గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, అక్టోబర్ 05, 2014

అగమ్యగోచరంగా ఏపీఈఆర్సీ...

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఉనికి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతమున్న ఏపీఈఆర్సీపై ఏపీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఏపీఈఆర్సీని కొనసాగించకుండా.. కొత్త ఈఆర్సీ ఏర్పాటు చేయడం, చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ భవానీప్రసాద్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్ణయం తీసుకోవడంపై విద్యుత్‌రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామంతో ఏపీఈఆర్సీ ఉద్యోగులు తమ భవితవ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సంస్కరణలకు ఆజ్యం పోసి 1999లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ)ని ఏర్పాటుచేసింది. 15 ఏండ్లుగా చట్టబద్దంగా పనిచేస్తున్న సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేయడం చంద్రబాబుకే చెల్లిందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజనలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే అన్ని రకాల కమిషన్లను కొత్తగా ఏర్పాటుచేసుకునే వెసలుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అన్ని రకాల కమిషన్లు (ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, పబ్లిక్‌సర్వీస్ కమిషన్, విద్యుత్‌రెగ్యులేటరీ కమిషన్ ఇతరత్రా) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించాలి. పునర్విభజన చట్టంలో ఏపీఈఆర్సీపై స్పష్టత లేదనే సాకుతో చంద్రబాబు ప్రభుత్వం ఏపీఈఆర్సీని బేఖాతర్ చేస్తూ కొత్తగా మరో ఏపీఈఆర్సీని ఏర్పాటుచేయడం గమనార్హం.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ప్రస్తుత ఏపీఈఆర్సీ ఆరు నెలలపాటు మనుగడలో ఉండే అవకాశం ఉంది. ఆ నిబంధనను సైతం ఏపీ సర్కార్ తుంగలో తొక్కింది. దీంతో ఈఆర్సీలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి సంకటంగా మారింది. ఏపీఈఆర్సీలో అధికారికంగా మంజూరు పోస్టులు (సాక్షన్ స్ట్రెంథ్) 81 కాగా, 41 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. అందులో కేవలం 15 మంది తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ ఈఆర్సీలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఆంధ్రా ఉద్యోగుల విషయంలో మాత్రం అవశేష ఆంధ్రప్రదేశ్ ఎటూ తేల్చలేదు. మరోవైపు ప్రస్తుత ఈఆర్సీ ఉద్యోగులందరూ అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని ఈఆర్సీకి అనుబంధంగా పనిచేసే అవకాశం కల్పించాలని ఏపీఈఆర్సీ చైర్మన్ భాస్కర్ ఇప్పటికే లేఖ రాసినా ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి