గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జూన్ 24, 2015

టవర్లు పీకేస్తాం.. దాడులు చేయిస్తాం.. -ఏపీ సిట్ అధికారుల బెదిరింపు!!

-రాష్ట్రంలో నెట్‌వర్క్, బిజినెస్‌ను దెబ్బతీస్తాం
-సర్వీస్ ప్రొవైడర్లకు ఏపీ సిట్ బెదిరింపులు!
-ఏపీ ఫోన్‌లు ట్యాప్ అయ్యాయని చెప్పాలని ఒత్తిళ్లు?
-ట్యాపింగ్ జరుగలేదని తేల్చిన కంపెనీ ప్రతినిధులు
-విచారణ తీరు మారకుంటే డీవోటీకి ఫిర్యాదు?
టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ పెట్టిన కేసులో ఏపీ సిట్ అధికారుల విచారణ బెదిరింపులపర్వంగా సాగుతున్నదని తెలుస్తున్నది. విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు రెండోరోజు పలువురు సెల్‌ఫోన్ కంపెనీల ప్రతినిధులను విచారించారు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి అధికారుల ఫోన్‌లు ట్యాప్ చేసిందంటూ సృష్టించి చెప్పాలని సర్వీస్ ప్రొవైడర్లపై రెండో రోజూ రాక్షసంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్యాపింగ్ జరిగినట్లు చెప్పకపోతే ఆయా కంపెనీల సెల్ టవర్లను, వ్యాపారాన్ని దెబ్బతీస్తామని బెదిరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఓటుకు నోటు వ్యవహారంలో తమ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో ఇరుక్కుపోయిన కేసును పక్కదారి పట్టించే విధంగా సిట్ విచారణ జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


providers

అయితే సదరు కంపెనీల ప్రతినిధులు మాత్రం ట్యాపింగ్ జరుగలేదని విస్పష్టంగా తేల్చి చెప్పారని సమాచారం. కొందరు ప్రతినిధులైతే అధికారుల విపరీత ప్రవర్తనపై అసహనం వ్యక్తంచేశారని తెలిసింది. విచారణకు వచ్చిన తమకు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధిస్తూ, లేనిది ఉన్నట్టు సృష్టించి చెప్పాలని బలవంతం చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. తాము చెప్పిన వాటికి తలూపాలని, లేకుంటే ఏపీలో ఆయా కంపెనీల సెల్‌టవర్లు పీకేయిస్తామని, అల్లరిమూకలు, రౌడీలతో పడగొట్టిస్తామని, ఆయా కంపెనీలకు చెందిన జోనల్, సబ్ జోనల్ కార్యాలయాలు, ఔట్‌లెట్లు, డిస్ట్రిబ్యూటర్లపై దాడులుచేయిస్తామని, తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపుతామని సిట్ అధికారులు బెదిరిస్తున్నారని విచారణకు హాజరైన ప్రొవైడర్లు వాపోతున్నారు. ఏపీ ప్రజలకు సమాచార వ్యవస్థను దూరం చేసేలా సిట్ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విచక్షణ కోల్పోయి విచారణ...


ఓటుకు నోటు కేసులో ట్యాపింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై 12 సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చిన సిట్.. విచారణకు హాజరైన ప్రతినిధులను నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నిస్తున్నదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ నిబంధనలను బేఖాతరు చేస్తూ సర్వీస్ ప్రొవైడర్లను పిలిచి, పోలీస్‌స్టేషన్‌లో రాత్రింబవళ్లు ప్రశ్నించడంపై నెట్‌వర్క్ కంపెనీల యాజమాన్యాలు సీరియస్‌గా స్పందిస్తున్నాయి. సిట్ విచారణ తీరు, బెదిరించడంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీవోటీ)కు ఫిర్యాదు చేసేందుకు అవి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ విచారణ తీరుతెన్నులు మారకపోతే ఏపీలో తమ బిజినెస్ ఆపేస్తామని, మొత్తంగానే కంపెనీల సేవలు నిలిపివేస్తామని తమ ఫిర్యాదులో స్పష్టం చేయనున్నారని తెలిసింది.

ప్రజలకు సమాచార వ్యవస్థ దూరం చేసే చేష్టలు


సిట్ చేష్టలు ఏపీ ప్రజలకు సమాచార వ్యవస్థను దూరం చేసేవిగా ఉన్నాయని పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణంలో శంకుస్థాపన తప్ప మరే పనులూ మొదలు కాలేదు. ఇటువంటి సమయంలో సెల్‌టవర్లు, నెట్‌వర్క్ స్తంభించేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ విడిపోవడంతో అవశేష రాష్ట్రంగా మిగిలిన ఏపీకి ఇంతవరకూ కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పేరున్న కంపెనీ ఏదీ కూడా ముందుకు రాలేదు. ఈ సమయంలో ఒక కేసులో ఏ మాత్రం సంబంధం లేని సర్వీస్ ప్రొవైడర్లను ఇలా వేధిస్తే ఇంక పెట్టుబడులు ఎలా పెడతామని పారిశ్రామికవేత్తలు సైతం అసహనం వ్యక్తంచేస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి