గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 28, 2015

మోసకారి రాధాకృష్ణ రూపాలు బహు పసందు!

"...దోషాలోకన నిపుణాః పరుషగిరో
దుర్జనాశ్చ ఘూకశ్చ..."
గుడ్లగూబలు.. దుష్టులు దోషాలోకనంలోను, పరుష భాషణంలోనూ నేర్పరులు అని పెద్దల వాక్యం.

పాపం రాధాకృష్ణకు ఓ పెద్ద కల. తెలంగాణ సెంటిమెంటు అనేది లేకుండా పోవాలని. కేసీఆర్‌ను ఉద్యమనాయకుడుగా కాకుండా ఒక సాదాసీదా రాజకీయనాయకుడుగా ప్రజలు గుర్తించాలని. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోవాలని.. ఇదేం తెలంగాణ?...ఆయన ఉన్నపుడే బాగుండేది.. ఆయనొస్తే బాగుంటుంది అని ప్రజలంతా చంద్రబాబుకోసం ఎదురుతెన్నులు చూడాలని.. అందుకే పాపం ఎడాపెడా కథలు కహానీలు పత్రిక నిండా పరిచేస్తూ ఉంటాడు. సరే.. ఆయనకదో తుత్తి.. వదిలేద్దాం.


ఈ ప్రచారపరంపరలో ఒక గొప్ప రహస్యాన్ని కనిపెట్టి తాజా కొత్తపలుకులో పరిచేశాడు. ఏమిటట? కేసీఆర్‌లో కరడుగట్టిన నియంత ఉన్నాడట. ఓ పెద్ద అపరిచితుడు ఉన్నాడట. చాలాకాలంగా ఎవరికీ తెలియకుండా లోపల దాచేసుకుని 15 నెలలు అయ్యాక ఇపుడిపుడే బయటకు తీస్తున్నాడట. కేసీఆర్ నియంతృత్వానికి ఉదాహరణ ఏమిటంటే.. రైతు ఆత్మహత్యలు, కల్తీకల్లు ఆత్మహత్యలు, మున్సిపల్ వర్కర్లు, ఆశా వర్కర్ల ఆందోళన, వరంగల్ ఎన్‌కౌంటర్ పట్ల ఆయన వైఖరి. అందువల్ల ఆయన నియంత. 


మరి ఏపీలో మున్సిపల్ సమ్మె, డ్వాక్రా మహిళల ఆందోళనలు జరిగినపుడు అక్కడి ప్రభుత్వం బంతిపూల దండలేసి స్వాగతించిందా?..చీరెలు సారెలు పెట్టి సత్కరించిందా? హైదరాబాద్ వీధుల్లో చితకబాదిందా? తిరుపతి అడవుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లకు విందుభోజనాలు పెట్టిందా? పిట్లల్ని కాల్చినట్టు కాల్చేసిందా? ఏవోబీలో వారానికో ఎన్‌కౌంటర్ ద్వారా మావోయిస్టులకు సన్మానాలు చేస్తున్నదా? ఆచూకీ కూడా దొరక్కుండా మాయం చేస్తున్నదా? రాజధాని పేరిట తూళ్లూరు భూములను, బందరు పోర్టు పేర అక్కడి భూములను దానం చేస్తే పుచ్చుకున్నదా? పంటలు తగులబెట్టి మరీ లాక్కున్నదా? చిన్నచిన్న అంశాలకే కేసీఆర్ నియంత అయితే... ఇవన్నీ చేసిన చంద్రబాబును ఏమనాలి? సరే.. అదలా ఉంటే, ఇంతకాలం కేసీఆర్‌పై ఈగ వాలనివ్వని వారికి సైతం ఇవాళ ఆయన గురించి తెలిసిపోయిందట. వాళ్లంతా తిరగబడుతున్నారట. ఇక బ్రహ్మాండం బద్దలు కావడమే ఆలస్యమట. గతంలో కొందరు తెలంగాణ రాష్ట్రం వేరు- తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వేరు అన్న సోయి లేకుండా మాట్లాడేవారట. అలాంటి సన్నాసులకు ఇపుడుసోయి వచ్చిందని రాధాకృష్ణ ఆనందం. మరి ఆ సోయిలేని సన్నాసుల జాబితాలో ఎవరెవరున్నారో.. ఎవరెవరిని సన్నాసులని రాధాకృష్ణ అనుకున్నాడో మనకు తెలియదు. 


వేలు విడిచిన బంధుత్వాలా?..


నిజానికి కేసీఆర్ మీద నియంత అనే ప్రచారం రాధాకృష్ణ ఇవాళ కొత్తగా చేస్తున్నదేం కాదు.. తెలంగాణ ఆవిర్భావానికి ముందూ భారీగానే ప్రచారం చేశాడు. అయినా ఆనాడు జనం టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కావాలని తీర్పు ఇచ్చారు. ఇవాళ కొత్తగా వచ్చిందల్లా కమ్యూనిస్టులు.. వాళ్ల సంఘాల ఉనికి సమస్య. ఆంధ్ర పెత్తనంలోని ఒక్కో సంస్థా చేజారి పోతుంటే ఠారెత్తి పోతుంటే పుట్టుకువచ్చిన సమస్య. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో మాదిరిగా ఇప్పుడూ బండి ముందుకు సాగకపోవడం వల్ల వచ్చిన సమస్య. రాధాకృష్ణకు వీరితో వేలు విడిచిందో కాలు పట్టుకున్నదో ఓ సంబంధం వీరితో ఉన్నట్టుంది. బంధుమిత్రుల బాధ ఈయనకూ బాధే. 


పాపం కేసీఆర్ మాయలో పడి మోసపోని పార్టీ ఒక్కటీ లేదని కమ్యూనిస్టు నాయకుడొకరు రాధాకృష్ణకు చెప్పుకుని ఓదార్పు పొందారట. నిజమే.. కాంగ్రెస్, టీడీపీ హయాంలో మాదిరిగా సంఘాలు ముందు పెట్టుకుని మాయలో పడేసిన వాళ్ల పప్పులు ఇప్పుడు ఉడకడం లేదు. ఆ రకంగా వాళ్లు మోసపోయినట్టే మరి.


తెలంగాణ ప్రేమికుడట..


మనవడు నేర్చుకున్నట్టు.. అవ్వకు దురద తీరినట్టు అని వెనకటికో సామెత. పలక అడిగిన మనవడికి వీపు అప్పగించి రాసుకోమందట ఓ అవ్వ. తద్వారా మనవడు అక్షరాలు నేర్చుకున్నట్టు అవ్వ దురద తీరినట్టు అయిందట. తాజా కొత్త పలుకులో కేసీఆర్ దీక్ష విరమణ కోసం గద్దర్‌ను తాను ఒప్పించానని రాధాకృష్ణ రాసుకున్న వైనం అలాగే ఉంది. ఈ ప్రచారం ద్వారా అటు తాను తెలంగాణకు కృషి చేశానని చెప్పుకోడానికి... ఇటు కేసీఆర్ మధ్యలోనే విరమణకు సిద్ధమయ్యాడని బురద చల్లడానికి ఉపయోగ పడిపోయింది. 


ఇంతకీ కేసీఆర్ దీక్ష విరమణే చేయాలంటే ఈ భూమ్మీద ఎవరూ దొరకనట్టు రాధాకృష్ణే ఉన్నాడా? అప్పటికి పూజ్య జయశంకర్‌సార్ లేరా? తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యుడి స్థాయిలో కోదండరాం లేరా? అనేక ప్రజా సంఘాలు లేవా? ఎంఆర్‌పీఎస్ మందకృష్ణ కూడా అపుడు కేసీఆర్ వద్దనే లేరా? కొంచెం హోంవర్క్ చేసి రాసి ఉంటే బాగుండేదేమో.. పోనీ ఈయన వెళ్లాడని అనుకున్నా. గద్దర్‌లాంటి ఉద్యమకారుడు రాధాకృష్ణ పైరవీలకు పడిపోయి ప్రకటనలు ఇచ్చేస్తారా? ఇలాంటి కథలు ఆంధ్రజ్యోతి బానర్‌గా వేసుకుంటే పాఠకులకు కాస్త వినోదం పంచినట్టుగా ఉంటుందేమో ఆర్కే ఆలోచిస్తే బాగుంటుంది. నిజానికి కేసీఆర్ హాస్పిటల్‌లో దీక్షలో ఉండగా రాధాకృష్ణ వ్యవహరించిన తీరు చూసి తెలంగాణ సీనియర్ జర్నలిస్టు ఒకరు తలబాదుకున్న విషయం అప్పుడు అంతా చెప్పుకున్నారు. 


ఇక్కడ ఇంకో ట్విస్టు ఏమిటంటే, చిదంబరం ప్రకటన అనంతరం రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ కార్యక్రమానికి కేసీఆర్ వచ్చారు. ఆ సందర్భంగా ఖమ్మం హాస్పిటల్‌లో దీక్ష విరమణ నుంచి అనేక వంకర టింకర ప్రశ్నలు రాధాకృష్ణ వేశారు. మరి అపుడే ఈ గద్దర్ అంశం ఎందుకు బయటపెట్టలేదు? ఓపెన్ హార్ట్ అంటే హృదయం పరిచేయడమే కదా? మహిళలను కూడా అడగదగినవీ దగనివీ అడిగేవారు కదా! అపుడు ఆర్కేకు ఏ మొహమాటం అడ్డం వచ్చింది? ఇవాళ ఏ అవసరం దాన్ని చెప్పిస్తున్నది? 


ఎక్స్‌పెక్ట్ చేయలేదేమో..


కేసీఆర్‌లో అపరిచితుడు ఉన్నాడని రాధాకృష్ణ ఉవాచ. అధికారంలోకి వచ్చాక ఆ అపరిచితుడు కనిపిస్తున్నాడట. నిజమే. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పాలన ఇలా ఉంటుందని రాధాకృష్ణ గ్యాంగు ఊహించి ఉండరు. అసలు కేసీఆర్ ఫాంహౌసే దాటి రాడని డిసైడై ఉంటారు. ఎపుడో ఒంటి గంటకు సచివాలయానికి ఇలా వచ్చి అలా వెళ్తాడని అనుకుని ఉంటారు. ఏదో నాలుగు మాటలు చెప్పడం తప్ప పాలన ఏం తెలుస్తుంది? నాలుగు నెల్లలో బజార్లో పెట్టేయమూ? అనుకుని లెక్కలేసుకుని ఉంటారు. 


"తెలంగాణ వాళ్లకు పాలన కూడా వస్తదా? అధికారులు చెప్పిందానికి బుర్రలూపడం తప్ప" అనుకుని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని లైట్ తీస్కొని ఉంటారు. పార్టీలో నాలుగు రోజులకే కల్లోలం పుట్టదా? ముక్కలు కాకపోదా అనుకుని పార్టీలకు కూడా రెడీ అయి ఉంటారు. ఉన్నమాట చెప్పాలి.. రాధాకృష్ణే కాదు చివరకు తెలంగాణవాదులు కూడా ఊహించని అనేక దృశ్యాలు ఆవిష్కారమయ్యాయి. నిజమే కేసీఆర్‌లో ఒక సమర్థ పాలకుడనే అపరిచితుడు బయటికి వచ్చాడు.


మాటల మరాఠీ అని పిలిపించుకున్న పాత కేసీఆర్ మౌన గంభీర ముద్రలోకి పాలన అంతరాంతరాల్లోకి.. సమస్యల మూలాలను తడిమితడిమి శాశ్వత పరిష్కరాల్లోకి వెళ్లే ఒక కొత్త పాలకుడు బయటికి వచ్చాడు. ఫాంహౌజ్‌లో పడుకుంటాడనుకున్న కేసీఆర్ వరంగల్‌లో మూడు రోజుల బస రాధాకృష్ణలాంటి వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. ప్రజల్లోకి పేదల ఇండ్లలోకి చొచ్చుకు పోవడం అనుకుని ఉండరు. కృష్ణా గోదావరి నదుల నడకల సంపూర్ణ అధ్యయనం ఆశించి ఉండరు. కాలం కలిసిరాక కొన్ని అపశ్రుతులు అనివార్యంగా ఏర్పడి ఉండవచ్చు. కానీ ఇవాల్టికీ తెలంగాణ అభివృద్ధి మీద ఆయన చిత్తశుద్ధిని ప్రజలు కాదు...కనీసం ఆర్కే వెంటేసుకునే నాయకులు కూడా శంకించలేరు. చెప్పినా ఇవేవీ రాధాకృష్ణ అంగీకరించలేడు. ఆయనకు జీర్ణం కాదు. 

ఘంటాకర్ణుడికి అష్టాక్షరీమంత్రం ఉపదేశం చేయడం రాధాకృష్ణకు బుద్ధి చెప్పడం వృథా ప్రయాసే.


ఎవరు అపరిచితుడు?
సరే ఆ విషయం అలా ఉంచితే.. కేసీఆర్‌లో ఉన్నాడో లేడో కానీ రాధాకృష్ణలో వేనవేల అపరిచితులు ఉన్నారంటారంతా. వాళ్లు అవసరాలకోసం ఆవిర్భవిస్తారుట. ఊసరవెల్లిలా రంగులు మార్చుతారట. ఒకరు యుద్ధం చేస్తే మరొకరు పంచన చేరుతారుట. అందుకేనేమో రాధాకృష్ణకు నిన్నటిదాకా శత్రువుగా ఉన్న వాళ్లు హఠాత్తుగా మిత్రులవుతాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టే అపరిచితులకు కేరాఫ్ మనోడే అంటారు పాత్రికేయులు. 2002లో చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల వార్తలను లంపెన్‌గాళ్లు అంటూ రాధాకృష్ణ నిషేధిస్తే, వైఎస్ హయాంలో ఒత్తిడులు పెరగగానే అపరిచితుడు ఆవిర్భవించిన వాళ్లతోనే ప్రత్యేక ఇంటర్వ్యూలు, కవర్‌పేజీ కథనాలతో మచ్చిక చేసుకున్నాడు.


రాధాకృష్ణకు జర్నలిస్టు యూనియన్ నాయకుల మీద బోలెడంత ప్రేమ. కానీ పాపం ఆయనలోని అపరిచితుడు 2005లో ఏలూరు సభలో మంత్రాంగం చేసి యూనియన్‌ను చీల్చిపారేశాడు. ఇదే యూనియన్ నాయకులకు వ్యతిరేకంగా బానర్ స్టోరీలు కూడా వేసుకున్నాడు. కాలం ప్రతిసారి కలిసి రాదు కదా.. కర్మ చాలక బడుగు నేతలను బాడుగనేతలంటూ వార్తలు రాయడం మందకృష్ణ దాడులు, కేసుల నమోదు వ్యవహారాలు ఎదురు కాగానే అదే యూనియన్ నేతల కాళ్లు గడ్డాలు పట్టుకుని మద్దతుగా తెచ్చుకున్నాడు. 


ఎవ్వరికీ భయపడను పొమ్మన్నాడు. తర్వాత అపరిచితుడో పరిచితుడో తెలియదు కానీ... అదే మందకృష్ణను టీవీ ఇంటర్వ్యూలకు పిలిపించి శాంతింప చేసుకున్నాడు. ఇక సుజనా చౌదరి మీద వరుస కథనాలు రాధాకృష్ణ రాస్తుంటే హఠాత్తుగా అపరిచితుడు వాటిని నిలిపివేసిన వైనాలు ప్రెస్‌క్లబ్బుల్లో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆంధ్రజ్యోతి జీవితంగా బతికిన పెద్ద మనిషి ఓ చానెల్ పెట్టుకుంటే ఆర్థిక చేయూత అందించే వారిని మేనేజ్ చేసి చానెల్‌ను ఆర్థికంగా దెబ్బతీసి అప్పులపాలు చేసిన అపరిచితుడూ ఆర్కేలోనే ఉన్నారని పాత్రికేయుల ఉవాచ. ఇందరు అపరిచితులను తనలో పెట్టుకున్న పెద్దమనిషి ఇతరుల మీద నిందలు మోపడం వింత. ఇంతకీ ఈ సారి కొత్తపలుకు రాసింది.. పరిచితుడా? అపరిచితుడా?



చవి యెరిగిన కుక్క - చావగొట్టినా పోదు అని పెద్దల మాట. ప్రభుత్వం పాత పద్ధతిలో ఉండాలి. మేం సమ్మె అనగానే సాష్టాంగపడాలి.. మా పంట పండాలి.. అని రాధాకృష్ణకు ఆయన బంధుమిత్రులకు ఉండవచ్చు. కానీ ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీల కోసం.. సంఘాల ఉనికికోసం నడవవు. పంచాయతీలు చెల్లించాల్సిన వేతనాలను ప్రభుత్వమే చెల్లించాలని దబాయిస్తే ప్రభుత్వాలు సాష్టాంగపడవు.



కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల మీద ఆంధ్రులు పెత్తనం చేయడం.. రాధాకృష్ణకు ఆ సంఘాల నాయకులకు అవసరం కావచ్చేమో. కానీ తెలంగాణ ప్రభుత్వం ధర్మసత్రం కాదు.. ఏదో సంఘం ఉనికికి ప్రమాదమని చెప్పి డబ్బులు కుమ్మరించేందుకు. అయినా ఆంధ్రపెత్తనంలోని సంఘాలు ఎలా నట్టేట ముంచుతాయో సకలజనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీలో వీరి వైఖరి చూసిన అనుభవం ఉంది. అందుకే ఆ వాసనలున్న సంఘాలను పక్కకు పెట్టాల్సిందే. పాములకు పాలు పోస్తే నష్టం తెలంగాణకే. బ్రిటిష్ వాడి పాలన పోయాక అంతా భారతీయీకరణ జరిగినట్టే.. నూతన రాష్ట్రంలో ఆంధ్ర సంస్థలు, ఆంధ్ర సంఘాలన్నింటికీ చరమగీతం పాడాల్సిందే. 


ఏ రాష్ట్రంలోనైనా 250శాతం జీతాలు పెంచమంటూ సమ్మెలు చేసిన సందర్భం ఉన్నదా? కార్మికుల జీతాల కోసం రాష్ట్ర బంద్ పాటించిన సందర్భం ఉన్నదా? ఇక్కడ అలాంటి సమ్మెలు జరుగుతున్నాయంటే.. పగ బట్టినట్టు వివిధ పక్షాలను కూడగడుతున్నాయంటే అర్థం ఏమిటో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమైనా చేసి లొంగదీయాలని వారికి కోరికగా ఉండవచ్చు. అందుకే మున్సిపల్ భంగపాటు మరిచీ మరువక ముందే ఆశా వర్కర్ల సమస్య ముందుకు తెచ్చారు. ఏపీలో వరుసగా మూడు ఎన్‌కౌంటర్లు జరిగినా పెదవి విప్పని వారు ఇక్కడ ఒక్క ఎన్‌కౌంటర్‌కే చలో అసెంబ్లీ అంటున్నారు. 


వారి ప్రకటనలను, వారు కూడగడుతున్న సంఘాల జాబితా చూస్తే భారీ ఎత్తుగడే వున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు.. తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్ర పాలకులనే తరిమికొట్టిన అనుభవం ఉంది. ఇలాంటి ఎత్తుగడలు తిప్పికొట్టగల సామర్థ్యమూ ఉంది.


మహాగజాః పలాయంతే మశకానాం తు కా కథా?మహామహా ఏనుగులే పరుగులు పెడుతుంటే దోమల మాట చెప్పేదేమిటి? ప్రజల మద్దతు ఆదరణ ఉన్నంతకాలం ఎవరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, సెప్టెంబర్ 26, 2015

విఘ్నములఁ దొలఁగింపుము విఘ్నరాజ!

కవి పండితులకు, తెలంగాణ ప్రజలకు, వీక్షకులకు
వినాయక నిమజ్జన దినోత్సవ శుభాకాంక్షలు!


(తెలంగాణ రాష్ట్రమును తొందరగా ఈయుమని దివి: సెప్టెంబర్ 18, 2013 నాడు నేను విఘ్నపతిని ప్రార్థిస్తూ వ్రాసిన పద్యములకు సంతసించిన ఆ విఘ్నేశ్వరుడు మనకు మన తెలంగాణ రాష్ట్రమును ప్రసాదించి మనను బానిసత్వమునుండి విముక్తులను చేసినాడు. అందులకు మరొక్కసారి  ఆనాటి దినమును స్మృతికితెచ్చుకొంటూ ఆ పద్యాలను ఇక్కడ ప్రకటిస్తున్నాను. అప్పటి మన ఆకాంక్షలు ఎలా ఉన్నాయో మరొక్కసారి జ్ఞాపకము చేసుకొనండి సోదరులారా!)




హెచ్చు తగ్గులు లేనట్టి హిత మనమున,
దరికిఁ జేరనిచ్చితిమి యందఱనుఁ బ్రేమఁ
గుఱియ; స్వార్థ మేమాత్రమ్ముఁ గోర మయ్య;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (1)


మమ్ము బాధించినట్టి సీమాంధ్రులకును
మంచి బుద్ధిని దయసేసి, మమత గలుగు
వారలుగ మార్చి, దీవించి, వరము లిచ్చి,
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (2)


మాయ లేనట్టి వార; మమాయకులము;
కుడు మటన్నఁ బండు వటంచుఁ గూర్మి మీఱ,
సంతతము సంతసముఁ బూని, స్వాగతింప;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (3)


తెలుఁగు వారందఱును నొక్కటిగను నుండి,
ప్రాంతములుగాను విడిపోవ బాగటంచు,
వేడుచుంటిమి ప్రార్థించి, పేర్మి మీఱ;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (4)


ఆత్మ గౌరవోద్యమ మిది, యాదరించి,
యిష్టములఁ దీర్చి, యెడఁబాపి కష్టములను,
మమ్ముఁ గరుణింప వేడెద మనమునందు;
వేగఁ దెలగాణ మీవయ్య విఘ్నరాజ! (5)



-: శుభం భూయాత్:-

(గత టపాను ఇక్కడ చూడగలరు: విఘ్నరాజ!)






బుధవారం, సెప్టెంబర్ 23, 2015

తొలి పరీక్షలో...గుణాత్మక మార్పు

"తెలంగాణ చరిత్ర, సంస్కృతి మన పాఠ్యపుస్తకాల్లో అవసరం లేదు అని తీర్మానించుకున్న రాష్ర్టాలు ఇప్పుడు పునరాలోచించుకుంటాయేమో  చూడాలి. తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించాలంటే తెలంగాణ గురించి తెలుసుకోకతప్పదనే తత్త్వం బోధపడినంక వారి మనసు, పాఠ్యపుస్తకాలు కూడా మారుతాయేమో.. వేచి చూడాలి."

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక పారదర్శకంగా ఉండాలని, అవినీతికి, పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రతిభ ఆధారంగానే నియామకాలుండాలనేది ప్రభుత్వ నిర్ణయం. అందుకు తగ్గట్టుగానే ఘంటా చక్రపాణి నాయకత్వంలోని బృందం మొదటి పరీక్షను విజయవంతంగా ముగించింది. పరీక్ష రాసిన అభ్యర్థుల మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కూడా ఇది తొలి పరీక్షే. 


gatika

రిజర్వేషన్ నిర్ణయించడం, సిలబస్ ఖరారు చేయడం, ప్రశ్నా పత్రాలు రూపొందించడం తదితర ఘట్టాలన్నీ విజయవంతంగా పూర్తిచేసి తొలి పరీక్షలో మెరుగైన ఫలితం రాబట్టుకున్నారు కమిషన్ సభ్యులు. తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించడం అనేది ఓ సాంకేతిక అంశం. అంతకుమించి విజయం సాధించింది కమిషన్. అది తెలంగాణ ఉద్యోగ నియామకాల ప్రక్రియ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, ప్రముఖ వ్యక్తులు, జీవన విధానానికి సంబంధించి భారతదేశమంతా చదువుకోవాల్సిన అనివార్యతను సృష్టించింది. అది తొలి పరీక్షలో సాధించిన గుణాత్మక మార్పు. 


కొన్నిరోజులుగా మనం దాదాపు అన్ని దినపత్రికల్లో చూస్తున్నాం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, ఆచారాలు, వాడుక పదాలు, విశిష్ట వ్యక్తులు, పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాల గురించి పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు వస్తున్నాయి. ఒక్కో పత్రిక రెండు, మూడు పేజీల స్పెషల్స్ కూడాఇస్తున్నాయి. తెలంగాణ ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్ సహా చాలామంది విద్యావంతులు, మేధావులు, అధ్యాపకుల ఇంటర్వ్యూలు, వారు తెలంగాణ గురించి చెప్పిన విషయాలు ప్రముఖంగా ప్రచురితమవుతున్నాయి. చాలామందికి ఈ మార్పు అర్థం కావడం లేదు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకు మాత్రమే స్పష్టంగా అర్థమైంది. ఎందుకీ మార్పు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే సిలబస్ విడుదల చేసింది. అందులో తెలంగాణకు సంబంధించిన సిలబస్ పెట్టింది. దానికి సంబంధించిన విషయాలు, వివరాలు కూడా అందించింది. 


అయితే లోతుగా చదవడం, విశ్లేషణ చేసుకోవడం, చరిత్రను అర్థం చేసుకోవడం, సంస్కృతిపై అవగాహన పెంచుకోవడం కోసం ఈ వ్యాసాలు అవసరమయ్యాయి. ఇప్పటికిప్పుడు చరిత్ర పుస్తకాలు తిరగేయడం సాధ్యం కాదు కాబట్టి (చాలా వరకు అందుబాటులో కూడా లేవు కాబట్టి) అభ్యర్థులకు పేపర్లే దిక్కయ్యాయి. ఫలితంగా తెలంగాణలో రెండు నెలలుగా పేపర్ల సర్క్యులేషన్ పెరిగింది. ఈ నేపథ్యంలో పేపర్లలో కూడా పోటీ పెరిగింది. తెలంగాణకు సంబంధించిన విషయాలు ఎవరు ఎక్కువ రాస్తే వారి పేపరే అమ్ముడుపోయే స్థితి వచ్చింది. అందుకే పత్రికలు తెలంగాణ గురించి పేజీలకు పేజీల సమాచారం ఇస్తున్నాయి. తెలంగాణ వారికి తెలిసినవే అయినప్పటికీ.. ఇంతకాలం మరుగున పడిన చాలా అంశాలు పత్రికల్లో ప్రచురితం కావడం ఒక రకమైన పరవశానికి గురి చేస్తున్నది. 1947గురించి మాత్రమే బాగా తెలిసిన వారికి, ఇప్పుడు 1948 కూడా కొత్తగ పరిచయమవుతున్నది. 


1956 ఘటనలు బాగా గుర్తున్న వారికి 1952ను కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. బ్రిటిష్ పాలన, దోపిడీ గురించి మాత్రమే చదువుకున్న వారికి, భారతదేశ సైనిక పాలన ఘోరాలు కూడా తెలుసుకోవాల్సి వస్తున్నది. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్నే రెండు భాగాలుగా చేసుకుని చదువుకునే వారు, ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చదువుకోవాల్సి వస్తున్నది. రాయల పాలన గురించి, రత్నాల వ్యాపారమే చరిత్రగా మిగిలిన దుస్థితి నుంచి కాకతీయుల సామ్రాజ్యం గురించి, చెక్కిన శిల్పాల గురించి, తవ్విన చెరువుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన మార్పు సాధ్యమైంది. మహాకవి శ్రీశ్రీ పద్యాలే కాదు, ప్రజాకవి కాళోజీ ప్రశ్నల్లో కూడా తెలుగుతనాన్ని, ధిక్కార స్వరాన్ని కొత్తగా వినవలసి వస్తున్నది. అల్లూరి సీతారామారాజు పరాక్రమమే కాదు, కొమురం భీం ధీరత్వంలో కూడా ఆదివాసీల పోరాటాన్ని వెతుక్కుంటున్నారు.


తెలంగాణ రాష్ట్రం వచ్చినంక జరిగిన మొదటి పరీక్షకు 24 వేల మంది హాజరయ్యారు. అందులో పదివేల మంది ఇతర రాష్ర్టాల వారే. వారిలో ఆరు వేలు ఆంధ్రప్రదేశ్ వారుంటే, నాలుగు వేలు ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర ఇతర రాష్ర్టాల వారున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మొత్తం ఉద్యోగాలు తెలంగాణ వారికే దక్కుతాయి అని అనుకుంటే, వివిధ కారణాల వల్ల టీఎస్‌పీఎస్సీ కూడా పాత రిజర్వేషన్ విధానాన్నే కొనసాగించాల్సి వచ్చింది. 60 శాతం స్థానికులకు, 40 శాతం స్థానికేతరులకు ఉద్యోగాలు కేటాయించింది. ఈ 40శాతం కోటాలో ఉద్యోగాలు సంపాదించడం కోసం చాలామంది ఇప్పుడు తెలంగాణ గురించి కొత్తగా చదువుకోవాల్సి వస్తున్నది. 


కారణమేదైనా సరే, తెలంగాణలో కొలువుల కోసం జరిగే పరీక్షలో తెలంగాణకు సంబంధించిన అంశాలే ఉండటం సహజం. ఏ రాష్ట్రంలో అయినా సరే ఇలాగే ఉంటుంది. కానీ తెలంగాణలోనే కొత్తగా ఎందుకు కనిపిస్తున్నదంటే, ఇవి సాంస్కృతిక దోపిడీ నుంచి బయట పడుతున్న క్షణాలు కాబట్టి. తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలు సాధికారికంగా పతాక శీర్షికలుగా మారిన ఘడియలు కాబట్టి. నిజానికి సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే చరిత్ర, సంస్కృతికి సంబంధించి సమన్యాయం జరగాల్సి ఉండె. కానీ వివక్ష జరిగింది. రాష్ట్ర ఏర్పాటు అంటే సమైక్య రాష్ట్ర ఆవిర్భావమే చెప్పారు తప్ప, ఆంధ్ర, హైదరాబాద్ వేర్వేరు రాష్ర్టాలుగా ఉండేవనే వాస్తవాన్ని కూడా చెప్పలేకపోయారు. ఇవాళ మన చరిత్ర చదువుకునే మన పిల్లలు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిలబస్‌లో తెచ్చిన మార్పుల ఫలితంగా కేవలం పరీక్ష విధానంలోనే కాదు, రేపు విద్యార్థులు ఏం చదువుకోవాలి, ఏం తెలుసుకోవాలనే విషయంలో కూడా అవగాహన వచ్చింది. 


ఇది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సాధించిన మార్పు. సిలబస్ రూపొందించిన వారు, ప్రశ్నాపత్రం తయారు చేసిన వారు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. లోకల్-నాన్ లోకల్ సరిగ్గా నిర్ధారించలేని సమయంలో తెలంగాణలో ఉద్యోగం చేసే వారికి ఇక్కడి స్థానికతపై పట్టున్నదనే విషయం నిరూపించుకోవాల్సిన అనివార్యతను సృష్టించగలిగారు.


ఇక్కడ పుట్టిపెరిగిన వారికే గటక రుచి తెలుస్తుంది. బతుకమ్మ పువ్వు తెలుస్తుంది. పీవీ నర్సింహారావు పుట్టుపూర్వోత్తరం తెలుస్తుంది. దాసి వ్యవస్థ తెలుస్తుంది. కాళోజీ గొడవ తెలుస్తుంది. గద్దర్ గొంతు తెలుస్తుంది. యాదిరెడ్డి త్యాగం తెలుస్తుంది. కేసీఆర్ ఘనత తెలుస్తుంది. 610 జీవో తెలుస్తుంది. సైనిక పాలన తెలుస్తుంది. రంగం భవిష్యవాణి తెలుస్తుంది. ఖమ్మం కిన్నెరసాని తెలుస్తుంది. ఇవన్నీ తెలంగాణ వారి జీవితంలో భాగం. తమ జీవితమే ఓ పాఠ్యాంశమైనప్పుడు చదువు ఎవరికైనా తేలికే. అందుకే టీఎస్‌పీఎస్సీ పరీక్ష ప్రశ్నా పత్రం తెలంగాణ బిడ్డలతో ఆలింగనం చేసుకున్నది. కడుపులో లేకున్నా కావలించుకుందామనుకునే వారికి మింగుడుపడని ముద్దయింది. 


కొసమెరుపు: తెలంగాణ చరిత్ర, సంస్కృతి మన పాఠ్యపుస్తకాల్లో అవసరం లేదు అని తీర్మానించుకున్న రాష్ర్టాలు ఇప్పుడు పునరాలోచించుకుంటాయేమో చూడాలి. తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించాలంటే తెలంగాణ గురించి తెలుసుకోకతప్పదనే తత్త్వం బోధపడినంక వారి మనసు, పాఠ్యపుస్తకాలు కూడా మారుతాయేమో.. వేచి చూడాలి.




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



శనివారం, సెప్టెంబర్ 19, 2015

ఈ రాతలు... చారిత్రక తప్పిదాలు!

తెలంగాణ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నది. కానీ ఏ ఒక్క చరిత్రకారుడు కూడా తెలంగాణ చరిత్రలోని ప్రధాన ఘట్టాలను ఒక పుస్తకంగా రాసి ప్రచురించలేదు. అయితే మార్కెట్‌లో దాదాపు అరడజను పుస్తకాలున్నాయి. వాటిని ఔత్సాహిక మేధావులు రాశారు. ఇద్దరు ముగ్గురు తెలంగాణ చరిత్రను స్థాలీపులాక న్యాయంగా సమీక్ష చేశారు. కానీ వారెవరూ ప్రామాణిక ఆధారాలైన శాసనాలు, నాణేలు, పురావస్తు తవ్వకాలు, సమకాలీన గ్రంథాలు, రాత ప్రతులు, ఇటీవలి ఆధారాలు,నిరూపిత అంశాలను లెక్కలోకి తీసుకోలేదు. 

satya

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను నిపుణుల సహాయంతో సమీక్షించి ఆగస్టు 31న ప్రకటించింది. ఈ కొత్త సిలబస్‌లో తెలంగాణ చరిత్రకు సంబంధించి రాష్ట్ర సాధన అనే ప్రధానాంశాన్ని ఒక ప్రత్యేక పేపర్‌గా చేర్చారు. దీంతో గ్రూప్-1 పరీక్షలో 33 శాతం తెలంగాణ చరిత్ర కు ప్రాధాన్యం ఇచ్చినైట్లెంది. పరీక్ష అభ్యర్థులు చదవాల్సిన సుమారు 10 సబ్జెక్టుల్లో తెలంగాణ చరిత్రకు ఇంతటి ప్రాముఖ్యం రావడంతో ఈ సబ్జెక్టును చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. అది సరైందే కూడా. కానీ మార్కెట్‌లో తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ పబ్లిషర్స్, ప్రైవేట్ వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు రాసి ప్రచురించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ ప్రైవేట్ పబ్లికేషన్స్ వల్ల విద్యార్థులు అప్రామాణికమైన అంశాలు చదివి నష్టపోతున్నారు.


విచిత్రమైన విషయమేమంటే తెలంగాణ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నది. కానీ ఏ ఒక్క చరిత్రకారుడు కూడా తెలంగాణ చరిత్రలోని ప్రధాన ఘట్టాలను ఒక పుస్తకంగా రాసి ప్రచురించలేదు. అయితే మార్కెట్‌లో దాదాపు అరడజను పుస్తకాలున్నాయి. వాటిని ఔత్సాహిక మేధావులు రాశారు. ఇద్దరు ముగ్గురు తెలంగాణ చరిత్రను స్థాలీపులాక న్యాయంగా సమీక్ష చేశారు. కానీ వారెవరూ ప్రామాణిక ఆధారాలైన శాసనాలు, నాణేలు, పురావస్తు తవ్వకాలు, సమకాలీన గ్రంథాలు, రాత ప్రతులు, ఇటీవలి ఆధారాలు, నిరూపిత అంశాలను లెక్కలోకి తీసుకోలేదు. ప్రొఫెషనల్ చరిత్రకారులు చేయవలసిన ఈ పనులను వారు చేయలేదని విమర్శించడం తగదు. కనీసం వారు ప్రజలకు, విద్యార్థులకు కొంత సమాచారాన్నైనా చేరవేయగలగడం అభినందనీయం.


తెలంగాణ చరిత్రలోని ప్రాచీన, మధ్య యుగాలకు సంబంధించి ప్రామాణిక పుస్తకాల రచన జరగాలి. ఆధునిక యుగానికి సంబంధించి ప్రామాణిక పుస్తకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. గౌతమ్ పింగ్లే, వెంకటరామారావు రాసిన పుస్తకాలు వాటిని వీలైనంత ప్రామాణికంగా సంక్షిప్తీకరించాయి. మొత్తం తెలంగాణ చరిత్రను సంక్షిప్తీకరించిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పుస్తకాన్ని ఇటీవల తెలుగు అకాడమీ ప్రచురించింది. 


అయితే ఈ ఇంటర్మీడియట్ పుస్తకంతో సహా ప్రైవేట్ పుస్తకాలు, ఈ మధ్య దినపత్రికల్లో వస్తున్న వ్యాసాల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించి బేసిక్ అంశాలు కూడా తప్పులతో వచ్చాయి. వాటివల్ల ఒక పుస్తకంలో ఒక లాగా, మరో పుస్తకంలో మరోలా చదివి విద్యార్థులు గందరగోళ పడకుండాఉండాలని కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.


చరిత్ర మొత్తం ఒక పూర్తి నిడివి గల సినిమా అనుకుంటే అందులో ఒక నిమిషం చరిత్రకు మాత్రమే లిపి/రాత ఆధారాలున్నాయి. లిపి ఆధారాలు లేని చరిత్ర పూర్వయుగాన్ని ఎవరూ రాయడం లేదు. పురావస్తు శాఖ దగ్గర వంద సంవత్సరాల కిందటి నుంచి భద్రపరుస్తున్న వార్షిక నివేదికలు, తవ్వకాల రిపోర్టుల ఆధారంగా ఆ చరిత్రను రాయాలి.


ఎప్పుడో ఏడు దశాబ్దాల కిందట... కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో తవ్వకాలు జరుగకముందు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు గొర్తి వెంకటరావు రాసినట్లుగా ఇప్పటికీ ఆయన రాసినట్లే శాతవాహనులు క్రీ.పూ.271లో అధికారంలోకి వచ్చారని రాస్తున్నారు. ఇది చారిత్రక తప్పిదం. ఇలా రాసినవారెవరూ కనీసం కోటిలింగాల తవ్వకాల రిపోర్టును కూడా చూసి ఉండరు. మరి ప్రసిద్ధి గాంచిన చరిత్రకారిణి రొమిలా థాపర్ మాత్రం కోటిలింగాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని పెద్దబొంకూరు, ధూళికట్ట, మెదక్ జిల్లాలోని కొండాపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల రిపోర్టులను అధ్యయనం చేసి పదమూడేళ్ల కిందట తెలంగాణ/ శాతవాహన చరిత్రను భారతదేశ చరిత్రతో సమన్వయం చేసి శాతవాహనులు క్రీ.పూ.80 ప్రాంతంలో కోటిలింగాలలో అధికారంలోకి వచ్చారని, క్రీ.పూ.50 ప్రాంతం నుంచి శాతకర్ణి అనే రాజు సామ్రాజ్యాన్ని నిర్మించాడని ఎర్లీ ఇండియా అనే పుస్తకంలోని 226వ పుటలో రాసింది.


శాతవాహనుల తరువాత వచ్చిన రాజులు ఇక్ష్వాకులు. వీరు నాగార్జునకొండ చుట్టుపక్కలున్న కృష్ణా-గుంటూరు మండలంలోనే అధికారం నెరిపారని ఇప్పటి వరకు భావించారు. కానీ ఇటీవల నల్గొండ జిల్లాలోని ఫణిగిరిలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బయటపడిన బ్రాహ్మీలిపి శాసనాలు ఇక్ష్వాకులు ఖమ్మం, నల్గొండ జిల్లాలను కూడా పాలించిన తెలంగాణ రాజులని,వారి పాలనా కాలం కూడా ఇంతవరకు భావించినంత తక్కువ కాలం కాదని తెలియజేశాయి. పైగా ఆ తవ్వకాలు క్రీ.శ. ఒకటి నుంచి ఐదవ శతాబ్దాల మధ్య కాలంలో తెలంగాణలో వికసించిన బౌద్ధశిల్ప కళా చాతుర్యాన్ని, తెలంగాణకు రోమన్ దేశంతో గల వాణిజ్య సంబంధాలను కూడా విశదం చేశాయి. వీటన్నింటినీ కొత్త తెలంగాణ చరిత్రకారులు అధ్యయనం చేసి అధ్యాయాలు రాయాలి.


ఇక్ష్వాకుల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చి కృష్ణా నది ఉత్తరాన మొదలుకొని మధ్య భారతదేశంలోని నర్మదా నది వరకు అధికారం నెరిపిన విష్ణుకుండిన రాజుల తొలి నివాసం ఇప్పటి వరకు భావించినట్టు గుంటూరు జిల్లాలోని వినుకొండ కాదు. మన తెలంగాణ చరిత్రకారుడు బి.ఎన్. శాస్త్రి రాసినట్టు మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాదు (అమరావతి) ప్రాంతం- వారి ఇతర రాజధానులు నల్గొండ జిల్లాలోని ఇంద్రపాల నగరం, రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట. ఇంతవరకు భావించినట్టుగా వీరు తమ రాజ్యాన్ని క్రీ.శ. 624 వరకు పాలించలేదు. ఇటీవల కొత్తగా లభించిన తాండిపూడి తామ్ర శాసనాలు విష్ణుకుండినులను క్రీ. శ. 569లో పృథ్వీ మహారాజు అనే రాజు నిర్మూలించి ఖమ్మం,నల్గొండ, గోదావరి జిల్లాలను క్రీ.శ 617 వరకు పాలించాడని తేల్చాయి.


విష్ణుకుండినుల తర్వాత మూడు ప్రధాన రాజవంశాలు, సుమారు పది స్థానిక రాజవంశాలు తెలంగాణను పరిపాలించాయి. ఈ కాలం ఐదు శతాబ్దాలు. రెండువేల ఒక వంద సంవత్సరాల చరిత్రలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర తీసేయదగింది కాదు. ఐనా సిలబస్‌లో ఈ చరిత్రను ఒకే అధ్యాయంలో పేర్కొన్నారు. కారణం రాష్ట్రస్థాయి చరిత్రను ఈ కాలంలో నిర్మించలేము అనేది. కానీ స్థానిక చరిత్రను రాయడం/చదవడం వల్ల ఆయా స్థానికులు ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు కాబట్టి ఈ యుగ చరిత్రను విస్మరించకూడదు. కనీసం ఈ యుగ సాంస్కృతిక అంశాలను సిలబస్‌లో పేర్కొనడం ముదావహం. ఈ యుగానికి సంబంధించి తెలంగాణ జిల్లాల్లో వందలాది శాసనాలు దొరికాయి. అలాంటివి ఐదు జిల్లాల సంపుటాలుగా కూడా ప్రచురించబడినాయి. వాటిని కూలంకషంగా అధ్యయనం చేసి రాయాలి.


ప్రసిద్ధి గాంచిన కాకతీయ యుగం తర్వాత తెలంగాణను (ఆదిలాబాద్ జిల్లా మినహా) రాచకొండ పద్మనాయక రాజులు పాలించారు. ఈనాటి ఆంధ్రలో వీరి సమకాలికులు రెడ్డి రాజులు. ఇప్పటి వరకు ఈ ఇరువురి యుగానికి రెడ్డి రాజుల యుగం అని పేరు. రెడ్డి రాజులు తెలంగాణను పాలించలేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా 14,15 శతాబ్దాల తెలంగాణ చరిత్రకు నాయక యుగం అని పేరు పెట్టాలి. కాకతీయ యుగానికి పండితారాధ్య చరిత్ర అనే సమకాలీన గ్రంథం ఎలాంటి వివరాలు అందిస్తుందో నాయక యుగానికి సింహాసన ద్వాత్రింశిక మొదలైన గ్రంథాలు అలాంటి వివరాలు అందిస్తాయి. బహమనీ, కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ యుగాల చరిత్రకు సంబంధించి స్టేట్ ఆర్కైవ్స్‌ను, సాలర్‌జంగ్ మ్యూజియంలో ఉన్న పర్షియన్, అరబిక్, ఉర్దూ, ఇంగ్లీష్ రాతప్రతులను కనీసం వాటి ఇంగ్లీష్ అనువాదాలను సంప్రదించి ఆయా అధ్యాయాలు రాయాలి. ప్రొఫెషనల్ చరిత్రకారుల బృందం పై విషయాలను దృష్టిలో పెట్టుకొని రాస్తున్న పుస్తకం తెలుగు అకాడమీ ద్వారా మరికొన్ని రోజుల్లో రానుంది. ఓరియంట్ బ్లాక్‌స్వాన్ పబ్లిషర్స్ ద్వారా ఇంకొక ప్రామాణిక చరిత్ర రానుంది.




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



గురువారం, సెప్టెంబర్ 17, 2015

జూన్ రెండే మన అసలైన పండుగ...!!!



1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర తెలుసుకోవాలి. ఈ రోజున దీన్ని ఎవరూ ఎలా విశ్లేషిస్తారో దాని వలన వారి మనోగతాలు తెలుసుకోవచ్చు.


నేపథ్యం: దక్కనీ రాజ్యంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణది ఒక విలక్షణమైన చరిత్ర. కాకతీయుల దగ్గరి నుంచి 1948 దాక సుస్థిర రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రాంతం. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉండి, ప్రకృతి బీభత్సాలేవీ అంటకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్నంగా అలరారిన చరిత్ర ఉన్న దేశం. ప్రజాహితం కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి ఖ్యాతి గడించిన దేశ ప్రధాన మంత్రి సాలార్జంగ్-1 మరణంతో కష్టాలు మొదలయ్యాయి. ఆయన మరణంతో ప్రధానమంత్రి పీఠాన్నెక్కిన సాలార్జంగ్-2 చేసిన కొన్ని పనులతో స్థానికులకు కష్టాలు మొదలయ్యాయి. బ్రిటిష్ వారిని అభిమానించి, ఇంగ్లీషువిద్య నేర్చిన అతను తండ్రి వ్యతిరేకించిన పనిని చేశాడు. పర్షియన్ భాషను తొలగించి, ఉర్దూను అధికార భాషగా చేయడంతో జరిగిన నష్టానికి భారీగానే మూల్యం చెల్లించాడు. పదవీచ్యుతుడై ముప్ఫై ఏళ్లు రాకుండానే కన్నుమూశాడు. కానీ మిగతా పనులకంతా అతను చేసిన ప్రభుత్వ అధికార భాషా మార్పిడి.. ఈ ప్రాంత చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి, విషాదానికి దారితీసింది. 


ఇది స్థానికులకు అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. ముల్కీ సమస్యకు దారి తీసింది. స్థానికులకు రాని ఉర్దూ భాషలో విద్య గరపిన ఉత్తర భారత ముస్లింలు, కాయస్థులు పెద్ద సంఖ్యలో నిజాం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం జరిగింది. అక్కడ మొదలైన భాషా సమస్య, ముల్కీ సమస్యగా మారి అస్థిర పాలన తోడై మిగతా సమస్యలతో కలిసి రాజాకార్ల సమస్యగా రూపుదిద్దుకుంది. ఆ రజాకార్లలో స్థానిక ముస్లింల కంటే తెలంగాణేతర ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. నిజానికి రజాకార్లలో అందరూ ముస్లింలు కారు. వారి పేరు పెట్టుకుని అగ్రకులాల వారు, జమీందార్లు తమ దగ్గర పనిచేసే బీదవారి మీద, ఇతర సామాన్య జనాల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీన్ని సాకుగా చేసుకుని భారత ప్రభుత్వం చేసిన పోలీసు చర్య (ఆపరేషన్ పోలో) చరిత్రలో జరిగిన పెద్దమోసాలలో ఒకటి. నమ్మక ద్రోహానికి చక్కటి ఉదాహరణ. 


కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కేఎం మున్షీని తమ ప్రతినిధిగా నిజాం (7) రాజు వద్దకు పంపి, అల్లరిమూకలను అణచి తన రాజ్యం తాను ఏలుకునేందుకు సహాయం చేస్తామని నమ్మబలికారు. అది నమ్మి భారత దేశంలో తన దేశం విలీన ప్రతిపాదనకు అంగీకరించిన నిజాంకు జనరల్ చౌదరి తన పనికాగానే పెద్ద షాక్ ఇచ్చారు. నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నట్టు, వెంటనే ఈ ప్రాంతం మీద మార్షల్‌లా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాడు. ఇదంతా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగింది. ఇక ప్రధానమంత్రి నెహ్రూ మున్షీకి ఒక రహస్య సందేశం పంపి తన పాత్ర తాను పోషించాడు. 


అదేమిటంటే విలీన సమయంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు కానీ, నిజాంకు కానీ ఎక్కడా కనపడొద్దని! ఇక భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రి చేసిన ఈ పనులతో ఈ నాటకం ముగిసింది. ఇది అప్పటిదాకా ప్రజారంజకంగా ఎన్నో పనులు చేసిన నిజాం పాలన నుంచి విమోచనా? ఒకప్పటి భారతదేశ ప్రభుత్వ విద్రోహమా? ఈ ప్రశ్నకు సర్దార్ పటేల్‌ను సమర్థిస్తూ దీనిని విమోచన అనేవారు సమాధానం చెప్పాలి.


ఇక ఆ తరువాత విమోచన నిజంగా జరిగినట్టా అన్నది పరిశీలించాలి. 1948 సెప్టెంబర్ 18నుంచి యథేచ్ఛగా సాగిన మూడేళ్ల కేంద్ర పరిపాలన (పోలీసు పహరా)లో వారు ఇక్కడికి పంపిన పోలీసు అధికారులు, ముఖ్యంగా మద్రాసు నుంచి దిగుమతి అయిన ఆంధ్ర అధికారులు ఇక్కడ చేసిన అఘాయిత్యాలకు అంతేలేదు. (కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తండ్రి అలా వచ్చినవారే!) ఒక సర్వే ప్రకారం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలోనూ, తర్వాత జరిగిన రజాకార్ల హింసలోనూ కలిపి చనిపోయిన వారికంటే, కేంద్ర పోలీసు బలగాల చేతిలో 1948 నుంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేదాకా చనిపోయినవారి సంఖ్య దాదాపు మూడు రెట్లు అధికం! ఆ కాలంలో సామాన్య ప్రజలు నిజాం ప్రభుత్వం ఉన్నప్పటి కంటే ఎక్కువ బాధలు, కష్టాలు అనుభవించారు. అంటే 1948లో జరిగింది...ప్రజల దృష్టిలో నిజంగా విమోచ నేనా? కేవలం మతమౌఢ్యం ఉన్నవాళ్ళకు అలా కనిపిస్తుందా? ఇది ఇంకా లోతుగా విశ్లేషించవలసిన అంశం.


ఇక.. విలీనం తెలంగాణను ఒక్కసారి కాదు, రెండుసార్లు కుదిపింది. భారతదేశంలో విలీనమై అష్టకష్టాలు పడి, చివరకు ఒక ప్రభుత్వం ఏర్పడి ఊపిరి తీసుకుంటున్న సమయంలో ఇంకో విలీనం! 

తెలంగాణ...అంబేద్కర్ ఆశయాలకు, సలహాలకు వ్యతిరేకంగా భాషా ప్రయుక్త రాష్ర్టమనే విఫల యత్నానికి బలైంది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో విలీనమై పెనం మీదినుంచి పొయ్యిలో పడింది. ఇక ఆ తర్వాత ఆరు దశాబ్దాల చరిత్ర.. ఈ ప్రాంతవాసులెవరికీ చెప్పనక్కరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా మొదటి మోసకారి విలీనాన్ని ఎప్పుడూ జరపలేదు. రెండోదైన బలవంతపు విలీనాన్ని నవంబర్ 1న ఘనంగా జరిపాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ఈ రోజులన్నింటిని ఎలా పరిగణించాలి? సీమాంధ్ర వారు, ఒక సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడేవారు ఎలాగూ తెలంగాణ చరిత్ర చదవరు. మిగతా ఈ ప్రాంత వాసులంతా ఈ చరిత్రను తెలుసుకోవలసిన అవసరం ఉన్నది.


విద్రోహంతో ఒకటికి రెండు సార్లు విలీనమైన తెలంగాణ ఇప్పుడు స్వంత ప్రభుత్వంలో ఏ దినాన్ని జరపాలి? దేనిని ఎలా పరిగిణించాలి? సెప్టెంబరు 17ను ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టంగా చరిత్రలో లిఖించాలి. అది ప్రభుత్వ మార్పిడే కానీ విమోచన కాదు. నవంబరు 1ని తద్దినంగా జరుపుకోవాలి. తద్దినం అంటే ముగిసిన కథకు గుర్తు.

జూన్ 2ను సంతోషకరమైన దినంగా పరిగణించాలి. నిజానికి వందల ఏళ్ల రాజరిక పాలనకు, ఆరు దశాబ్దాల పరాయి పాలనకు చరమగీతం పాడి సొంత ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుని, స్వయం పాలన మొదలు పెట్టిన జూన్ 2 మాత్రమే అధికారికంగా జరుపుకోవలసిన పండుగ. దీనిని ఆస్వాదించిన వారు తెలంగాణ ప్రజలు, వ్యతిరేకించినవారు తెలంగాణేతరులుగా గుర్తించాలి. ఇక్కడ మతాలకు, కులాలకు, ఇతర సంకుచిత భావాలకు, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఈ రోజు చోటులేదు. తెలంగాణ ప్రజలకు జూన్ 2 అతి ముఖ్యమైన రోజు.

                                                                          - ప్రొఫెసర్ కనకదుర్గ దంటు




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



ఓం శ్రీ మహా గణాధిపతయే నమః !

సుకవి పండిత మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!



స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (1)


ప్రమాణి వృత్తము:
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! (2)


ప్రణవ వృత్తము:
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (3)


శాలినీ వృత్తము:
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)


వంశస్థము:
నమో నమో విఘ్న వినాశకాయ తే!
నమో విచిత్రాయ! వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)


వన మయూరము:
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)


స్రగ్విణీ వృత్తము:
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)


ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)


భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృతీశా! నమస్తే! (9)


(శుభం భూయాత్)




బుధవారం, సెప్టెంబర్ 09, 2015

మన భాషకు పట్టాభిషేకం...!!!

తెలంగాణ ప్రజలకు, మేధావులకు, బ్లాగు వీక్షకులకు
తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు!


ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి రోజైన సెప్టెంబర్ 9ని ఇక నుంచి తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. కాళోజీకి తెలంగాణ భాష అన్నా యాస అన్నా అపారమైన అభిమానం. ఆయన రచనలన్నీ కొనసాగింది తెలంగాణ మాండలికంలోనే. ఉమ్మడి రాష్ట్రంలో రెండున్నర జిల్లాల భాషనే దండి భాషగా గుర్తించి అదే ప్రామాణికమైన భాష అని గత ప్రభుత్వాలు నిర్ణయించడం ఒక విధంగా తెలంగాణ భాష, యాసలను అగౌరవపరచడమే అని విశ్వసించిన కాళోజీ, రాష్ట్రంలో చెలామణిలో ఉన్న అన్ని మాండలీకాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనే వారు. కాళోజీ కవిత్వంలో మనకు మూడు ముఖ్యమైన లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి సరళమైన భాష. రెండవది ధిక్కార స్వరం, మూడవది మానవతావాదం. కాళోజీ తన రచనలలో సరళమైన భాషను ఎంచుకున్నారు కాబట్టే వారు ప్రజలకు దగ్గరైంది. ఒకవేళ కాళోజీ సరళమైన శైలిని ఎంచుకోకపోతే అతని నా గొడవ తన గొడవగానే మిగిలిపోయేది. ఇది మన గొడవగా గానీ మనిషి గొడవగా గానీ మారేది కాదు. అందుకే అతను వేమన వలె అసలు సిసలైన ప్రజాకవి అయ్యారు. 

నాది పలుకబడుల భాష, బడిపలుకల భాష కాదు అని గర్వంగా చెప్పిన కాళోజీ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం వాడుక భాషలోనే రాయాలి అని చెప్పేవారు. తెలుగు భాషలో ఒక ప్రాంతం భాష ఆధిపత్యం వహించి మిగితా ప్రాంతాల ప్రజల భాషను తక్కువగా చూడడం, న్యూనతకు గురి చేయడం ఎంతమాత్రం అంగీకారం కాదు. కాళోజీకి అన్న విషయాన్ని వారి రచనలే తెలియజేస్తున్నయి. రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు, తక్కినోళ్ల యాస తొక్కి నొక్కబడ్డప్పుడు, ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు అని నినదించారు. తెలంగాణ భాష యాసలను ఎవరు కించపరిచినా సహించేవారు కాదు. కాళోజీ అన్న విషయం...వారు రాయప్రోలు సుబ్బారావు విషయంలో స్పందించిన తీరే ఒక చక్కటి నిదర్శనం. ఉస్మానియా విశ్వవిద్యాల యం తెలుగు శాఖాధిపతిగా పనిచేసిన రాయప్రోలు సుబ్బారావుగారు తరచుగా తెలంగాణ భాష యాసలను కించపరుస్తూ మాట్లాడుతుండేవారు. ఇతను గైర్ ముల్కీ. గైర్ ముల్కీ అయిన సుబ్బారావు తెలంగాణ భాషను కించపరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ ఈ విధంగా స్పందించారు.

లేమావి చిగురులను లెస్సగా మేసేవు
ఋతురాజు వచ్చెనని అతి సంభ్రమముతోడ
మావి కొమ్మల మీద మైమరచి పాడేవు
తిన్న తిండెవ్వారిదే కోకిలా నువు
పాడు పాటెవ్వారిదే కోయిలా?
అని సుతిమెత్తగా చురకలంటించిరి.


కాళోజీకి మాతృభాషపట్ల ఎనలేని గౌరవం. మాతృభాషను ఆదరించక పరభాషపై మోజు పెంచుకుని కన్నతల్లి వంటి స్వభాషను నిరాదరణకు గురిచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కాళోజీ ఈ విధంగా స్పదించారు.

తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు
సంకోచపడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలునేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా?

ఇది 1942లో రాసిన కవిత. ఇప్పటికి ఇది మనకు వర్తిస్తుంది. పరభాష మనల్ని మనం మనంగా బ్రతుకకుండా చేస్తుంది. పరభాషను భుజాలపై మోస్తూ మన భాషను మనం అగౌరవపరుస్తున్నాం. ఈ వైఖరిని మనం ఎండగట్టాలి అన్న కాళోజీ మాటలు ఈ నాటికీ వర్తిస్తాయి. కొన్నేళ్లుగా కాళోజీ జన్మదినం రోజును తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా ఆయన అభిమానులు జరుపుతున్నారు. కానీ నేడు కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం.


శ్రీశ్రీచే తెలంగాణ లూయి అరగాన్‌గా స్తుతించబడ్డ కాళోజీ ఆలోచనల్లో ఆచరణలో అసలు సిసలైన మానవతావాది. ప్రపంచం బాధంతా శ్రీశ్రీ బాధ అయితే కాళోజీ గొడవంతా సగటు మనిషి గొడవ. అతనికి మానవత్వం పరమావధి. కాళోజీ గొడవ మనిషి గొడవ. కాళోజీకి మానవత్వం పరమావధి. దార్శనిక చరిత్రలో మొదటిసారిగా మానవున్ని కేంద్రంగా చేసి నిర్మించే దర్శనానికి పునాదులు వేసిన తత్త్వవేత్త ప్రొటాగరస్. ప్రొటాగరస్‌తో ప్రారంభమైన మానవతావాదం క్రమంగా అభివృద్ధి చెంది వివిధ రకాల మానవతా వాదాలుగా పరిణామం చెందింది. 


అయితే కాళోజీ మాత్రం అన్నిరకాల మానవతా వాదాలను తనలో విలీనం చేసుకున్న వ్యక్తి. అతనిదొక విశిష్ఠమైన మానవతావాదం. అందుకే కాళోజీ తన ఆత్మకథలో ఈ విధంగా అంటాడు. నానా యిజాల అడుగున చూడ నా యిజందే అగుపడును జాడ అని. మానవుడే అన్నింటికి కొలమానం అనే తాత్త్విక చింతనను ప్రొటాగరస్ నుంచి, ప్రశ్నించే స్వభావం వున్నవాడే మనిషి అని చెప్పే దార్శనిక ధోరణి ని ఎం.ఎన్. రాయ్ నుంచి ఈ విధంగా వివిధ దార్శనికుల విషయాలన్నింటిని తనలో జీర్ణం చేసుకున్న వ్యక్తి కాళోజీ. ప్రహ్లాద చరిత్రకు కాళోజీ ఇచ్చిన భాష్యంలో ప్రశ్నించే స్వభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారి రచనలన్నింటిలో మొదటి నుంచి చివర వరకు మానవతావాదానికి సంబంధించిన కోణం ఆవిష్కరింపబడ్డది. మానవుని మూర్తిమత్వ వికాసానికి దోహదపడని ఏ యిజాన్ని అయినా సరే అతడు ఈసడించుకునేవాడు. అతని దృష్టిలో సంఘాలు నియమాలు సాంప్రదాయాలు మనిషిలోని కుళ్లుకు మారురూపాలు. అతను ఆశించిన సమాజం మానవుని మానవుని మాదిరిగా చూడగలిగే సమాజం. అందుకే అతడు ప్రజాస్వామ్య విలువలకు గాని పౌరహక్కులకు గాని భంగం వాటిల్లితే సహించేవాడు కాదు. పౌరహక్కులకు ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగినప్పుడు కాళోజీ స్పందించిన విధానాన్ని అపార్థం చేసుకున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. కాళోజీ హింసావాది అని... నక్సలైట్ అని... అనడం జరిగింది. కాళోజీ నా గొడవలో ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు. ప్రతి హింస తప్పు కాదు అని. 


హింస, ప్రతిహింస, రాజ్యహింసల మధ్య వ్యత్యాసం నిర్వచనాలు తెలువని వారే కాళోజీని అపార్థం చేసుకున్నది. కాళోజీ తాత్త్విక దృష్టిలో దౌర్జన్యాలను ఎదిరించే ప్రతి మనిషి ఒక ఉగ్రనరసింహుడే. తిరుగుబాటే బతుకుబాటగా మనిషి ఎంచుకోవడానికి కారకులు పాలకులు అని అతని విశ్వాసం. అందుకే కాళోజీ తన ఆత్మకథలో ఈ విధంగా పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినవాడే నాకు ఆరాధ్యుడు అని. ఎం.ఎన్. రాయ్ జయప్రకాష్ నారాయణ వలె పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఆదరించినవాడు కాళోజీ. ప్రజాస్వామ్య విలువలను తనలో సంపూర్ణంగా జీర్ణం చేసుకున్న వ్యక్తి కాళోజీ. నేను నీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే నీ హక్కు కోసం అవసరమైతే నా జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడుతాను అన్న వోల్తేర్ ప్రజాస్వామిక దార్శనిక భావాలను తనలో సంపూర్ణంగా జీర్ణించుకున్న వ్యక్తి కాళోజీ.

తెలుగు భాషా, సంస్కృతుల వికాసానికి కాళోజీ ఎనలేని కృషి చేశారు. తెలంగాణ ప్రజా సంస్కృతికి విఘాతం కలిగినప్పుడల్లా తన స్వరాన్ని వినిపించాడు. అణగారిన ప్రజల కోసం తన గళమెత్తాడు. తెలుగు ప్రజల పౌరహక్కుల కోసం శ్రమించాడు. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం మరిచినప్పుడల్లా వారి ధర్మాన్ని గుర్తు చేశాడు. పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని జయప్రకాశ్ నారాయణ్ గూర్చి కాళోజీ చెప్పిన మాట కాళోజీ జీవితానికి అక్షరాల వర్తిస్తుంది. ఒక దార్శనికుడు మరణించినంత మాత్రాన అతని దర్శనం అంతరించిపోదు. కాళోజీ ఈనాడు భౌతికంగా మన మధ్య లేకున్నా అతని భావాలు మాత్రం మనిషి గొడవగా సగటు మనిషి ఉన్నంతకాలం ఉంటాయి. మన భాష, మన పలుకుబడులకోసం ఇపుడు మన స్వతంత్ర రాష్ట్రంలో కాళోజీ జన్మదినం రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా జరగడం గర్వించతగింది.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



సోమవారం, సెప్టెంబర్ 07, 2015

బాబునోట...అవే అసత్యాలు...మళ్లీ మళ్లీ!

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. తను కోరినట్లు సమన్యాయం జరగలేదంటున్న చంద్రబాబు, ఏమి చేసిఉంటే న్యాయం, సమన్యాయం జరిగి ఉండేదో కేంద్రానికి లఖితపూర్వకంగా కానీ, మౌఖికరూపంలో గాని ఒక్కముక్క కూడా సూచించలేదు. సమన్యాయం అన్నది ఎవరికీ అర్థం తెలియయని బ్రహ్మపదార్థంగా మిగిలింది. కావలసిందేమిటో ఇతర పార్టీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ వారు జాబితాలు ఇచ్చారు. కానీ టీడీపీ అధినేత నోరు విప్పలేదు. ఇవ్వకుండా తర్వాత నిందించవచ్చుననే ఎత్తుగడ అందుకు కారణమనుకోవాలి. అవసరమైన సమయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తక్కిన పార్టీలవలె చేయవలసింది చేయక ఈ తరహా ఎత్తుగడ రాజకీయాలను నడిపిన చంద్రబాబు, తర్వాత కేంద్రాన్ని నిందించటంలో గల నిజాయితీ ఏమిటి?


ashok

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును గోబెల్స్ అనడం సమంజసం కాబోదు. గోబెల్స్ చెప్పిన దాని ప్రకారం అసత్యాలను మళ్లీ మళ్లీ చెప్పి ప్రచారం చేసినట్లయితే ప్రజలను అదే నిజమని నమ్మించవచ్చు. ఈ సూత్రీకరణలో మంచి తర్కం ఉన్నమాట నిజమే అయినా, అది దేశ కాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది చంద్రబాబుకే అర్థమైనట్లు లేదు. కనుక కొన్ని అసత్యాలను మళ్లీ మళ్లీ చెప్తున్నారు. గోబెల్స్ కాలం కన్నా ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులు అయినందున తను చెప్తున్న దాన్ని తెలంగాణ సంగతి సరేసరి కాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ విశ్వసించటం లేదిపుడు. అంతేకాదు ఆయన తన అసత్యాలను పునశ్చరించేకొద్దీ ఆయన మాటల పట్ల నమ్మకం ఇంకా తగ్గిపోతున్నది. ఈ విషయం చంద్రబాబు ఎంత త్వరగా గ్రహిస్తే ఆయనకే అంత మంచిది.


కొన్ని ఉదాహరణలను చూద్దాం. తను ఆగస్టు 31న మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, ఏకపక్షంగా, ఇష్టానుసారంగా ఉమ్మడి రాష్ర్టాన్ని విభజించిందని అన్నారు. తను ఈ మాట అనటం ఎన్నవసారో లెక్క కూడా లేదు. అదే చంద్రబాబు సరిగ్గా రెండు వారాల క్రితం ఆగస్టు 14న ఒక వివరణ పత్రం విడుదల చేస్తూ, తాను విభజన వద్దనలేదని అన్నారు. ఆ మాట కూడా లెక్కలేనన్ని సార్లన్నారు. అందుకు పొడిగింపు అన్నట్లు, తెలంగాణ ఏర్పడటానికి కారణం తాను కేంద్రానికి ఇచ్చిన అంగీకార లేఖేనని కూడా తెలంగాణలో పలుమార్లు సగర్వంగా ప్రకటించుకున్నారు. ఈ రెండు విధాలైన మాటల మధ్య గల వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. చంద్రబాబు పార్టీ తొలిదశలో విభజనకు వ్యతిరేకంగా లేఖ ఇవ్వటం, తర్వాత అనుకూలంగా ఇవ్వటం రెండూ వాస్తవాలు. మొదటి వైఖరిని తర్వాత ఎందుకు మార్చుకోవలసి వచ్చిందనేది అందరికీ తెలిసిందే గనుక ఆ చర్చ అక్కరలేదు. కానీ మార్చుకున్నారన్నది నిజం. 


కానీ మొదటి లేఖను గాని, రెండవ లేఖను గాని అసలు కేంద్రానికి ఎందుకు పంపవలసి వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న. విభజనకు అవుననిగాని, కాదని కాని ఆయన తనంతట తానే లేఖలు రాశారా, లేక తమ పార్టీ వైఖరి ఏమిటని కేంద్రం అడిగిన మీదటనా? సమాధానం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై వైఖరి తెలియజేయవలసిందంటూ అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని, రాష్ట్రంలోని వివిధ ప్రధాన పక్షాలకు వలెనే టీడీపీకి కూడా లేఖ రాసింది. అటువంటి స్థితిలో ఎవరినీ సంప్రదించలేదన్న చంద్రబాబు ఫిర్యాదుకు గల విలువేమిటి?
ఇంకా చెప్పాలంటే, కేంద్రం నేరుగా కానీ, కేంద్రం పనుపున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇదే ప్రశ్నపై టీడీపీ సహా వివిధ పార్టీలను ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలోనే గాక ముఖాముఖి ప్రత్యేక సమావేశాలలో అనేకమార్లు సంప్రదించింది. 


ఇక్కడ అసెంబ్లీలో ఢిల్లీ అఖిలపక్ష సమావేశాలలో విభజన అంశాన్ని నిర్దిష్టంగా, సూటిగా చర్చించారు. తనవైఖరి మారిన అనంతరం టీడీపీ ప్రతిసారి తాము విభజనకు సుముఖమని చెప్తూ వచ్చింది. ఇవన్నీ సంప్రదింపులు కావా? అట్లాంటి వైఖరి తీసుకున్న టీడీపీ ఆ మాట తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నది. విభజనను ఆమోదిస్తున్నామని తెలంగాణలో చాటిచెప్పుకుంది. తమ లేఖ ఇవ్వనట్లయితే కేంద్రం విభజనకు నిర్ణయించే ఉండేదికాదని తెలంగాణ టీడీపీ నాయకులు పదేపదే సగర్వంగా ప్రకటించుకున్నారు. దీనంతటికి విరుద్ధంగా చంద్రబాబు తెరవెనుక చేసిందేమిటన్నది అట్లుంచుదాం. అది అప్రస్తుతం. కానీ, తెరముందట జరిగినవన్నీ కూడా, విభజన విషయమై యూపీఏ ప్రభుత్వం టీడీపీని గాని, మరొకరిని గాని సంప్రదించనే లేదన్నమాట నిజం కాదని స్పష్టం చేస్తున్నాయి.


చంద్రబాబును కేంద్రం సంప్రదించిందని, ఆయన సానుకూలంగా లేఖ ఇచ్చారని, అదే మాట తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం చెప్పుకుంటూ, మరొక విధమైన రాజకీయ లబ్ధి కోసం సీమాంధ్రలో వ్యతిరేకపు మాటలు మాట్లాడుతున్నారని ఆ రోజుల్లోనే సీమాంధ్ర ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఆ మాట అక్కడి ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేగాక, సాధారణ ప్రజలు కూడా ఎత్తిచూపారు. 2014 విజయానికి కారణాలు అనేకం ఉన్నాయి. పరిస్థితులు తనకు వేర్వేరు విధాలుగా కలిసివచ్చాయి. కానీ దాని అర్థం విభజన విషయమై కేంద్రం టీడీపీని సంప్రదించనేలేదని సీమాంధ్రులు నమ్మారని కాదు. 


పైగా ఆ సంప్రదింపులు టీడీపీ వైఖరులు అన్నీ కూడా మీడియాలో ప్రతిదశలో నమోదు అయి ప్రజల దృష్టికి వచ్చినటువంటివే. ఇదంతా చంద్రబాబుకు తెలియదని గాని, గుర్తుకులేదని గాని అనుకోలేం. అటువంటి స్థితిలో విభజన కూడా జరిగిపోయి పదిహేను మాసాలు గడిచిన వెనుక ఆయన యూపీఏ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా, ఏకపక్షంగా విభజన చేసిందని వాదించ బూనుతున్నారంటే, గోబెల్స్ సూత్రానికి సర్వకాల సర్వావస్థలలోనూ విలువ ఉంటుందని నమ్ముతున్నారన్న మాట. ఆయన ఇంత అమాయకంగా, ఇంత తరచుగా అదే సత్యాన్ని మళ్లీ మళ్లీ చెప్పటాన్ని చూసి ఆశ్చర్యం, విసుగు, జుగుప్స అన్నీ కలుగుతున్నాయి. అయితే ఇంతకూ ఇది ఇట్లా ఎందుకు జరుగుతున్నట్లు? చంద్రబాబు తనకు తెలియకుండానే యాదాలాపంగా, అట్లా మాట్లాడటం ఒక అలవాటుగా మారిపోయి అంటున్నట్లా? ఆ విధంగా తోచదు. అందుకు ఏదో కారణం ఉండే ఉండాలి. అది ఏమై ఉంటుంది?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదేపదే అంటున్న మాటలు మరికొన్ని ఉన్నాయి. విభజన విషయమై ఎవరినీ సంప్రదించలేదనే మాటకు, ఈ అదనపు మాటలకు మధ్య గల సంబంధాన్ని మనం కనుగొనే ప్రయత్నం చేసినట్లయితే అప్పుడాయన ఎవరినీ సంప్రదించలేదనే ఈ గోబెల్స్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావచ్చు. చంద్రబాబు అదనపు మాటలు ఏమిటి? కేంద్రం రాష్ర్టాన్ని ఇష్టానుసారంగా, ఒక పద్ధతి లేకుండా విభజించింది. సమన్యాయం చేయాలని కోరితే పట్టించుకోలేదు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆర్టికల్ 3 కింద విభజన చేశారు. కొత్త రాష్ర్టానికి రాజధాని ఏదో చెప్పకుండా విభజించారు వగైరాలు. ఈ మాటలలో కొన్ని వక్రీకరణలున్నాయి. కొన్ని స్వయంగా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేవి ఉన్నాయి. అవేమిటో చూసేముందు ఒక మాట చెప్పుకోవాలి. 


చంద్రబాబు ప్రస్తుతం కొన్ని సమస్యలలో ఉన్నారు. మరొకవైపు భవిష్యత్తు అభివృద్ధి గురించి తనకు కొన్ని ఆలోచనలున్నాయి. ఆ సమస్యలు బయటపడటం, భవిష్యత్తు ఆలోచనలకు పరిస్థితులను సానుకూలం చేసుకోవటం అనే రెండూ ఆయనకు అవసరం. ఈ రెండు అవసరాలు తీరేందుకు ఆయన ఒక వ్యూహం రచన చేసుకున్నట్లు కనిపిస్తున్నది. సరిగా ఆ వ్యూహంలో భాగంగానే ఆయన, తను చెప్పే మాటలు కొన్ని అసత్యాలని తెలిసికూడా అవే అసత్యాలు మళ్లీ మళ్లీ చెప్తున్నారు. అదే విధంగా, పైన మనం అదనపు మాటలు అన్నవాటిని మాట్లాడుతున్నారు.


రాష్ట్ర విభజన చివరిదశలో కొంత హడావుడి జరగటం, కొన్ని అంశాలు అస్పష్టంగా ఉండటం నిజం. ఇందుకు కారణం ఏమిటి? తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ స్థాయిలో, ప్రభుత్వస్థాయిలో సంవత్సరాల తరబడి సంప్రదింపుల అనంతరం చివరకు సూత్రరీత్యా నిర్ణయం జరిగిపోయిన తర్వాత కూడా సీమాంధ్ర ధనిక వర్గాలు, రాజకీయ వర్గాలు దానిని ఏ విధంగానైనా అప్పటి లోక్‌సభా కాలంల జరగనివ్వకుండా ఉండాలని శాయశక్తులా ప్రయత్నించారు. కేవలం వారి ఒత్తిళ్లు, ఎత్తుగడల కారణంగా ఎప్పుడో తాపీగా, సావధానంగా జరగవలసిన విభజన చివరి సమావేశాల చివరి దశవరకు నెట్టుకుపోయింది. ఆఖరుకు చివరిక్షణాలలోనూ వారు లోక్‌సభలో చేసిన పెప్పర్‌స్ప్రే డ్రామా, రాజ్యసభలో సాగించిన నానా రభస నాటకం వంటివి తెలిసిందే. తీరా బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా ఖమ్మం మండలాల విషయమై తమ పలుకుబడిని చూపగలిగారు. కేవలం వారి కారణంగానే ఈ చివరిదశ హడావుడి, కొన్ని అస్పష్టతలు చోటుచేసుకున్నాయి. వారు నిజాయితీగా వ్యవహరించి కేంద్రానికి ఊపిరి తిరగనిచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదు. కానీ అప్పటి లోక్‌సభలో ఏమీ తేలకుండా ఆపగలిగితే, తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి మొత్తం వ్యవహారం వెనుకకుపోగలదన్నది వారి ఎత్తుగడ. 


ఇవేవీ రహస్యాలు కావు. చంద్రబాబు ఇదేమి తెలియనట్లు అమాయకంగా, కేంద్రం ఒక పద్ధతి లేకుం డా విభజించిందని అంటున్నారు. సీమాంధ్ర ధనిక వర్గాలు, రాజకీయ వర్గాల పలుకుబడులు, లాబీయింగ్‌లు, ఎత్తగడలు, కుట్రల చరిత్ర మొత్తం ఉమ్మడి రాష్ట్రపు చరిత్ర పొడవునా పరుచుకుని ఉన్నది. చిదంబరం ప్రకటన, విభజన బిల్లు తయారీ- ఆమోదాల దశలో అది పరాకాష్ఠకు చేరింది. ఒకవైపు ఇటువంటి చరిత్రలో కీలక పాత్ర పోషిస్తూనే మరొకవైపు తానే, తామే కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త చేష్టలకు బాధితులైనట్లు లోకాన్ని గోబెల్స్ పద్ధతిలో నమ్మించచూసేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నంలో భాగమే ఈ మాటలన్ని. ఇక్కడ గమనించవలసింది ఒకటున్నది. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. 


తను కోరినట్లు సమన్యాయం జరగలేదంటున్న చంద్రబాబు, ఏమి చేసిఉంటే న్యాయం, సమన్యాయం జరిగి ఉండేదో కేంద్రానికి లఖితపూర్వకంగా కానీ, మౌఖికరూపంలో గాని ఒక్కముక్క కూడా సూచించలేదు. సమన్యాయం అన్నది ఎవరికీ అర్థం తెలియయని బ్రహ్మపదార్థంగా మిగిలింది. కావలసిందేమిటో ఇతర పార్టీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ వారు జాబితాలు ఇచ్చారు. కానీ టీడీపీ అధినేత నోరు విప్పలేదు. ఇవ్వకుండా తర్వాత నిందించవచ్చుననే ఎత్తుగడ అందుకు కారణమనుకోవాలి. అవసరమైన సమయంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తక్కిన పార్టీలవలె చేయవలసింది చేయక ఈ తరహా ఎత్తుగడ రాజకీయాలను నడిపిన చంద్రబాబు, తర్వాత కేంద్రాన్ని నిందించటంలో గల నిజాయితీ ఏమిటి? ఇది కేంద్రాన్ని సమర్థించడం కోసం అంటున్నమాట కాదు. కానీ చంద్రబాబు తాను చేయవలసింది ఏమి చేశారన్నది ప్రశ్న. అది చేసి ఆ తర్వాత ఇతరులను వేలెత్తిచూపితే అందులో సహేతుకత ఉంటుంది.


ఆర్టికల్ 3 గురించి, రాజధాని గురించి అనే మాటలు అర్థం లేనివి. ఇతర రాష్ర్టాల ఏర్పాటుకు ముందు అసెంబ్లీ తీర్మానాలు జరిగాయా లేదా అన్నది కాదు. వాటి విభజన జరిగింది కూడా ఆర్టికల్ 3 ప్రకారమే. అసెంబ్లీ తీర్మానం ముందస్తుకాని, తర్వాత కానీ అసలు ఏ దశలోనైనా అసెంబ్లీల ఆమోదం అవసరమని గాని సదరు ఆర్టికల్ లో ఎక్కడా లేదని, కేవలం రాజకీయ సౌలభ్యం కోసం అప్పుడు తీర్మానాలు జరిగాయని చంద్రబాబుకు తెలియక కాదు. 


అటువంటిది తప్పనిసరైతే సీమాంధ్ర మెజార్టీ సభ్యులు తెలంగాణ తీర్మానాన్ని ఓడించి ఉండేవారు గదా అన్నది ఆయన ఆలోచన. ఇది మనం గ్రహించలేని మేధావి డిస్కవరీ ఏమీ కాదు. అదే పద్ధతిలో రాజధాని ఏదో ముందే చెప్పటం కేంద్రానికి ప్రజాస్వామికం అవుతుందా, లేక ఆ నిర్ణయాన్ని కొత్త రాష్ర్టానికి వదిలివేయటమా? ఇవన్నీ మాట్లాడే చంద్రబాబు దేశ చరిత్రలో లేనివిధంగా పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో హక్కులంటూ రెవెన్యూలో భాగం అనే తమ అపూర్వమైన కోర్కెలు, వగైరాల గురించి మాత్రం మాట్లాడరు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




గురువారం, సెప్టెంబర్ 03, 2015

తెలంగాణ తురాయి... కందుకూరు...!!!

-పుష్కలంగా క్వార్ట్, ఫెల్స్‌ఫర్ నిక్షేపాలు
-కోట్ల విలువైన ముడిఖనిజం విదేశాలకు ఎగుమతి
-అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణకు ఖ్యాతి
గోల్కొండ వజ్రాలకు పేరుగాంచింది. ఈ ప్రాంతంలో దొరికిన వజ్రాలు రాజులు, సామ్రాట్టుల కిరీటాలను అలంకరించాయి. కోహినూర్ తదితర వజ్రాలు ఇందుకు సాక్ష్యం.. ఇది చరిత్ర.. హైదరాబాద్‌తోపాటు దానిని ఆవరించుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా వజ్రాలు, ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలున్న ప్రాంతం. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంతోపాటు కుత్బుల్లాపూర్, మహేశ్వరం మండలాల్లో క్వార్ట్, ఫెల్స్‌ఫర్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లుగా జియాలజీ, మైనింగ్ శాఖ తేల్చింది. ఈ మండలాల్లో 30రకాలకు పైగా ముడిఖనిజాలు విరివిగా లభిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డిల్లోని ఖనిజ సంపద గురించి ఉమ్మడిరాష్ట్రంలో ప్రపంచానికి అంతగా తెలిసేది కాదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదు. వజ్రాల వల్ల ఒకనాడు గోల్కొండ ప్రపంచఖ్యాతిని ఆర్జించినట్లు, ఈ ఖనిజ సంపదతో రంగారెడ్డి జిల్లా అంతర్జాతీయ దృష్టిని విస్తృతంగా ఆకరిస్తున్నది. 

ఇది వర్తమానం..గ్రేటర్ హైదరాబాద్ శివారున రంగారెడ్డి జిల్లాలో ఉన్న కందుకూరు మండలంలోని మూడు గ్రామాల పరిధిలో కోట్ల రూపాయల బి గ్రేడ్ క్వార్ట్, ఫెల్స్‌ఫర్ ఖనిజ నిక్షేపాలున్నాయి. వందల రకాల వస్తువుల తయారీకి ఇక్కడి ఖనిజాన్ని ముడిసరుకుగా వాడుతున్నారు. ప్రధానంగా అద్దాల తయారీ పరిశ్రమలో వినియోగిస్తున్నారు. పేరున్న గ్లాస్ పరిశ్రమలు పోటీపడి మరీ ఇక్కడి ముడిసరుకునే తెప్పించుకుంటున్నాయి. తమిళనాడులోని గ్లాస్ పరిశ్రమకు ఇక్కడి నుంచే ముడిసరుకు సరఫరా అవుతున్నది. కందుకూరు ఖనిజాలకు దేశ విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలోని ఏడు క్వారీ యూనిట్లు క్వార్ట్, ఫెల్స్‌ఫర్ ఖనిజాల్ని వెలికి తీస్తున్నాయి. 

quary






క్వార్ట్, ఫెల్స్‌ఫర్ ఒకేరకానికి చెందినవి. క్వార్ట్‌లో కొంతమేర సిలికాన్ పర్సంటేజీ ఎక్కువగా ఉంటే, ఫెల్స్‌ఫర్‌లో పోటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. నాణ్యమైనదిగా తేలిన ఫెల్స్‌ఫర్, క్వార్ట్‌ను గ్లాస్ పరిశ్రమల్లో వాడుతున్నారు. నాసిరకం ఫెల్స్‌ఫర్‌ను టైల్స్ తయారీ కోసం పరిశ్రమలు ఏరికోరి తీసుకుంటున్నాయి. 2014 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లానుంచి 10,1190 టన్నుల క్వార్ట్, 48, 1185 టన్నుల ఫెల్స్‌ఫర్‌ను ఎగుమతి చేశారు. కందుకూరులో 9.46హెక్టార్లలో, మురళీనగర్‌లో 9.28 ఎకరాల్లో, గూడూరులో 8.05 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. వ్యవసాయయోగ్యం కాని పట్టాభూముల్లో సైతం ఇటీవలి కాలంలో ఖనిజాలకోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. క్వార్ట్ రకం పలుగురాయి టన్నుకు రూ.750 నుంచి 1000 వరకు ధర పలుకుతుండగా, సెల్ప్‌ఫర్‌కు కూడా అదే స్థాయి డిమాండ్ ఉంది.


కందుకూరు ఖనిజానికే డిమాండ్


సాధారణంగా మిగతా క్వారీల్లో దొరికే పలుగురాయి 50 గ్రాముల నుంచి అర కిలోవరకు మాత్రమే ఉంటుంది. ఇది వస్తువుల తయారీకి పనికిరాదు. కేవలం ముగ్గురాయిగా మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. నాణ్యత తక్కువగా ఉండటంలో తవ్వకాల సమయంలోనే ఖనిజం స్వరూపాన్ని కోల్పోయి పౌడర్‌గా మారిపోతుంది. కాని కందుకూరులో దొరికే ఖనిజం నాణ్యమైనది. ఒక్కో పలుగురాయి అరకిలో నుంచి 50 కిలోల బరువు ఉంటుంది. దీంట్లో మూలకాలు విరివిగా లభిస్తాయి. వస్తూత్పత్తికి ఇది అనుకూలంగా ఉంటుంది. దీంతో గాజు గ్లాస్ పరిశ్రమలు రంగారెడ్డి ఖనిజాన్నే డిమాండ్ చేసి మరీ తెప్పించుకుంటున్నాయి.


200 వస్తువుల తయారీలో..


కందుకూరు ఖనిజాన్ని దాదాపు 200 రకాల వస్తువుల తయారీలో వినియోగిస్తున్నారు. ముగ్గురాయి నుంచి మొదలుకుని టేబుల్ గ్లాస్ నుంచి విమానాల తయారీ వరకు దీనిని ముడిసరుకుగా వాడుతున్నారు. బీరుసీసాలు, పింగాణి వస్తువులు, ఖరీదైన గ్లాస్‌ను తయారుచేస్తున్నారు. ఇక్కడి ఖనిజాన్ని నల్లగొండ, పాలమూరు జిల్లాల్లోని పలు పరిశ్రమలు కొనుగోలు చేస్తున్నాయి. కొన్నవాటిలో అత్యధిక భాగాన్ని ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడి నుంచి మొదట వైజాగ్, కాకినాడ, మద్రాస్‌లకు తరలించి తరువాత అక్కడి నుంచి విదేశాలకు పంపిస్తున్నారు. 


చెన్నైలోని గ్లాస్ పరిశ్రమల్లో ఇక్కడి క్వార్ట్, ఫెల్స్‌ఫర్‌లే వాడుతున్నారు. గతంలో ఇక్కడ లభించిన ఖనిజాన్ని హైదరాబాదు పరిసర ప్రాంతాలకు తీసుకుపోయి ముగ్గురాయి కోసం పౌడరు చేసేవారు. దీంతో కందుకూరు, మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ గ్రామాల్లో తలకొండపల్లిలో పలు పౌడర్ పరిశ్రమలు వెలిశాయి. ఈ పౌడరును వినియోగించి పింగాణి వస్తువులు, గృహాలంకరణ వస్తువులు తయారుచేసేవారు. ఇప్పుడు ముడిఖనిజానికి డిమాండ్ పెరగటంతో క్వారీ యాజమానులకు కాసుల పంట పండుతున్నది. తహసీల్దార్ నుంచి ఎన్‌ఓసీ రాగానే క్వారీలు వెలుస్తున్నాయి. టన్నుల కొద్దీ ఖనిజం ఎగుమతి అవుతున్నది. ఒక్కో టన్ను ముడిఖనిజంపై రూ. 42 రాయల్టీగా ప్రభుత్వానికి చెల్లించి తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు వందల మంది స్థానికులకు ఉపాధి లభిస్తున్నది. ఈ ఎగుమతులతో కూడా తెలంగాణ పేరు అంతర్జాతీయ విపణితో మరోమారు మార్మోగడం ఖాయం.



(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


బుధవారం, సెప్టెంబర్ 02, 2015

ఉక్కు తెలంగాణ...!!!

iron


రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో సుమారు 302 మిలియన్ టన్నుల మేర ఇనుప ఖనిజం నిల్వలున్నాయని ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. ఇంతదాకా ఒక్క ఖమ్మం జిల్లా బయ్యారంలో మాత్రమే ఈ నిక్షేపాలున్నాయని భావించారు. అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సర్వేలు జరిపించింది. ఇదే సమయంలో ఇతర జిల్లాల్లో జరిపిన ప్రాథమికస్థాయి పరిశీలనలు తీపి కబురు అందించాయి. తెలంగాణవ్యాప్తంగా భారీ స్థాయిలో ఐరన్ ఓర్ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఇది శుభ సంకేతంగా భావిస్తున్నారు.

-రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం నిక్షేపాలు
-ఐదు జిల్లాల్లో ఐరన్ ఓర్
-ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడి
-ఉక్కు పరిశ్రమపై చిగురిస్తున్న ఆశలు
-కొనసాగుతున్న జీ-3 స్థాయి ప్రయోగాలు

ప్రస్తుతం ప్రాథమికంగా లభ్యమైన సమాచారాన్ని గనుల శాఖ ఉన్నతాధికారులు, సీనియర్ అధికారులు క్రోడీకరిస్తున్నారు. మొత్తం ఐదు జిల్లాల్లోనూ ఈ నిక్షేపాలు విస్తరించి ఉన్నాయని సమాచారం. 200 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం (జీ-3 లేదా జీ-2 స్థాయిలో) అందుబాటులో ఉంటే పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం ఉంటుందని టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టం చేసింది. కాగా ప్రాథమికంగా జీ-4 స్థాయిలో జరిపిన పరిశోధనల్లో రాష్ట్రవ్యాప్తంగా 302 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్టుగా తేలింది.
అసలు ప్రయోగాలేమిటి..?


ఖమ్మం జిల్లా బయ్యారంలో ఇనుప ఖనిజం నిక్షేపాలున్నాయని, దీనితో ఇక్కడ స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. అప్పటి నుంచే ఇను ప ఖనిజం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయి.. ఆయా గనుల్లో ఉన్న ఐరన్ ఓర్ ఏ గ్రేడ్‌తో ఉంది.. ఎంత మొత్తంలో నిల్వలు ఉన్నాయనే ప్రాథమిక సమాచారం సేకరించడానికి ఇక్కడ విస్తృతంగా పరిశోధనలు మొదలు పెట్టారు. 


ఇలా ప్రాథమికంగా భూ ఉపరితలంపై చేసిన ప్రయోగాలను జీ-4 స్థాయిగా పేర్కొంటారు. ఈ స్థాయిలో ఒక్క బయ్యారం (ఖమ్మం)లోనే కాకుండా వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లోనూ ఐరన్ ఓర్ నిక్షేపాలున్నట్టుగా గుర్తించారు. అయితే ఇలా గుర్తించిన ఇనుప ఖనిజం నిక్షేపాల గ్రేడ్ ఒక్కో స్థాయిలో ఒక్కోలా ఉంది. ఈ నిల్వల మొత్తం 302 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని నిర్ధారించారు.


జీ-3 స్థాయి..


ఉపరితలం మీద జీ-4 స్థాయిలో చేపట్టిన ప్రయోగాల్లో వెల్లడైన ప్రాథమిక సమాచారంపై మరింత లోతుగా ప్రయోగాలు చేపట్టడమే జీ-3 స్థాయిగా చెప్పుకోవచ్చు. ఇందులో సుమారు ప్రతి 400 నుంచి 300 మీటర్లకు ఒకచోట డ్రిల్లింగ్ చేస్తారు. బయ్యారంలో ప్రస్తుతం గుర్తించిన 69 చదరపు కిమీ పరిధిలో సుమారు 12 నుంచి 13 బోర్లను డ్రిల్లింగ్ చేశారు. మరో 45 కి.మీ. పరిధిలో చేయాల్సి ఉంది. ఈ డ్రిల్లింగ్ సందర్భంగా ఎంత లోతులో ఎంతమేర ఐరన్ నిక్షేపాలున్నాయనేది గుర్తిస్తారు. ఇది జీ-3 స్థాయి ప్రయోగాలు.


జీ-2 స్థాయి..


ఈ స్థాయిలో ప్రతి 100 మీటర్లకు ఒక బోరును డ్రిల్ చేస్తారు. ఇందులో భూగర్భంలో వెల్లడైన అంశాలను విశ్లేషిస్తారు. ఎంత మందం ఇనుప ఖనిజం ఉంది.. ఏయే గ్రేడ్లలో ఉంది.. ఏయే లోతుల్లో ఉంది అనే సమాచారాన్ని నిర్ధారిస్తారు. దీనివల్ల కచ్చితమైన నిల్వలు, గ్రేడింగ్‌ను లెక్కించవచ్చు. ఆ తరువాత లభించిన ముడిపదార్థాన్ని కెమికల్ అనాలసిస్ (రసాయన విశ్లేషణ) చేస్తారు.


చిగురిస్తున్న ఆశలు..


టాస్క్‌ఫోర్స్ కమిటీ చెప్పినదానిని బట్టి జీ-3 గానీ.. జీ-2 స్థాయిలోగానీ జరిగిన ప్రయోగాల్లో లభించిన సమాచారం ప్రకారం 200 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం లభిస్తే పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం ఉన్నట్టుగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో నిర్వహించిన జీ-4 స్థాయి ప్రయోగాల్లో 302 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం గనులున్నట్టుగా వెల్లడయినందువల్ల జీ-3 స్థాయి పరీక్షల్లో 200 మిలియన్ టన్నులకుపైగానే ఐరన్ ఓర్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా జీ-3 స్థాయిలో (బయ్యారం చుట్టుపక్కల) చేపట్టిన ప్రయోగాల్లోకూడా సానుకూలత కనపడుతుందని అందిన సమాచారం.


భవిష్యత్తులోనూ...


ఇదిలా ఉండగా గతంలో 75 నుంచి 80 శాతం ఇనుము శాతం ఐరన్ ఓర్ ఉంటేనే స్టీలు, ఉక్కు పరిశ్రమలకు అనువైనవిగా ఎంపిక చేసేవారు. అయితే గడిచిన రెండు, మూడు దశాబ్దాల కాలంలో అందివచ్చిన యంత్రాలు, ఆధునికత, సాంకేతికత కారణంగా 62 శాతం ఇనుము శాతం (ఫెర్రస్ పర్సెంటేజీ) ఉన్నా లాభదాయకమని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ శాతాన్ని 45 నుంచి 50 శాతానికి తగ్గించికూడా ఉక్కును ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అంటే ఇప్పుడు చేస్తున్న ప్రయోగాలు భవిష్యత్తులోనూ ఉపయోగపడతాయనే చెప్పవచ్చు. 


ప్రస్తుతం తెలంగాణలోని ఐదు జిల్లాల్లో గుర్తించిన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోనే 62 శాతం ఆపైనకూడా ఐరన్ ఓర్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో బయ్యారంలో 10 మిలియన్ టన్నుల ఐరన్‌ఓర్ 42 నుంచి 65 ఫెర్రస్ గ్రేడ్ ఉన్నట్టుగా నిర్ధారించారు. అలాగే మొట్ల తిమ్మాపురం, ఇస్రులాపురం తదితర గ్రామాల పరిధిలో 12 మిలియన్ టన్నులుగా ఉందని గుర్తించిన ఐరన్ ఓర్‌లో 58 నుంచి 62 శాతం ఫెర్రస్ ఉందని గుర్తించారు. వరంగల్ జిల్లా నేలవంచ, బొద్దుగడ్డ, మంచెర్ల, కొంగరగిద్ద (గూడూరు మండలం)లో సుమారు 15 మిలియన్ టన్నులుగా గుర్తించిన ఐరన్ ఓర్‌లో 58 నుంచి 68 శాతం ఫెర్రస్ ఉందని నిర్ధారించారు. 


అలాగే ముప్పవరం, మల్లంపల్లి, పాకాల సరస్సు, గరీబ్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఐరన్ ఓర్‌లో 30 నుంచి 60 వరకు, మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో 55 నుంచి 60 శాతం వరకు ఉందని తేల్చారు. ఇందులోనూ హెమటైట్ రకం ఎక్కువగా ఉందని తేలడంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయనే చెప్పవచ్చు. కరీంనగర్ జిల్లాలో సుమారు 86 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్న మాగ్నెటైట్ గనులనుకూడా ఉపయోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.


మాగ్నెటైట్ అయితే..


ఖమ్మం జిల్లా ఉట్లమట్వాడ, సర్కాయ్‌పిల్లు,తత్రాయపల్లి , గోపాల్‌పూర్ గ్రామాలతోపాటు, అటు కరీంనగర్‌లోని యెర్రబల్లి, కొత్తపల్లి, దామెర, అంబర్‌పేట, అర్నకొండ, మల్లాపూర్, చొప్పదండి తదితర ప్రాంతాల్లోనూ కలిపి సుమారు 145 మిలియన్ టన్నుల మాగ్నెటైట్ నిల్వలున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. మిగతా ప్రాంతాల్లో హెమటైట్ రకానికి చెందిన ఇనుక ఖనిజం ఉంది. హెమటైట్ రకం ఖనిజం అయితే స్టీలు ఉత్పత్తికి నేరుగా వాడుకోవచ్చు. అదే మాగ్నెటైట్ అయితే దానిని నేరుగా వాడుకోలేము. ఆధునిక పద్ధతిలో దానిలోని గ్రేడింగ్‌ను పెంచాల్సి ఉంటుంది.


table



శాతాన్ని బట్టి స్టీలు..


62 శాతం ఫెర్రస్ ఉన్న ఖనిజం అయితే 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయడానికి 5 మిలియన్ టన్నుల ఖనిజం అవసరం అవుతుంది. ఒకవేళ 45 శాతం ఫెర్రస్ ఉన్న ఖనిజం అయితే.. 3 మి. ట.ల ఉత్పత్తి కోసం 8 మి. టన్నుల ముడిఖనిజం అవసరం అవుతుంది. అలాగే 38 శాతం గ్రేడ్ అయితే.. 3 మి. ట. కోసం 10 మి. టన్నుల ముడిపదార్థాన్ని వినియోగించాల్సి ఉంటుంది. తెలంగాణలోని 5 జిల్లాల్లో ప్రాథమిక (జీ-4) స్థాయిలో చేపట్టిన పరిశోధనల్లో సగటున (యావరేజీ) 50 నుంచి 55 శాతం వరకు ఫెర్రస్ ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 


దీనినిబట్టే.. జీ-3, లేదా జీ-2 స్థాయిలో చేపట్టే ప్రయోగాల్లో తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన నిల్వలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదీగాక.. 200 మిలియన్ టన్నుల నిల్వలు కావాలంటే.. అవసరం అయితే పక్క రాష్ర్టాల్లోని ఇనుప ఖనిజాన్నికూడా తెచ్చుకోవచ్చు. ఏ రకంగా చూసినా ఉక్కు పరిశ్రమపై ఆశలు చిగురిస్తున్నాయనే చెప్పవచ్చు. ఇక జీ-3, జీ-2 స్థాయి ప్రయోగాలు ఎప్పుడు పూర్తవుతాయా? అని ఎదురుచూడటం ఒక్కటే మిగిలింది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!