గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఆగస్టు 27, 2015

తెలంగాణ వాదన వింటాం...!!!

supreme.court


కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణ వాదనలు, అభిప్రాయాలను తప్పక వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. అందుకు అవకాశం తప్పక ఇస్తామని తెలిపింది. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి.


-కృష్ణా జలాల పిటిషన్లపై సుప్రీంకోర్టు..
  తెలంగాణ పిటిషన్‌పై స్పందించాలని కేంద్రానికి ఆదేశం
- నాలుగు రాష్ర్టాల మధ్య వాదనలు జరగాలి..
  లేదంటే రాష్ట్రం ఏర్పడి ప్రయోజనమేమున్నది?
-రాష్ట్ర న్యాయవాది వైద్యనాథన్ వాదనలు
-వ్యతిరేకించిన మహారాష్ట్ర న్యాయవాది
- విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా
-బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లో ఖాళీ పోస్టును
  కేంద్రం భర్తీ చేయకపోవడంపై సుప్రీం ఆగ్రహం
అందరి వాదనలు విన్న జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ భానుమతితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలంగాణ తనకు జరిగిన అన్యాయం గురించి అడుగడంలో తప్పు లేదని అయితే, ప్రస్తుతం నీటి కేటాయింపులపై వెలువడిన ట్రిబ్యునల్ ఉత్తర్వుల లోతుల్లోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, అలా ఏర్పడితే మళ్లీ నాలుగు రాష్ర్టాల వాదనలు మొదటినుంచి ప్రారంభించాల్సి ఉంటుందని జస్టిస్ దీపక్‌మిశ్రా అభిప్రాయపడ్డారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఖాళీ అయిన పోస్టును భర్తీ చేయడంపై సమాధానం ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి కేంద్రాన్ని ఆదేశించారు.


తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానాన్ని, ట్రిబ్యునల్‌లో పోస్టు భర్తీపై వివరణను వచ్చే నెల 10వ తేదీకల్లా కోర్టుకు తెలియజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు. కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు, తెలంగాణ దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు, కర్ణాటక దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, తెలంగాణ తాజాగా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 



తొలుత తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం (1956)లోని సెక్షన్ 3 ప్రకారం కేంద్ర జలవనరుల శాఖకు గత సంవత్సరం జూలై 14వ తేదీన ఫిర్యాదు చేశామని, సంవత్సరంలోగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఆ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం సుప్రీంకోర్టులో ఇటీవలనే మరో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశామని కోర్టు దృష్టికి తెచ్చారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్ర అవసరాల గురించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎప్పుడూ వాదనలు వినిపించే అవకాశమే రాలేదని పేర్కొన్నారు. 


అందువల్ల జలాల పంపిణీపై నాలుగు రాష్ర్టాల మధ్య వాదనలు జరగాలని, ఆ తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని వాదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కూడా తమ రాష్ట్రం తరఫున వాదనలను బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఉంచామని, విచారణ సందర్భంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ, సెక్షన్ 89 ప్రకారం జరగాల్సిన ప్రక్రియ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు సంబంధించినది మాత్రమేనని, కానీ మహారాష్ట్ర, కర్ణాటక అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకకు కేటాయించిన నీటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటాను డిమాండ్ చేయరాదని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన రాష్ట్ర న్యాయవాది వైద్యనాథన్, కేంద్ర ప్రభుత్వం తమ ఫిర్యాదుకు ఇప్పటివరకూ సమాధానాన్ని ఇవ్వలేదని గుర్తుచేస్తూనే, 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంగనాథన్ ఉన్న సమయంలో నదీ జలాల వివాదాలకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు, వెలువరించిన ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఏకే సంఘీ బదులిస్తూ, త్వరలోనే సమాధానమిస్తామని తెలిపారు.


ఉమ్మడి రాష్ట్ర జలాలను పంచుకోవాలి..


బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వులను ఇచ్చి రెండేండ్లవుతున్నా అమలులోకి రాకుండా పిటిషన్ల రూపంలో ఆటంకాలు ఎదురవుతుండడం దురదృష్టకరమని మహారాష్ట్ర తరఫున వాదనలు చేసిన సీనియర్ న్యాయవాది అంద్యార్జున అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే రెండు ట్రిబ్యునళ్ల ఉత్తర్వులు వెలువడ్డాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఈ అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిశీలించిందన్నారు. అందువల్లనే పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 89ని పేర్కొన్నదని, దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటినే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు పంచుకోవాల్సి ఉంటుందన్నారు. 


ఈ కారణంగానే ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేండ్లు పొడిగించిందని, ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులను కూడా రెండో ట్రిబ్యునల్ చేసిందని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం జలాల పంపిణీకి సంబంధించి మళ్లీ నాలుగు రాష్ర్టాల మధ్య వాదనలు జరగాలని, పునః పంపకాలు జరగాలని కోరితే.. మళ్లీ మొదటికి వస్తుందని అన్నారు. నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ 5(2), (3) కేవలం మూడు రాష్ర్టాలకు సంబంధించినదేనని, ఎక్కువ కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికే వెళ్లాయని, తెలంగాణ వాదనను ఎప్పుడూ వినలేదని, ఇప్పుడు తెలంగాణ వాదించడం సమంజసం కాదని అన్నారు. రెండు వాదనలను విన్న జస్టిస్ దీపక్ మిశ్రా, వివిధ రాష్ర్టాలు (తెలంగాణ) వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లు విచారణార్హం కాదని గత విచారణ సందర్భంగా మహారాష్ట్ర వాదించిందని, అయితే ఈ పిటిషన్లను వేసిన రాష్ర్టాలకు వాటివాటి అభ్యంతరాలు, వాదనలు ఉన్నాయని, ఇవి విచారణకు అర్హమైనవేనని వ్యాఖ్యానించారు.


ఖాళీ పోస్టును భర్తీ చేయండి..


ముగ్గురు సభ్యులున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఒకరు రాజీనామా చేశారని.. ఇంకా ఆ పోస్టును కేంద్రం భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సంఘీని ప్రశ్నిస్తూ, ట్రిబ్యునల్‌లో ఖాళీ పోస్టును ఎప్పటిలోగా భర్తీ చేస్తారో వివరణ ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ, ఈ విషయం తనకు తెలియదని, ప్రభుత్వంను అడిగి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను ధర్మాసనానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. ఖాళీ పోస్టు భర్తీపై స్పష్టత ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని కోరారు.


తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ తన వాదన కొనసాగిస్తూ.. నదీ వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. గెజిట్‌లో పేర్కొనడంగానీ, ట్రిబ్యునల్‌కు ఆదేశాలు ఇవ్వడంగానీ, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాల్సి ఉన్నా.. ఆ పని చేయలేదని అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన సెక్షన్-3 ఫిర్యాదుకుగానీ, ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న సెక్షన్ 89 పిటిషన్‌గానీ, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్లుగానీ ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదని గుర్తు చేశారు. దీనికి జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ.. సెక్షన్-3లో చాలా పరిమితులు ఉన్నాయి. 41 ఏండ్ల క్రితం బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పుడు మళ్లీ వాదనలు నాలుగు రాష్ర్టాల మధ్య కొనసాగించాలని అంటే.. చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మళ్లీ నాలుగు రాష్ర్టాల మధ్య వాదనలు జరగాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడ్డారు. 


రద్దయిన పాత షెడ్యూలు


ఇరు పక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. షెడ్యూలు ప్రకారం బుధవారం, గురువారం రెండు రాష్ర్టాలు వాటి అభిప్రాయాలు, వాదనలు వినిపించిన తర్వాత మరో రెండు రాష్ర్టాలు వచ్చే నెల 9, 10 తేదీల్లో వినిపించాల్సి ఉంది. బుధవారం విచారణ అనంతరం పాత షెడ్యూలు రద్దయింది. తదుపరి విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా పడింది. ఆ విచారణకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయడంపై సుప్రీంకోర్టుకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 


రాష్ట్రం ఏర్పడి ప్రయోజనం ఏమిటి..?


కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని, న్యాయమైన వాటా దక్కలేదని, అన్యాయాన్ని న్యాయస్థానాల్లో చెప్పుకోక మరెక్కడికి వెళ్తామని వైద్యనాథన్ ధర్మాసనానికి విన్నవించారు. రాష్ట్ర ఏర్పాటులో జలం ప్రధానమైన అంశమని, నీటి కేటాయింపులో న్యాయం జరగనప్పుడు, జరిగిన అన్యాయానికి పరిష్కారం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇలా ఉంటే.. రాష్ట్రం ఏర్పడినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేయడంలేదని, కానీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తప్పనిసరిగా చెప్పుకోవాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ, తప్పనిసరిగా తెలంగాణ అభిప్రాయాలను న్యాయస్థానం వింటుందని, ఆ అవకాశం ఇస్తుందని, అయితే ప్రస్తుతం నీటి కేటాయింపులపై వెలువడిన ఉత్తర్వుల లోతుల్లోకి వెళ్ళడం లేదని వ్యాఖ్యానించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పడితే నాలుగు రాష్ర్టాల మధ్య తొలినుంచి వాదనలు జరగాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి