గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 19, 2014

పునరావాస కేంద్రంగా సింగరేణి

-రిటైర్డ్ అధికారులకు పెద్దపీట.. నిషేధమున్నా నియామకాలు
-లక్షల్లో జీతాలు చెల్లింపు.. సంస్థపై ఆర్థికభారం
-ప్రభుత్వం చర్యలు చేపట్టాలని టీబీజీకేఎస్ డిమాండ్
సింగరేణి బొగ్గు ఉత్పాదన పరిశ్రమలో నిబంధనలకు విరుద్ధంగా, రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ రిటైర్డ్ అధికారులకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సీమాంధ్రకు చెందిన రిటైర్డ్ అధికారులకు సింగరేణిలో అత్యున్నత పోస్టులు కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా అదే పరిస్థితి కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో రిటైర్డ్ ఎకనామెట్రీషీయన్ జీ వెంకటనారాయణకు తిరిగి ఉద్యోగం ఇచ్చారు. ఆయనకు నెలకు రూ. 80 వేల వేతనం చెల్లిస్తున్నారు.

కోలిండియాలో రిటైర్డ్ జీఎం గౌతంధార్‌కు ఉద్యోగం ఇచ్చి నెలకు రూ.లక్ష వేతనంతో పాటు రూ.25వేలు ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ కింద చెల్లిస్తున్నారు. ఏపీఎస్సీబీలో రిటైర్డ్ అధికారి పీ మహిపతికి రూ. 50 వేలు, కే గోవర్ధన్‌రెడ్డి, డీ విశ్వేశ్వరరావులకు నెలకు రూ.లక్ష చొప్పున, ఐటీ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ అధికారి వీ సాగర్‌కు నెలకు రూ.లక్ష, రిటైర్డ్ జీఎం పురుషోత్తంకు నెలకు రూ.లక్ష, సర్వే డిపార్ట్‌మెంట్‌లో రిటైర్డ్ ఉద్యోగి టీవీ నాగేశ్వరరావుకు నెలకు రూ.60వేలు, ఎస్ లక్ష్మీనారాయణకు రూ.50 వేలు, రిటైర్డ్ ఈఈ లక్ష్మీనారాయణకు నెలకు రూ లక్ష, ఏపీ ట్రాన్స్‌కోలో రిటైర్డ్ డీఈపీ గుప్తాకు నెలకు రూ.లక్ష 25వేలు, సింగరేణి ఆస్పత్రి రిటైర్డ్ డాక్టర్ నర్సింహారావుకు నెలకు రూ.లక్ష, ప్రభుత్వ సర్వీసులో సీఈగా రిటైరయిన లవకుశరెడ్డికి నెలకు రూ.లక్ష చొప్పున వేతనాలు ఇస్తూ ఫ్యాకల్టీ రూపంలో అక్రమంగా నియమకాలు చేపట్టారు. వీరికి నెలకు వేతనాలే కాకుండా కన్వేయన్స్ అలవెన్స్, ఫోన్ బిల్లులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. తాజాగా శేషగిరిరావు, రామచంద్రమూర్తి, వీఎస్‌ఎన్ మూర్తి అనే ముగ్గురు అధికారులు వచ్చే నెలలో సింగరేణిలో పదవీ విరమణ చేయనున్నారు. వీరికి కూడా రిటైరయిన తర్వాత కూడా తిరిగి ఏదో ఒక రూపంలో నియామకాలు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఫ్యాకల్టీ రూపంలో అడ్డదారుల్లో జరుగుతున్న ఈ అక్రమ నియామకాలపై ఎవరూ దృష్టి కేంద్రీకరించకపోవడంతో అడ్డగోలుగా వ్యవహారం కొనసాగుతూనే ఉంది.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భాగంగా సింగరేణిలో ఇలాంటి నియామకాలు చేయాలంటే బహిరంగంగా పత్రికా ప్రకటన చేసి దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం కూడా ఇలాంటి నియామకాలపై నిషేధం విధించింది. ఇప్పటికీ నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ప్లాన్, నాన్‌ప్లాన్ పోస్టులను క్రియేట్‌చేసే ప్రక్రియపై నిషేధం విధించింది. అయినప్పటకీ సింగరేణిలో నియామకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నియామకాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్, సింగరేణి టీ జేఏసీలు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశాయి. ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించి ఆర్థిక దుబారాను అరికట్టి నిబంధనల ప్రకారం నియామకాలు జరిగేలా చర్యలు తీసుకొని సంస్థను రక్షించాలని టీబీజీకేఎస్ కోరింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి