గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మార్చి 31, 2015

పచ్చకామెర్లరోగికి లోకమంతా పచ్చగానే....

pointblock

సత్య మనృతంబు పరుషోక్తి సరసభాష
ప్రాణిహింసయు దయయు లోభంబు నీఁగి
కనక సంగ్రహవ్యయములు గలుగు వార
రమణికై వడి బహురీతి... రాజనీతి!

రాజనీతి
కొన్నిసార్లు సత్యాసత్య మిశ్రమంగా,
కొన్నిసార్లు నిష్ఠూరంగా, ఒకసారి చెవికింపుగా,
ఒకచోట కఠోరంగా, ఒకసారి దయను చూపుతూ,
మరోసారి ద్రవ్యమాశ చూపుతూ, ఆ తర్వాత వ్యయం కలిగిస్తూ
ఇలా వార రమణిలా నానా విధాలుగా సాగేది రాజనీతి ...

అన్నది భర్తృహరి సుభాషితం. అలాంటి రాజనీతికి స్థిరత్వం ఉండదు. జయాపజయాల ప్రమేయం లేకుండాలోకరీతిని బట్టి సాగిపోవడం రాజనీతిజ్ఞుల లక్షణం. అజ్ఞానులకీ రాజనీతిజ్ఞత అర్థం కాదు. దాని లోతుపాతు లెరుగరు. అందుకే అల్ప విజయాలకే ఎగిరిపడతారు.

అక్కన్న మాదన్నగార్లు అందలం ఎక్కితే..
సాటికి సరప్ప చెరువుకట్ట ఎక్కాడట.. 
ఎవరి ఆనందం వారిది. ఎవరి తృప్తి వారిది. వాళ్లకు అది గొప్ప అయితే ఈయనకిదే మేటి.

రాధాకృష్ణా సరప్ప టైపే. ఇవాళ చెరువు కట్టే ఆయనకు అందలం అయిపోయింది. బీజేపీ గెలుపే పండుగ అయిపోయింది. సరే.. ఆనందించే హక్కు ఆయనకుంది. కాదనంగానీ..ఆ పరవశంలో చెక్కిన కొత్తపలుకులో ఉచితానుచితాలు అటకెక్కించడమే అభ్యంతరకరం. ఏపీలో టీడీపీ ఓటమి చంద్రబాబుది కాదు.. టీచర్లు సేవాతత్పరుడిని గెలిపించి మంచి సందేశం ఇచ్చారట. కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వానికి హెచ్చరిక పంపారట. ఇక్కడ కేసీఆర్ చాలా చాలా నేర్చుకోవాలట.

ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అంతేకాదు కేసీఆర్ చెబుతున్న ఇతర పార్టీలు ఉండకూడదన్న మాటను ప్రజలు తిరస్కరించారట. ఎక్కడ మా అందాల చంద్రబాబు!... అంటూ దేవులాడుతున్నారట. ఈ ఎన్నికల్లో బోలెడంత మనసు పారేసుకున్నారట. బీజేపీ-టీడీపీ కూటమిని ప్రత్యామ్నాయంగా భావించాం పో! అని ఈ ఎన్నిక ద్వారా చెప్పేశారట. ఇక్కడ బోనాలు, బతుకమ్మలు, యాదగిరిగుట్టలతో కేసీఆర్ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఇంకేం చేయడం లేదట. మరీ ఆశ్యర్యకరమైన వ్యాఖ్య ఏమంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవేనట. ఈ ఎన్నికలతోనే టీఆర్‌ఎస్ పని అయిపోయిందట.

మరి మెదక్ ఉప ఎన్నికను ఏ కాకి ఎత్తుకుపోయినట్టు? కంటోన్మెంటు ఎన్నికలను ఏ అనకొండ కబళించినట్టు? సదరు ఎన్నికల్లో రాధాకృష్ణ ప్రవచించిన టీడీపీ-బీజేపీ అనబడే మహా ప్రత్యామ్నాయ శక్తిని ఓటర్లు పెకిలించి బంగాళాఖాతంలోకి విసిరేసిన చరిత్ర ఏమైనట్టు? ఒక పత్రికాధిపతి.. బోలెడంత అనుభవం, అనుభూతులు ఉన్న పాత్రికేయరత్నం అయిన రాధాకృష్ణ ఇది మర్చేపోయినట్టున్నారు. అందుకే కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవేననేశారు.
తెలుగు పాఠకులను దేవుడు రక్షించుగాక! అంతటితో ఆయన అజ్ఞానాంధకారం ఆగలేదు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ అస్సలు బలపడలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయట. మా మంచి సీమాంధ్రులు శ్రద్ధగా వెళ్లి కసిగా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారట. వారు కేసీఆర్ మాటలను విశ్వసించలేదని కూడా తేలిపోయిందట. 

మరి ఈ మధ్యే కదా కంటోన్మెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయాలు కూడా నమోదు చేసింది. కంటోన్మెంటులో ఉండే సీమాంధ్రులు సీమాంధ్రులు కానట్టేనా? సరే... అలాగే అనుకుందాం.. మరి రాధాకృష్ణ ప్రవచించిన మహత్తర అరివీర భయంకర ప్రత్యామ్నాయరాజం బీజేపీ-టీడీపీ కూటమి సదరు ఎన్నికల్లో ఖాతా కూడా ఎందుకు తెరువలేకపోయినట్టు? ఎమ్మెల్యేల సంతానాన్ని నిలిపినా, పిట్టర్ బాబులు కోట్లు కుమ్మరించినా ఎందుకు బాల్చీ తన్నేసినట్టు? గుడిసె వాసినుంచి ఆకాశహర్మ్యాల నివాసుల దాకా, నూనూగు మీసాల యువతనుంచి పండు ముదుసల్ల దాకా జనులంతా పాల్గొన్న ఆ ఎన్నికల్లో సాధించిన విజయం...కేవలం పట్టభద్రులకి.. అదీ ఓట్లు ముందస్తుగా నమోదు చేసుకున్న, చేయబడిన గుప్పెడు ఓటర్లకే పరిమితమైన ఒక్క ఫలితంతో తలకిందులై పోయినట్టా? ఈ మాత్రం దానికే తెలంగాణ సెంటిమెంటు పలచబడినట్టా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటమైనట్టా? 

కానని ముఖానికి కప్పే దయ్యమై పట్టిందట..అనే సామెతుంది తెలంగాణలో.

ఎపుడో 2009 తర్వాత ఉప ఎన్నికల నాటినుంచి పచ్చపార్టీ డిపాజిట్లకు మొహం వాచి...వాచి నిద్రాణమై నిర్జీవమై నిరాశలో కూరుకుపోయిన పరిస్థితి. ఎన్ని కుట్రలు వండి వార్చినా బురద చల్లినా అరవై, డెబ్బైవేల మెజార్టీలతో టీఆర్‌ఎస్ జైత్రయాత్రలు నిద్రకు దూరం చేసిన పరిస్థితి. నెర్రలువారిన నేలలో పడక పడక పడ్డ ఒక్క వానచుక్కలాగ ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఓ ముసుగు విజయం. బహశా దాని ఫలితమే తాజా కొత్తపలుకులోని ఆ కప్పగంతులన్నీ. కౌమారంనుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే బాలురకు మూతిమీద మొలిచే రాగిపోగులు ఓ చిత్రమైన సమస్య.

మీసాలు అయినట్టూ కానట్టుగా ఉండే ఆ నూనూగు పోగులను అద్దం ముందు తిప్పి తిప్పి అందాలు చూసుకున్నా.. పదేపదే తడిమి తడిమి , లాగి లాగి నిర్దారించుకోచూసినా నమ్మీ నమ్మలేని వింత అనుభూతి. వచ్చీరాని వయసు కాబట్టి అవి అవేనా? అవి నాకేనా? అని మనసు పీకే ఆశ్చర్యానందాలతో కూడిన అయోమయావస్థ. ప్రస్తుతం రాధాకృష్ణ కూడాగెలుపు మీద అలాంటి సంభ్రమాశ్చర్యాల సందేహాస్పదాంబుధిలో మునిగితేలుతున్నట్టు కనిపిస్తున్నది.

బ్లడ్ గ్రూపు.. టీ -నెగిటివ్
బ్లడ్ గ్రూపుల్లో ఏ, బీ, ఏబీ అని ఓ పాజిటివ్, నెగిటివ్ అని...ఇలా గ్రూపులుంటాయి. కానీ రాధాకృష్ణది మాత్రం టీ నెగిటివ్ గ్రూపు. మూత్ర పరీక్షలని, రక్త పరీక్షలని, సీటీ స్కాన్ అని.. ఇలా అనేక రకాల పరీక్షలుంటాయి వైద్యపరీక్షల్లో. మీరు ఏ పరీక్ష చేసినా రాధాకృష్ణకు వచ్చే రిపోర్టు మాత్రం ఒకటే. తెలంగాణ వ్యతిరేకత. అందుకే ఆయనకు తెలంగాణ వచ్చాక ఎన్ని ఎన్నికలు జరిగాయో గుర్తుకు రాలేదు. టీఆర్‌ఎస్ గెలుపులు.. తెలంగాణ వ్యతిరేకుల దారుణ పరాజయాలు తట్టనే లేదు. కేవలం అస్మదీయులు గెలిచిన ఒక్క ఎన్నికే మనసుకు వచ్చింది.

ఆ వ్యతిరేకత ఆయనలో ఎంతగా జీర్ణించుకుపోయిందంటే తెలంగాణ ఉద్యమం మొదలైన నాటినుంచి రాధాకృష్ణ అంటున్నది ఒకే మాట. ..ఉద్యమం వేడి ఎంతకాలం ఉంటుంది? సెంటిమెంటు ఎక్కువ కాలం నిలవదు అనే మాట. ఆయన దృష్టిలో తెలంగాణవాదం ఏదో నలుగురు కూడి చేసే అల్లరి. నాలుగురోజుల్లో చల్లారిపోతుంది. పాపం గత 14 ఏండ్లుగా అదే మాట మీద నిలబడ్డారు. ఎప్పటికైనా నిజం కాకపోతుందా అని కలలు కన్నారు. కాకపోతే వేసివేసి ఆ రికార్డు అరిగిపోయింది.. విరిగిపోయింది. కానీ తెలంగాణవాదమే చెక్కుచెదరలేదు. అయినా సరే.. సెంటిమెంటు చల్లారకపోతుందా? కేసీఆర్ బలహీనపడక పోతాడా? అన్నదే ఆయన ఆశ. అందుకే ఈ ఒక్క ఫలితంతో ఆనందాలు అవధులు దాటిపోయి సెంటిమెంటు తగ్గిపోతున్నది అంటూ గంతులేశాడు.

నాలుగుసార్లు రాస్తే నిజమని ప్రజలు నమ్మేయకపోతారా అన్నది ఆయన ఆశ కావచ్చు. కానీ రాధాకృష్ణ లాంటి వాళ్లు ఉన్నంతకాలం ఆ సెంటిమెంటు కచ్చితంగా ఉండి తీరుతుంది. పీడకలగా మారిన తెలంగాణ రాష్ర్టాన్ని దెబ్బ కొట్టడానికి రాధాకృష్ణ వేయని ఎత్తులేదు. రాష్ట్రం వచ్చీరాగానే కరెంటు లేక పరిశ్రమలు తరలిపోతున్నాయోచ్ అంటూ ఎన్ని రాతలు? ఫార్మా అయిపోయింది.. ఇక కర్నాటకే కేరాఫ్ అంటూ ఎన్ని కుట్రలు. అదిగో ఏపీకి స్పెషల్ స్టేటస్... ఇదిగో తెలంగాణ పరిశ్రమలు తరలిపోతున్నాయ్ అంటూ ఎన్ని వార్తలు. శ్రీశైలం నీరు విద్యుత్‌కు వాడితే వ్యతిరేక ప్రచారం. సాగర్ నీరు తరలింపును ఆపితే దుష్ప్రచారం. మెట్రో రైలు మీద దుమారం. పాలమూరు పథకాల మీద బురద. ఇవన్నీ చెప్తున్నవి ఏమిటి? ఆ కలం తెలంగాణ మేలు కోరదు. ఆ పలుకు ఇక్కడి ప్రజల అభ్యున్నతిని సహించదు. తెలంగాణ వచ్చిన 9 నెలల్లో ఈ గడ్డకు మేలు చేసే వార్త ఒక్కటన్నా రాశారా? వేశారా?

"....చీడపుర్వు దాఁ
జెడఁ దిను నింతెకాక పుడిసెండు జలంబిడి పెంపనేర్చునే?
పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!"
అన్నాడు భాస్కర శతకకారుడు.. చీడపురుగు చెట్టును తొలిచివేస్తుందే కానీ చేరెడునీళ్లు పోసి పెంపు సేయదు కదా!
-సవాల్‌రెడ్డి



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!



ఆదివారం, మార్చి 29, 2015

ఆంధ్రా పాలకుల హయాంలో...శ్రీశైలం కబ్జా...!

pottiredupadu


ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రలో ఏవైనా ప్రాజెక్టులు ప్రతిపాదించినపుడు మీడియాకు వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలుకాకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు కనిపించేవి. తెలంగాణ ప్రాజెక్టుల ప్రస్తావన వస్తే మాత్రం కృష్ణా, గోదావరి నదులు ఎండిపోయి నీళ్లు లేక దీనంగా కనిపించేవి. అడవులు అడ్డుపడేవి. కొండలు ఆపేసేవి. మాది ఎడారి ప్రాంతం అని దబాయించే రాయలసీమకు ఉమ్మడి రాష్ట్రంలో వారికి హక్కు ఉన్న తుంగభద్ర, కేసీ కెనాల్ కాకుండా హక్కులు లేని శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా అనేక ప్రాజెక్టులు నిర్మించారు. సీమ మొత్తం ఎక్కడపడితే అక్కడ డజన్ల కొద్దీ రిజర్వాయర్లు కట్టుకున్నారు. పోతిరెడ్డిపాడునుంచి 450 టీఎంసీల నీటిని తరలించేలా సామర్థ్యం పెంచుకున్నారు. ఇవాళ కృష్ణ నీరు పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ కాలువ పేర తమిళనాడు పూండి దాకా అడవులు, నదులు, కొండలు, గుట్టలన్నీ ఛేదించి బిరాబిరా వెళ్లిపోతున్నది. హంద్రీనీవా ఆరు వందలకు పైగా కిలోమీటర్ల దూరం నదులను దాటేసి అనంతపురం జిల్లాదాక అలవోకగా వెళుతున్నది.
-నిలువుదోపిడీ చేసి దొంగ ఏడుపులు
-పోతిరెడ్డిపాడు ప్రవాహం పెంచి ఆరు జిల్లాలకు ఆరు ప్రాజెక్టులు
-2024 కిలోమీటర్ల కాల్వలు.. 32 రిజర్వాయర్లు
-సీమలో ప్రతి జిల్లాకూ కృష్ణ నీరే
-మరి తెలంగాణలో ఎన్ని జిల్లాలకిచ్చారు? ఎన్ని కాల్వలు తవ్వారు?

తెలంగాణలో ఏదైనా ప్రాజెక్టు చేపడుతున్నామనగానే సీమాంధ్ర నాయకత్వం, మీడియా వందరకాల ప్రశ్నలు లేవనెత్తుతుంది. సాధ్యాసాధ్యాలపై చర్చ చేస్తుంది. నీటి హక్కుల గురించి మాట్లాడతారు. పరివాహక హక్కులను గుర్తు చేస్తారు. అనుమతులున్నాయా? అని ఆరాలు తీస్తారు. కృష్ణానది నీటి వినియోగం విషయంలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు జరిగిన అన్యాయం గురించి అర్థం చేసుకోవాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్ర నాయకత్వం చేసిన నీటి దోపిడీని అర్థం చేసుకోవాలి. శ్రీశైలం రిజర్వాయరు నుంచి యథేచ్ఛగా కాలువలు, ఎత్తిపోతలు నిర్మించిన తీరు చూస్తే ఆశ్చర్యం, విస్మయం కలుగుతాయి. 

veligonda

పలు జిల్లాలు, వివిధ నదులు, కొండలు, వాగులు, అప్పటికే ఉన్న కాలువలను దాటుకుని శ్రీశైలం నీరు ముందుకు సాగిపోతుంది. శ్రీశైలంలో రాయలసీమకు నీటి హక్కులు లేవు. పరివాహక నిబంధనల ప్రకారం అనంతపురం, కడప, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు కృష్ణా బేసిన్‌లోకి రావు. చాలా ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అనుమతులు లేవు. అటవీ అనుమతులు లేవు. నిజానికి శ్రీశైలం రిజర్వాయరు నుంచి రాయలసీమకు తొలుత ఎటువంటి కేటాయింపులూ లేవు.

తుంగభద్ర నుంచి 110 టీఎంసీల నీటి కేటాయింపు మాత్రం ఉంది. దానిని తుంగభద్ర ఎగువ కాలువతోపాటు సుంకేశుల వద్ద తుంగభద్రపై నిర్మించిన కేసీ కాలువల ద్వారా తీసుకోవాలి. కానీ తుంగభద్ర నుంచి తమకు నీరు తగినంత రావడం లేదనే కారణం చూపి సీమాంధ్ర నాయకత్వం శ్రీశైలం రిజర్వాయరును దాదాపు కబ్జా చేసేసింది. ఒక్కటి కాదు రెండు కాదు...ఆరు కాలువలు శ్రీశైలం నుంచి నీటిని తీసుకుపోతాయి. పోతిరెడ్డిపాడు నుంచి బయలు దేరేవి నాలుగు కాగా, కర్నూలు జిల్లా మల్యాల వద్ద ఎత్తిపోసే హంద్రీ-నీవా ఐదవది. వెలిగొండ సొరంగం ప్రాజెక్టు ఆరవది. భూమి పొరలను పర్రున పగుల గొట్టుకుంటూ,అవసరమైన చోట సొరంగాలు తవ్వుతూ, ఎత్తిపోతలు నిర్మించుకుంటూ, నదులు, కాలువలపై నీటి వంతెనలను నిర్మించుకుంటూ జలాలను తరలించారు. ఎన్ని రిజర్వాయర్లు నిర్మించారో లెక్కలేదు. నిజానికి స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి బరితెగించి ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తెచ్చారు.

పోతిరెడ్డిపాడునుంచి 450 టీఎంసీలు..


galerunagari-canal-scheme

ఈ ప్రాజెక్టులన్నీ నింపుకోవడానికి వీలుగానే పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44,000 క్యూసెక్కులకు పెంచారు. పాత, కొత్త కాలువలు రెండింటి ద్వారా 55,000 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంది. అంటే రోజుకు ఐదు టీఎంసీల నీటిని మళ్లించుకునే సామర్థ్యం ఈ కాలువకు ఉంది.

ముప్పై రోజులు వరద ఉంటే 150 టీఎంసీలు, 45 రోజులు వరద ఉంటే 225 టీఎంసీల నీటిని ఆలవోకగా తరలించుకుపోవడానికి వీలుగా ఈ కాలువల నిర్మాణం జరిగింది. 90 రోజులపాటు నీటిని తరలిస్తే 450 టీఎంసీల వరకు తీసుకోవచ్చు. అంతేకాదు పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా శ్రీశైలం రిజర్వాయరులో 844 అడుగుల లోతువరకు నికర జలాలను కూడా తరలించుకునే అవకాశం ఉంది. వీటి ఆధారంగా నిర్మించిన రిజర్వాయర్లకు లెక్కేలేదు. వెలుగోడు, అలగనూరు, గోరకల్లు, అవుకు, పెన్న అహోబిలం, తెలుగుగంగ, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, చిన్నముక్కపల్లి, మైలవరం, గండికోట, సోమశిల, కండలేరులతోపాటు పలమనేరు సమీపంలోని అడవిపల్లి రిజర్వాయరుదాకా ఎన్ని రిజర్వాయర్లు ఉంటాయో లెక్క తీయడం కూడా కష్టమే.

నదులు దాటుకుంటూ..


తెలుగు గంగ కాలువ గాలేరు, సగిలేరు, పెన్నా, స్వర్ణముఖి, ఆరణి నదులను దాటుకుని ప్రయాణిస్తుంది. గాలేరు-నగరి కాలువ గాలేరు, కుందు, పెన్నా, స్వర్ణముఖి నదులను దాటుకుని నీటిని మోసుకెళుతుంది. హంద్రీ-నీవా హంద్రీ, పెన్నా, చిత్రావతి, నీవా నదులను దాటుకుని ముందుకు సాగుతుంది. కడప-కర్నూలు కాలువ హంద్రీ, గాలేరు, కుందు, పెన్నా నదులను దాటుకుని కడప చేరుకుంటుంది. శ్రీశైలం నీటితో గాలేరు, కుందు, పెన్నా నదులు పునర్జన్మనెత్తాయి.

ఏ కాలువ ఎక్కడి దాకా..


1. హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల అంతిమగమ్యం కృష్ణానది నుంచి 610.100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లా పలమనేరు. ఈ కాలువ కర్నూలు జిల్లాలో హంద్రీ నదిని, కేసీ కాలువను, అనంతపురం జిల్లాలో పెన్నా, చిత్రావతి నదులను, తుందభద్ర కాలువను దాటుకుని చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. కర్నూలు జిల్లా మల్యాల వద్ద శ్రీశైలం రిజర్వాయరు వెనుకభాగం నుంచి 40 టీఎంసీల నీటిని తరలించి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.03 లక్షల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2. గాలేరు-నగరి సుజల స్రవంతి అంతిమగమ్యం 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరి. పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు నదికి నీటిని మళ్లించి అక్కడి నుంచి అలగనూరు, గోరకల్లు, అవుకు రిజర్వాయర్ల ద్వారా పెన్నా నదిపై నిర్మించిన మైలవరం, గండికోట రిజర్వాయర్లకు తరలించి, అటు నుంచి కడప మీదుగా కాళహస్తి, నగరిల వరకు నీటిని తీసుకెళ్లాలన్నది ఈ కాలువ లక్ష్యం. శ్రీశైలం నుంచి 38 టీఎంసీల నీటిని తరలించి చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 2.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యం.

3. తెలుగు గంగ గమ్యం 434 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూండి రిజర్వాయర్. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకుని వెలుగోడు రిజర్వాయరును నింపి అటు నుంచి నల్లమల అడవుల ద్వారా తెలుగు గంగ రిజర్వాయరు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ అటు నుంచి పెన్నా నదిపై నిర్మించిన సోమశిలకు, అక్కడి నుంచి కండలేరుకు అక్కడి నుంచి చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడుకు నీరు తరలించారు. చెన్నయ్‌కి 15 టీఎంసీల తాగునీరుతోపాటు 28.99 టీఎంసీలతో కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో 2.75 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం లక్ష్యం.

4. ఎస్‌ఆర్‌బీసీ కాలువ 300 కిలోమీటర్లు నీటిని తీసుకెళుతుంది. ఈ కాలువ బనకచర్ల నుంచి పెన్నాపై నిర్మించిన మైలవరం దాకా 198 కిలోమీటర్ల పొడవున 19 టీఎంసీల వరద నీటితో కర్నూలు, కడప జిల్లాల్లో 1.9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం.

5. వెలిగొండ ప్రాజెక్టు కాలువ అంతిమ లక్ష్యం శ్రీశైలం రిజర్వాయరుకు 290 కిలో మీటర్ల దూరంలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలుకా. ఈ ప్రాజెక్టు ద్వారా 43.5 టీఎంసీల వరద నీటిని తరలించి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలను సాగు చేయాలన్నది లక్ష్యం. శ్రీశైలం రిజర్వాయరు నుంచి టన్నెలు ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నీటిని పారించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

6. ఇవి కాకుండా తుంగభద్రపై సుంకేశుల వద్ద ప్రారంభమయ్యే కడప-కర్నూలు కాలువను కూడా బనకచర్ల వద్ద పోతిరెడ్డిపాడుకు లింకు చేశారు. తుంగభద్ర నుంచి తగినంత నీరురావడం లేదని, ఆ నీటిని బనకచర్ల వద్ద నుంచి తీసుకోవాలని ఈ లింకును నిర్మించారు. ఈ కాలువ కడప పట్టణంలో ముగుస్తుంది.

క్లుప్తంగా...
1. ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారం శ్రీశైలం నుంచి తరలించదల్చుకున్న నీరు - 154.5 టీఎంసీలు. కాలువల నీటి తరలింపు సామర్థ్యం 450 టీఎంసీలకు పైనే.
2. ఆరు ప్రాజెక్టుల కింద సాగులోకి తీసుకురాదలచిన ఎకరాలు- 19.66 లక్షల ఎకరాలు
3. తాగునీరు, సాగునీరు అందుకునే జిల్లాలు- 6 ( కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం)
4. తవ్విన కాలువల మొత్తం పొడవు- 2024 కిలోమీటర్లు
5. నీరందుకునే నదులు, ఉపనదులు- 10 (హంద్రీ, గాలేరు, కుందు, సగిలేరు, పెన్నా, స్వర్ణముఖి, చిత్రావతి, పాపాగ్ని, మాండవి, నీవా)
6. నీరందుకునే రిజర్వాయర్లు-32 (వెలుగోడు, అలగనూరు, గోరకల్లు, అవుకు(కర్నూలు), చిన్నముక్కపల్లి, బ్రహ్మంగారి మఠం, మైలవరం, గండికోట, వామికొండ, సర్వరాజసాగర్(కడప), సోమశిల, కండలేరు, దుర్గంసాగర్, వెలికొండసాగర్, కృష్ణసాగర్(నెల్లూరు), శ్రీబాలాజీ రిజర్వాయర్, పద్మాసాగర్, శ్రీనివాససాగర్, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి(చిత్తూరు), పెన్నా అహోబిలం, చిత్రావతి, మిడ్ పెన్నా రిజర్వాయర్, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల(అనంతపురం), రాళ్లవాగు, గుండ్ల బ్రహ్మ్రేశ్వరం, నల్లమలసాగర్, కంభం చెరువు, తురిమెళ్ల రిజర్వాయర్(ప్రకాశం).

ఈ ప్రాజెక్టుల కాలువల తవ్వకం అటు చిత్తూరు జిల్లా పలమనేరుదాకా, ఇటు నగరిదాకా పూర్తయింది. తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా మొదటి దశలు పూర్తయ్యాయి. సీజనులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. రెండవ దశ పనుల్లోనే అక్కడక్కడా పనులుపెండింగులో ఉన్నాయి. వెలిగొండ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

మరి తెలంగాణ సంగతేమిటి?..
ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని మోసం చేశారు? రాయలసీమకు రావలసిన నీటివాటా విషయంలో ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. వరద నీటిని తీసుకోవడంలోనూ తప్పు లేదు. కానీ తెలంగాణ ఏం పాపం చేసింది? మహబూబ్‌నగర్ ఏం పాపం చేసింది? 610 కిలోమీటర్ల దూరంలో కూడా కాలువలు తవ్విన ఏలికలకు పక్కనే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు ఎందుకు కనిపించలేదు? ఇక్కడ జనం ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతుంటే దత్తత తీసుకున్నామని చెప్పినవారు ఏం చేశారు? ఫ్లోరైడు నీరు తాగి అచేతనులవుతుంటే ఎందుకు కళ్లప్పగించి చూస్తూ వచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం చెప్పుకోవాలి. అన్యాయాలను తెలంగాణ ప్రభుత్వం సవరించాలి.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, మార్చి 07, 2015

జేసీజే పరీక్షలకు ఓకే!!

-మూల్యాంకనం మాత్రం వద్దు: హైకోర్టు
-పరీక్షలపై స్టే కోరిన తెలంగాణ.. వ్యతిరేకించిన ఏపీ
-హైకోర్టులో ఉద్రిక్తత.. చాంబర్‌లోనే ధర్మాసనం తీర్పు
జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే)-2014 నోటిఫికేషన్ ఆధారంగా మార్చి 8న నిర్వహించే రాతపరీక్షలను యథాతథంగా నిర్వహించాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. అయితే జవాబుపత్రాలను మూల్యాంకనం చేయద్దని స్పష్టంచేసింది. రానున్న ఆదివారం నిర్వహించబోయే రాతపరీక్షలు మినహా తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు మరేవిధంగా ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది.
అభ్యర్థులు రాసిన జవాబుపత్రాలను సీల్డ్‌కవర్లలో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగిన సమయంలో 2014 ఫిబ్రవరిలో జారీచేసిన జేసీజే -2014 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల 8న రాతపరీక్షలు నిర్వహించడాన్ని సవాల్‌చేస్తూ న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రత్యేక రాష్ర్టాలు ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా రాతపరీక్షలు నిర్వహించడం సహేతుకం కాదని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మార్చి 4న చివరిసారిగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. తీర్పును మార్చి 6వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్కంఠ..


తెలంగాణ రాష్ర్టానికి నష్టం చేకూర్చేవిధంగా జేసీజే నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో శుక్రవారంనాటి కోర్టు ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం పదిన్నరకు ఉత్తర్వులు వెలువరిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ న్యాయవాదులు భారీస్థాయిలో హైకోర్టుకు చేరుకున్నారు. కేసు సంఖ్య రాగానే తెలంగాణ రాష్ట్రం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలను మరోసారి ధర్మాసనానికి నివేదించారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన నోటిఫికేషన్‌కు తెలంగాణ రాష్ర్టానికి సంబంధం లేదని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్‌ను పట్టించుకోకుండానే నోటిఫికేషన్ జారీచేశారని నివేదించారు. జేసీజే పోస్టులను ఆరు నెలల్లోగా భర్తీ చేయాలని జనవరి 20న సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించినందున అత్యవసరంగా పరీక్షలను నిర్వహించాల్సిన అవసరం లేదని కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు విధించిన ఆరు నెలల గడువులోగా రెండు రాష్ర్టాలకు న్యాయవ్యవస్థను విభజించి, దిగువ కోర్టుల్లో న్యాయమూర్తులు, ఇతర సిబ్బందిని ఆయా రాష్ర్టాలకు కేటాయించిన తర్వాత ఖాళీల ఆధారంగా జేసీజే పోస్టులను భర్తీ ప్రక్రియ చేపట్టాలని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. అప్పటి వరకు పరీక్షలపై, కొత్త నోటిఫికేషన్‌పై స్టే విధించాలని అభ్యర్థించారు.

ఆంధ్రప్రదేశ్ తరపున ఆ రాష్ట్ర ప్రత్యేక న్యాయవాది వాదనలు చేస్తూ.. తాము స్టేకు నిరాకరిస్తున్నామని తెలిపారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని కోరారు. ఏపీ వాదనలపై కోర్టు హాల్లోని తెలంగాణ న్యాయవాదుల్లో అసంతృప్తి చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. హైకోర్టు తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు చేస్తూ.. ఆరు నెలల్లో పోస్టులను భర్తీచేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాలనుసారమే రాతపరీక్షల నిర్వహణతోపాటు కొత్త నోటిఫికేషన్ జారీచేసినట్లు వివరించారు. వాదనలు పూర్తవ్వడంతో తాము తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా పేర్కొని, బెంచి దిగి చాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో న్యాయవాదులను ఉద్దేశించి.. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు, పేరు ఉందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారన్నారు. కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదుల గూర్చి కాదని, దేశవ్యాప్తంగా ఉన్న అంశాలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తదనంతరం నలబై నిమిషాల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ తిరిగి ధర్మాసనాన్ని అధిరోహించారు. అయితే అదే సమయంలో తీర్పు వెలువరిస్తారనే ఉత్కంఠతో తెలంగాణ న్యాయవాదులు కోర్టు హాల్లోనే ఉన్నారు. కొద్దిపాటి సమయం వేరే కేసులు విచారణ చేపట్టిన ధర్మాసనం, తీర్పును వెలువరించకుండానే బెంచి దిగిపోయింది. మధ్యాహ్నం గడిచినప్పటికీ న్యాయవాదులు కోర్టు హాల్లోనే తీర్పుకోసం వేచిచూస్తూ ఉన్నారు. మధ్యాహ్నం భోజన విరామం సమయం తర్వాత ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లోనే ఉత్తర్వులు వెలువరించనున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాదులకు, అడ్వకేట్ జనరల్‌కు సమాచారం అందించారు. దీంతో వారందరూ చాంబర్‌కు చేరుకున్నారు. చాంబర్‌లోనే ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది.

పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని పేర్కొంది. అయితే మూల్యంకనం చేపట్టవద్దని, ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉన్నందున తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే చర్యలు చేపట్టినందున, అలాగే అభ్యర్థులు సైతం సిద్ధం అయినందున పరీక్షలను యథాతథంగా నిర్వహించడానికి అనుమతి ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

lawyers


తీర్పు నేపథ్యంలో హైకోర్టులో పోలీసులు, బలగాల మోహరింపు


జేసీజే పరీక్షలపై, నోటిఫికేషన్లపై తీర్పు నేపథ్యంలో హైకోర్టు వద్ద పోలీసులు, భద్రతా బలగాలను భారీగా మోహరించారు. తెలంగాణ న్యాయవాదుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయనే ఉద్దేశంతో కోర్టు హాల్లోకి న్యాయవాదులను అనుమతించే విషయంలో పలు నిబంధనలు విధించారు. కోర్టు ప్రాంగణంలోకి ఇతరులు రాకుండా నిరోధించారు.

పరీక్షలు అడ్డుకున్నవారిపై కఠిన చర్యలు : హైకోర్టు రిజిస్ట్రార్


జేసీజే పోస్టుల రాతపరీక్షలను అడ్డుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికాప్రకటన విడుదలచేశారు. పరీక్షలు అడ్డుకోవడంద్వారా రీఎగ్జామినేషన్‌కు కారణమైనవారినుంచే రీఎగ్జామినేషన్‌కు అయ్యే ఖర్చు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల వరకే పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు అనుమతించబోమని రిజిస్ట్రార్ స్పష్టంచేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లతోపాటు ఫోటో గుర్తింపుకార్డు లేదా బార్ అసోసియేషన్ జారీచేసిన గుర్తింపుకార్డు తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.

స్క్రీనింగ్ టెస్ట్‌లంటే మా గొంతులు నొక్కడమే: జేఏసీ


నమస్తే తెలంగాణ, చార్మినార్: జేసీజే రాతపరీక్షలను యథాతథంగా నిర్వహించాలన్న తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయవాద జేఏసీ నేతలు రాష్ట్ర హైకోర్టు ముందు నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు తీర్పు న్యాయవాదులకు, తెలంగాణ వాదులకు తీరని నష్టం కలిగిస్తుందని విచారం వ్యక్తంచేశారు. ఈ దఫా జ్యుడిషియల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగితే వచ్చే 30 ఏండ్ల వరకు మళ్లీ జ్యుడిషియల్ ఉద్యోగాల భర్తీ ఉండదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం జ్యుడిషియల్ ఉద్యోగాల్లో భాగమైన జూనియర్ సివిల్ జడ్జి పోస్టులతోపాటు ఇతర విభాగాల్లో నియామకాలను 42ః58 నిష్పత్తిలో విభజించి ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఇదే విషయాన్ని కోరుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని జిల్లా కోర్టుల వద్ద విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను చేపట్టినా హైకోర్ట్ ప్రతిస్పందించక పోవడం న్యాయవాదుల గొంతు నొక్కడమేనన్నారు. అయితే పరీక్ష జవాబు పత్రాలను మూల్యాకనం చేయొద్దని, ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించడం కొంత సంతోషం కలిగించిందని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని కేంద్రంతో చర్చలు జరిపి, తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ ఏర్పాటును త్వరితంగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు మాణిక్ ప్రభుగౌడ్, ఎంఎస్ తిరుమల్‌రావు, గోవర్థన్, ఉపేంద్ర, ట్రిబ్యునల్ న్యాయవాద జేఏసీ కార్యదర్శి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

జేసీఏ పరీక్షకు తప్పక హాజరు కండి


జేసీజే పోస్టుల రాతపరీక్షను బాగా రాయాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ అభ్యర్థులను కోరింది. జేఏసీ నాయకులు శ్రీరంగారావు, కే గోవర్దన్‌రెడ్డి, అనిల్ మాట్లాడుతూ కొద్దికాలంగా ఈ విషయంలో గందరగోళం నెలకొని ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనకు గురికాకుండా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!


శుక్రవారం, మార్చి 06, 2015

విద్యుత్ ఇంజినీర్ల విభజనలో ఏపీ కిరికిరి...!!!


Power

విద్యుత్ వివాదాలకు అజ్యం పోసిన ఏపీ సర్కారు ఉద్యోగుల విభజనలోనూ కోత్త కిరికిరిలకు ఆజ్యం పోస్తున్నది. కార్పొరేషన్ల ఉద్యోగుల విభజన అంశాన్ని కమలనాథన్ కమిటీ సిఫార్సులకు ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. విద్యుత్ ఇంజినీర్ల విభజన అంశంపై ఏపీ ట్రాన్స్‌కో ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన తదుపరి తమ సొంత రాష్ర్టాల్లో పనిచేయాలన్న ఆకాంక్షతో ఇంజినీర్లు ఉన్న నేపథ్యంలో ఉద్దేశ్యపూర్వకంగానే ఉద్యోగుల విభజనను జాప్యం చేస్తున్నారని వారు ఆక్షేపిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో 4,592 మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా, వారిలో 1,100 మంది సీమాంధ్రకు చెందిన వారున్నారు. వీరిలో తొంబై శాతం మంది ఉద్యోగులు విభజన కోసం ఎదురుచూస్తున్నారు. కేవలం 200 మంది ఇంజినీర్లు మాత్రమే తెలంగాణలో కొనసాగాలని యోచిస్తున్నారు. విద్యుత్‌రంగంలో స్థానికత ప్రామాణికంగా ఇంజినీర్ల జాబితాను విద్యుత్‌సంస్థలు ఇప్పటికే సిద్ధం చేశాయి. అయితే విద్యుత్ యాజమాన్యాలు విధాన నిర్ణయాలు వెలువరించాల్సి ఉంది.

తెలంగాణ జెన్‌కోలో పనిచేస్తున్న సీమాంధ్ర ఇంజనీర్లు వెళ్ళిపోతే సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్(టీఎస్‌పీఈఏ) కొన్ని ప్రతిపాదనలు చేసింది. విద్యుత్ ఇంజినీర్ల విభజన క్రమంలో మంజూరు పోస్టులకు మించి ఉద్యోగులున్నట్లయితే సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు ఏ సుధాకర్‌రావు, జీ సంపత్‌కుమార్‌లు సూచించారు. విద్యుత్ సంస్కరణల సమయంలో అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్‌కో, జెన్‌కో, ఆనాటి సెంట్రల్ పవర్ డిస్కమ్‌లలో సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించిన విషయాన్ని వారు గుర్తుచేశారు.

విద్యుత్‌లోటుతో ఉన్న తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే చర్యలను నీరుగార్చేందుకే ఏపీ సర్కారు ఉద్యోగుల విభజనను మరింత జాప్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని తొమ్మిది, పదవ షెడ్యూళ్ల స్ఫూర్తికి భిన్నంగా ఏపీ ట్రాన్స్‌కో లేఖ రాయడాన్ని తప్పుపడుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు విద్యుత్ రంగంలో ఉద్యోగుల విభజనకు ఎలాంటి పొంతన లేదని, కార్పొరేషన్లు, కంపెనీలు సొంత మార్గదర్శకాలను రూపొందించుకుని ఏడాది కాలంలోగా ఉద్యోగుల విభజన చేసుకోవాలని చట్టంలో స్పష్టంగా ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం ఎనిమిది మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యుత్ ఉద్యోగుల విభజన చేయాలంటూ ఏపీ ట్రాన్స్‌కో తెలంగాణ ట్రాన్స్‌కోకు లేఖ రాయడంలోని ఔచిత్యాన్ని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!




వైద్యశాఖలో డిప్యుటేషన్ల మాయాజాలం!

-జోన్-6 పరిధిలో 130 మందికి స్థాన చలనం
-హైదరాబాద్‌కు క్యూ కడుతున్న ఉద్యోగులు
-మాజీ మంత్రి బంధువునంటూ చక్రం తిప్పిన అధికారి



ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 130 మందికి డిప్యుటేషన్ల పేరిట అనధికార బదిలీలు చేసి ఓ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఉండడంతో అనేక మంది ఈ అధికారిని సంతృప్తి పరిచి దొడ్డిదారిన బదిలీలు చేయించుకున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో పని చేసే సదరు అధికారి తాను మాజీ మంత్రి బంధువునంటూ చక్రం తిప్పి రూ.లక్షల్లో వెనకేసుకున్నారు. దీనిపై వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి విచారణకు ఆదేశించినా అది నేటికీ ముందుకు సాగలేదు. అక్రమాలు అత్యధికంగా జరిగాయని ఆరోపణలు వచ్చిన నల్లగొండ జిల్లాలో డిప్యుటేషన్లన్నింటినీ జిల్లా కలెక్టర్ రద్దు చేయాలని ఆదేశించారు. అదీ అమలు కావడం లేదు.


అసలేం జరిగిందంటే..హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, ఖమ్మం జిల్లాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలో వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది కొందరు హైదరాబాద్ చుట్టుపక్కల పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది కొందరు అధికారులకు వరంగా మారింది. అయితే బదిలీలపై నిషేధం ఉండటంతో మాజీ మంత్రి బంధువునని చెప్పుకునే ప్రాంతీయ కార్యాలయంలోని ఒక అధికారి ఆర్డీతో కుమ్మక్కు కావడంతో కాసుల పంట పడింది. నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నుంచి దాదాపు 130 మందికి పైగా ఎంపీహెచ్‌ఎస్ సూపర్‌వైజర్లు , పీహెచ్ స్టాఫ్ నర్సింగులకు దొడ్డిదారిన స్థాన చలనం కల్పించారు. ఒక జిల్లాలో సిబ్బంది పనితీరు బాగాలేకుంటే సంబంధిత డీఎంహెచ్‌ఓ మెమోలు జారీ చేసి ప్రాంతీయ కార్యాలయానికి సరెండర్ చేయవచ్చు. దాన్ని ఆసరాగా చేసుకొని 130 మందిని ఆయా జిల్లాల డీఎంహెచ్‌ఓలు ప్రాంతీయ కార్యాలయానికి సరెండర్ చేశారు. వారికి హైదరాబాద్, చుట్టుపక్కల పోస్టింగ్ ఇచ్చారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.2 నుండి 3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది.
ఏదీ విచారణ?:ఈ తతంగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా దీనిపై విచారణకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారికి బాధ్యతను అప్పగించారు. ఇప్పటిదాకా విచారణ ముందుకు సాగలేదు. ఇదిలాఉంటే ఈ వ్యవహారం నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది. నల్లగొండ డీఎంహెచ్‌ఓకు హైదరాబాద్ ప్రాంతీయ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో సరెండర్ చేయడం డిప్యుటేషన్‌పై మరో చోటికి వేయడం ఆయనకే దక్కాయి. అందువల్లే ఈ జిల్లాలోనే అత్యధికంగా ఈ దొడ్డిదారి బదిలీలు జరిగాయి.ఇదిగమనించి జిల్లా కలెక్టర్ వెంటనే వాటన్నింటినీ రద్దుచేయాలని కొన్నిరోజుల కిందట ఆదేశించారు.ఆ ఆదేశాలు అరకొరగానే అమలైనట్లు సమాచారం. ఇప్పటికీ చాలామంది యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఒకవైపు విచారణ కొనసాగకపోవడం, మరోవైపు ఒక జిల్లాలోనే నామమాత్రపు చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!!