గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఆగస్టు 28, 2014

తెలుగు వర్సిటీ.. ఆంధ్రామయం!

- కీలక పోస్టులన్నింటిలో సీమాంధ్రులే
- తెలంగాణ ఉద్యోగులపై తీవ్ర వివక్ష
- 27 ఏండ్లుగా ఇదే తంతు
- తెలంగాణ వచ్చినా తొలగని ఆధిపత్యం
- జోక్యం చేసుకోవాలని రాష్ట్ర సర్కార్‌కు టీ ప్రొఫెసర్ల విజ్ఞప్తి

ఉమ్మడి రాష్ట్రంలో 27 ఏండ్ల కిందట ఏర్పాటైన తెలుగు యూనివర్సిటీ..ఆంధ్రోళ్ళ ఆధిపత్యానికి వేదికగా మారింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. ఇప్పటికీ వర్సిటీలో సీమాంధ్ర అధ్యాపకుల పెత్తనం కొనసాగుతూనే ఉంది. తెలుగు యూనివర్సిటీ అకడమిక్, పరిపాలన విభాగాలకు సంబంధించిన అన్ని కీలక పదవుల్లోనూ వారే తిష్ఠ వేశారు.వర్సిటీ ఉన్నత పదవుల్లో తెలంగాణ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పరిపాలన సిబ్బంది మచ్చుకు కూడా కనిపించరంటే అతిశయోక్తి కాదు. కీలక పోస్టుల్లో నూటికి 80 శాతం సీమాంధ్ర ఉద్యోగులు పాతుకుపోయారు.

సీమాంధ్రలో వర్సిటీ ఏర్పాటుచేసిన కేంద్రాల్లో పనిచేస్తున్న వారంతా డిప్యూటేషన్ పేరుతో క్రమంగా విశ్వవిద్యాలయంలో పాగా వేశారు. ఆంధ్రా రాజకీయ నేతల అండదండలతో వారు వర్సిటీలోకి చొరబడ్డారు. వర్సిటీ ఏర్పాటుచేసిన నాటినుంచి ఇందే తంతు కొనసాగుతున్నది. పరిపాలన విభాగంలోని కీలక పదవుల్లో ఏడుగురు సీమాంధ్రులు ఉన్నారు. వారిలో జీ వెంకటరామయ్య, ప్రొఫెసర్ పీ చెన్నారెడ్డి, ప్రొఫెసర్ మృణాళిని, అసిస్టెంట్ ప్రొఫెసర్ వైఆర్ శ్యామల, ప్రొఫెసర్ కే సంజీవ్‌రావు, పబ్లికేషన్ డైరెక్టర్ వీ నిరీక్షణబాబు, రిజిస్ట్రార్ పీఏ డీవీడీ లక్ష్మీ కూడా సీమాంధ్రులే. వీరు దాదాపు 20 ఏండ్లుగా కొనసాగుతున్నారు. ఇక వర్సిటీలో ఫ్యాకల్టీగా 48 మంది పనిచేస్తుంటే వారిలో 22 మంది తెలంగాణ వారు, 26 మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉన్నారు. నాన్‌టీచింగ్ సిబ్బందిలో మొత్తం 35 మంది పనిచేస్తుంటే వారిలో తెలంగాణ సిబ్బంది 13 మంది, సీమాంధ్ర వారు 22 మంది ఉన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల్లో ప్రొఫెసర్ పీ చెన్నారెడ్డి, ప్రొఫెసర్ జీ వెంకటరామయ్య శ్రీశైలం నుంచి బదిలీపై హైదరాబాద్‌కు వచ్చి.. తొమ్మది ఏండ్లుగా వర్సిటీలో కొనసాగుతున్నారు. ఆడిట్ వ్యవహారంలో ప్రొఫెసర్ వెంకటరామయ్యపై ఫిర్యాదులు సైతం వచ్చాయి. ఈ ఇద్దరు ప్రొఫెసర్లు వర్సిటీని నియంత్రిస్తూ.. చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలో కనీస విధులు కూడా నిర్వహించకుండా.. ఒక్కొక్కరు రూ.1.50 లక్షల వరకు జీతాలు పొందుతున్నారని ఉద్యోగులు చెప్తున్నారు.

ప్రొఫెసర్ వెంకటరామయ్య స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా, స్టూడెంట్ ఫిర్యాదుల విభాగానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే సమాచార హక్కు చట్టం విభాగానికి లైజనింగ్ ఆఫీసర్‌గా, డైరెక్టర్ ఆఫ్ మ్యూజియంగా ఆయనే కొనసాగుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ఇన్ని పదవులు చాలదన్నట్టు.. ఆయన గత తొమ్మది ఏండ్లుగా కొనుగోలు కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగడం వర్సిటీలో ఆంద్రోళ్ళ పెత్తనం నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రొఫెసర్ చెన్నారెడ్డి కూడా అనేక పదవులు నిర్వహిస్తున్నారు. ఆయన పాలన అధికారిగా, అకడమిక్ ఎఫైర్స్ డీన్‌గా, వర్సిటీ బాచుపల్లి క్యాంపస్ ఇన్‌చార్జ్‌గా, సంస్కృతి, ప్రాంతాల అధ్యయనం విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నారు. ఇక వర్సిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉన్న ఒకాయన రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు బదిలీపై వచ్చారు.

బాచుపల్లి క్యాంపస్ నిర్మాణ సమయంలో వచ్చిన ఆయన.. క్యాంపస్ నిర్మాణం పూర్తయినా.. ఇంకా బాచుపల్లిలో ఇంజినీర్‌గానే నేటికి కొనసాగుతున్నారు. మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కూడా తెలుగు వర్సిటీకి అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరో సీమాంధ్ర ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండానే స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా తిష్ఠవేశారు. మరో సీమాంధ్రుడు సూపరింటెండెంట్ రిజిస్ట్రార్ పేషీలో 20 ఏండ్లుగా కొనసాగడం విమర్శలకు తావిస్తున్నది. ఇలా సీనియర్ ఉద్యోగుల స్థానాల్లో సీమాంధ్రులు తిష్ఠ వేశారు. బదిలీపై రావడమే తప్ప తిరిగివెళ్ళడం లేదు. దీనికితోడు పదవీ విరమణ చేసిన ముగ్గురు సీమాంధ్రులు సైతం నిబంధనలకు విరుద్ధంగా కన్సల్టెంట్లుగా 8 ఏండ్లుగా కొనసాగుతున్నారు.

యూజీసీ సెల్‌లోనూ అదే తంతుతెలుగు వర్సిటీ విభాగాలలో యూజీసీ సెల్ కీలకమైనది. యూజీసీ కేటాయించిన నిధులు నిర్వహణ చూసుకునే ఈ విభాగంలోనూ సీమాంధ్ర అధ్యాపకులే కొనసాగుతున్నారని, తెలంగాణ అధ్యాపకులకు అసలు స్థానమే లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం యూజీసీ కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ మృణాళిని కొనసాగుతున్నారని, ఆమె ద్వారా నిధులు ఆయా విభాగాలు వెళుతుంటాయని తెలిసింది. ఇక గత కొంతకాలంగా వర్సిటీలోని ఫోక్ విభాగంలో తెలంగాణ అధ్యాపకులకు కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్‌గా వైఆర్ శ్యామలను నియమించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ తెలుగు వర్సిటీ నుంచి సీమాంధ్ర పెత్తనం పోవడం లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే వెంటనే జోక్యం చేసుకొని.. తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయాలని వర్సిటీ తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి