గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 14, 2015

తెలంగాణ జల ప్రణాళిక "మిషన్ గోదావరి"!!!

గోదావరికి దక్షిణ గంగ అని పేరు. తెలంగాణలో ఈ నది ఉపయోగపడకుండానే ప్రవహిస్తూ పోతుంది. ఉత్తరాన ప్రాణహిత, వార్ధా, వెన్ గంగాలను కలుపుకుని పోచంపాడు వద్ద దశాబ్దాల కింద కట్టిన శ్రీరామ్‌సాగర్‌ను దాటుకొని సాగుతుంది. ఇటీవలే ఎల్లంపల్లి ప్రాజెక్టును మాత్రం నిర్మించారు. ఇక అక్కడి నుంచి ధవళేశ్వరం వరకు 460 కిలోమీటర్ల పొడుగునా ఒక్క గోదావరి జలాలను వినియోగించుకునేందుకు ఎలాంటి సాగునీటి ప్రాజెక్టు లేదు. ప్రాణహిత వైపు లేదా ఎల్లంపల్లి వైపు నుంచి భద్రాచలం వరకు గల 400 కిలోమీటర్లలో నీటిని వినియోగించుకోవడంపై తెలంగాణ దృష్టి సారించాలి. పోలవరం బ్యాక్ వాటర్ ఉండే ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే దాకా గోదావరి ప్రవాహంలోని నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను నిర్మించుకోవాలి. 

table



1. తెలంగాణ ప్రాజెక్టుల రూపకల్పన కోసం గోదావరిలో వాస్తవానికి ఎంత నీరు లభ్యమవుతున్నది? బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ర్టానికి వాటా కేటాయించిన నేపథ్యంలో- దీనికి చాలా మంది చెప్పే సమాధానం 1480 టీఎంసీలు. గోదావరి ఎక్కువగా తెలంగాణలోనే ప్రవహిస్తున్నది. కనుక, సీలేరు, శబరి జలాలను మినహాయించినా, మనకు ఈ మొత్తం వస్తుందని భావిస్తారు. నిజానికి ఈ నీటి లభ్యత ఎంత అనేది పరిశీలించాలని భావించాను. కేంద్ర జలవనరుల కమిషన్ దేశ వ్యాప్తంగా ప్రధాన నదులపై హైడ్రో అబ్జర్వేషన్ స్టేషన్‌లను ఏర్పాటు చేసి డేటాను ప్రచురిస్తుంది. 
దీనికి తోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఆన్ లైన్ ఇన్ రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టం ద్వారా కూడా నీటి లభ్యతను, ప్రవాహతను తెలుసుకోవచ్చు. ఈ క్రమంలోనే 2007-2012 మధ్య వీటిలో ప్రవహించిన నీటి ప్రవాహ సరాసరిని తీసుకుని నీటి ప్రవాహతను లెక్క తీయవచ్చు. దీని ప్రకారం గోదావరి బేసిన్‌లో నీటి లభ్యత వివరాలు పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. 

భద్రాచలం వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తున్న గోదావరి నీరు 2,163 టీఎంసీలు! అంటే తెలంగాణలో నీటిపారుదల, జల విద్యుత్‌కు భారీ అవకాశాలు ఉన్నాయి. ప్రాణహిత దగ్గర లభించే నీరు 350 టీఎంసీలు మాత్రమే కాదు. సముద్రమట్టానికి 140 మీటర్ల ఎత్తు నుంచి 700 టీఎంసీల నీళ్ళు వచ్చి పడుతున్నాయి. దీని ఆధారంగా జల విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా, నాలుగు వందల కిలోమీటర్ల మేర నదీ మార్గాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. 75 శాతం సగటు ప్రవాహం లెక్కగట్టినా 1,622 టీఎంసీల నీరు లభిస్తుంది.

2. డ్యాం/బ్యారేజీలకు అనువైన స్థలాలు- నీటి ఉపయోగం?తుమ్మిడిహట్టి: ఇది ప్రస్తుత ప్రతిపాదిత స్థలం. ఎత్తు విషయమై మహారాష్ట్రతో అంగీకారానికి రావలసి ఉన్నది. మహారాష్ట్ర వైపు ముంపును తగ్గించడానికి ఎత్తు, ప్రదేశం విషయంలో కొంచెం తగ్గినా తప్పులేదు. ఈ ప్రదేశం వద్ద 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు అంగీకరించినా, లిఫ్టు లేకుండా 160 టీఎంసీలు మళ్ళించడం ఎట్లా అనేది అర్థం కాని విషయం. లిఫ్టు ఏర్పాటు చేసి, ఎత్తు తగ్గించి, విడుదలైన నీటితో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఉత్తమం. సాగునీటిని, జల విద్యుత్‌ను (తదనుగుణంగా వ్యయాన్ని) పంచుకునే విషయమై మహారాష్ట్రతో చర్చించవచ్చు. కనీసం సగం తెలంగాణకు ఇవ్వాలె.

ముక్కిడిగూడెం:(116-136 మీ) ప్రతిపాదిత స్థలం నుంచి 55 కిలోమీటర్ల దిగువన కొండ వరుసలతో నీటిని నిలిపే లోయ వంటిది ఉన్నది. ఇది లిఫ్టుకు కూడా అనుకూలం. ప్రస్తుత ప్రాణహిత- చేవెళ్ళ పథకంలో గుర్తించిన మొదటి లిఫ్టు దీనికి 62 కిలోమీటర్ల దగ్గర ఉన్నది. ఇది చాలా అనుకూలమైనది. ఎందుకంటే ఈ స్థలం వల్ల ఎక్కువ ముంపు ప్రాంతం తెలంగాణవైపే ఉన్నది. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహించే పెద్ద వాగు నీళ్ళు ఇక్కడకు చేరుతాయి. ప్రాణహిత కూడా దీనికి ముందుగానే ఉన్నది. సాగునీటిని, జల విద్యుత్‌ను (తదనుగుణంగా వ్యయాన్ని) పంచుకునే విషయమై మహారాష్ట్రతో చర్చించవచ్చు. కనీసం సగం తెలంగాణకు ఇవ్వాలె. దీని వల్ల తెలంగాణ, మహారాష్ట్రలోనున్న విదర్భలోని వెనుకబాటు తనాన్ని ప్రాణహిత ద్వారా పారదోలవచ్చు.

ఎగువ కాళేశ్వరం (100-120 మీటర్లు) : నీటి లభ్యత ఎక్కువగా ఉండే అద్భుతమైన ప్రాంతం ఇది. ఇక్కడే ప్రాణహిత, గోదావరి కలుస్తాయి. కానీ ఎత్తు ఎక్కువగా ఉంటే ముంపు ఎక్కువగా మహారాష్ట్రలో ఉంటుంది. అందువల్ల ఎత్తు తగ్గించి, రివర్సిబుల్ టర్బైన్స్‌తో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలి. దగ్గరలో దిగువ కాళేశ్వరం డ్యాం ఉంటుంది.
దిగువ కాళేశ్వరం (93-115 మీటర్లు): ఈ రెండు రిజర్వాయర్ల మధ్య తక్కువ ముంపుతో లోయర్ రిజర్వాయర్ ఏర్పడుతుంది. ఎగువ, దిగువ రిజర్వాయర్ల మధ్య రివర్సిబుల్ టర్బైన్స్ కోసం అనుకూలమైన దిగువ రిజర్వాయర్ ఏర్పాటు చేయవచ్చు.

box



river

ఇచ్చంపల్లి (80-100 మీటర్లు): ఒకప్పుడు 125 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్‌తో వెయ్యి టీఎంసీల నీటిని వినియోగించుకునే భారీ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. కానీ నిర్మాణం జరగలేదు. అటవీ ఖనిజ సంపద మునగ కుండా వంద మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్‌తో నిర్మించవచ్చు. దీని నుంచి పైప్ ద్వారా దేవాదులకు నీరు పంపవచ్చు. 75 నుంచి 90 మీటర్ల మేర నీటిని తోడడం తప్పుతుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.

కంతనపల్లి:(70-85 మీ) సాగునీటి ప్రాజెక్టు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వవలసిన స్థలం ఇది. ఇక్కడ ఇరువైపుల తెలంగాణ భూభాగం ఉన్నది కాబట్టి ఎంత పెద్ద ప్రాజెక్టు వీలైతే అంత నిర్మాణం చేపట్టాలి. ఇక్కడి నుంచి దేవాదులకు నీటిని అందిస్తూ, విద్యుత్ వినియోగం తగ్గిస్తుంది. ప్రాణహిత, ఇంద్రావతి జలాలు భారీగా చేరడం వల్ల, గోదావరి మిగులు జలాలతో వంద రోజుల పాటు పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు.

ఎదిర: (57-70 మీ) ఇక్కడ మంచి బ్యారేజీని నిర్మించడానికి తెలంగాణకు రెండో ప్రాధాన్య ప్రాజెక్టు స్థలం. ఇక్కడ కూడా నీళ్లు, ముంపు ప్రాంతాలు తెలంగాణ భూభాగంలోనే ఉంటాయి. ప్రాజెక్టుకు రెండువైపులా వినియోగించుకుని సాగునీటి, థర్మల్ ప్లాంట్స్, హైడ్రో పవర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.


పర్ణశాల:(50-60 మీ) దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది.
దుమ్ముగూడెం:(45- 50 మీ.) ఇది పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోతుంది. కాబట్టి దీనిపై పెద్ద బ్యారేజీ చేపట్టి భద్రాచలంకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీనిని మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణహిత, గోదావరి నదులపై చేపట్టబోయే ఈ డ్యాంల, బ్యారేజీ నిర్మాణం వల్ల మనం సాగునీటి కోసం 650 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. అలాగే 4000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ విద్యుత్‌ను 200 నుంచి 400 మీటర్ల ఎత్తు వరకు నీటిని తరలించడానికి లిఫ్ట్ పంపుల కోసం ఉపయోగించుకోవచ్చు.

venkat


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!




2 కామెంట్‌లు:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మీ స్పందనలను వ్యాఖ్యలరూపంలో వెలువరించండి.

కమనీయం చెప్పారు...

మీరు వ్రాసినట్లు 650TMCల గోదావరి జలాలు తెలంగాణా ప్రాజెక్టులద్వారా వినియోగించుకుంటే మంచిదే.కానివాటికి కావలసిన నిధులు ,ఒక్కొక ప్రాజెక్టుకి అయే ఖర్చు వివరాలు కూడా వ్రాస్తే బాగుండేది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి