలికి కూడా వైద్యం అందకుండా చేశారు. తెలంగాణ గురించి న్యాయంగా మాట్లాడిన ఆంధ్ర ప్రజలపై దౌర్జన్యం చేశారు. ఎన్నని చెప్పాలి? ఇంత గొప్పవాళ్ళు మీ ఆంధ్రావాళ్ళు! అందుకే నేను ఈ అక్రమార్కుల గురించే చెప్పాను గానీ సామాన్య ఆంధ్ర ప్రజలను గూర్చి పల్లెత్తు మాటకూడా అనలేదని గమనించండి. అనవసరంగా ఉడుక్కోకండి. ఏదైనా...ఎవరు చేసినా... అన్యాయం అన్యాయమే..ననే విషయాన్ని మనఃపూర్వకంగా అంగీకరించండి. మీరిలా అన్నారని నాకు మీపై కోపంగానీ, ద్వేషం గానీ లేవు. మీరు మా గురించి తప్పుగా ఆలోచిస్తుండడం దురదృష్టకరం. మీకు భగవంతుడు సద్బుద్ధిని, సత్య జ్ఞానాన్నీ ప్రసాదించుగాక. స్వస్తి.

Jai Gottimukkala చెప్పారు...

@Haribabu Suranenii:

"విభజనకి ముందు సమైక్య రాష్ట్రంలో హైదరాబాదు ఆదాయం యెంతో తెలుసా? అప్పటి రాష్ట్రంలో ఉన్న రాయలసీమ,తెలంగాణ, ఆంధ్ర అనే మూడు ప్రాంతాల ఒక్కో ప్రాంతం నుంచీ యెంత వస్తుందో ఒక్క హైదరాబాదు నుంచే వాటికి దీటుగా వచ్చేది"

మీకు తెలుసా

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణా మొత్తం పన్నుల ఆదాయం 46,500 కోట్లు అయితే ఆంద్ర 46,400 కోట్లు అనగా 10 జిల్లాల తెలంగాణా (హైదరాబాద్ ఒక్కటే కాదు) 51% మాత్రమె.

"హైదరాబాదు తెలంగాణ గుండెకాయ అని దాన్ని యూటీ చెయ్యడానికి ఒప్పుకోనిది"

మా ఊరును యూటీ చేయమనడానికి పరాయి వాడెవడు? విశాఖ, బెజవాడ & తిరుపతి యూటీ చేయమని మేమంటే మీరు ఊరుకుంటారా?

"హైదరాబాదు ఆదాయంలో సింహభాగం ఆంధ్రా పారిశ్రామికవేత్తల నుంచీ వ్యాపారవేత్తల నుంచీ వస్తున్నదని"

మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకుల్, ఫేస్బుక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇంటర్గ్రాఫ్ వగైరాలు ఆంధ్రుల కంపనీలని మీద్వారా తెలుసుకొని నా జన్మ దనమ అయ్యింది :)

"పొరపాటున మీరు తన్ని తగిలేస్తే తెలంగాణ ఆదాయంలోనే ఒక పెద్ద బొక్క పడుతుంది,అది తెలుసా మీకు"

వాడు కాకపొతే ఇంకొకడు వస్తాడు అది మీకు తెలీదా తెలీనట్టు నటిస్తున్నారా?

"గణాంకాలతో సహా సాక్ష్యాలు ఉన్నాయి గనకనే హైదరాబాదు ఆదాయంలో మా వాటా మాకు పంచమని అడిగాం"

సాక్ష్యాల మాట దేవుడెరుగు కనీసం లెక్కలు చెప్పండి చూద్దాం. అయినా మీ ప్రాంత పెట్టుబడిదారులు మిమ్మల్ని వకాల్తా పుచ్చుకోమని అడిగారా లేదే? ఆదాయం మా ప్రాంతం నుండి వచ్చిందని టెక్కులు పొయెబదులు వాళ్ళను మీ రాష్ట్రానికి రమ్మనండి వస్తారేమో చూద్దాం.

నేను పొడించింది ఏమీ లేదు కానీ మా ఊరోడు లేకుంటే మీరు బతకలేరు అనే ఉత్తర ప్రఘల్భాలు చూస్తుంటే मई मर्द नहीं मेरा भाई मर्द है అన్న నానుడి గుర్తొస్తుంది!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

బాగా చెప్పారు జై గొట్టిముక్కలగారూ! ఈ విధంగానైనా అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటారేమో! స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదములు! స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి