గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 02, 2015

బాబుకు మతిపోయింది..

-యాదవులు, కురుమలను కించపరిచారు
-బేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలి: మంత్రి హరీశ్‌రావు
-ఎవడు పచ్చగున్నా బాబు ఓర్వలేడు
-ఆంధ్ర రైతులకు నీళ్లిచ్చిన మానవతావాది కేసీఆర్
-తెలంగాణ రైతు ఉసురు తీసింది బాబు
-టీడీపీలో కేసీఆరే సీనియర్
-ఓడిపోయి దిక్కులేక చేరింది చంద్రబాబు 
-తెలంగాణకు అడుగడుగునా ద్రోహమే
-బాబు క్షమాపణ చెప్పకపోతే ఊరుకోం: యాదవ నాయకుల హెచ్చరిక

rao

చంద్రబాబుకు వయసు మీద పడి మతితప్పిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నదని చెప్పుకునే బాబు ఇపుడు పూర్తిగా మరుగుజ్జులా మారిపోయాడని, పక్కనవాళ్లు పచ్చగా ఉంటే ఓర్వలేక కండ్లలో నిప్పులు పోసుకుంటున్నాడని అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డి, నిజమాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. 

టీడీపీ లేకపోతే కేసీఆర్ గొర్రెలు మేపుకునేవారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలమీద విరుచుకుపడ్డారు. గొర్రెలు కాసుకోవడం నీచమా..అవమానకరమా..? అని చంద్రబాబును ఆయన నిలదీశారు. యాదవులు, కురుమల వృత్తిని కించపరిచిన చంద్రబాబు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు మాటలు ఆయన మానసిక స్థితిని సూచిస్తున్నాయని అన్నారు. టీడీపీలో కేసీఆరే చంద్రబాబుకన్నా సీనియర్ అని హరీశ్‌రా వు చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడి పోయాడని హరీశ్ చెప్పారు. ఆ తర్వాత రాజకీయంగా పుట్టగతులులేక మామపెట్టిన పార్టీలో దిక్కులేక చేరారని తెలిపారు. కేసీఆర్ 1982 లోనే టీడీపీలో చేరితే చంద్రబాబు ఏడాది తరువాత 1983లో టీడీపీలో చేరారని అన్నారు. టీడీపీలో కేసీఆరే సీనియర్ అని స్పష్టం చేశారు. 

నీ బతుకేంది బాబూ..


కేసీఆర్ ఉన్నతమైన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆయన పుట్టింది 3 ఎకరాల భవంతిలో.. మరి నీ సంగతి ఏమిటి చంద్రబాబూ అని హరీశ్‌రావు నిలదీశారు. పుట్టిన ఇంటిని పాఠశాలకు, ఆస్తిని ఎస్సీ కార్పొరేషన్‌ను ఇచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. నీకు అలాంటి చరిత్ర ఉందా అని నిలదీశారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు నాయుడు వేలకోట్లకు ఎలా పడగలెత్తారని సూటిగా ప్రశ్నించారు. గురువింద గింజ నలుపెరగదన్నట్లుగా చంద్రబాబు గిల్లికజ్జాలకు దిగుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ మానవతావాది..


సీఎం కేసీఆర్ మానవతావాది కాబట్టే విశాఖ పట్నంలో తుఫాన్ వస్తే ఎవరూ కోరకముందే అక్కడికి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు పంపించి మానవత్వాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు. నాగార్జున సాగర్ వివాదం తలెత్తినపుడు సాగర్ నీళ్లను వాడుకునే హక్కు ఆంధ్రాకు లేదని స్వయంగా తానే అడ్డుకుంటే కేసీఆర్ పిలిచి వారించారని హరీశ్ చెప్పారు. ఇక్కడి వారైనా, ఆంధ్రా వారైనా అందరూ రైతులేనని నచ్చచెప్పి, నీళ్లిచ్చి అక్కడి వారి పంటలు కాపాడింది కేసీఆర్ అని హరీశ్ అన్నారు. అదే చంద్రబాబు తెలంగాణలో కరెంటు సమస్యతో రైతులు మరణిస్తున్నప్పుడు శ్రీశైలంలో తెలంగాణవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడని విరుచుకుపడ్డారు.

తెలంగాణలో పంటలు ఎండిపోవాలని కుట్రలు చేశారని అన్నారు. తెలంగాణలో ఆంధ్రా విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే, ఆంధ్రాలో భూములున్నా హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆంధ్ర రైతులకు కూడా రుణమాఫీ రద్దు చేసిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

ఎన్ని నాలుకలు నీవి?..


చంద్రబాబుకు వెయ్యినాలుకలని హరీశ్‌రావు దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణకు మొదటి లేఖ ఇచ్చింది తానే అంటాడు.. గుంటూరుపోయి తెలంగాణ ఆపింది తానే అంటాడు అని మంత్రి విమర్శించారు. 2009లో తెలంగాణ వచ్చినపుడు రాజీనామాలతో ఆపింది తానేనని గతంలో కూడా చంద్రబాబు బహిరంగ సభల్లోనే ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు చేసినంత ద్రోహం మరెవ్వరూ చేయలేదని హరీశ్ అన్నారు. పార్లమెంటు ఆమోదించేదాకా అడుగడుగునా అడ్డుపడ్డది చంద్రబాబే..వచ్చిన తర్వాత ఆవిర్భావానికి ముందే ఏడు మండలాలు కబళించింది చంద్రబాబేనని అన్నారు. పార్లమెంట్ చట్టాలు, ఒప్పందాలను తుంగలో తొక్కి తెలంగాణకు కరెంట్ రాకుండా ఆపి రైతుల ఉసురు తీశాడని అన్నారు.

ఆఖరుకు ఆత్మగౌరవంతో పాలన చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి సహించలేక హైదరాబాద్‌లో గవర్నర్ పరిపాలన పెట్టాలని కూడా కుట్రల మీద కుట్రలు చేశాడని గుర్తు చేశారు. ఇపుడు తగుదునమ్మా అని సమస్యలు పరిష్కరించుకోవడానికి కేసీఆర్ రావడం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని అన్నారు. సింగరేణి నుంచి ఆంధ్రాకు కరెంట్ ఇవ్వడంలో సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించడం అవివేకానికి నిదర్శనం అన్నారు.

రైతు మరణాలకు బాబే కారణం..


టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవలంబించిన విధానాలే నేడు రైతు మరణాలకు కారణమని హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు, విద్యుత్ అందించడంలో చూపిన వివక్ష కారణంగానే కరువు తిష్ఠ వేసి భారీగా వలసలు, రైతు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని అన్నారు. చెరువుల విధ్వంసం, ఆక్రమణలు, శిఖం భూములు కబ్జాలన్నింటికీ చంద్రబాబు పాలనలోనే బీజం పడిందని అన్నారు. 

ఉంటే సక్కగుండు...
చంద్రబాబు తెలంగాణలో ఉండదలిస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అయితే బుద్ధిగా ఉండాలని మాత్రమే చెప్తున్నామని అన్నారు. నేను ఇక్కడే ఉంటా ఎక్కడికి పోనని చంద్రబాబు పదేపదే అంటున్నడు.. అసలు ఆయనను పొమ్మన్నది ఎవరు..? ఇక్కడే ఉండు..కానీ తిన్న ఇంటివాసాలు లెక్కపెట్టకు. విద్యుత్ ప్రాజెక్టులకు అడ్డుపడకు.. నీళ్లు రాకుండా కుట్రలు చేయకు అని హెచ్చరిస్తున్నాం...అని హరీశ్‌రావు హితవు పలికారు. మా పక్కనే ఉంటూ మాకే గొయ్యితీస్తే పొమ్మనకపోతే ఏమంటాం అని ప్రశ్నించారు.

ఊర్ల పాల్గొంటూ హైదరాబాద్‌లో విమర్శిస్తున్నరు..


ఎర్రబెల్లి వంటి టీడీపీ నాయకులు, డీకే అరుణ వంటి కాంగ్రెస్ వారు ఊర్లలో మిషన్ కాకతీయలో పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలతో ఇది మంచి కార్యక్రమం అని ప్రోత్సహిస్తూ హైదరాబాద్ రాగానే ఈ పథకంమీద ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో చెరువుల మరమ్మతు పనుల పేరిట కాంట్రాక్టర్ జేబులు నిండేవన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతాంగం కడుపు నింపుతున్నదని తెలిపారు.

క్షమాపణ చెప్పకపోతే చావుదెబ్బే.. దూదిమెట్ల హెచ్చరిక


టీడీపీ లేకపోతే తెలంగాణలో కేసీఆర్ గొర్రెలు కాసుకోనేవారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై యాదవ సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. యాదవులను, కుల వృత్తిని చంద్రబాబు దారుణంగా అవమానించారని తెలంగాణ విద్యార్థి నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు. చంద్రబాబు వెంటనే యాదవులకు క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆయనకు యాదవుల చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.

అక్కడా ఇక్కడా ఛీత్కారాలే..


వాస్తవానికి చంద్రబాబును ఆంధ్రావాళ్లు కూడా నమ్మడం లేదని ఇటు తెలంగాణ అటు ఆంధ్రలో కూడా ఛీత్కరిస్తున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో వరుసకట్టి పార్టీ మారుతున్నారు. ఆంధ్రాలో ఆదరణ కరువైంది. అక్కడ తిరగలేకపోతున్నారు. దీనితో మతిస్థితిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో 3 లక్షలకు పైగా పింఛన్లు కోత విధించగా తెలంగాణలో 5 లక్షలు అదనంగా పింఛన్లు ఇస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. పూటకోసారి, ప్రాంతానికో విధంగా మాట్లాడుతున్న చంద్రబాబులాంటి రాజకీయ నాయకులు దేశంలో ఎక్కడా ఉండరని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో ఆ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి