గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 15, 2015

గోదావరి గలగల...కృష్ణానది విలవిల!!

- నదీయాజమాన్య బోర్డుల పరిస్థితి
- ఆగస్టు నుంచి పెండింగ్‌లో కృష్ణాబోర్డు వేతనాలు
- గోదావరికి అన్ని వసతులు, వేతనాలు
- అసంతృప్తిలో కృష్ణా యాజమాన్య బోర్డు
- కేంద్రం దృష్టికి పంచాయితీ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు జీతాలు లేవు. బోర్డు చైర్మన్‌కు శాశ్వత చాంబర్ లేదు. చీప్ ఇంజినీర్‌కు ప్రత్యేక గదిలేక క్లర్కులతో కలిసి కూర్చుంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ బోర్డుకోసం నయాపైసా విదిలించడం లేదు. ఆ రాష్ట్ర బడ్జెట్‌లో ఈ బోర్టుకు చంద్రబాబు ఉదారతతో కేటాయించిన మొత్తం కేవలం రూ. 10వేలు. ఏపీ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్న బోర్డు కేంద్రానికి మొరపెట్టుకుంది. 

రెండు బోర్డులు..

godavariరాష్ట్ర విభజన చట్టం కింద కేంద్రం రెండు జీవనదులు కృష్ణా గోదావరి నదులపై రెండు నదీ యాజమాన్య బోర్డులను ఏర్పరిచింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా, కృష్టా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పని చేయాలని నిర్దేశించింది. యాజమాన్య బోర్డుల వ్యయాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంది. బోర్డుల నిర్వహణ నిమిత్తం చెరో రూ. 5 కోట్లు జమ చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 5 కోట్లు, ఏపీ ప్రభుత్వం రూ. 5 కోట్లు ఉమ్మడిగా జత చేశాయి. ఈ మేరకు అక్కడా ఇక్కడా యాజమాన్య బోర్డులు ఏర్పాటయ్యాయి. 



గోదావరి గలగల..

తెలంగాణలో ఏర్పాటైన గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు మన ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది. విభజన చట్ట ప్రకారం కేంద్రం సూచించిన నిబంధనలను అన్నింటిని తుచా తప్పకుండా పాటించాలి. బోర్డు సభ్యులకు ఏ విషయంలోనూ ఇబ్బంది కలగకూడదని సీఎం కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు బోర్డుకు సంబంధించి ఏ సమస్యనై నా అవసరాన్నైనా తక్షణమే సమకూర్చుతున్నారు. నెలనెలా జీతాలు భత్యాలు ఇతర ఖర్చులకు నిధులు విడుదల చేస్తున్నారు. మాజీ చైర్మన్ అగర్వాల్ పని చేసింది కొద్ది నెలలే అయినా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సరైన గౌరవాన్ని కల్పించింది. ఉన్నంతలో ఆయను ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసింది. రెండు రోజుల్లో పదవి విరమణ చేస్తున్నారన్న సమయంలో పర్యాటక, పుణ్యక్షేత్రాల సందర్శనలు ఏర్పా టు చేసింది. తర్వాత వచ్చిన ఛైర్మన్ రామ్‌శరణ్, మెంబర్ చీఫ్ ఇంజినీర్ పట్నాయక్‌లకు వసతులు నిధుల్లోలోటు లేకుండా చూస్తున్నారు. 


కృష్ణా విలవిల..

ఇక ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిస్థితి దయనీయంగా ఉంది. బోర్డు ఛైర్మన్‌గా పండిట్ గత ఏడాది అక్టోబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్‌కు చెందిన అధికారి వీఎన్ నాగ్‌పురే చీఫ్ ఇంజినీర్ గా వచ్చారు. అప్పటి నుంచి ఇద్దరికి శాశ్వత చాంబర్ లేదు. ఛైర్మన్‌కు తాత్కాలిక చాంబర్ చూపినా చీఫ్ ఇంజినీర్ ఎల్‌డీసీలు, యూడీసీలతో నే కూర్చోవలసి వస్తోంది. గోదావరి బోర్డుతో సమానంగా, కృష్ణా బోర్డుకి కూడా తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్లు డిపాజిట్ చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఖజానా నుంచి చిల్లిగవ్వ తీయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీ బడ్జెట్‌లో బోర్డుకి ఈ ఏడాది కేవలం రూ.10 వేలు కేటాయించారు. బోర్డు ఛైర్మన్‌కు నెలకు సుమారు రు.1.7 లక్షలు, చీఫ్ ఇంజినీర్‌కు రూ. లక్షన్నర జీతం ఉంటుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. బోర్డు సిబ్బందికి జీతాలందడం లేదని చెప్తున్నారు. దీనితో బోర్డు సిబ్బంది కేంద్రానికి మొరపెట్టుకున్నారని తెలిసింది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి