గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 11, 2014

కేంద్రంలో ఉన్నది "మోడీ" ప్రభుత్వమా..."చంద్రబాబు" ప్రభుత్వమా...?

తెలంగాణ ఉద్యమం ఒకటిన్నర దశాబ్దాలకు పైగా ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారే తప్ప ఎవరినీ బలితీసుకోలేదు. చిన్నచిన్న ఘటనలు తప్ప విద్వేషపూరితమైన దాడులకు పాల్పడలేదు. చూస్తుంటే కేంద్రమే ఇక్కడి ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తున్నది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలని యోచిస్తున్నట్టు అనిపిస్తున్నది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 16 రాష్ర్టాలు అవతరించాయి. ఏ రాష్ట్రమూ ఎదుర్కోని విచిత్రమైన పరిస్థితులను తెలంగాణ ఎదుర్కొంటోంది. కేంద్రం ఇప్పటివరకు ఏ రాష్ట్రంపై విధించని ఆంక్షలు తెలంగాణపై విధిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను నియంత్రించడానికి, రాష్ట్రం హక్కులపై పరిమితులు విధించడానికి కేంద్రం మునుపెన్నడూ లేనంత శ్రద్ధను కనబరుస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వానికేదో పరిపాలించడం చేతగాదన్నట్టు, ఇక్కడ శాంతిభద్రతలకు ఏదో భంగం వాటిల్లినట్టు కేంద్రం ఎందుకు భ్రమపడుతున్నదో అర్థం కాదు. తెలంగాణపై పగప్రతీకారాలతో కేంద్రం వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. ఎవరిని రక్షించడంకోసం కేంద్రం ఇంతగా ఉబలాటపడుతున్నది? ఏ అక్రమాలకు కాపలాకాయడంకోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నది? తెలంగాణ స్వేచ్ఛను పొందడం ఇష్టంలేని సీమాంధ్ర శక్తులు...కేంద్రాన్ని, రాజ్యాంగాన్ని ఇంతగా ప్రభావితం చేయగలగడం ఆశ్చర్యకరం! ఇటువంటి కుట్రలు రెండు ప్రాంతాల మధ్య కలతలు పెంచడానికి దోహదం చేస్తాయే తప్ప సమస్యలను పరిష్కరించవు.

కేంద్ర నిర్ణయం హైదరాబాద్‌లో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య మరింత ఉద్రిక్తతలను పెంచుతుంది. కేంద్రం మునుపు జరిగిన రాష్ర్టాల విభజన నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. మూడు రాష్ర్టాలు విభజించామని పదేపదే జబ్బలు చరుచుకునే బీజేపీ నాయకత్వం అప్పుడేమి చేసిందో, ఇప్పుడేమి చేస్తున్నదో ఎందుకు ఆలోచించడం లేదు? ఆంధ్ర నాయకత్వం కూడా తమ సొంత అనుభవం నుంచి కూడా పాఠాలు నేర్చుకోలేదు.

ఇక...సీమాంధ్ర పాలకులు...నాడు మద్రాసు నుంచి ఉత్త చేతులతో రైళ్లలో ఫైళ్లు వేసుకుని కర్నూలుకు వచ్చిన విషయం మరచిపోయారా? ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదని అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలచారితో అనిపించుకున్నది జ్ఞాపకం లేదా?

-ఉమ్మడి రాజధాని, ఉమ్మడి అడ్మిషన్లు, ఉమ్మడి హైకోర్టు....అన్నీ ఉమ్మడిగా ఉండే పనిఅయితే ఉమ్మడి రాష్ర్టాన్నే కొనసాగించి ఉండవచ్చుగా?
-అడ్మిషన్లలో, న్యాయస్థానాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేకదా ఇంతకాలం కొట్లాడింది!
-హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో సీమాంధ్ర ప్రభుత్వం అత్యంత పక్షపాతంతో వ్యవహరించిందనేగా తెలంగాణ గోసపెట్టింది!
-మరి ఎవరి ప్రయోజనాలకోసం ఈ ఉమ్మడి వ్యవస్థలు?
-సీమాంధ్ర సృష్టించిన ఆధిపత్య వ్యవస్థలను, అవి చేస్తున్న అన్యాయాలను కొనసాగించే పనయితే ప్రత్యేక రాష్ట్రమెందుకు?
-సీమాంధ్ర పాలనలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను సరిచేయకపోతే తెలంగాణ వచ్చి ప్రయోజనం ఏమిటి?
-సీమాంధ్ర నాయకులకు బానిసత్వం చేయడానికి అలవాటుపడిన కొంతమంది టీటీడీపీ, టీబీజేపీ నాయకత్వం పార్లమెంటులో చట్టం చేసేటప్పుడు ఏం చేశారని ఎదురు ప్రశ్నిస్తున్నారు? అవునూ మీరేం చేశారు?
-పార్లమెంటులో మీ బలంతోనే కదా చట్టం వచ్చింది?
-మీ ఒత్తిడి వల్లనే కదా ఆంక్షలు వచ్చింది?
-రాజ్యసభలో వెంకయ్యనాయుడు అడుగడుగునా అడ్డం పడుతున్నప్పుడు తెలంగాణ నాయకులుగా మీరేం చేశారు?
-మీ పార్టీ నాయకత్వాలపై మీరు ఎందుకు ఒత్తిడి తేలేకపోయారు?
-తెలంగాణకు పూర్తి స్వేచ్ఛను ఎందుకు సాధించలేకపోయారు?

(ఎందుకంటే...మీతో సహా అందరూ అప్పుడు ముందుగా స్వరాష్ట్రం గట్టునపడాలనుకున్నారు గనక! తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడమే ప్రాధాన్యం అనుకున్నారు గనక!)

-అంతమాత్రంచేత తెలంగాణపై చూపుతున్న వివక్షను ప్రశ్నించకుండా ఉంటారా? -తెలంగాణకు రావలసిన హక్కులకోసం పోరాడకుండా ఉండాలా?
-స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా (కొందరు నాయకులు) చంద్రబాబు, వెంకయ్యల పల్లవికి ఇక్కడ ఎందుకు కోరస్ పాడుతున్నారు?
-బీజేపీ నాయకత్వానికి ఏ ఒక్కపనీ ప్రారంభించకపోయినా, చంద్రబాబు ఉత్తముడుగా ఎందుకు కనిపిస్తున్నాడు?
-అనేక నిర్ణయాలు చేసి గుణాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ రాక్షసుడుగా ఎందుకు కనిపిస్తున్నాడు?
-కిషన్‌రెడ్డి, ఎర్రబెల్లి తలలపై ఏ దయ్యం కూర్చుని వారితో ఇలా మాట్లాడిస్తున్నది?

అధికారం ఒకే ఒర. అందులో రెండు కత్తులు ఇమడలేవు. పోలీసు అధికారులను నియమించేది తెలంగాణ ప్రభుత్వం. వారి జీతభత్యాలు, సర్వీసు నిబంధనలు చూసేది రాష్ట్ర ప్రభుత్వం. వారికి పోస్టింగులు ఇచ్చేది ఈ ప్రభుత్వమే. అటువంటివారిపై గవర్నర్ పెత్తనం చెలాయిస్తారంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎలా ఒప్పుకుంటారు? ఏ చట్టం ప్రకారం గవర్నర్‌కు ఈ అధికారాలను కట్టబెడుతున్నారు? కేంద్రానికి ఆ అధికారమే ఉంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలి. సర్క్యులర్లు ఎందుకు పంపుతున్నారు? ఎవరి మెప్పుకోసం ఇదంతా చేస్తున్నారు? సుదీర్ఘ స్వరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సమాజం ఇటువంటి వంకర వేషాలను చాలా చూసింది. ఈ వేషాలు చెల్లవు. హైదరాబాద్ జిల్లా తెలంగాణలో భాగమైనప్పుడు ఇక్కడ ఆస్తుల పరిరక్షణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. రెవెన్యూ అధికారాలు రాష్ర్టానివి.

గవర్నర్ ఎవరు ఆస్తుల పంచాయితీలు చేయడానికి? ఉమ్మడి రాజధాని హైదరాబాద్‍కు పరిమితం. సైబరాబాద్, రంగారెడ్డి జిల్లాలను ఎందుకు ఈ చట్రంలోకి తీసుకువస్తున్నారు? కీలక సంస్థలను కాపాడడం అంటే ఏమిటి? కీలక సంస్థలకు నిర్వచనం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఇంతటి పిల్ల చేష్టలకు దిగడం విచిత్రంగా ఉంది. తెలంగాణ ఉద్యమం ఒకటిన్నర దశాబ్దాలకు పైగా ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారే తప్ప ఎవరినీ బలితీసుకోలేదు. చిన్నచిన్న ఘటనలు తప్ప విద్వేషపూరితమైన దాడులకు పాల్పడలేదు. చూస్తుంటే కేంద్రమే ఇక్కడి ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తున్నది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలని యోచిస్తున్నట్టు అనిపిస్తున్నది.

బీజేపీ నాయకులు తెలంగాణలో ఎదగాలనుకుంటే ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాళ్లుబట్టి గుంజే ప్రయత్నం చేయడం మాని, కేంద్రం బుద్ధిని మార్చండి. తెలంగాణను ఆంధ్రతో సమానంగా చూసేట్టు ప్రభావితం చేయండి. కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ అన్న స్పృహను తెచ్చుకోండి. ఐదున్నర దశాబ్దాలు గా నష్టపోయింది తెలంగాణ అన్న విషయం మరచిపోకండి. ఈ నష్టాలకు, కష్టాలకు కారకులు సీమాంధ్ర నాయకత్వం అన్న సోయినీ విస్మరించకండి.

హైదరాబాద్ లో ఎన్ని సంస్థలు, వనరులు, వసతులు ఉన్నా, అవన్నీ సీమాంధ్ర ఆధిపత్యంలో ఉన్నాయన్న విషయమూ గుర్తుంచుకోండి. ఐఎస్‌బి, ఐఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీ.....ఇలా ఏ సంస్థ అయినా తీసుకోండి...అందులో మన ఉద్యోగులెందరో, మన పిల్లలెందరో తెలుసుకుని మాట్లాడండి. కేంద్రానికి ఈ అంశాలన్నింటిపై అవగాహన కల్పించండి. ఇక్కడ మైకుల ముందు ఆవేశపడడం చాలా తేలిక. తెలంగాణవాళ్లకు చేతకాదు, చదువురాదు, పాలించుకోవడం తెలియదు అన్న సీమాంధ్ర ఆధిపత్య శక్తులకు మీరు మైకులుగా మారకండి. తెలంగాణ ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలు పెట్టలేదు. అధికారుల కేటాయింపే జరుగలేదు. సిబ్బంది కేటాయింపుపై కూడా కమలనాథన్ కమిటీ అనంతంగా సాగదీస్తున్నది. విభజన ప్రక్రియను తొందరగా ముగించడానికి, తెలంగాణకు పూర్తి స్వేచ్ఛను సాధించడానికి మీ శక్తియుక్తులు ఉపయోగించండి.

హైదరాబాద్‌ను గవర్నర్‌గిరీ నుంచి విడిపించడానికి ప్రయత్నించండి. కేసీఆర్ ప్రభుత్వం విమర్శలకు అతీతం కాదు. నిర్మాణాత్మక విమర్శలు చేసే వాతావరణం ఎప్పుడూ ఉండాలి. కానీ తగినంత సమయం ఇవ్వకుండా నోరుపారేసుకోవడం వల్ల ఎవరికీ మేలు జరుగదు. పైగా తెలంగాణవాళ్లు ఇలాగే వాళ్లలో వాళ్లు తన్నుకుంటారు అని తోటి సోదరులు నవ్వుకునే అవకాశం ఉంది. అధికారంకోసం మనలో మనం ఎంతైనా కలహించుకుని ఉండవచ్చు, కానీ కేంద్రంతో పోరాడేటప్పుడు మనమంతా ఒక్కటే అన్న చైతన్యాన్ని అన్ని పార్టీలూ ప్రదర్శించాలి.

-కట్టా శేఖర్ రెడ్డి
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి