గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 30, 2015

వాటర్ గ్రిడ్‍లపై వక్రభాష్యాలొద్దు!!!


కుట్రలు పన్నడం చాలా సులభం. కానీ కలలు కనడం, ఆ కలల సాకారానికి అహర్నిశలు కష్టపడటం అందరికీ చేతకాదు. కలలు నిజమవుతాయని నమ్మకం లేని వారు జీవితంలో ఏదీ సాధించలేరు. అందుకే.. కలలు కనాలి. ఆ కలలను నిజం చేసుకునే దిశగా నిరంతర ప్రయ త్నం చేయాలి. అపుడే అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతుంటాయి. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కలలు కన్నారు. నిరంతరం కృషి చేశారు. ఫలితం సాధించారు. అలాగే కొత్త ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం పట్ల విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడం, అందులో అవినీతికి అవకాశముందని నానా విమర్శలు గుప్పిస్తుండటం మీడియాలో చూస్తున్నాం. ఒక మంచి పథకం చేపడుతున్నపుడు దాన్ని ఆహ్వానించాలే తప్ప అడ్డంగా మాట్లాడమే లక్ష్యం కాకూడదు. నిజంగానే దాని అమలులో ఎలాంటి తప్పులు జరిగినా ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తెచ్చి నిలయదీయడం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ఆ రకంగా పని చేస్తున్నాయా?
మన రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా నీటి కొరత, ఫ్లోరైడ్ కలుషిత నీరు తప్ప స్వచ్ఛమైన నీరు దొరకదు. పంచాయతీ సంస్థలు లేదా ఇతర సంస్థలు శుద్ధి చేసి తాగునీటిని కొన్ని గ్రామాలలో అందిస్తున్నాయి. వాటిలోనూ శుద్ధి శాతం ఎంత అంటే అదీ అనుమానమే. తాగునీటి స్వచ్ఛత, దాని లభ్యతపైనే ఏ సమాజం ఆరోగ్యమైనా అధారపడి వుంటది. అంతేకాదు దేశంలోనే తెలంగాణ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. అలాంటి ప్రాంతానికి స్వచ్ఛమైన తాగునీటి లభ్యతకు ఎంతటి ప్రాధాన్యముంటదో చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని రకా లుగా అవశ్యమైనది కాబట్టే జలహారం (వాటర్‌గ్రిడ్)కు ప్రభుత్వం అంత ప్రాధాన్యం ఉన్నది.


దేశంలో ప్రభుత్వాలు గుక్కెడు కలుషితం లేని తాగునీరు అందించలేకపోతున్నాయి. ఫలితంగా తాగునీరును కూడా వ్యాపారం చేశాయి. నదులనే అమ్మేసిన ఘటనలు ఈ దేశంలో ఉన్నాయి. తమిళనాడులో 12 ఏళ్ల క్రితం కావేరి ఉపనది భవానీ నదిని ఓ అమెరికా కంపెనీకి (లీజుకు)అమ్మేశారు. ఛత్తీస్‌గఢ్‌లో శివనాథ్ అనే చిన్న నదిని 23 కి.మీ పొడవున ఓ కంపెనీకి అమ్మేశారు. గొప్పగా చెప్పుకునే గుజరాత్‌లోనూ కిమ్ నదిని, కాక్‌పాడ కాలువను 2003లో ఓ కంపెనీకి అమ్మేశారు. దీంతో బహుళజాతి సంస్థలు తాగునీటిని వ్యాపారంచేసి వేల కోట్లు కొల్లగొట్టుకుపోతున్నాయి. కిన్లే లాంటి విదేశీ కంపెనీలు మన నీటిని మనకే అమ్మి ఈ దేశం నుంచి కోట్లాది లాభాలను తరలించుకుపోతున్నాయి. ప్రకృతిలోని పంచభూతాలను కూడా వ్యాపార వస్తువులుగా మన ప్రభుత్వాలే మార్చేస్తున్న ఈ కాలంలో.. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో పదివేల గ్రామాలకు వందలాది పట్టణాలకు శుభ్రమైన తాగునీటిని ప్రభుత్వమే అందించడానికి వాటర్‌గ్రిడ్ పథకం చేపట్టడం గొప్ప సదాశయం. అందుకే ఈ పథకాన్ని కేంద్రం కూడా ప్రశంసించింది. తెలంగాణలో జరుగుతున్న ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుసుకొని అమలు చేయాలని కేంద్రం ఆదేశించడమే ఈ పథకంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తున్నది. హడ్కో లాంటి ప్రఖ్యాత సంస్థ తెలంగాణలో చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకానికి ముగ్ధురాలై ప్రతిష్టాత్మక అవార్డును కూడా తెలంగాణ ప్రభుత్వానికి ప్రదానం చేసింది. అంతేకాదు, హడ్కో సంస్థ పదివేల కోట్ల రూపాయల ఆర్థిక రుణ సాయాన్ని కూడా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రతిపక్షాలకు ఇవేమీ కనిపిస్తున్నట్లు లేదు. ఎంతసేపూ విమర్శించడమే తమ హక్కుగా భావించే ఇలాంటి ప్రతిపక్షాలకు మంచిని మెచ్చుకోవడం ఎన్నటికీ చేతకాదని తమకు తామే చెప్పుకుంటున్నారు.


వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా, గోదావరి నదుల నుంచి 42 టీఎంసీల నీటిని వాటర్‌గ్రిడ్‌కు ఉపయోగిస్తామంటున్నది. ప్రతి వ్యక్తి ఉపయో గానికి 100 లీటర్ల నుంచి 150 లీటర్ల నీరు అందిస్తామంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 సెగ్మెంట్లు ఏర్పాటు చేసి, 19 ఇంటెక్ వెల్స్, 67 ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మిస్తామంటున్నది. మొత్తం పథకంలో ఒక లక్షా 25 వేల కి.మీ పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నది. ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ పథక నిర్మాణ ప్రణాళికను మన ప్రభుత్వ ఇంజినీర్లే తయారు చేశారు. దాని అంచనాలను కూడా నిపుణులే నిర్ధారించారని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ప్రతిపక్షాలలో కొందరు ఈ పథకాన్ని అనుమానించడమే పనిగా పెట్టుకొన్నారు. రంద్రాన్వేషణతో రాజకీయ ఆరోపణలు సహజమే కావచ్చు, కానీ ఆ పథకం అమలు అంచనాల పట్ల ప్రతిపక్షాలకే సరైన అవగాహన లేకపోతే అవి రాజకీయ ఆరోపణలుగానే మిగులుతాయి తప్ప నిజాలు కాలేవు.


ఒక విపక్షనేత వాటర్ గ్రిడ్ పథకాన్ని పది వేల కోట్లలో పూర్తి చేయవచ్చన్నారు. 38 వేల కోట్ల అంచనాలెందుకన్నారు. నిజంగానే పదివేల కోట్లతోనే పది వేల గ్రామాలకు ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించగలిగితే విపక్షాలు ఇన్నేళ్లు ఎందుకు చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి పథకానికే ఏడు వేల కోట్లు కేటాయించారు. ఒక్క జిల్లా తాగు నీటికే ఏడు వేల కోట్లు కేటాయించినపుడు, పది జిల్లా ల తెలంగాణ తాగునీటి పథకానికి ఎంత కేటాయించాలనేది సహజంగా వచ్చే మౌలిక ప్రశ్న. పది జల్లాలకు 70 వేల కోట్లు ఖర్చవుతాయని స్కూలు పిల్లాడిని అడిగినా చెబుతాడు. అయినా, తెలంగాణ పది జిల్లాల వాటర్ గ్రిడ్ పథకం అంచనాను ఈ ప్రభుత్వం సుమారు 38వేల కోట్లు మాత్రమే వేసింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారే ఇపుడు వాటర్‌గ్రిడ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. నిజంగానే పది వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేయగలిగే పరిజ్ఞానముంటే, తమకు పంపాలని ప్రభుత్వం విపక్షాలను కోరింది. నిర్మాణాత్మక విమర్శ కన్నా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమివ్వడాన్ని ప్రజలు హర్షించరు.


గత ఉమ్మడిరాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పథకానికి మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేవి. జలయజ్ఞంలో జరిగింది కూడా అదే. పని జరగకముందే అడ్వాన్సు లు ఇవ్వడం వెనకాల అవినీతి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులిచ్చి కమీషన్లు కాజేసిన ఆరోపణలు గత ఉమ్మడి పాలకులపై లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి ఇపుడు వాటర్ గ్రిడ్ లాంటి పథకాలకు అడ్వాన్సులివ్వ బోవడంలేదని ఈ ప్రభుత్వం కరాఖండిగా చెప్పేసింది. దేశంలో మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వబోమని ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. అవినీతి పట్ల ప్రభుత్వం చాలా మేరకు అప్రమత్తత పాటిస్తున్నదనడానికి అదొక ఉదాహరణ. వాటర్‌గ్రిడ్ టెండర్లు కూడా అంచనా కన్నా తక్కువకు పోయాయని, కొంత ప్రజాధనం ఆదా అయిందని కూడా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పారదర్శకతకు ఏ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చినా ప్రజలు హర్షిస్తారు. అలాగే విపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేసినపుడు మాత్రమే ప్రజలు స్వీకరిస్తారు.


తెలంగాణ ఉద్యమానికి - నీటికి బలమైన సంబంధం ఉన్నది. అటు సాగు, ఇటు తాగునీటి కోసం దశాబ్దాల తరబడి తల్లడిల్లిన గోస తెలంగాణోడికి తప్ప బయటి అధిష్టానాల కింద పనిచేసే వారికి అంతగా పట్టదు. అందుకే విపక్షాల విమర్శల్లో రాజకీయ కోణం మాత్రమే ఉంటున్నది. నిజంగానే గత పాలకులకు ఫ్లోరైడ్ తెలంగాణ పట్ల అంత చిత్తశుద్ధే ఉంటే, ఎప్పుడో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీరు అంది ఉండాలి. తెచ్చుకున్న తెలంగాణలో స్వచ్ఛమైన తాగునీరుకు నిక్కచ్చిగా మొదటి ప్రాధాన్యం. తెలంగాణ గ్రామాల ఆరోగ్యం మినరల్ వాటర్ ప్లాంట్లపై ఆధారపడి ఉన్నది. అయినా ఆ నీళ్లలోనూ ఆరోగ్యానికి ఎక్క డా గ్యారంటీ లేదు. కొన్ని వేల గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా అందుబాటులో లేవు. మొత్తం తెలంగాణ గ్రామాలకు పట్టణాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలంటే భగీరథ ప్రయత్నమే జరగాలి. అందుకే వాటర్‌గ్రిడ్ అనే ఒక భగీరథ ప్రయత్నం నిరాటంకంగా పూర్తి కావాలి. దేశంలో స్వచ్ఛమైన తాగునీటిని సాధించుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడాలి. అందుకే ఇదొక మహత్కార్యం. దేశంలో ప్రతి దాన్ని ప్రైవేటు వ్యాపారాలకు వదిలేస్తున్న నేటి కాలం లో ప్రభుత్వమే వాటర్ గ్రిడ్‌లాంటి శాశ్వత మంచినీటి పథకాన్ని చేపట్టడం తెలంగాణకు ఒక వరం. బయటి అధిష్టానాలు కలిగిన పార్టీలే తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఉంటే.. తాగునీటిని వ్యాపారానికి వదిలేవారు. తెలంగాణ ఉద్యమానికి- నీటికి ఉన్న సంబం ధం అలాంటిది కాబట్టే ఇవాళ ప్రభుత్వమే వాటర్‌గ్రిడ్ పథకం చేపట్టింది. సాగు-తాగు నీటిని ప్రజలకు అందుబాటులోకి తేగలిగితే తెలంగాణ అస్థిత్వ పార్టీకి తిరుగుండదనే విషయాన్ని విపక్షాలు కూడా గుర్తిస్తున్నాయి. అందుకే ఆధారాలను గాలికి వదిలేసి వాటర్‌గ్రిడ్ పథకంపై విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. 


తెలంగాణ రాజకీయాల్లో డైనమిజం చాలా అవసరం. వేగంగా పనిచేయడం, భవిష్యత్తు అవసరాలను గుర్తించడం, దార్శనికతతో పనిచేయడం మరింత అవసరం. ఈ పథకం పట్ల కేసీఆర్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, దాని పని వేగం పట్ల పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ అంతకు మించి శ్రద్ధ చూపిస్తున్నారు. ఏ పథకానికైనా రుణాలు లభించాలంటే, పాలకుడికి, అధికారులకు ఆ పథకం పట్ల చిత్తశుద్ధి, దార్శనికత ఉన్నపుడే అలాంటి రుణాలు లభించగలుగుతాయి. హడ్కో సంస్థ ఇవాళ వాటర్‌గ్రిడ్‌కు పదివేల కోట్ల రుణం ఇవ్వడానికి సిద్ధపడిందంటే ఆ పథకం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి సంబంధిత మంత్రికి ఉన్న కార్యసాధన పట్టుదలే ప్రధాన కారణం. నిబద్ధత ఉన్న కేటీఆర్ లాంటి మంత్రి కలిగి ఉండడం వల్లనే వాటర్‌గ్రిడ్ పథకం దేశంలో ప్రశంసలు అందుకోగలుగుతున్నది.


-kallurisreddy@gmail.com


(నమస్స్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి