గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 07, 2015

బాబునోట...అవే అసత్యాలు...మళ్లీ మళ్లీ!

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. తను కోరినట్లు సమన్యాయం జరగలేదంటున్న చంద్రబాబు, ఏమి చేసిఉంటే న్యాయం, సమన్యాయం జరిగి ఉండేదో కేంద్రానికి లఖితపూర్వకంగా కానీ, మౌఖికరూపంలో గాని ఒక్కముక్క కూడా సూచించలేదు. సమన్యాయం అన్నది ఎవరికీ అర్థం తెలియయని బ్రహ్మపదార్థంగా మిగిలింది. కావలసిందేమిటో ఇతర పార్టీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ వారు జాబితాలు ఇచ్చారు. కానీ టీడీపీ అధినేత నోరు విప్పలేదు. ఇవ్వకుండా తర్వాత నిందించవచ్చుననే ఎత్తుగడ అందుకు కారణమనుకోవాలి. అవసరమైన సమయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తక్కిన పార్టీలవలె చేయవలసింది చేయక ఈ తరహా ఎత్తుగడ రాజకీయాలను నడిపిన చంద్రబాబు, తర్వాత కేంద్రాన్ని నిందించటంలో గల నిజాయితీ ఏమిటి?


ashok

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును గోబెల్స్ అనడం సమంజసం కాబోదు. గోబెల్స్ చెప్పిన దాని ప్రకారం అసత్యాలను మళ్లీ మళ్లీ చెప్పి ప్రచారం చేసినట్లయితే ప్రజలను అదే నిజమని నమ్మించవచ్చు. ఈ సూత్రీకరణలో మంచి తర్కం ఉన్నమాట నిజమే అయినా, అది దేశ కాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది చంద్రబాబుకే అర్థమైనట్లు లేదు. కనుక కొన్ని అసత్యాలను మళ్లీ మళ్లీ చెప్తున్నారు. గోబెల్స్ కాలం కన్నా ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులు అయినందున తను చెప్తున్న దాన్ని తెలంగాణ సంగతి సరేసరి కాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ విశ్వసించటం లేదిపుడు. అంతేకాదు ఆయన తన అసత్యాలను పునశ్చరించేకొద్దీ ఆయన మాటల పట్ల నమ్మకం ఇంకా తగ్గిపోతున్నది. ఈ విషయం చంద్రబాబు ఎంత త్వరగా గ్రహిస్తే ఆయనకే అంత మంచిది.


కొన్ని ఉదాహరణలను చూద్దాం. తను ఆగస్టు 31న మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, ఏకపక్షంగా, ఇష్టానుసారంగా ఉమ్మడి రాష్ర్టాన్ని విభజించిందని అన్నారు. తను ఈ మాట అనటం ఎన్నవసారో లెక్క కూడా లేదు. అదే చంద్రబాబు సరిగ్గా రెండు వారాల క్రితం ఆగస్టు 14న ఒక వివరణ పత్రం విడుదల చేస్తూ, తాను విభజన వద్దనలేదని అన్నారు. ఆ మాట కూడా లెక్కలేనన్ని సార్లన్నారు. అందుకు పొడిగింపు అన్నట్లు, తెలంగాణ ఏర్పడటానికి కారణం తాను కేంద్రానికి ఇచ్చిన అంగీకార లేఖేనని కూడా తెలంగాణలో పలుమార్లు సగర్వంగా ప్రకటించుకున్నారు. ఈ రెండు విధాలైన మాటల మధ్య గల వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. చంద్రబాబు పార్టీ తొలిదశలో విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వటం, తర్వాత అనుకూలంగా ఇవ్వటం రెండూ వాస్తవాలు. మొదటి వైఖరిని తర్వాత ఎందుకు మార్చుకోవలసి వచ్చిందనేది అందరికీ తెలిసిందే గనుక ఆ చర్చ అక్కరలేదు. కానీ మార్చుకున్నారన్నది నిజం. 


కానీ మొదటి లేఖను గాని, రెండవ లేఖను గాని అసలు కేంద్రానికి ఎందుకు పంపవలసి వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న. విభజనకు అవుననిగాని, కాదని కాని ఆయన తనంతట తానే లేఖలు రాశారా, లేక తమ పార్టీ వైఖరి ఏమిటని కేంద్రం అడిగిన మీదటనా? సమాధానం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై వైఖరి తెలియజేయవలసిందంటూ అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని, రాష్ట్రంలోని వివిధ ప్రధాన పక్షాలకు వలెనే టీడీపీకి కూడా లేఖ రాసింది. అటువంటి స్థితిలో ఎవరినీ సంప్రదించలేదన్న చంద్రబాబు ఫిర్యాదుకు గల విలువేమిటి?
ఇంకా చెప్పాలంటే, కేంద్రం నేరుగా కానీ, కేంద్రం పనుపున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇదే ప్రశ్నపై టీడీపీ సహా వివిధ పార్టీలను ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలోనే గాక ముఖాముఖి ప్రత్యేక సమావేశాలలో అనేకమార్లు సంప్రదించింది. 


ఇక్కడ అసెంబ్లీలో ఢిల్లీ అఖిలపక్ష సమావేశాలలో విభజన అంశాన్ని నిర్దిష్టంగా, సూటిగా చర్చించారు. తనవైఖరి మారిన అనంతరం టీడీపీ ప్రతిసారి తాము విభజనకు సుముఖమని చెప్తూ వచ్చింది. ఇవన్నీ సంప్రదింపులు కావా? అట్లాంటి వైఖరి తీసుకున్న టీడీపీ ఆ మాట తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నది. విభజనను ఆమోదిస్తున్నామని తెలంగాణలో చాటిచెప్పుకుంది. తమ లేఖ ఇవ్వనట్లయితే కేంద్రం విభజనకు నిర్ణయించే ఉండేదికాదని తెలంగాణ టీడీపీ నాయకులు పదేపదే సగర్వంగా ప్రకటించుకున్నారు. దీనంతటికి విరుద్ధంగా చంద్రబాబు తెరవెనుక చేసిందేమిటన్నది అట్లుంచుదాం. అది అప్రస్తుతం. కానీ, తెరముందట జరిగినవన్నీ కూడా, విభజన విషయమై యూపీఏ ప్రభుత్వం టీడీపీని గాని, మరొకరిని గాని సంప్రదించనే లేదన్నమాట నిజం కాదని స్పష్టం చేస్తున్నాయి.


చంద్రబాబును కేంద్రం సంప్రదించిందని, ఆయన సానుకూలంగా లేఖ ఇచ్చారని, అదే మాట తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం చెప్పుకుంటూ, మరొక విధమైన రాజకీయ లబ్ధి కోసం సీమాంధ్రలో వ్యతిరేకపు మాటలు మాట్లాడుతున్నారని ఆ రోజుల్లోనే సీమాంధ్ర ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఆ మాట అక్కడి ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేగాక, సాధారణ ప్రజలు కూడా ఎత్తిచూపారు. 2014 విజయానికి కారణాలు అనేకం ఉన్నాయి. పరిస్థితులు తనకు వేర్వేరు విధాలుగా కలిసివచ్చాయి. కానీ దాని అర్థం విభజన విషయమై కేంద్రం టీడీపీని సంప్రదించనేలేదని సీమాంధ్రులు నమ్మారని కాదు. 


పైగా ఆ సంప్రదింపులు టీడీపీ వైఖరులు అన్నీ కూడా మీడియాలో ప్రతిదశలో నమోదు అయి ప్రజల దృష్టికి వచ్చినటువంటివే. ఇదంతా చంద్రబాబుకు తెలియదని గాని, గుర్తుకులేదని గాని అనుకోలేం. అటువంటి స్థితిలో విభజన కూడా జరిగిపోయి పదిహేను మాసాలు గడిచిన వెనుక ఆయన యూపీఏ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, ఏకపక్షంగా విభజన చేసిందని వాదించ బూనుతున్నారంటే, గోబెల్స్ సూత్రానికి సర్వకాల సర్వావస్థలలోనూ విలువ ఉంటుందని నమ్ముతున్నారన్న మాట. ఆయన ఇంత అమాయకంగా, ఇంత తరచుగా అదే సత్యాన్ని మళ్లీ మళ్లీ చెప్పటాన్ని చూసి ఆశ్చర్యం, విసుగు, జుగుప్స అన్నీ కలుగుతున్నాయి. అయితే ఇంతకూ ఇది ఇట్లా ఎందుకు జరుగుతున్నట్లు? చంద్రబాబు తనకు తెలియకుండానే యాదాలాపంగా, అట్లా మాట్లాడటం ఒక అలవాటుగా మారిపోయి అంటున్నట్లా? ఆ విధంగా తోచదు. అందుకు ఏదో కారణం ఉండే ఉండాలి. అది ఏమై ఉంటుంది?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదేపదే అంటున్న మాటలు మరికొన్ని ఉన్నాయి. విభజన విషయమై ఎవరినీ సంప్రదించలేదనే మాటకు, ఈ అదనపు మాటలకు మధ్య గల సంబంధాన్ని మనం కనుగొనే ప్రయత్నం చేసినట్లయితే అప్పుడాయన ఎవరినీ సంప్రదించలేదనే ఈ గోబెల్స్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావచ్చు. చంద్రబాబు అదనపు మాటలు ఏమిటి? కేంద్రం రాష్ర్టాన్ని ఇష్టానుసారంగా, ఒక పద్ధతి లేకుండా విభజించింది. సమన్యాయం చేయాలని కోరితే పట్టించుకోలేదు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆర్టికల్ 3 కింద విభజన చేశారు. కొత్త రాష్ర్టానికి రాజధాని ఏదో చెప్పకుండా విభజించారు వగైరాలు. ఈ మాటలలో కొన్ని వక్రీకరణలున్నాయి. కొన్ని స్వయంగా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేవి ఉన్నాయి. అవేమిటో చూసేముందు ఒక మాట చెప్పుకోవాలి. 


చంద్రబాబు ప్రస్తుతం కొన్ని సమస్యలలో ఉన్నారు. మరొకవైపు భవిష్యత్తు అభివృద్ధి గురించి తనకు కొన్ని ఆలోచనలున్నాయి. ఆ సమస్యలు బయటపడటం, భవిష్యత్తు ఆలోచనలకు పరిస్థితులను సానుకూలం చేసుకోవటం అనే రెండూ ఆయనకు అవసరం. ఈ రెండు అవసరాలు తీరేందుకు ఆయన ఒక వ్యూహం రచన చేసుకున్నట్లు కనిపిస్తున్నది. సరిగా ఆ వ్యూహంలో భాగంగానే ఆయన, తను చెప్పే మాటలు కొన్ని అసత్యాలని తెలిసికూడా అవే అసత్యాలు మళ్లీ మళ్లీ చెప్తున్నారు. అదే విధంగా, పైన మనం అదనపు మాటలు అన్నవాటిని మాట్లాడుతున్నారు.


రాష్ట్ర విభజన చివరిదశలో కొంత హడావుడి జరగటం, కొన్ని అంశాలు అస్పష్టంగా ఉండటం నిజం. ఇందుకు కారణం ఏమిటి? తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ స్థాయిలో, ప్రభుత్వస్థాయిలో సంవత్సరాల తరబడి సంప్రదింపుల అనంతరం చివరకు సూత్రరీత్యా నిర్ణయం జరిగిపోయిన తర్వాత కూడా సీమాంధ్ర ధనిక వర్గాలు, రాజకీయ వర్గాలు దానిని ఏ విధంగానైనా అప్పటి లోక్‌సభా కాలంల జరగనివ్వకుండా ఉండాలని శాయశక్తులా ప్రయత్నించారు. కేవలం వారి ఒత్తిళ్లు, ఎత్తుగడల కారణంగా ఎప్పుడో తాపీగా, సావధానంగా జరగవలసిన విభజన చివరి సమావేశాల చివరి దశవరకు నెట్టుకుపోయింది. ఆఖరుకు చివరిక్షణాలలోనూ వారు లోక్‌సభలో చేసిన పెప్పర్‌స్ప్రే డ్రామా, రాజ్యసభలో సాగించిన నానా రభస నాటకం వంటివి తెలిసిందే. తీరా బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా ఖమ్మం మండలాల విషయమై తమ పలుకుబడిని చూపగలిగారు. కేవలం వారి కారణంగానే ఈ చివరిదశ హడావుడి, కొన్ని అస్పష్టతలు చోటుచేసుకున్నాయి. వారు నిజాయితీగా వ్యవహరించి కేంద్రానికి ఊపిరి తిరగనిచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదు. కానీ అప్పటి లోక్‌సభలో ఏమీ తేలకుండా ఆపగలిగితే, తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి మొత్తం వ్యవహారం వెనుకకుపోగలదన్నది వారి ఎత్తుగడ. 


ఇవేవీ రహస్యాలు కావు. చంద్రబాబు ఇదేమి తెలియనట్లు అమాయకంగా, కేంద్రం ఒక పద్ధతి లేకుం డా విభజించిందని అంటున్నారు. సీమాంధ్ర ధనిక వర్గాలు, రాజకీయ వర్గాల పలుకుబడులు, లాబీయింగ్‌లు, ఎత్తగడలు, కుట్రల చరిత్ర మొత్తం ఉమ్మడి రాష్ట్రపు చరిత్ర పొడవునా పరుచుకుని ఉన్నది. చిదంబరం ప్రకటన, విభజన బిల్లు తయారీ- ఆమోదాల దశలో అది పరాకాష్ఠకు చేరింది. ఒకవైపు ఇటువంటి చరిత్రలో కీలక పాత్ర పోషిస్తూనే మరొకవైపు తానే, తామే కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త చేష్టలకు బాధితులైనట్లు లోకాన్ని గోబెల్స్ పద్ధతిలో నమ్మించచూసేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నంలో భాగమే ఈ మాటలన్ని. ఇక్కడ గమనించవలసింది ఒకటున్నది. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. 


తను కోరినట్లు సమన్యాయం జరగలేదంటున్న చంద్రబాబు, ఏమి చేసిఉంటే న్యాయం, సమన్యాయం జరిగి ఉండేదో కేంద్రానికి లఖితపూర్వకంగా కానీ, మౌఖికరూపంలో గాని ఒక్కముక్క కూడా సూచించలేదు. సమన్యాయం అన్నది ఎవరికీ అర్థం తెలియయని బ్రహ్మపదార్థంగా మిగిలింది. కావలసిందేమిటో ఇతర పార్టీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ వారు జాబితాలు ఇచ్చారు. కానీ టీడీపీ అధినేత నోరు విప్పలేదు. ఇవ్వకుండా తర్వాత నిందించవచ్చుననే ఎత్తుగడ అందుకు కారణమనుకోవాలి. అవసరమైన సమయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తక్కిన పార్టీలవలె చేయవలసింది చేయక ఈ తరహా ఎత్తుగడ రాజకీయాలను నడిపిన చంద్రబాబు, తర్వాత కేంద్రాన్ని నిందించటంలో గల నిజాయితీ ఏమిటి? ఇది కేంద్రాన్ని సమర్థించడం కోసం అంటున్నమాట కాదు. కానీ చంద్రబాబు తాను చేయవలసింది ఏమి చేశారన్నది ప్రశ్న. అది చేసి ఆ తర్వాత ఇతరులను వేలెత్తిచూపితే అందులో సహేతుకత ఉంటుంది.


ఆర్టికల్ 3 గురించి, రాజధాని గురించి అనే మాటలు అర్థం లేనివి. ఇతర రాష్ర్టాల ఏర్పాటుకు ముందు అసెంబ్లీ తీర్మానాలు జరిగాయా లేదా అన్నది కాదు. వాటి విభజన జరిగింది కూడా ఆర్టికల్ 3 ప్రకారమే. అసెంబ్లీ తీర్మానం ముందస్తుకాని, తర్వాత కానీ అసలు ఏ దశలోనైనా అసెంబ్లీల ఆమోదం అవసరమని గాని సదరు ఆర్టికల్ లో ఎక్కడా లేదని, కేవలం రాజకీయ సౌలభ్యం కోసం అప్పుడు తీర్మానాలు జరిగాయని చంద్రబాబుకు తెలియక కాదు. 


అటువంటిది తప్పనిసరైతే సీమాంధ్ర మెజార్టీ సభ్యులు తెలంగాణ తీర్మానాన్ని ఓడించి ఉండేవారు గదా అన్నది ఆయన ఆలోచన. ఇది మనం గ్రహించలేని మేధావి డిస్కవరీ ఏమీ కాదు. అదే పద్ధతిలో రాజధాని ఏదో ముందే చెప్పటం కేంద్రానికి ప్రజాస్వామికం అవుతుందా, లేక ఆ నిర్ణయాన్ని కొత్త రాష్ర్టానికి వదిలివేయటమా? ఇవన్నీ మాట్లాడే చంద్రబాబు దేశ చరిత్రలో లేనివిధంగా పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో హక్కులంటూ రెవెన్యూలో భాగం అనే తమ అపూర్వమైన కోర్కెలు, వగైరాల గురించి మాత్రం మాట్లాడరు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి