గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 22, 2015

టీఎస్‌పీఎస్సీలో...దొంగలు పడ్డారు!!!

TSPSC


రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ అక్రమాలు, అన్యాయాలనుంచి సొంత అస్తిత్వం దిశగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు సాగుతున్నాయి. ఒకవైపు ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు వాటిని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగుల కలలు నెరవేర్చే కేంద్రంగా ఉన్న టీఎస్‌పీఎస్సీలో ఏపీపీఎస్సీ సిబ్బంది కొందరు తాజాగా అరాచకానికి దిగారు.

-డూప్లికేట్ కీతో కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోకి చొరబడ్డ ఏపీపీఎస్సీ ఉద్యోగులు
-ఫైళ్లు, కుర్చీలు చిందరవందర.. పలు కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు మాయం!
-తెలంగాణ ఉద్యోగ భర్తీ ప్రక్రియపై అక్కసుతోనే?
-పోలీసులకు కమిషన్ కార్యదర్శి ఫిర్యాదు
-ఇక సహించబోమంటున్న ఉద్యోగ నేతలు


టీఎస్‌పీఎస్సీలోని అత్యంత కీలకమైన కాన్ఫిడెన్షియల్ రూమ్ తలుపులను దొంగల్లా డూప్లికేట్ తాళంతో తెరిచి చొరబడిన ఏపీపీఎస్సీ ఉద్యోగులు అక్కడి ఫైళ్లు చిందరవందర చేశారు. కుర్చీలు లాగిపడేశారు. కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి విధులు నిర్వర్తించే స్థలాన్ని ఆక్రమించారు. కొన్ని కీలకమైన ఫైళ్లు సైతం అజాలేకుండా పోయాయని తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాల విషయంలో వేగంగా దూసుకుపోతూ తొలి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపైనా ఏపీ కుట్రలకు దిగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

TSPSC01


ఇంత వరకూ ఏపీపీఎస్సీ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయని నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ వరస నోటిఫికేషన్లకు సిద్ధమవడమే కాకుండా.. రెండు రోజుల క్రితమే తన తొలి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గ్రూప్స్ సిలబస్ సిద్ధం చేస్తున్నది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రానున్న రోజుల్లో నోటిఫికేషన్లను జారీ చేయనున్న నేపథ్యంలో దీనిపై అక్కసుతోనే ఏపీపీఎస్సీలోని కొందరు అధికారులు, సిబ్బంది ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏఈఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా కార్యాలయంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి అక్కడ వాతావరణం చూసి కంగుతిన్నారు.


ఏపీ ఉద్యోగులు అక్కడినుంచి కదిలేందుకు ససేమిరా అన్న పరిస్థితిని చైర్మన్ ఘంటా చక్రపాణికి వివరించారు. చైర్మన్ సూచన మేరకు కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అయితే అప్పటికే ఏపీ ఉద్యోగులు కాన్ఫిడెన్షియల్ గదిలోనుంచి వెళ్లిపోయారు. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ రూమ్‌లో ఏపీ ఉద్యోగులు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు చైర్మన్ ఘంటా చక్రపాణి నివేదించారని అనంతరం మీడియాతో మాట్లాడిన టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సీ విఠల్ తెలిపారు. త్వరలో గవర్నర్‌ను కమిషన్ ఉన్నతవర్గాలు కలవనున్నట్లు చెప్పారు.


ఏపీపీఎస్సీని తమ కార్యాలయంనుంచి ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసిందని ఆయన వివరించారు. ఇదిలాఉండగా శుక్రవారం సాయంత్రం సైతం టీఎస్‌పీఎస్సీకి చెందిన గదులకు ఏపీపీఎస్సీ ఉద్యోగులు తాళాలు వేసినట్లు సమాచారం. ఏపీపీఎస్సీ దుందుడుకు చర్యల నేపథ్యంలో ప్రస్తుత భవనం నుంచి ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని వేరేచోటికి తరలించాలన్న డిమాండ్ ముందుకు వస్తున్నది. 


మంచితనమే తప్పయింది...


రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఐదు అంతస్తుల భవనంలోనే టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం ఏపీపీఎఎస్సీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తాత్కాలికంగా స్థలం ఇచ్చేందుకు తెలంగాణ కమిషన్ వర్గాలు అంగీకరించాయి. ఈ మేరకు రెండు కమిషన్ల కార్యదర్శుల సమక్షంలో ఇరు కమిషన్ల ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది.


మొదటి ఫ్లోర్‌ను పార్కింగ్‌కు వాడుకోవాలని, 2, 3 ఫ్లోర్‌లను టీఎస్‌పీఎఎస్సీ, 4, 5 ఫ్లోర్‌లను ఏపీపీఎఎస్సీ ఉపయోగించుకోవాలని స్పష్టంచేశారు. ఈ ఒప్పందాన్ని ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సైతం అభినందించారు. అయితే 2, 3వ అంతస్తులలో గల ఏపీపీఎఎస్సీ వర్గాలు తమకు కేటాయించిన ఫ్లోర్‌లలోకి వెళ్లడం లేదు. అయినప్పటికీ టీఎస్‌పీఎఎస్సీ వర్గాలు సహకరిస్తూనే వారితో తమ 34 సెక్షన్‌లను కలిపి ఉంచుకొని పనిచేసుకుంటున్నాయి. మరోవైపు కేటాయించిన స్థలం ఖాళీ చేయకపోవడం వల్ల 5వ అంతస్తులోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌నుంచే టీఎస్‌పీఎస్సీ తన కార్యకలాపాలు నిర్వర్తించుకోవాల్సి వస్తున్నది. ఈ క్రమంలో తాజాగా నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాతి రోజు అయిన శుక్రవారం ఏపీపీఎస్సీ ఉద్యోగులు కొందరు టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ గదిని డూప్లికేట్ తాళంతో తెరవడం అనేక అనుమానాలు లేవనెత్తుతున్నది.


కొలువుల ప్రకటనతో కుట్రకు తెర


ఏపీపీఎస్సీ కొలువుల నియామకానికి ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. మరోవైపు టీఎస్‌పీఎస్సీ కొత్త కొలువుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తున్నది. అదే క్రమంలో కొత్త సిలబస్ రూపొందించడం, విస్తృత స్థాయిలో నిపుణులతో చర్చలు జరపడం, వేగంగా డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించడంవంటి పనుల్లో బిజీగా ఉంది. తక్కువ మంది సిబ్బందే ఉన్నా.. అంతా కలిసికట్టుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, నియామక ప్రక్రియలో ఆటంకాలు కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే కీలకపత్రాలు ఉండే రహస్య గదిలోకి ఏపీ ఉద్యోగులు చొచ్చుకువచ్చారని టీఎస్‌పీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.


కమిషన్‌లు నడుస్తున్న భవనంలో ఉన్న ఏకైక స్ట్రాంగ్ రూం కూడా ఏపీపీఎస్సీ కస్టడీలోనే ఉంది. ఒప్పందం ప్రకారం భవనాన్ని వాడుకోవాలని కమిషన్ ఉన్నతవర్గాలు ఒప్పందం చేసుకున్నా.. కిందిస్థాయి ఉద్యోగులు దాన్ని బేఖాతరు చేయడం ఏపీ ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని చాటుతున్నదని తెలంగాణ కమిషన్ ఉద్యోగులు అంటున్నారు. ఇపుడు నోటిఫికేషన్లు ప్రారంభదశలోనే ఉన్నాయని అయితే.. గ్రూప్స్, ఇతర నోటిఫికేషన్లు వచ్చిన సమయంలో భారీ స్థాయిలో రహస్య సమాచారం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఏపీ ఉద్యోగులు దురుద్దేశపూర్వకంగా ఇదే తరహా చర్యలకు దిగితే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఘటన వివరాలను వివరిస్తూ, ఏపీపీఎస్‌స్సీని తమ భవనం నుంచి వేరే పంపించాలని కోరుతూ అతి త్వరలో పునర్విభజన కమిటీకి లేఖ రాయాలని టీఎస్‌పీఎస్సీ ఉన్నతవర్గాలు యోచిస్తున్నాయి.


దర్యాప్తు చేస్తున్న పోలీసులు


టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ కార్యదర్శి సీతాదేవి చాంబర్‌ను ఏపీపీఎస్సీ సిబ్బంది అక్రమంగా నకిలీ తాళంతో తెరిచి గదిని స్వాధీనం చేసుకున్నారని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ శుక్రవారం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చాంబర్‌లో ఇటీవల టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ ఫైల్స్‌తో పాటు కార్యాలయానికి సంబందించిన విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 5వ అంతస్తులోని తమ చాంబర్‌ను అక్రమంగా తెరవడమే కాకుండా అందులోని విలువైన పత్రాలను కూడా మాయం చేసి ఉంటారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 5వ అంతస్తులోని తమ చాంబర్‌ను అప్పగించాలని ఏపీపీఎస్సీ అధికారులను కోరినా అప్పగించడంలేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ గంగసాని శ్రీధర్ తెలిపారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి