గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, డిసెంబర్ 05, 2015

హైదరాబాద్...తెలంగాణ అస్తిత్వ పతాక!

ఓవైపు బీజేపీ- తెలంగాణ వస్తే రజాకార్ల రాజ్యమవుతుందనే దుష్ప్రచారానికి ఒడిగట్టింది. అలాగే మజ్లిస్ పార్టీ కూడా- తెలంగాణ వస్తే మైనారిటీలకు రక్షణ ఉండదనే అపోహను ప్రచారంలో పెట్టింది. ఇలా బీజేపీ-మజ్లిస్ పార్టీలు నగరంలో తమ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశాయి. ఆంధ్రాధిపత్య రాజకీయాలకు తోడ్పడ్డాయి. కాబట్టి, ఆ కుతంత్రాలను ఛేదించి తెలంగాణ అస్తిత్వాన్ని నగర ప్రజల్లో పాదుకొల్పాల్సిన అవసరాన్ని ఎవరు గుర్తించినా వారిని ప్రశంసించాల్సిందే. 

srinivas


హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై అన్ని పార్టీల దృష్టి మాత్రమే కాదు, సీమాంధ్ర పత్రికలూ బాగా దృష్టిపెడుతున్నాయి.మొన్నటికి మొన్న ఓ పత్రిక రాజధానిలో దాహార్తి అంటూ ఫ్రంట్ పేజీలో ఓ స్టోరీ రాసింది. సమస్యలను ఎత్తి చూపడం పత్రికల విధి అనడంలో అనుమానం లేదు. సమస్యను భూతద్దంలో చూపడం తప్ప... ప్రభుత్వం ఆ సమస్యను ఎంత తీవ్రమైనదిగా పరిగణించి పనిచేస్తున్నదనే విషయాన్ని మరుగుపరుచడంలోనే... ఆ పత్రిక దుర్బుద్ధి మనకు అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య ఉన్నది. దాన్ని అధిగమించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి కూడా ఉన్నది. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులు అందరికీ తెలిసినవే. అలాగే నగర దాహార్తిని తీర్చడానికి శాశ్వత ప్రణాళికలను గత రెండు దశాబ్దాలుగా సమైక్య పాలకులు పట్టించుకొని ఉంటే ఇవాళ నగరంలో తాగునీటి సమస్య ఉండేది కాదు. 
కానీ ఆ పత్రిక ఆ విషయాన్ని మరుగు పరిచి, ఇప్పటి ప్రభుత్వంపై నెపం నెట్టి చూపాలనే ఉద్దేశం తప్ప మరొకటి కనిపించదు. గోదావరి నీటిని నగరానికి తరలించడంలో సీఎం కేసీఆర్ కృషిని ప్రశంసించక తప్పదు. ఎల్లంపల్లి నుంచి గోదావరి నీటిని నగరానికి తరలించడానికి కేంద్ర అటవీ శాఖ, రక్షణ శాఖల నుంచి ఆరు నెలల్లోనే అనుమతులు సాధించారు. యుద్ధ ప్రాతిపదికన కేసీఆర్ చేసిన పని తీరు గురించి ఆ పత్రిక ఒక్క మాట రాయకపోవడం దాని రాతల్లో దాగివున్న మర్మాన్ని తెలియజేస్తుంది. గత పాలకులు రాజధాని హైదరాబాద్‌లో సమస్యలను కావాలని వదిలేసిపోయారు. ఆ సమస్యలు వచ్చిన తెలంగాణను మరింత పీడించాలనే సమైక్య పాలకుల దురుద్దేశాల ఫలితమే నేడు నగరంలో ఉన్న నీటి సమస్య. 

ఇక తెలంగాణ మూడేళ్లలో రాబోతున్నదనగానే, అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం... కరెంటు కొరతను గాలికి వదిలేసిన విషయం తెలిసిందే. కరెంటు కొరతతో... వచ్చిన తెలంగాణ... తల్లడిల్లాలనే వారి దురుద్దేశం సుస్పష్టం. ఆరు నెలలలోనే విద్యుత్ కొరతను కేసీఆర్ ప్రభుత్వం అధిగమించింది. పరిశ్రమలకు డిమాండ్ తగ్గ విద్యుత్ సరఫరా జరుగుతున్నది. చిన్న, కుటీర పరిశ్రమలు నిరాటంకంగా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. కార్మికులకు ఉద్యోగ భద్రతా పెరిగింది. హైదరాబాద్‌లో రౌండ్ ది క్లాక్ విద్యుత్ సరఫరా జరుగుతుండటం కేసీఆర్ ప్రభుత్వ పని తీరుకు ఒక నిదర్శనం.

నగరంలోని సగటు పౌరుడు ఏం కోరుకుంటాడు? శాంతి భద్రతలు, నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీరు, మంచిరోడ్లు, పరిశుభ్రత. పై అంశాలలో మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చిత్తశుద్ధితో పని చేస్తున్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఇక ప్రధానమైనది శాంతిభద్రతల అంశం. మనకు తెలిసి నగరంలో పోలీసు వ్యవస్థ ఇంత పకడ్బందీగా గతంలో పనిచేసింది లేదు. అందుకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. రాత్రి 11 దాటిందంటే, జూబ్లీహిల్స్ లాంటి వీఐపీ ప్రాంతాల్లో, అలాగే పాతనగరంలో యువకుల బైక్ రైడింగ్‌లు, కారు రైడింగ్‌లు, స్ట్రీట్ ఫైటింగ్ బెట్టింగ్‌లు, రాత్రిపూట రోడ్డుపై వెళ్లేవారి పట్ల ఈవ్ టీజింగ్‌లు జరిగేవి. ప్రజలు రాత్రిపూట బయటికి వెళ్లాలంటే కొంత జంకేవారు. గత ఏడాదిన్నరగా నగరంలో రాత్రి పూట యువకులు చేసే న్యూసెన్స్‌ను నగర పోలీసులు చాలా పకడ్బందీగా కట్టడి చేయగలిగారు. 
రాత్రిపూట రోడ్లపై వాహన రైడింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌లు, న్యూసెన్స్ సృష్టిస్తున్న యువకులను నగర పోలీసులు పట్టి, వారికి కౌన్సిలింగ్‌లు ఇప్పిస్తున్నారు. వారి తల్లిదండ్రులకు సైతం కౌన్సి లింగ్ ఇస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. పోలీసులు తమ పిల్లల ప్రవర్తనను చక్కది ద్దుతున్నందుకు తల్లిదండ్రులు సైతం సంతోషిస్తున్నారు. నగరంలో పోలీసింగ్ వ్యవస్థ పని చేస్తున్న తీరును ప్రశంసిస్తున్నారు. రోడ్లపైనా, బస్‌స్టాప్‌లలో అమ్మాయిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌లకు గురి కావడం గతంలో సర్వసాధారణం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. అవి మంచి ఫలితాలను చూపిస్తున్నాయి. ఎక్కడ పోకిరీలు తారస పడినా మహిళలు షీటీమ్‌లకు ఫోన్ చేసి చెప్పగలుగుతున్నారు. దీని వల్ల పోకిరీల ఆగడాలు నగరంలో చాలా మేరకు తగ్గాయని క్రైం రిపోర్టులే చెపుతున్నాయి. చూడడానికి ఇవన్నీ చిన్న విషయాలుగానే కనిపిస్తాయి.

ఇంత పెద్ద మహా నగరంలో సగటు మహిళకు భద్రత లేకపోతే.. దేనికి భద్రత ఉన్నట్లుగా మనం భావించాలి? నగరంలో తీవ్రవాదం ఏమూలలో దాగి ఉన్నా, దాన్ని పట్టి చట్టానికి అప్పగించడంలోనూ కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తున్నదనడానికి కేంద్ర ఇంటలిజెన్స్ విభాగం నుంచి లభిస్తున్న ప్రశంసలే ఒక సాక్ష్యం. ఇలా నగరంలోని శాంతి భద్రతల విషయంలో, ప్రభుత్వ పని తీరు పట్ల రాజధాని ప్రజల్లో ఇంతటి సానుకూల స్పందన కనిపిస్తుంటే, ఆంధ్రా మీడియాకు మాత్రం అవేవీ కనిపించకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.
హైదరాబాద్‌లో ఆంధ్రాప్రాంత ప్రజలు కేసీఆర్ ప్రభుత్వ పని తీరుపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు? అనేది కూడా కీలక ప్రశ్నే. ఉదాహరణకు గతేడాది కంటోన్మెంట్ ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. కంటోన్మెంట్‌లోనూ ఆంధ్రా ఓటర్లు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని అక్కడి ఫలితాలు కొంత మేరకు చెప్పాయి కూడా. రాష్ట్రం విభజన జరిగిపోయింది. వారు తెలంగాణ రాష్ట్రంలో బతకాలి కాబట్టి, ఇక్కడి ప్రభుత్వ పని తీరు ఆధారంగానే వారు ఓటేస్తారు తప్ప, ఆంధ్రాను ఏలుతున్న చంద్రబాబుకు ఓటేయరని కూడా ఆ ఫలితాలు రుజువు చేశాయి. ఆంధ్రాపార్టీలు గతంలో చేసిన దుష్ప్రచారాలు నిజం కావని కూడా వారు గుర్తిస్తున్నారు. తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకుంటామన్నారే గానీ ఆంధ్ర వాళ్లను వెళ్లగొడతామని ఏనాడూ అనలేదు. తెలంగాణ రాజ్యాధికారం కింద ఏ ప్రాంత ప్రజలు బతికినా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ రాజ్యాధికారానికి కన్నం వేయాలనుకున్న శక్తుల పట్ల మాత్రమే తెలంగాణ అప్రమత్తంగా ఉంటుందని గమనించాలి. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో బతుకుతున్న ఆంధ్రా ప్రజలు ఇప్పటికే బాగా అర్థంచేసుకున్నారు.

కాబట్టే, కేసీఆర్ ప్రభుత్వం పట్ల గుడ్డి వ్యతిరేకత కన్నా, కేసీఆర్ పని తీరును వారు గమనిస్తున్నారు.


సమైక్య పాలనలో మతవాదం, తీవ్రవాదాలకు హైదరాబాద్ కేంద్రమనే పేరు ఉంది. నగరాన్ని ఆంధ్రాధిపత్య, మతోన్మాదాధిపత్య రాజకీయాల నుంచి సగటు తెలంగాణ అస్తిత్వం వైపు మళ్లించాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించి పని చేస్తున్నారు. హైదరాబాద్‌ను ఒక శాంతి కాముక నగరంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. నగరంలో 30 శాతంపైగా ఉన్న మైనారిటీలున్నారు. మజ్లిస్ లాంటి రాజకీయపార్టీల మనుగడకు మైనారిటీలే బలమైన ఓటు బ్యాంకుగా పని చేస్తూ వస్తున్నారు. అలాంటి మజ్లిస్ పార్టీతో టీఆర్‌ఎస్ సాన్నిహిత్యాన్ని నెరపడమంటే, అది మత రాజకీయాలను ప్రోత్సహించడమని కొందరు అపోహపడవచ్చు.

కానీ మైనారిటీలనూ జనజీవన రాజకీయాల వైపు మళ్లించాల్సిన అవసరాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఉదాహరణకు గతంలో మజ్లిస్‌తో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలూ స్నేహం చేశాయి. రాజకీయ లబ్ధిని మూటగట్టుకున్నాయి. కానీ మైనారిటీల సంక్షేమంలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాయి. కానీ కేసీఆర్ మైనారిటీలను మతం ఆధారంగానే చూడకుండా వారిలో ప్రాంత భావాన్ని పెంపొందించి తెలంగాణ జనజీవనంలో మమేకం చేయాలనుకుంటున్నారు. నిజానికి అదొక అభ్యుదయం. నగర రాజకీయాలలో అభ్యుదయ ఆలోచనా విధానాలు పెంపొందించాల్సిన బాధ్యతను గతంలో కాంగ్రెస్‌గానీ, టీడీపీగానీ గుర్తించలేదు. సరికదా మత రాజకీయాలతో ఆటలాడుకున్నాయి. తమ పబ్బం గడుపుకున్నాయి.

ఆ రెండు పార్టీల బాధ్యతారాహిత్యంతోనే హైదరాబాద్ నగర రాజకీయాలు మతాల చుట్టూ, ఉన్మాదాల చుట్టూ, ఆంధ్రాధిపత్యాల చుట్టూ తిరిగాయి. దానితో తెలంగాణ అస్తిత్వం నుంచి హైదరాబాద్‌ను వేరు చేయాలనే కుతంత్రాలను నడిపాయి. ఒకప్పుడు ఉద్యమ కాలంలో నగర ప్రజలను తెలంగాణ అస్తిత్వానికి దూరం చేసే కుతంత్రాలు జోరుగా సాగాయి. ఓవైపు బీజేపీ- తెలంగాణ వస్తే రజాకార్ల రాజ్యమవుతుందనే దుష్ప్రచారానికి ఒడిగట్టింది. అలాగే మజ్లిస్ పార్టీ కూడా- తెలంగాణ వస్తే మైనారిటీలకు రక్షణ ఉండదనే అపోహను ప్రచారంలో పెట్టిం ది. ఇలా బీజేపీ-మజ్లిస్ పార్టీలు నగరంలో తమ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశాయి. ఆంధ్రాధిపత్య రాజకీయాలకు తోడ్పడ్డాయి. కాబట్టి, ఆ కుతంత్రాలను ఛేదించి తెలంగాణ అస్తిత్వాన్ని నగర ప్రజల్లో పాదుకొల్పాల్సిన అవసరాన్ని ఎవరు గుర్తించినా వారిని ప్రశంసించాల్సిందే. అందుకే నగర రాజకీయాలను తెలంగాణ అస్తిత్వం వైపు మలుపు తిప్పుతున్న కేసీఆర్‌ను అభినందించక తప్పదు. కాబట్టి, హైదరాబాద్‌పైనా అస్తిత్వ పతాక ఎగరడానికి ఉన్న అవకాశాలను ఎవరైనా ఎలా కాదనగలరు?



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి