గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 24, 2014

ఉమ్మడి ప్రభుత్వంలో అక్రమార్కుల భూ మాయ..!

-జవహర్‌నగర్‌లో గల్లంతైన సర్కారు భూములు
-వివాదాల్లో 1500, కబ్జాలో 600 ఎకరాలు
-అధికారికంగా తేల్చిన హెచ్‌ఎండీఏ
-సమైక్య పాలనలో వేల ఎకరాలు అన్యాక్రాంతం
-నిజాం భూనిధి హారతి కర్పూరం
ఇద్దరు వ్యక్తులు ఓ భూమి విషయమై కోర్టు కెక్కారు. తీర్పు ఒకరికి అనుకూలంగా వచ్చింది. బయటకు వచ్చాక ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుకున్నారు. డబ్బులు చేతులు మార్చుకున్నారు. తర్వాత ఆ భూమిని అమ్మేసుకున్నారు. ఇంతకీ ఆ భూమి వారిద్దరిదీ కాదు. సర్కారుది.. ఆ సర్కారు సీమాంధ్ర పాలకులది.. ఆ భూమి తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ శివారులోనిది..! సమైక్య పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ భూముల దుస్థితి ఇది!
HMDA-land
సమైక్యపాలనలో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని వేలాది ఎకరాల సర్కారు భూములు హారతి కర్పూరమైపోయాయి. పాలకులే దళారుల్లాగా వేలం పాటలు పెట్టి మరీ అమ్మేశారు. మిగిలిన భూములు వారి కనుసన్నల్లో ఉండేవారు దొరికినవాడు దొరికినట్టు ఆక్రమించుకుని కోట్లు కూడబెట్టుకున్నారు. తమ భూదాహాన్ని తీర్చుకోవడానికి పాలకులు హెచ్‌ఎండీఏ వంటి సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు.

వివిధ సంస్థలు, శాఖల ఆధ్వర్యంలోని భూములన్నింటినీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెచ్చి వారి దోపిడీకి రాజమార్గం వేసుకున్నారు. వారి భూదాహానికి నిజాం రాజు ఏర్పరిచిన భూనిధి సైతం గల్లంతైంది. ఫలితంగా హెచ్‌ఎండీఏ దగ్గర ఉండాల్సిన మిగులు భూములు 4,142.53 ఎకరాల్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని కబ్జాల పాలయ్యాయోకూడా తెలియని పరిస్థితి ఉంది. ఇటీవల జరిపిన సర్వేలో ఒక్క రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లోనే హెచ్‌ఎండీఏకు చెందిన 1500 ఎకరాలు న్యాయ వివాదాల్లో, 610 ఎకరాలు కబ్జాలో ఉన్నట్లు తేలింది.

ఇవాళ స్వరాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని భూముల కబ్జాపై కొరడా ఝళిపిస్తున్నది. కోట్ల విలువైన భూములు తన అధీనంలోకి తెచ్చుకున్న హెచ్‌ఎండీఏ నిర్వాకం వల్ల ఇవాళ ఈ సంస్థకు తన అధీనంలో క్షేత్ర స్థాయిలో వివాద రహితంగా ఎన్ని భూములు ఉన్నాయో, కబ్జాలో ఎన్ని భూములున్నాయో కూడా తెలియని అయోమయం ఏర్పడింది. వీటిని కాపాడడంలో హెచ్‌ఎండీఏ పూర్తిగా విఫలమైంది.

జవహర్‌నగర్‌లో కోట్ల భూములు అన్యాక్రాంతం...

గత ఏడాది అధికారులు నిర్వహించిన సర్వేలో హెచ్‌ఎండీఏ ఆధీనంలోని ప్రభుత్వ భూముల్లో 143.37 ఎకరాల మేర మాత్రం కబ్జాకు గురైనట్లు అధికారులు తేల్చారు. రాజేంద్రనగర్ మండల పరిధిలోని బొమ్రుకొద్వాల గ్రామ పరిధిలోని సర్వేనంబరు 42లో 6.32 ఎకరాలు, షేక్‌పేటలోని హకీంపేటలో సర్వేనంబరు 102/1లో 2.05 ఎకరాలు, బండ్లగూడలో సర్వేనంబరు 261లో 1.20 ఎకరాలు, నాంపల్లి మండల పరిధిలోని డైరా, నారాయణగూడలో టీఎస్ నంబరు 1, 2, 47ల్లో మూడు గుంటల భూమి కబ్జా చెరలో ఉన్నట్లు గుర్తించారు. కానీ నేటి వరకు ఆక్రమణల తొలగింపుపై దృష్టిసారించలేదు.

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని జవహర్‌నగర్‌లో 133 ఎకరాలకు పైగా భూములు పరాధీనమైందనేది అధికారిక నిర్ధారణ. అయితే ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో వేల ఎకరాలు కబ్జా పాలైనట్టు తేలింది. ప్రత్యేకంగా జవహర్‌నగర్ భూములపై చేపట్టిన సర్వేలో హెచ్‌ఎండీఏ ఆధీనంలోని 1500 ఎకరాల భూములపై న్యాయ వివాదాలు ఉండగా, ఇందులోనూ 610 ఎకరాలకు పైగా భూములు ప్రస్తుతం కబ్జాదారుల చెరలో ఉన్నట్లు తేలింది.

ఇక్కడ ఎకరం కనిష్ఠంగా రూ.40 లక్షల ధర పలుకుతుంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏకు చెందిన రూ.600 కోట్లకు పైగా విలువైన భూములు పరాధీనంలో ఉన్నాయి. వాస్తవంగా జవహర్‌నగర్‌లోని పలు సర్వేనంబర్లలో (262 నంబర్లు) సుమారు 2350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవిన్యూ శాఖకు చెందిన ఈ భూమిని గత ప్రభుత్వాలు హెచ్‌ఎండీఏకు బదలాయించాయి. ఈ సంస్థ అధికారులు వీటినుంచి 300 ఎకరాలు రాజీవ్ స్వగృహ, సచివాలయం ఉద్యోగులకు, బిట్స్ పిలానీ, ట్రాన్స్‌కో వంటి పలు శాఖలకు కేటాయించారు. ఇవన్నీ పోగా మిగిలిన భూమి మొత్తం హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉండాలి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.

-62 సర్వేనంబర్లలోని 263.23 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఇందులో ఎలాంటి ఆక్రమణలు లేవు. నేరుగా ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనువుగా ఉంది.
-29 సర్వేనంబర్లలోని 146.35 ఎకరాల భూమి కూడా ఖాళీగానే ఉంది. ఆక్రమణలు జరగలేదు గానీ ఈ భూములపై న్యాయ స్థానాల్లో పలువురు ప్రైవేటు వ్యక్తులు కేసులు వేశారు. ప్రభుత్వ రికార్డుల్లో అవి సర్కారు భూములుగా ఉన్నా ప్రస్తుతం అవి న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి.
-మరో 51 సర్వేనంబర్లలోని 220.34 ఎకరాల భూమి పూర్తిగా వివిధ వ్యక్తుల చేతుల్లో ఉంది. క్షేత్రస్థాయిలో వాటిలో గదుల నిర్మాణం చేపట్టారు. మరికొందరు కబ్జా చేసి, తోటలు వేసుకున్నారు. ఈ భూములపై న్యాయ వివాదాలు లేవు. ప్రభుత్వ భూమి అయినప్పటికీ బహిరంగంగానే కబ్జాదారులు పొజిషన్‌లో ఉన్నారు.
-72 సర్వేనంబర్లలోని 1299.19 ఎకరాల భూములు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం కోర్టులో కేసులు ఉన్నాయి. ఇందులో 390.38 ఎకరాల మేర భూముల్లో ఆక్రమణదారులు వివిధ నిర్మాణాలు కూడా చేపట్టారు. మరికొందరు తోటలు వేసుకోగా ఇంకొందరు ఏకంగా క్రషర్ మిల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
-ఇలా స్వయానా అధికారుల క్షేత్రస్థాయి సర్వేలోనే ప్రభుత్వ భూముల పరిస్థితి ఇలా ఉందని తేలినా నేటికీ సెంటు భూమిని కూడా అధికారులు స్వాధీనం చేసుకోలేదు.

రూ.400 కోట్ల విలువైన భూములపై డ్రామా..

ఎకరం కోట్లు పలికే మియాపూర్ ప్రాంతంలోని భూములను కూడా హెచ్‌ఎండీఏ పరిరక్షించుకోలేకపోయింది. ఈ కబ్జాల వెనక ప్రజాప్రతినిధుల హస్తం ఉండటంతో అధికారులు వారికి వత్తాసు పలికి రూ.వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారు. మియాపూర్‌లోని సర్వేనంబరు 159లో 120.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అడంగల్ పహాణీలోనూ ఇది గాయెరాన్ సర్కారీ భూమిగానే వస్తుంది. ఇది రెవిన్యూ శాఖ ఆధీనంలో ఉండగా కొన్ని సంవత్సరాల కిందట ప్రభుత్వం ఇందులో 21.26 ఎకరాలను ఏపీఎస్ ఆర్టీసీకి కేటాయిస్తే ఆ సంస్థ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంది.

అదిపోగా మిగిలిన భూములను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. వీటిని పరిరక్షించాల్సిన అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారు. వాస్తవంగా ఇది ప్రభుత్వ భూమి. కానీ రెండు ప్రైవేటు సంస్థలు తెలివిగా సర్వేనంబరు 159లోని 41.26 ఎకరాల భూమి ఒకరికొకరు తమదంటూ కోర్టుకెక్కారు. అధికారులు, ప్రభుత్వాన్ని పార్టీగా పెట్టలేదు. దీంతో వాళ్ల వద్ద ఉన్న ఆధారాలను బట్టి కోర్టు కష్టజీవుల సంఘానిదే ఆ భూమి అంటూ తీర్పునిచ్చింది.

దీనిని అడ్డం పెట్టుకొని సదరు సంఘం ప్రతినిధి భూమి కబ్జా పెట్టాడు. అయినా హెచ్‌ఎండీఏ అధికారులు స్పందించి ఇది ప్రభుత్వ భూమి అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లలేదు. అయితే దీనిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశంతో 2010లో అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్ విచారణ నిర్వహించారు. రెండు ప్రైవేటు సంస్థలు కోర్టుకెక్కి తెలివిగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే విషయాన్ని గుర్తించి, కలెక్టర్‌కు నివేదించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకొని, భూమిని స్వాధీనం చేసుకోవాలని హెచ్‌ఎండీఏకు కలెక్టర్ సూచించారు. ఆ సర్వేనంబరులో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించారు. అయితే హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న కష్టజీవుల సంఘం ప్రతినిధి ఇండ్లులేని నిరుపేదలనుంచి రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేసి, ప్లాట్లు అమ్ముకుంటున్నారు. కలెక్టర్ నిషేధం ఉండడం వల్ల నోటరీ ద్వారా వాటిని అమ్ముకుంటున్నాడే గానీ ప్లాట్లు మాత్రం చూపించ లేదు.

ఒక వ్యక్తి ఎంతకీ తనకు ప్లాటు చూపకపోవడంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. కేసు విచారించిన ఫోరం అది ప్రభుత్వ భూమిగా గుర్తించి వడ్డీతో సహా బాధితుడికి మొత్తాన్ని చెల్లించాలని కష్టజీవుల సంఘాన్ని ఆదేశించింది. ఇలా ఇన్ని పరిణామాలు జరుగుతున్నా హెచ్‌ఎండీఏ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఎకరం కనీసంగా రూ.10 కోట్ల విలువ చేసే ఈ ప్రాంతంలోని రూ.400 కోట్లకు పైగా విలువైన భూమిని తమ ఆధీనంలోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గందరగోళంగా మారిన భూనిధి...

హెచ్‌ఎండీఏ చేతిలో మొదట్లో కొద్దిపాటి భూమి మాత్రమే ఉండేది. పాలకుల భూదాహానికి ఆ మాత్రం సరిపోక వివిధ శాఖలకు చెందిన భూములన్నింటీనీ ఈ సంస్థకు బదలాయించారు. ఈ ప్రక్రియను పక్కాగా నిర్వహించక పోవడంతో అంతా గందరగోళంగా మారిపోయింది. అధికారులు బదలాయింపులో నిర్లక్ష్యం వహించడం, న్యాయపరమైన కేసులను సమర్థంగా ఎదుర్కోకపోవడంతో వేలాది ఎకరాల ప్రభుత్వ భూ నిధి గందరగోళంగా తయారైంది.

గత ఏడాది హెచ్‌ఎండీఏ అధికారికంగా వెల్లడించిన వివరాలు ప్రకారం హెచ్‌ఎండీఏకు 4290.11 ఎకరాల భూములున్నాయి. అదనంగా ప్రభుత్వం రెవిన్యూ, ఇతర శాఖల నుంచి 4,548.06 ఎకరాలను బదలాయించింది. దీంతో మొత్తం 8838.17 భూములు హెచ్‌ఎండీఏకు చెందినవిగా రికార్డుల్లో నమోదైంది. ఇందులో వివిధ అవసరాలకు భూములు కేటాయించారు. 2495.04 ఎకరాల భూములను లేఅవుట్లుగా మార్చి అమ్మారు. మరో 181.10 ఎకరాలను వేలం ద్వారా నేరుగా యధాతథంగా ఎకరాల విస్తీర్ణంలో విక్రయించారు. ఇలా ప్రభుత్వానికి రూ. 2500 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అవిపోగా హెచ్‌ఎండీఏ దగ్గర 4,142.53 ఎకరాల భూములు మిగిలి ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కచ్చితంగా ఎంత భూమి అందుబాటులో ఉంది? అనేది ఇవాళ అధికారులకే తెలియదు.

కబ్జాలు.. న్యాయ వివాదాలు..

ఇక హెచ్‌ఎండీఏ నిర్వాకం వల్ల ఒక్క రంగారెడ్డి జిల్లా పరిధిలోనే వేలాది ఎకరాల భూములు పరాధీనమయ్యాయి. కొన్ని న్యాయ వివాదాల్లో చిక్కుకోగా... మరికొన్ని కళ్లముందు కబ్జాదారులు అనుభవిస్తున్నా అధికారులు నోరు మెదపడం లేదు.ఈ జిల్లాలో గూడులేని నిరుపేదలకు నీడ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా సెంటు భూమి కూడా అందుబాటులోని లేని పరిస్థితి. అలాగే ప్రజా శ్రేయస్సు కోసం వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ఈ భూములను వినియోగించాలనుకున్నా న్యాయ వివాదాలతో ముందడుగు వేయలేని స్థితి ఉంది.

ధర్మకర్త బాధ్యత మరిచిన పాలకులు..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గతంలో చెప్పినట్లు నిజాం నవాబు నుంచి వారసత్వంగా తెలంగాణకు లక్షల ఎకరాల భూములు వచ్చాయి. నిజాం వ్యక్తిగత ఆస్తులన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక ధర్మకర్తలా వ్యవహరించాల్సిన సమైక్య ప్రభుత్వాలు దళారుల పాత్ర వహించాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములను తెగనమ్మాయి. కొన్ని ప్లాట్లుగా మార్చి వేలం పెడితే మరికొన్ని ఎకరాల లెక్కల్లో విక్రయాలు చేశాయి. హెచ్‌ఎండీఏ ద్వారా వచ్చిన ఆదాయమే సుమారు రూ.2500 కోట్లకు పైగా ఉంటుంది. వచ్చిన మొత్తాన్ని న్యాయంగా ఇక్కడే వినియోగించాలి. కానీ సీమాంధ్ర పాలకులు ఇటు హైదరాబాద్, అటు తెలంగాణ బాగు కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఆ మొత్తాన్ని ఇడుపులపాయకు నాలుగు లేన్ల రహదారి,సీమాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసినట్లు స్వయానా కాగ్ నివేదికలే బట్టబయలు చేశాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి