గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 22, 2014

తెలంగాణ ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులు తెలంగాణకే...!

-రెండు రాష్ర్టాలలో సూపర్‌న్యూమరీ పోస్టులు
-ఖాళీలలోకి డిప్యూటేషన్ పద్ధతిలో సీనియర్లు
-ఉభయ రాష్ర్టాల సీఎస్‌ల భేటీలో కీలక నిర్ణయాలు!
-సామరస్యంగా, స్నేహపూర్వకంగా విభజన
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు సంబంధించిన అనేక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. రెండు రాష్ర్టాల ఉద్యోగుల మధ్య ఘర్షణను పెంచవద్దని, సామరస్య వాతావరణంలో, స్నేహపూరితంగా విభజన జరుగాలని ఇద్దరు ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆదివారం జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం ఉద్యోగుల విభజన అంశాన్ని ప్రధాన కార్యదర్శులకు అప్పచెప్పాలని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కీలకభేటీలో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఉద్యోగుల విభజనకు సంబంధించిన పలు అంశాలపైన పరస్పర అవగాహనకు వచ్చి, ఒప్పందాలపై సంతకాలు కూడా చేసినట్లు సమాచారం.
ప్రధానంగా అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి బట్వాడా చేసిన నాలుగో తరగతి, లాస్ట్‌గ్రేడ్ ఉద్యోగులను తెలంగాణ రాష్ర్టానికి బదిలీ చేసేందుకు ఏపీ సీఎస్ అంగీకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ర్టానికి రాష్ట్రస్థాయిలో 58:42 నిష్పత్తిలో ఉద్యోగులను విభజించేందుకు, 42% ఉద్యోగులను తెలంగాణకు కేటాయించేందుకు అంగీకారాలు కుదిరినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.

రెండు రాష్ర్టాలలో మిగులు ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు సూపర్‌న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసుకోవాలని అనుకున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఖాళీలు ఏర్పడినట్లయితే రెండేండ్లలో రిటైర్‌కానున్న సీనియర్ ఉద్యోగులను డిప్యూటేషన్ పద్ధతిలో మార్చుకోవడానికి ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యోగ సంఘాలు తెలియజేసిన అభ్యంతరాలన్నింటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్కార్ స్పందించినట్లు అధికారులు చెప్పారు.

ఇద్దరు ఉన్నతాధికారుల మధ్యన కుదిరిన అంగీకారాల ప్రకారమే ఫైనల్ మార్గదర్శకాలు ఉండాలని కూడా కమలనాథన్ కమిటీకి వివరించాలని ఇద్దరు పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు తుది మార్గదర్శకాలను తయారుచేసి, వాటిపైన ఇద్దరు సీఎస్‌లు సంతకాలు చేసినట్లు తెలిసింది. వీటిని కమలనాథన్ అంగీకరించిన తర్వాత వాటిని కేంద్రహోంశాఖకు పంపిస్తారు. మార్గదర్శకాలపై ప్రధాని ఆమోదముద్ర తప్పనిసరి. అందుకని ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ మొదటివారానికే పూర్తి చేయాలనే సంకల్పంతోనే ఇద్దరు ప్రధానకార్యదర్శులు వేగంగా స్పందిస్తున్నట్లు తెలుస్తున్నది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి