గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, అక్టోబర్ 18, 2014

తెలంగాణలో...నాటి వివక్షతోనే...నేటి విద్యుత్ కష్టాలు!

తెలంగాణలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్నది. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా వినియోగించే కరెంటు కన్నా ఈ సమయంలో వినియోగం బాగా ఎక్కువైంది. దీని ప్రభావం మొత్తం అన్ని రంగాలపై పడి కరెంటు సరఫరాపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావుల కింద పంట సాగు అధికంగా ఉన్నది. దీనివల్ల విద్యుత్ వినియోగం డిమాండ్ బాగా పెరిగింది.
కొన్ని రోజులుగా తెలంగాణలో రైతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. నానా తంటాలు పడి ఆరుగాలం శ్రమించే రైతులు నేలరాలడం బాధాకరమైన విషయమే? ఆ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సిందే. సాగు చేసిన భూమిలో మొలకెత్తిన మొక్కలకు నీరు అందక ఎండిపోతున్న పైరులను చూసి అల్లాడుతున్న రైతు, ఎండిన బీళ్లు చూడలేక చలించిపోయి తనువు చాలిస్తున్నాడు.

వర్షాలు లేకపోవడం ద్వారా బోర్లపైనే ఆధారపడే రైతులు కరెంటు కోసం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదు.అప్పు చేసి సాగు చేసిన పంటలు మధ్యలోనే ఎండిపోవడంతో చేసిన అప్పు, చేసిన సాగు.. పంటలు మధ్యలోనే ఎండిపోవడం ద్వారా చేసిన అప్పు ఏవిధంగా తీర్చాలో అనే తపనతో మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అన్నివర్గాల భరోసా అవసరమే.

అయితే రైతన్నల ఆత్మహత్యలపై ప్రతిపక్ష పార్టీలు పాలక ప్రభుత్వంపై అర్థం పర్థంలేని విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతుల ‘భరోసా యాత్ర’ ల పేరుతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు తలా మూడు జిల్లాల పర్యటించి రైతుల ఆత్మహత్యలకు పాలక పార్టీనే ముద్దాయిని చేసి చూపిస్తున్నాయి. అయితే ఈ రైతన్నల ఆత్మహత్యలకు కారకులెవరు? పాలక పార్టీనా? కరెంటు కోతలా? కరువు కాలమా? లేదా గత ప్రభుత్వ విధానాలా? అనేది పరిశీలించి చూడాల్సిన అవసరం ఉన్నది.

మొదటగా వర్షాభావం పరిస్థితి చూద్దాం. వ్యవసాయానికి ప్రాణాధారమైన వర్షాలు ముఖం చాటు వేయడంతో రాష్ట్రంలో కరువు అల్లాడుతున్నది. తొలకరి వానలకు సైతం నోచుకోకపోవడంతో గత కొన్నేళ్ళుగా ఎన్నడులేని విధంగా పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడంతో రాష్ట్రంలో జిల్లాలో దుర్భిక్షం నెలకొన్నది. వర్షపాతం సాధారణం కన్నా 40శాతం తక్కువ కురిసింది. ఫలితంగా రాష్ట్రంలో వరిపంట 1.64 లక్షల హెక్టార్లలో, మొక్కజొన్న 3.22 లక్షలు, పెసర 0.5లక్షలు, కంది 1.75 లక్షలు, మినుము 0.15 లక్షలు, సోయా 2.10 లక్షలు, పత్తి 12.12 లక్షలు, జొన్న 0.34 లక్షలు, ఆముదం 0.55 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేయడం జరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో అతి తక్కువగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. దీంతో 52 శాతం మేరకే సాగు చేయడం జరిగింది.

ఆదిలాబాద్ జిల్లాలో 14.2 సెంటీమీటర్ల వర్షపాతంతో రాష్ట్రంలో మొదటిస్థానం ఉండి 7 శాతం సాగు చేయడం జరిగింది. అయితే గతంతో పోలిస్తే పంట సాగు చాలా తక్కువని వ్యవసాయ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. వర్షాభావం తగ్గటం వల్ల పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆత్మహత్యలు చేసుకుని కడుపుకోత మిగుల్చుతున్నారు. దీనికి పాలక పార్టీనే కారణం అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టటం చూస్తుంటే కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా! మరి ఆ ఆత్మహత్యలకు గత పాలకులు బాధ్యత వహించగలరా?
రెండవది కరెంటు కష్టాలు - తెలంగాణలో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతున్నది. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా వినియోగించే కరెంటు కన్నా ఈ సమయంలో వినియోగం బాగా ఎక్కువైంది. దీని ప్రభావం మొత్తం అన్ని రంగాలపై పడి కరెంటు సరఫరాపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావుల కింద పంట సాగు అధికంగా ఉన్నది.

దీనివల్ల విద్యుత్ వినియోగం డిమాండ్ బాగా పెరిగింది. గత ఏడాది అంటే జూలై-ఆగస్టు నాటికి 1500 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం ఉంటే, ఇప్పుడది 1900నుంచి రెండు వేల మెగావాట్లకు పెరిగిందని అధికార వర్గాలే తెలియచేస్తున్నాయి. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలకు ఏటా అగస్టు నుంచి అక్టోబర్ చివరి వరకు కరెంటు వినియోగం అధికంగా ఉంటుంది. కానీ ఈ సీజన్లో వర్షాలు లేకపోవడంతో జూలై నుంచే గరిష్ఠ స్థాయిలో పంటలకు విద్యుత్ వినియోగం పెరిగింది. గత ఐదేళ్ళలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదు.రాష్ట్రంలో బోర్లు, బావుల కింద 37లక్షల ఎకరాలు ఖరీఫ్‌లో సాగు చేయాల్సి ఉంది. కానీ కేవలం 25లక్షల ఎకరాలు మాత్రమే సాగుచేసినా విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అధికారవర్గాలు వాపోతున్నాయి.

తెలంగాణ జెన్‌కో ద్వారా 409మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఇందులో ధర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 2744.35మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా తరచూ అనేక యూనిట్లలో లోపాలు తలెత్తి ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్నది. ఇటీవలి కాలంలో కొత్తగూడెం, కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పలుమార్లు లోపాలు తలెత్తగా మరికొన్ని చోట్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిపివేయడం జరుగుతున్నది. ఇదే గాకుండా నాసిరకం బొగ్గు కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేక పోవడంతో జల విద్యుత్‌కేంద్రాలు పని చేయడం లేదని, దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు తరుచూ తలెత్తుతున్నాయని విద్యుత్ అధికారులు అంటున్నారు.

అయితే ఈ కరెంటు కష్టాలకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే జలయజ్ఞం ప్రాజెక్టుల క్రింద వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా తెలంగాణ రైతాంగానికి ఫలితం మాత్రం దక్కలేదు . ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకమే దీనికి నిదర్శనం. మూడేళ్లలో పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తామని 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్ళు కాదు కదా! పదేళ్ళు పూర్తయింది. పనులు పూర్తి కాలేదు. జరిగిన పనిలో కూడా అంతా డొల్లతనం కనబడుతున్నది. 25 టీఎంసీల నీటి వినియోగంతో 3.4 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు సాగు నీరందించేందు కు 2990 కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది.
ఆరు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశారు. కానీ కాంగ్రెస్ పాలకులు 3.4 లక్షల ఎకరాలకు కాదు కదా 34 వేల ఎకరాలకు కూడా నీరు అందించలేకపోయారు. అంటే కాంగ్రెస్ పాలకులు తెలంగాణ రైతాంగానికి ఎంతటి మేలు చేసిండ్రో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో భారీ నీటి ప్రాజెక్టుల కట్టలు పూర్తి అయి ఉంటే తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందేది. పంటలు ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతు చేతికొచ్చి లాభాలు చేకూర్చేవి. తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచిన కాంగ్రెస్ ‘రైతు భరోసా’ పేరుతో ప్రజల్లోకి వెళ్ళినా తగిన స్పందన రాకపోవడంతోనే మూడు జిల్లాలకు పరిమితం అయ్యిందని చెప్పక తప్పదు. జలయజ్ఞం పేరిట లక్షల కోట్ల రూపాయలు అవినీతికి కారకులైన కాంగ్రెస్ నాయకులు పంట సాగుకు మాత్రం నీరు అందించలేకపోయారు.
ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణలో ఉనికి కోల్పోయినా రైతుల పేరుతో యాత్రలు చేసి రైతులను పరామర్శింస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. కానీ కరెంటు కోసం బషీర్ బాగ్ దండయాత్ర చేసిన వామపక్షాల కార్యకర్తలను పిట్టల్లా కాల్చి చంపిన నాటి టీడీపీకి చెందిన నేతలు ఇవ్వాళ కరెంటు కోతలపై మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. రైతు రాజ్యమే రామరాజ్యం అని అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అప్పట్లో రైతులను అనేక విధాలుగా ఇబ్బందుల పాలు చేసిన సంఘటనలు రైతులు ఎవ్వరూ మరువలేదు. రైతుల ఆత్మహత్యల్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కింది. తన పదేళ్ల పరిపానలో సుమారు 17,242 మంది రైతులను పొట్టన పెట్టుకున్న టీడీపీ ఈ నాడు రైతు ఆత్మహత్యలపై మాట్లాడటం చూసి బాధిత కుటుంబాలు విస్తుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సంక్షోభానికి గత పాలకులే కారణమని రైతులు కన్నెర్ర చేయడంతో మధ్యలోనే తమ యాత్రలు ఆపి ఢిల్లీకి నివేదిక ఇస్తామని పయనం అవుతున్న తీరు కనపడుతూనే ఉన్నది.
గత 17ఏళ్లలో సుమారు 33,326 మంది రైతుల ఆత్మహత్యలపై అనేక అధ్యయనాలు జరిగాయి. 2004లో జయతిఘోష్ కమిషన్, 2006 లో జస్టిస్ రామచంద్రారెడ్డి కమిషన్, 201లో మోహన్ కందా కమిటీ ఆధ్వర్యంలో రైతు ఆత్మహత్యలపై అనేక సిఫార్సులు చేశాయి. ముఖ్యంగా రైతులందరికీ సాగునీరు అందించాలని, కౌలుదారులతో సహా రైతులందరికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని చెప్పాయి. గిట్టుబాటు ధరపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని సూచించాయి. కానీ ఆ సిఫార్సులు ఏవి కూడా అమలు కాకుండా పోవడం వల్లే వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు నష్టం కలిగిస్తూ బడా బాబులకు లాభాలు చేకూర్చిన గత పాలకులు అన్ని విధాలుగా రైతులను నిర్లక్ష్యం చేశారు. ఈ వివక్ష, నిర్లక్ష్యాల కారణంగానే రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగింది. నేటికీ కొనసాగుతున్నది.

ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం...గత పాలకులు తెలంగాణకు చేసిన నస్టాన్ని అధిగమించే పనిలో ఉన్నది. ముఖ్యంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకొనేందుకు సిద్ధం అయింది. ‘రుణమాఫీ’ పథ కంతో సుమారు 36లక్షల మంది రైతులకు అప్పులు మాఫీ చేస్తూ రైతులకు ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసింది. ప్రస్తుతం 25 శాతం బ్యాంక్ రుణాలు ప్రభుత్వమే చెల్లించి మిగతా 75శాతం వచ్చే మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణ సర్కారు బ్యాంకులకు రుణం చెల్లించనున్నది. ఈలోగా రైతులు బ్యాంకర్ల ద్వారా కొత్త రుణాలు తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నది.
ఈ విషయం అర్థంగాక కొందరు రైతులు ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడు తున్న తీరు కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని ప్రతి పక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం విషాదం. అంతకన్నా జాతి ద్రోహం మరొకటి లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విపక్షాలు విమర్శలు మానుకొని ప్రభుత్వానికి సహకారం అందించాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ కరువు-కరెంటు కష్టాలను తీర్చాలి. తెలంగాణ నవ నిర్మాణంలో రైతుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి. అందుకు పార్టీలకతీతంగా కలిసి నడవాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి