గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 06, 2015

ఎన్నికల హామీలపై చేతులెత్తేసిన చంద్రబాబు...!!!

- సమైక్యరాష్ట్రంలో ఇచ్చిన హామీలను..
-ఇప్పుడు అమలుచేయటం కష్టమని ప్రకటన
- ప్రత్యేక రాష్ట్రంలో పరిస్థితులు మారాయని కబుర్లు
- ఏపీ విభజన 2014 మార్చి ఒకటినే పూర్తి...
-ఆ తర్వాతే ఎన్నికలు వాగ్దానాలు
- వాస్తవాలకు మసిపూసే ప్రయత్నం చేస్తున్న ఏపీ సీఎం
- బాబు నిప్పుకాదు.. తుప్పు: రఘువీరా
ఎన్నికల హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టించారు. ఏడాదిపాలనలో ఒక్కహామీని కూడా నెరవేర్చలేదన్న ప్రతిపక్షాల విమర్శలు నిజమేనని ఆయనే పరోక్షంగా ఒప్పుకొన్నారు. తాను ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ సమైక్యరాష్ట్రంలో ఇచ్చినవని, ప్రస్తుతం వాటన్నింటినీ నెరవేర్చటం సాధ్యంకాదని చేతులెత్తేశారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గురువారం నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు. సమైక్య రాష్ట్రంలో నాడు చాలా హామీలిచ్చాను. రాష్ట్రం విడిపోయాక పరిస్థితులు మారిపోయాయి. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు అన్ని హామీలను నెరవేర్చటం కష్టం. మీరు నాపై నమ్మకంతో ఓట్లేశారు. అందువల్ల హామీలను నెరవేర్చటానికి ప్రయత్నిస్తా అని చెప్పారు.



ఓటుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచమిస్తూ ప్రత్యక్షంగా దొరికిపోయిన టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యవహారంపై చంద్రబాబు గంభీర వచనాలు పలికారు. ఎవరికీ భయపడనని.. బుల్లెట్‌లా దూసుకెళ్తానని అన్నారు. రేవంత్ కేసులో తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న ఎత్తులను తిప్పికొడుతామని చెప్పారు. ఈ కేసులో చంద్రబాబే అసలు సూత్రధారి అన్న తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యలపై ఏపీ సీఎం మండిపడ్డారు. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా బతికానని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో హామీలిచ్చారా?


ఉమ్మడి రాష్ట్రంలో హామీలిచ్చానన్న చంద్రబాబు ప్రకటనపై ప్రతిపక్షాలతోపాటు ఏపీ ప్రజలు కూడా ముక్కున వేలేసుకొంటున్నారు. నిప్పులాంటి నిజాలను కూడా బాబు ఎలా బూడిదతో కప్పేయగలననుకుంటారు అనే విషయం మరోసారి రుజువైందని విమర్శిస్తున్నారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్‌సభ 2014 ఫిబ్రవరి 18 ఆమోదముద్ర వేయగా, మరో రెండు రోజుల తర్వాత 20 రాజ్యసభ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదంతో మార్చి ఒకటోతేదీన గెజిట్‌లో కూడా ప్రకటించారు. జూన్ 2న అపాయింటెడ్‌గా నిర్ణయించినా అప్పటికే రాష్ట్రం విడిపోయిన విషయం ప్రపంచానికంతా అర్థమయ్యింది. కాగా, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ 30, మే 7న రెండు దఫాలుగా జరిగాయి.

ఆ ఎన్నికల్లో రాష్ట్ర విభజనపై విమర్శలు గుప్పించటం ద్వారానే చంద్రబాబు అధికారం సాధించారనే అభిప్రాయం కూడా ఉంది. బాబు మాటలు నమ్మి ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను నామరూపాలులేకుండా చేసి టీడీపీకి పట్టంగట్టారు. పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆయన ముందూ వెనుకా ఆలోచించకుండా అధికార సాధనే లక్ష్యంగా ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిన తర్వాత వాటిని అమలుచేయలేనంటూ అడ్డంగా బుకాయించటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బాబు మరోసారి తన బుద్ధిని బయటపెట్టుకున్నారని మండిపడుతున్నారు. ఏడాదిపాటు ఒక్క రాజధాని నిర్మాణంపై ఆయన అనేకానేక ప్రకటనలిస్తూ నెట్టుకొచ్చారు. ఇప్పుడు సామాన్యులు తమసంగతేమిటని నిలదీసే పరిస్థితి వచ్చేసరికి చేతులెత్తేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. 

బాబు నిప్పుకాదు.. తుప్పు: రఘువీరారెడ్డి


టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముడుపుల కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ఎదురుదాడిచేసినంత మాత్రాన తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రాజకీయాల్లో నిప్పులా బతికానన్న బాబు వ్యాఖ్యలపై రఘువీరా మండిపడ్డారు. 

చంద్రబాబు నిప్పుకాదు.. తుప్పు అని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ కేసులో తనకు ప్రమేయం ఉందో లేదో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 66 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థ్యులను పోటీకి నిలిపటాన్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబు, తన పార్టీకి 14 మంది ఎమ్మెల్యేలే ఉన్నా ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలిపారని నిలదీశారు. రేవంత్ కేసులో చంద్రబాబు అప్రూవర్‌గా మారటం మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య సూచించారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి