గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, అక్టోబర్ 20, 2014

ఉమ్మడితో టీఎస్‌ఆర్‌టీసీ దోపిడీ...!!!

తెలంగాణ విభజనకు పూర్వం, తర్వాత కూడా సీమాంధ్ర పాలకుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తుల్లో వీలైనంత భాగాన్ని దోచుకోవాలనీ, వీలుకాకపోతే ఆర్టీ సీ విభజనను మరింత జాప్యం చేయాలని చూస్తున్నారు. నష్టాలు మన నెత్తిన ఎత్తి, లాభాలను దోచుకోవాలనీ కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ సమాజం మేల్కోవాలి. సామాన్యుని ప్రయాణ సాధనమైన ఆర్టీసీని రక్షించుకోవాలి. రాష్ట్రం ఏర్పడి నాలుగు నెలలైంది. తెలంగాణ అంతా కొత్త శోభ సంతరించుకొంటున్నది. ప్రతి విభాగం నూతనోత్సాహంతో తమ తమ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుంటున్నది. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. కాని సామాన్యుని ప్రయాణ సాధనం ఆర్టీసీకి ఉమ్మడిగ్రహణం వీడక తల్లడిల్లుతున్నది. 
నాలుగు నెలల ప్రత్యేక రాష్ట్రంలో 21 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము, సీమాంధ్ర ఆర్టీసీ ఖాతాలో జమ అయ్యింది. శ్రమ తెలంగాణ ఆర్టీసీ కార్మికులది, దోపిడీ సీమాంధ్ర ఆర్టీసీది. కాలం గడుస్తున్న కొద్దీ గాయం విస్తరిస్తున్న బాధ. ప్రభుత్వం ఈ కిరికిరిని వెంటనే పరిష్కరించాలనీ ప్రజలు ,తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారు.
తెలంగాణలో రవాణా వ్యవస్థ పటిష్టమైంది, విశిష్టమైంది. 1932లో నైజాం పాలనలో మీర్జా వజ్రత్ అలీ, జనరల్ మేనేజర్‌గా తెలంగాణలో రవాణా వ్యవస్థను ప్రారంభించారు. ఇది ఆనాటికి అత్యుత్తమమైన ప్రజాస్వామ్య ఆకాంక్ష. ఆవిధంగా ఎదిగిన ఆర్టీసీ నేడు లక్షా 25 వేల మంది కార్మికులతో 25వేల బస్సులతో దేశంలో అతి పెద్ద రవాణా సంస్థగా ఎదిగి ప్రతిరోజు కోటి 50 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చడంలో గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నది. దీని వెనక శ్రమ, సంపద అంతా 10 జిల్లాల తెలంగాణ ఆర్టీసీ కార్మికులది, ప్రజలది.

తెలంగాణ ప్రాంత ప్రజల విశ్వసనీయ ప్రయాణ సాధనం ఇప్పటికీ ఆర్టీసీ మాత్రమే. ప్రత్యామ్నాయ ప్రయాణ సాధనాలు, వ్యక్తిగత వాహన వినియోగం సీమాంధ్ర కంటే తెలంగాణలో తక్కువ. సీమాంధ్ర ప్రాంత పరిస్థితి దీనికి భిన్నం. వ్యక్తిగత వాహన వినియోగ సామర్థ్యం, మరో రవాణా సౌకర్యమైన రైలు వినియోగం చాలా ఎక్కువ. ప్రైవేటు ట్రావెల్స్ అన్నీ సీమాంధ్రలోనే తిష్ఠవేసినవి. ఒకే నెంబర్ మీద అనేక బస్సులు నడిపిన ఘన చరిత్ర ఆ ప్రాంత ట్రావెల్స్ యాజమాన్యాలకు ఉన్నది. ప్రైవేటు బస్సులు కదిలిన తర్వాతే ఆర్టీసీ బస్సులు కదలాలి. ప్రైవేటు బస్సులన్నీ నిండు కుండల్లా కదుల్తుంటే, వెనక ఆర్టీసీ బస్సు ఖాళీగా రావలసిందే. కనీసం క్రాస్ చేసి ముందుకెళ్లితే ఆర్టీసీ కార్మికుల మీద దాడులు జరిగిన ఘటనలు కోకొల్లలు. ఇంతకాలంగా సర్వసాధారణంగా వినిపించే మాట నష్టాల్లో ఆర్టీసీ! ఇది విస్తరించడానికి, నష్టాలు పెరగడానికి సీమాంధ్ర ఆర్టీసి వల్లనే అనే సంగతి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు అనుభవంలోకి వస్తున్నది.

ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంత ఆదాయాన్ని గండికొడుతూ వస్తున్న సీమాంధ్ర ఆర్టీసీ యాజమాన్యం, అక్కడి ప్రభుత్వం- తెలంగాణ ప్రాంత ఆర్టీసీ మూల సంపదను కొల్లగొట్టే పనిలో పడింది. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. జవహర్ కమిటీ కుట్రలను భగ్నం చేస్తూ ధర్నాలకు దిగి పోరాడుతున్నారు. జవహర్ కమిటీ రిపోర్టు యధాతథంగా ఆమోదిస్తే తెలంగాణకు వెయ్యికోట్ల ఆస్తి నష్టం సంభవిస్తుంది.ఈ ప్రాంత ఆర్టీసి లేవలేని స్థితిలోకి నెట్టబడుతుంది. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం జవహర్ కమిటి రిపోర్టును తిరస్కరించాలి. తెలంగాణ ప్రాంత ఆర్టీసీ ఆస్తులు తరతరాలుగా వారసత్వంగా లభించినవే. ఇక్కడి భూములు, భవనాలు ఇక్కడి కార్మికుల చెమటతో నిర్మించినవే.

తెలంగాణ ఆస్తుల్లో భాగం అడుగుతున్న వారు సీమాంధ్ర ప్రాంతంలోని బస్‌స్టాండ్‌లు, బస్‌డిపోలు, షాపింగ్ కాంప్లెక్సులు తదితర ఆస్తుల్లో భాగం పంచుతారా? అన్నది సూటి ప్రశ్న. మాదిమాకే మీదీమాకే అనే దోపిడీ తత్వాన్ని సీమాంధ్ర ఆర్టీసీ నాయకులు విడనాడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి. ఆర్టీసీని శాస్త్రీయంగా విభజించాలి. అది త్వరగా జరగాలి. పోటీపడి రెండు ప్రాంతాల ఆర్టీసీ ఎదగాలి. విడిపోయిన మూడు నెలల వ్యవధిలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు శ్రమించి 8కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టారు. సీమాంధ్ర ఆర్టీసీకి 21 కోట్లు నష్టం. గణాంకాలు పరిశీలించే కమిటి ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. 1958 జనవరి నాటికి అప్పటి ప్రభుత్వం నుంచి రాజధానిలో 16 స్థిరాస్తులు, మిగిలిన తొమ్మిది తెలంగాణ జిల్లాల్లోని 42 స్థిరాస్తులను మార్కెట్ విలువను చెల్లించి ఆర్టీసీ కొనుగోలు చేసింది.

దానికి ఇప్పటి సీమాంధ్రకు సంబంధమేలేదు. ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఆదాయంతోనే ఇప్పుడున్న సీమాంధ్ర ఆర్టీసీ ఆస్తులు సంపాదించుకొన్నవే. అట్లాంటప్పుడు నిజంగా వాటిలో భాగస్వామ్యం అడగవలసింది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యమే. ఇదే సహజ న్యాయం కూడా. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు కార్మికులు- మానీళ్ళు, మానిధులు, మా ఉద్యోగాలు మాకు కావలసిందే అని ఉద్యమించింది దీని కోసమే. ప్రధానంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్ ఏమిటంటే.. ఈ ప్రాంతంలోని ఆర్టీసీ ఆస్తిలో చిల్లిగవ్వగాని, గజం స్థలం గానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు.ఈ దోపిడీని అడ్డుకోవడానికి ప్రాణాలర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.జవహర్ కమిటీ రిపోర్టు తీవ్రమైన దోపిడీకి దారితీసే విధంగా ఉన్నది.కాబట్టి దాన్ని బేషరతుగా రద్దుచేయాలి. ఆర్టీసీ ఉద్యోగులు విభజన కోసం ఏర్పాటైన షిల్లాబెడె కమిటీ ద్వారానే త్వరతగతిన జరగాలి.

ఆర్టీసీ ఆదాయ వ్యయాన్ని రెగ్యులర్‍గా ఆడిట్ చేస్తున్న కమిటీ జె.బి.ఆర్. కన్సల్టెంట్ ద్వారానే జరగాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.తెలంగాణ విభజనకు పూర్వం, తర్వాత కూడా సీమాంధ్ర పాలకుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తుల్లో వీలైనంత భాగాన్ని దోచుకోవాలనీ, వీలు కాకపోతే ఆర్టీసీ విభజనను మరింత జాప్యం చేయాలని చూస్తున్నారు. నష్టాలు మన నెత్తిన ఎత్తి, లాభాలను దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణ సమాజం మేల్కోవా లి. సామాన్యుని ప్రయాణ సాధనమైన ఆర్టీసీని రక్షించుకోవాలి.అవసరమైతే మరో ఉద్యమానికి నాంది పలకాలి. తగిన నియమాలు నిబంధనలు స్పష్టంగా రాసుకుని ఆర్టీసీలో విభజన ప్రక్రియను వేగవంతం చేయాలి. తద్వారా ఆర్టీసీ ప్రగతి చక్రాన్ని తెలంగాణ ప్రజల మేలుకోసం పరు గెత్తించాలి. ఇదే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి