గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, అక్టోబర్ 02, 2014

ఎముకల నూనె తయారీ ద్వారా నెలకు రూ.45 కోట్ల సంపాదన...!!!

- కాటేదాన్ కేంద్రంగా మాఫియా సామ్రాజ్యం
- నకిలీనూనెతో ప్రజల ప్రాణాలతో చెలగాటం
- జంతు వ్యర్థాలతో నూనెల తయారీ
- మంచినూనెలో సగం సగం కల్తీ
- పక్క రాష్ర్టాలకూ ఎగుమతులు
- రంగంలోకి పోలీసు బృందాలు
bonesoilఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న గుట్టలు రోగంవచ్చిన పశువుల ఎముకలు, కొమ్ములు, మాంసం.. బక్కచిక్కి, చచ్చిపోయిన జంతువుల కళేబరాలు! వాటి నుంచి తీసిన కొవ్వుతో ఏం చేయొచ్చు? వినడానికే అసహ్యం వేసే ఈ తంతులో ఏకంగా వంట నూనెలు తయారు చేస్తున్నారు కొందరు దుర్మార్గులు! మూతపడిన కార్ఖానాల్లో చెట్టంత ఎత్తున గోడలు కట్టి.. భారీ గిన్నెలు పెట్టి.. పశువుల ఎముకలు, కొవ్వును కరిగేదాకా మరగబెట్టి.. నూనె తీస్తున్నారు. 
దానిని అందమైన డబ్బాల్లో నింపి.. జనంపైకి వదులుతున్నారు! తెలిసీ కొనుగోలు చేస్తున్న కొన్ని హోటళ్లు.. ఆ నూనెకు మరికాస్త మంచి నూనె జోడించి.. బిర్యానీలు వండేస్తున్నారు! రోడ్డుపక్కన బండ్ల వ్యాపారులు కొందరు బజ్జీలు వేయించి.. ప్లేట్లలో పెట్టి అమ్మేస్తున్నారు! నెలకు 45 కోట్ల విలువైన ఈ రోత పుట్టించే దందా జరుగుతున్నది నగరంలోని పారిశ్రామికవాడల్లోనే! దీనిపై కొంతకాలంగా నిఘా పెట్టిన నగర పోలీసులు.. బుధవారం పలుచోట్ల దాడులు చేసి.. వేల లీటర్ల పశువుల నూనెను సీజ్ చేశారు. దందా చేస్తున్నవారిని అరెస్టు చేశారు. ఒళ్లు జలదరించే ఈ ఎముకల నూనె దందా తీరుతెన్నులు ఏవంటే...

bonesoil01రాష్ట్రంలో జంతు కళేబరాలు, పశు వ్యర్థాలనుపయోగించి తయారు చేసే నకిలీ నూనెల వ్యాపారం స్థాయి ఎంతో తెలుసా? నెలకు రూ.45 కోట్ల పైమాటే. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఈ దందాను మాఫియాముఠాలే నడుపుతున్నాయి. పకడ్బందీగా అనేక దొంతరలుగా ఈ వ్యవహారం సాగుతుండడంతో అసలు సూత్రధారులు పట్టుబడడం లేదు. దాంతో తూతూ మంత్రంగా జరిమానాలతో అధికారులు సరిపెడుతున్నారు. ఇపుడు ఈ దందాను భూస్థాపితం చేయాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం నడుం కట్టింది.

కాటేదాన్‌లోనే అధికం.. 
హైదరాబాద్ నడిబొడ్డున ఉండే మలక్‌పేట, డబీర్‌పురా, చాంద్రాయణ్‌గుట్టలతోపాటు శివారుల్లోని కాటేదాన్, తుర్కయాంజల్, ఉప్పల్, మేడ్చెల్‌లలో భారీ నాలాలు, పాత పారిశ్రామికవాడల్లోని రసాయన వాసనలువచ్చే ప్రాంతాలలో ఈ కల్తీనూనె తయారీ కేంద్రాలు ఉన్నాయి.

నగరం మొత్తం సుమారు 12 కేంద్రాలుండగా కేవలం కాటేదాన్‌లోనే ఆరు వరకు తయారీ కేంద్రాలున్నాయి. ఈ దందాలో అనారోగ్యానికి గురైన జంతువులను చవక ధరలకు కొని దాన్ని వధించి దానిలోని కొవ్వు, ఉపయోగపడని మాంసం, ఎముకలు, కొమ్ములన్నింటిని భారీ బాండీలలో వేసి, అవి కరిగే వరకు మరగపెడుతారు. ఈ ప్రక్రియలో నూనె వస్తుంది. ఆ నూనెను డబ్బాలలో నింపి రాత్రి వేళల్లో మంచినూనె తయారు చేసే ఇతర కంపెనీలకు సరఫరా చేసి వస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఈ నూనెను ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. ప్రతి రోజు రాష్ట్రంనుంచి 30 వేల లీటర్ల వరకు ఈ నకిలీ అయిల్ సరఫరా అవుతుందని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఆరోగ్యానికి హాని...
జంతువుల నుంచి తీసిన ఈ నూనె లీటర్ ధర.. 20 నుంచి 30 ధర పలుకుతుంది. దానిని ప్యూరిఫై చేసి రూ. 50 వరకు విక్రయిస్తున్నారు. చిన్న హోటల్ నుంచి ఓ మోస్తరు పెద్ద హోటళ్లకు దీన్ని సరఫరా చేస్తున్నారు. హోటళ్లకు వచ్చే వినియోగదారులకు అనుమానాలు రాకుండా నిర్వాహకులు అసలైన నూనె సగం, నకిలీ నూనె సగం వాడుతుంటారు. డబ్బాలలో నింపి విక్రయిస్తుండడంతో కొందరు మంచినూనెగా భావించి కొంటున్నారు.

నకిలీ నూనె పామ్‌అయిల్‌లా తెల్లగా గడ్డకట్టి ఉంటుంది. నూనెలో నుంచి దురాస్వన వస్తే అది కచ్చితంగా నకిలీదేనని చెప్పవచ్చు. డాల్డాలా ఉండే ఈ నకిలీ అయిల్.. అసలు డాల్డా, పామాయిల్ కరిగే సమయం కంటే ఆలస్యంగా కరుగుతుంది. ఈ నూనెలు వాడిన ఆహారం తింటే భవిష్యత్తులో గుండె, ఊపిరితిత్తులు, కాలేయాలపై ప్రభావం పడుతుంది.

బక్క జీవులతోనే..
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పశువుల మార్కెట్లలో ఈ నకిలీ నూనె తయారీకి సంబంధించిన ముఠాలు ఉంటాయి. సంతకు వచ్చే బక్క జీవులు, రోగాలతో ఉండే పశువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు. అక్కడ బాగున్న మాంసాన్ని పక్కకు తీసి మిగతాదంతా నకిలీ నూనెల కార్మాగారాలకు తరలిస్తున్నారు.

bonesoil02జంతువుల కొనుగోలు దగ్గర నుంచి నకిలీ అయిల్ విక్రయదారుడి వరకు చేరవేసేదంతా ఒక మాఫియా తరహాగా సాగుతుంది. జంతువులు కొనేది ఒకరు. వాటిని కోసేది, తయారీ కేంద్రానికి తెచ్చేది, తయారైన నకిలీ అయిల్‌ను అసలు నూనె తయారీ కంపెనీకి చేర్చేవారు.. అందులో నకిలీని మంచి నూనెలో కలిపే వారు ఇలా ఎక్కడికక్కడ వేర్వేరు వ్యక్తులు ఒకరికి ఒకరు తెలియకుండా నిర్వహిస్తారు. దీనికి వెనక హైదరాబాద్, మహారాష్ట్రలకు చెందిన ముఠాలున్నాయి. అసలు నిర్వాహకులు బయటకు రారు. అధికారుల దాడులలో అందులో పనిచేసే వారే చిక్కుతారు.

శత్రు దర్భేద్యంగా తయారీ కేంద్రం
పశు వ్యర్ధాలను మరగబెట్టినప్పుడు దుర్వాసన వస్తుంది.. దానితో తయారీ కేంద్రాలను పారిశ్రామిక వాడలలో కెమికల్ వాసన వచ్చే ప్రాంతాలు, నగరంలో అయితే నాలాల పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక వాడలల్లో పనిచేయని పాత కార్మాగారాలు, పాత భవంతులు ఎత్తైన ప్రహారీ ఉండి అందులో ఏమి జరుగుతుందో తెలియని ప్రాంతాలు ఎంపిక చేసుకుంటున్నారు. ఈ తయారీ కేంద్రంలో పనిచేసే వారు బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్ ప్రాంతాలకు చెందిన వారే ఉంటారు. అనుభవాన్ని బట్టి జీతాలు రూ. 50 వేల వరకు ఉంటాయి. వీరు తయారీ కేంద్రంలోకి ఎవరినీ రానీయరు. కొత్తవారు వస్తే దాడి చేసి భయానక వాతావారణం సృష్టిస్తారు. తయారీ కేంద్రాన్ని శత్రు దుర్భేద్యంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నడిపిస్తుంటారు.

రంగంలోకి ప్రత్యేక బృందాలు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ నూనెల తయారీ దారులపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసి దాడులు చేసేందుకు నగరంతో పాటు జిల్లాలో బృందాలను ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలలలోని పుడ్ విభాగం అధికారులతో కలిసి దాడులు నిర్వహించనున్నారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు నకిలీలపై పూర్తిసమాచారాన్ని సేకరించి వారి ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నారు.

నకిలీ నూనె తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు
జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ గోదాంపై సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం దాడి చేశారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 90 డ్రమ్ముల నకిలీ నూనెను పట్టుకున్నారు. ఒక్కో డ్రమ్ములో 200 లీటర్ల నూనె ఉంది. ఈ గోదాంలో భారీ ఎత్తున జంతువుల ఎముకలు, పుర్రెలు కనిపించాయి. పాతబస్తీకి చెందిన ఉస్మాన్‌తో పాటు మరో ముగ్గురు కలిసి ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి.. అక్కడ పనిచేస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఐదు నెలల్లో రెండోసారి నకిలీ నూనెను స్వాధీనం చేసుకున్నారు.


5 కామెంట్‌లు:

priyathama చెప్పారు...

ఇది కచ్చితంగా ఆంధ్రావాళ్ళా పనే అయివుంటుంది

priyathama చెప్పారు...

ఇది కచ్చితంగా ఆంధ్రావాళ్ళా పనే అయివుంటుంది

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఆంధ్రావాళ్ళో... తెలంగాణవాళ్ళో...కానీ, నీచులు!
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బులు దండుకుంటున్న దుర్మార్గులు!!
ఆంధ్రా అక్రమార్కులు చేసే పనులు చూచివున్నాం గనక మీరు అలా భావించడంలో తప్పులేదు. ఆంధ్రావాళ్ళు అయినా కావచ్చును!

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

ఇవి ఏ ప్రాంతంవారు చేశారు అనేవిషయం కాదు, ఇలాంటివి ఏ ప్రాంతంవారు చేసినా ఖండించవలసిన విషయం. ఇలాంటి దందాలు ఏళ్ల నుండీ జరుగుతున్నా గత కాలపు ఆంద్రపాలకులు పట్టించుకోని మాట సత్యం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత వీటిపైన ఉక్కుపాదం మోపుతున్న మాట వాస్తవం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నిజం చెప్పారు మల్లికార్జునస్వామిగారూ! మన తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను తప్పక శిక్షిస్తుంది...మరొకరు ఇలాంటి పనులుచేయకుండా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి