గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 20, 2014

ముదిరిన ఆరోపణల పైత్యం!

-వాస్తవాలు తెలిసినా మభ్యపెడుతున్న రేవంత్‌రెడ్డి
-ఉద్దేశపూర్వకంగా మెట్రోపై దుష్ప్రచారం
-మెట్రో ఎండీ ప్రకటన తర్వాత కూడా అవే ఆరోపణలు
-అందులో అలాంటి వాస్తవం లేదంటున్న ఎక్వా స్పేస్ డెవలపర్స్ డైరెక్టర్
-రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం దావా?
-సమాచారం ఇచ్చేందుకు సిద్ధం

హైదరాబాద్ నగరమే కాదు.. తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైలుప్రాజెక్టు విచ్ఛిన్నానికి ప్రయత్నించిన పచ్చదండు బొక్కాబోర్లా పడింది. ఒక కంపెనీపై గురిపెట్టి.. దాన్ని మెట్రోకు ముడిపెట్టి.. తెలంగాణ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రజలను నమ్మించలేకపోయారు. ఇక్కడ మెట్రోపై కుట్రలు చేసి పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించే బాధ్యతను భుజాన వేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. ఆయనకు బాకా ఊదుతున్న సీమాంధ్ర మీడియాకు గత రెండ్రోజులుగా చుక్కెదురవుతున్నది.

సాధారణ ఉత్తర, ప్రత్యుత్తరాల్లో భాగంగానే లేఖ రాసినట్లు ఎల్‌అండ్‌టీ కంపెనీ స్పష్టం చేసింది. ప్రధానంగా తమకు ఇచ్చిన స్థలం తమ వద్దనే ఉన్నదని, అందులో పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పత్రికాముఖంగా వెల్లడించారు. దీంతో తమ ఆరోపణల్లో పసలేదని తేలిసినప్పటికీ రేవంత్‌రెడ్డి మాత్రం పాడిందే పాటగా మీడియా ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. గతంలో ఆయన సమాచార హక్కుచట్టం ద్వారా అన్ని వివరాలు సేకరించిన తర్వాత కూడా ఈ అసత్య ఆరోపణలను పదేపదే చేయడం వెనక ఆయన వ్యూహం, అంతరార్థం ఏముందని తెలంగాణవాదులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా రేవంత్‌రెడ్డి పసలేని అసత్య ఆరోపణలు చేయడంలో భాగంగా అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్‌ను అనవసరంగా ఇందులోకి లాగారు. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్ ఎ శ్రీనివాస్‌రావు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ప్రజాప్రతినిధి అయిన రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్య విలువలు మరిచి ఎలా అసత్య ఆరోపణలు చేస్తున్నారో ఆయన అంశాలవారీగా వివరణ ఇచ్చారు. వాస్తవాలన్నీ సమాచార హక్కుచట్టం ద్వారా సేకరించినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీనివాస్‌రావు తెలిపారు.పత్రికా ప్రకటనలో వెల్లడించిన

వివరాలివి..- ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) నిర్వహించిన బహిరంగ వేలంలో డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ కంపెనీ 31.35 ఎకరాలను దక్కించుకున్నది. 2007లోనే అందుకు రూ.580 కోట్లను చెల్లించింది. ఆ తర్వాత 2013లో రూ.34.83 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందులో డీఎల్‌ఎఫ్‌కు ఏ ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనంగానీ, అదనపు రాయితీలుగానీ ఇవ్వలేదు. అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంలో ఆ భూమిని కొనుగోలు చేశారు.
-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.2వేల కోట్ల విలువైన భూమిని మైహోమ్ గ్రూపునకు చెందిన రామేశ్వర్‌రావుకు కట్టబెట్టినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అసలు రామేశ్వర్‌రావుకు ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు. 2007లో డీఎల్‌ఎఫ్ కంపెనీ ఈ భూమిని కొనుగోలు చేసింది.
-ఈ భూమికి తెలంగాణ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చినట్లుగా రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.కానీ ఇందులోనూ ఎలాంటి వాస్తవం లేదు. వాస్తవంగా డీఎల్‌ఎఫ్ కంపెనీ 2013లో స్టాంప్ డ్యూటీ కింద రూ.34.83 కోట్లు చెల్లించింది. ఈ పత్రాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
- ఏపీఐఐసీ 2007, 2008 సంవత్సరాల్లో ఈ సర్వేనెంబరులోని భూమిని (ప్లాట్లను) అనేక కంపెనీలకు అమ్మింది. ఇందులో డీఎల్‌ఎఫ్ లిమిటెడ్, సలర్‌పురియా, పురవంకర, ఐటీసీ, మైహోమ్, పయనీర్ ఇలా ఎన్నో ఉన్నాయి.
- అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ వేలం సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు చూసుకోకపోవడం వల్ల కొన్ని కంపెనీలకు అమ్మిన భూముల్లో నిర్మాణాలపై నిషేధం ఉన్నది. దీంతో ప్రభుత్వం, ఏపీఐఐసీనే స్వయంగా ఆ భూమికి బదులుగా మరో భూమిని తీసుకోవాల్సిందిగా ఆహ్వానించాయి. ఇందులో భాగంగా డీఎల్‌ఎఫ్, పురవంక కంపెనీలకు ఏపీఐఐసీ ప్రత్యామ్నాయ భూములను ఇస్తామని లేకపోతే చెల్లించిన డబ్బులను వాపసు ఇస్తామని చెప్పింది. కానీ వేలంలో ఇతర కంపెనీలకు అమ్మిన భూముల్లో నిర్మాణాలపై నిషేధం లేదు.
- ఏపీఐఐసీ సూచన మేరకు డీఎల్‌ఎఫ్ ప్రత్యామ్నాయ భూమికి అంగీకరించగా పురవంక మాత్రం తాను చెల్లించిన డబ్బులను వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండు చేసింది.
-ఇంతకు ముందే డీఎల్‌ఎఫ్ కంపెనీ స్టాంప్ డ్యూటీ కింద మొత్తాన్ని చెల్లించినందున ప్రత్యామ్నాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సిందిగా గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం తప్పిదం వల్లనే ప్రత్యామ్నాయ భూమికి వెళ్లాల్సి వచ్చిందిగానీ ఇందులో డీఎల్‌ఎఫ్ కంపెనీ తప్పిదం ఏమీ లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమాచారాన్ని పొందిన రేవంత్‌రెడ్డికి ఇవన్నీ తెలుసు. అయినా ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- రేవంత్‌రెడ్డి ప్రధానంగా మరో ఆరోపణ చేస్తున్నారు. ఎల్‌అండ్‌టీ మెట్రోకు కేటాయించిన స్థలాన్ని ఏపీఐఐసీ డీఎల్‌ఎఫ్‌కు ఇస్తున్నదని అంటున్నారు. ఇది నూరు శాతం అవాస్తవం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ప్రతికాముఖంగా ఇది వాస్తవంకాదని చెప్పారు. తమకు కేటాయించిన స్థలం తమ వద్దనే ఉన్నదని, పనులు ప్రారంభించేందుకు కూడా తాము కసరత్తు చేస్తున్నామని చెప్పినా రేవంత్‌రెడ్డి మాత్రం పదేపదే అదే అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
- అక్వా (డీఎల్‌ఎఫ్ కంపెనీ)కి కేటాయించిన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి పనులు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. కానీ జీహెచ్‌ఎంసీ, మైనింగ్ అధికారుల నుంచి సంబంధిత అనుమతులు పొందిన తర్వాతే ఈ పనులు మొదలుపెట్టడం జరిగింది. అందుకు సంబంధించిన అనుమతుల ప్రతులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
- ఈ భూమి విషయంలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాయితీలు కల్పించినట్లుగా రేవంత్‌రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారు. కానీ ఆయన చేసిన ఆరోపణలన్నీ అంశాలవారీగా అవాస్తవాలని నిరూపించేందుకు సంబంధిత పత్రాలతో మేం సిద్ధంగా ఉన్నాం. బహిరంగ వేలం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవన్నీ గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. కేవలం తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రక్రియలో భాగంగా చివరి దశలోని ఆదేశాలు మాత్రమే జారీ చేసింది. ముఖ్యంగా ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాతే మైహోం ఎస్పీవీగా ఇందులోకి ప్రవేశించింది.
-మైహోం 2014, ఏప్రిల్‌లో ఎస్పీవీగా ప్రవేశించింది. ప్రపంచ ప్రమాణాల మేరకు మౌలిక వసతులతో ఐటీ/ఐటీఈఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేసి, వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు ఇందులోకి ప్రవేశించింది.
- రేవంత్‌రెడ్డి సమాచార హక్కు చట్టం కింద అన్ని రకాల వివరాలు సేకరించిన తర్వాత కూడా మైహోం, దాని చైర్మన్ రామేశ్వర్‌రావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో ఆయనకు బాగా తెలుసు.
- మైహోం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలుగానీ, రాయితీలుగానీ పొందలేదు. పారిశ్రామికరంగంలో గత మూడు దశాబ్దాలుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ.. అంకితభావం, నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది.
- అసత్యపు ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం దావా వేసేందుకు ఉన్న అన్ని రకాల న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నాం. ఈ విషయంలో ప్రజలకు, మీడియాకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి