గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఫిబ్రవరి 25, 2015

ఇంటి దొంగలు 1,150 మంది...!!!

-ఇందిరమ్మ స్కాంపై సీఐడీ నివేదిక సిద్ధం
-రెండురోజుల్లో ప్రభుత్వానికి సమర్పణ
-18 నియోజకవర్గాల్లో 36 గ్రామాల పరిశీలన
-రూ. 250 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తింపు
-ప్రభుత్వం అనుమతితో తదుపరి చర్యలు

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అక్రమార్కుల చిట్టా సిద్ధమైంది. ఆరునెలలుగా దర్యాప్తు సాగిస్తున్న సీఐడీ ఇందిరమ్మ ఇండ్ల స్కాంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు.. ఇలా దాదాపు 1150 మందిని నిందితులుగా గుర్తించింది. అందులో భాగంగా హౌసింగ్ డీఈలు, ఏఈలు, ఎండీవోలు, ఎంఆర్‌వోలు, వీఆర్‌వోలు, వీఓలు, బ్రోకర్లు, డబుల్ బెనిఫిషియర్లను నిందితులుగా చేర్చినట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 18 నియోజకవర్గాల్లోని 36 గ్రామాల్లో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ, దర్యాప్తు చేసి నివేదిక రూపొందిస్తున్నది. రెండురోజుల్లో ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలిసింది. అయితే కేవలం 36 గ్రామాల్లో జరిపిన ప్రాథమిక విచారణలో రూ.250 కోట్లవరకు నిధులు దుర్వినియోగం అయినట్టు అధికారులు తేల్చారు. ఇల్లు మంజూరై నిర్మించుకున్న విషయం అర్హత పొందిన వ్యక్తికి తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు.

ఇక ఇండ్లు కట్టకుండానే కట్టినట్టు ఫొటోలు సృష్టించారు. వాటికి డీఈలు, ఏఈలు, ఎండీవోలు, ఎంఆర్‌వోలు, వీఓలు.. బిల్లులు మంజూరు చేసి భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారు. దళారులు అర్హుడి పేరిట బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వారికి తెలియకుండానే డబ్బులు కూడా డ్రా చేసినట్టు సీఐడీ ఆధారాలతో సహా బయటపెట్టింది.


దర్యాప్తు జరిపిన నియోజకవర్గాలు..రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో శాంపిల్ సర్వే పేరిట దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. ప్రతి జిల్లాలో ఒక్కో కేసు నమోదు చేసింది. ఈ కేసులను విచారణ జరిపేందుకు జిల్లాకో బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇలా తొమ్మిది బృందాలు గ్రామస్థాయిలో దర్యాప్తు చేశాయి. ఇండ్ల స్కాంలో ఉన్న ప్రతి గ్రామాన్ని తిరగడం కష్టసాధ్యం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా 18 నియోజకవర్గాలను ఎంచుకుంది. జిల్లాకు రెండు నియోజకవర్గాలు, నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున ఎంచుకొని దర్యాప్తు ప్రారంభించింది. మండలాల్లోని ఎంపీడీవో, ఎంఆర్‌ఓ కార్యాలయాల నుంచి ఇండ్ల మంజూరు, నిధులు, వాటి లెక్కలకు సంబంధించిన పూర్తి స్థాయి డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకుంది.

ఎంచుకున్న రెండు గ్రామాల్లోకి వెళ్లి ప్రతిఒక్క లబ్ధిదారుడిని ప్రశ్నించింది. అసలు ఇండ్లే కట్టకుండా లక్షల్లో నిధులు నొక్కేశారని సీఐడీ ఆధారాలతో సహా తేల్చింది. ఇలా నారాయణ్‌ఖేడ్, ఆందోల్, డోర్నకల్, భూపాలపల్లి, పాలేరు, అశ్వారావుపేట, ఎల్లారెడ్డి, బోధన్, మంథని, హుజురాబాద్, నాగార్జునసాగర్, దేవరకొండ, ఖానాపూర్, ఆసిఫాబాద్, కొడంగల్, అలంపూర్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిధులు పక్కదారి పట్టాయని స్పష్టంగా నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది.



  1. (నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి